అడ్వెంట్  2                   సిరీస్ B  (పాత నిబంధన ప్రసంగము)

పాత నిబంధన పాఠము: యెషయా  40:1-11; పత్రిక పాఠము: 2పేతురు 3:8-14; సువార్త పాఠము: మార్కు 1:1-8; కీర్తన 85.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: యెషయా 40:1-11

యెషయా 40:1-11, 1మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, 2–నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను. ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. 3ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా–అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. 4ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. 5యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వ శరీరులు దాని చూచెదరు. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. 6ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు –నేనేమి ప్రకటింతునని మరియొకడడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వు వలె ఉన్నది. 7యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటి వారే. 8గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. 9సీయోనూ, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి –ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. 10ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడచుచున్నది. 11గొఱ్ఱెల కాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును.

ఉపొధ్ఘాతము: యెషయా తన ప్రవచనంలోని మొదటి భాగాన్ని (అధ్యాయాలు 1–39) ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదానుగూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయా ప్రవచించాడని (యెషయా 1:1) చెప్తుంది.

ఒకప్రక్క, 2 రాజులు 18:11, తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించి యుండిరి. అస్సిరియ రాజైన షల్మనేసర్ V ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు పై దండెత్తి దాని ముఖ్యపట్టణమైన సమరియాను స్వాధీనం చేసుకుని నాశనం చేసి ఇశ్రాయేలు పదిగోత్రాలను చెరగొనిపోయాడు. ఇక్కడితో ఇశ్రాయేలు కథ ముగిసిపోయింది. 

మరొకప్రక్క, ఆహాజు పరిపాలించినంత కాలం, యూదా రాజ్యం అస్సిరియన్ శక్తిచే తాకబడలేదు. కాని హిజ్కియా యేలుబడిలో, అతడు అష్షూరు రాజుపై తిరగబడటానికి ప్రోత్సహించబడ్డాడు (2 రాజులు 18:7). అతడు దేవునిని అడగకుండా ఆలోచన చేసి ఐగుప్తు రాజుతో పొత్తు పెట్టుకున్నాడు (యెషయా 30:2-4). అప్పుడు అష్షూరు రాజు యూదా దేశమందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొన్నాడు. హిజ్కియా అస్సిరియన్లకు లొంగిపోయాడు కప్పం చెల్లించాడు (2 రాజులు 18:12-15). కొంత విరామం తర్వాత సన్హెరిబ్ యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనను పంపి యెరూషలేమును ముట్టడించాడు. ఆ సందర్భంలో యెషయా హిజ్కియాను భయపడవద్దని ప్రోత్సహించాడు (యెషయా 37:6). దేవుని దూత అస్సిరియన్ సైన్యంపై పడింది దానిలోని 1,85,000 మంది పురుషులు ఒక రాత్రిలో చంపబడ్డారు (2 రాజులు 19 మరియు 2 దినవృత్తాంతములు 32). రాజధాని నగరం యొక్క ప్రధాన ద్వారము వద్ద అస్సిరియన్ దళాలను నాశనం చేయడం ద్వారా దేవుడు యెరూషలేమును రక్షించటంతో మొదటి భాగం ముగుస్తుంది. యెషయా 39వ అధ్యాయంలో బాబిలోనియన్లను పరిచయము చేస్తూ, భవిష్యత్తులో యూదా ప్రజలును వారి తిరుగుబాటును బట్టి బబులోను చెరలోనికి వెళ్తారని యెషయా హిజ్కియాను హెచ్చరించటంతో మొదటి భాగము ముగుస్తుంది.

40వ అధ్యాయంలో ప్రవక్త భవిష్యత్తులో జరగబోయే దానిని గురించి చెప్తూ, యూదా ప్రజలను దేవుడు తిరిగి వారిని చెర నుండి విడిపిస్తాడని ప్రవచించాడు – సైరస్ బాబిలోన్‌ను ఓడించడం 538 బి.సి.లో యూదులు యెరూషలేముకు తిరిగి రావడానికి మరియు ఆలయాన్ని మరియు నగరాన్ని పునర్నిర్మించడానికి అనుమతించే శాసనాన్ని జారీ చేయడం, అప్పుడు ఇశ్రాయేలీయులు తిరిగి రావడం ఇవ్వన్ని ప్రవక్తకు దేవుడు ముందుగానే చూపించాడు.

చెరలో ఉన్న తన ప్రజలను యెహోవా దర్శిస్తాడని (ఐగుప్తు దాస్యము నుండి విడిపించినట్లుగా) తిరిగి వారిని సీయోనుకు తెస్తాడని, ప్రతి అడ్డంకిని తొలగిస్తాడని యెహోవా మహిమ తిరిగి బయలుపరచబడునని ఒకడును తప్పకుండ సర్వ శరీరులు దాని చూచెదరని ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చునని ప్రవక్త ప్రకటించుచుండగా, ఈ అడ్వెంట్ కాలములో తిరిగి రాబోవుచున్న ప్రభువు కొరకై సిద్ధపడుదాం.

అంశము: తిరిగి బయలుపరచబడబోవుచున్న యెహోవా మహిమ కొరకై సిద్దపడదాం
1. ఆయన ప్రకటించిన ఆదరణను బట్టి 1,2
2. ఆయన కొరకు సిధ్దపడదాం 3-5
3. నిత్యము నిలుచు ఆయన వాగ్దానములను బట్టి 6-8

1

1మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, 2–నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను. ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.

బబులోను చెరను గురించిన ప్రవక్త మాటలు యూదా ప్రజలను ఎలా తాకాయో మనకు తెలియదు. ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళటం, ఆ భయానక సంఘటలను గురించి విన్న యూదా ప్రజలకు ఈ మాటలు భయాన్ని కలిగించి ఉండొచ్చు. కలవరపడుచున్న తన ప్రజల హృదయాలను నిమ్మళింపజేయడానికి, తన కృప కనికరములలో, 1మీ దేవుడైన యెహోవా అను నేను మీతో చెప్తునదేమనగా అనే మాటలు ఎంతో ఓదార్పునిస్తున్నాయి. మీ దేవుడు అనే మాట యెహోవా ఆయన ప్రజలకు మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది. 2నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. ఒకే ఆజ్ఞ రెండు మారులు పలుకబడుతూ మన పాఠం ప్రారంభమయ్యింది. ఆ ఆదేశం దేవుని మనస్సు నుండి వచ్చింది దేవుడే స్వయంగా దానిని తన ప్రేమగా కలవరపడుచున్న తన ప్రజల హృదయాలను నిమ్మళింపజేయడానికి తన కృప కనికరములలో, తన ప్రజలకు ప్రకటించమని తన ప్రవక్తకు చెప్పాడు. దేవుడు తన ప్రజలకు ఈ ఓదార్పును కోరుకుంటున్నాడు. ఆయన వారిని “నా జనులు” అని పేర్కొన్నాడు. వారిని ఆయన నా జనులు అని పిలవడం వారిపట్ల ఆయనకున్న మార్పులేని ప్రేమను తెలియజేస్తున్నాయి. వారి అవిశ్వాసం, వారి తిరుగుబాటు, వారి పాపాలన్నీ తర్వాత, వారు ఇప్పటికీ దేవుని ప్రజలే. దేవుడు వారి దేవుడే, ఆయన నమ్మకమైనవాడు దయగలవాడు, ఆయన వాగ్దానం చేసినట్లుగా: “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా ఆయన వేయివేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును క్షమించేవాడునిర్గమకాండము 34:6,7.

మునుపటి అధ్యాయం యొక్క సంభాషణ అదృశ్యమవుతుంది. పరిచయ మాటలు లేకుండా, మనం దేవుని ఆలోచన మధ్యలో ఉన్నాం, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి.

వారిని ఎవరు ఓదార్చాలి? “ఓదార్పు” అనే పదం ఇక్కడ దుఃఖము, బాధను అనుభవిస్తు నిరాశలో వారికి ఓదార్పు నిచ్చుట అనే అర్ధంలో వాడబడింది. నా జనులను ఓదార్చుడి అనే ఈ ఆజ్ఞ ఏక వచనము కాదు బహువచనం. దేవుని ఓదార్పు సందేశం ప్రవక్తల ద్వారా నాటి విశ్వాసులందరికి వర్తిస్తుంది. పాత నిబంధనలో, దేవుని ఓదార్పు సందేశం ప్రవక్తల ద్వారా వచ్చింది. కొత్త నిబంధనలో, అపొస్తలుల ద్వారా వచ్చింది. సువార్తను పంచుకునే వారందరూ తన ప్రజలను ఓదార్చడానికి దేవుని ఆజ్ఞను పాటిస్తారు. ఈ ఆజ్ఞ దేవుని ప్రజా సేవకులుగా సేవ చేసే వారందరికీ మరియు సువార్తను పంచుకునే విశ్వాసులందరికీ వర్తిస్తుంది. విశ్వాసులందరూ దేవుని ఓదార్పుని అవసరమైన వారికి అందించాలనే ముఖ్యమైన పనిని పంచుకోవాలి.

భాదలలో చింతాక్రాంతులై ఉన్నవారికి, బలహీనులకు, నిరీక్షణలేక నిరుత్సాహపడు వారికి ఓదార్పు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మాటలను పట్టుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకొమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని మాటలు ఏ రూపములో ఉన్నను, అది చెప్పే విషయం ఒక్కటే, నిరీక్షణను చేపట్టుటకు, బలమైన ధైర్యము కలుగునట్లు పశ్చాత్తాపము పరివర్తన ద్వారా దేవుని మాటలను విశ్వసించినప్పుడు వాటిని ఆధారము చేసుకొని నిలబడినప్పుడు/ జీవించినప్పుడు ఓదార్పు కలుగుతుంది.

రెండవ వచనం ఆ ఓదార్పును పంచుకునే పద్ధతిని మనకు పరిచయం చేస్తుంది, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. మానవ భాష ద్వారా, దేవుడు తన ఓదార్పును ఇతరులకు బదిలీ చేస్తాడు. ఈ ప్రక్రియ చాలా సులభం. ఆ ఓదార్పు దేవుని నుండి ఉద్భవించింది, ఆయన దానిని మానవ భాషలో వెల్లడించాడు. తద్వారా అది ఇతరులకు విస్తరించబడాలి. సువార్త మాటలలో వస్తుంది, దేవుడు తన కృపను మరియు దయను విస్తరించే మార్గాల ద్వారా వస్తుంది. ప్రేమగా మాటలాడుడి అని దేవుడు నిర్ధేశించాడు. హృదయంతో మాట్లాడి ప్రకటించండి లేదా పిలవండి. మీ స్వరాన్ని ఉపయోగించండి అని దేవుడు చెప్పాడు.

యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఏ విషయం గురించి యెరూషలేముతో మాట్లాడాలి? ఓదార్పు దేవుని నుండి మాత్రమే వస్తుంది. దేవుని మాటలు మాత్రమే ఒకనికి ఓదార్పును ఇచ్చి నమ్మకాన్ని ఇవ్వగలవు. కాబట్టి ఓదార్పుగా ఇక్కడ దేవుడు మూడు విషయాలను యెరూషలేముకు ప్రకటించమని చెప్పాడు: ఆ మూడు విషయాలు చాలా ఆదరణకరముగా ఉన్నాయి. యెరూషలేముకు నీరీక్షణను ప్రకటిస్తున్నాయి. ఆయన క్షమాపణను, కృపను, సందేశాన్ని తెలియజేస్తున్నాయి:

మొదటిగా, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను. (చెర యుధ్ధమే) చెర ముగింపుకు వస్తుందని అంటే దేవుడు నిర్ణయించినంత కాలము (70 సంవత్సరాలు) మాత్రమే వాళ్ళు చెరలో ఉంటారని, నిశ్చయత వారికి ఇవ్వబడింది. చెరనుండి విడుదలను గురించి మాత్రమే దేవుడు మాట్లాడటం లేదు, వారిక బబులోనులో బానిసలుగా ఉండరనే నిశ్చయత నిస్తుంది. బాబిలోనియన్ చెర ముగింపు దేవుని ప్రజలకు ఓదార్పునిచ్చింది.

మరోవైపు, పాపం, మరణం ప్రతి పాపిని బంధించాయి. ప్రతి పాపి తాను అలాంటి బంధనం నుండి విముక్తి పొందాడనే ప్రకటన కోసం ఆశిస్తాడు. యేసు వచ్చాడు కాబట్టి, మనం పాపం నుండి మరణం నుండి విడుదల పొందాం. మనం ఇకపై పాపానికి బానిసలం కాదు. దేవుని కోపం కారణంగా నరకంలో శాశ్వత శిక్షను అనుభవించడానికి మనం ఇకపై వాటి చెరలో బంధించబడిలేము. మన స్వంత ప్రయత్నం ద్వారా కాని లేదా మన జీవిత కాలములో దేవుని ధర్మశాస్త్రాన్ని సంతృప్తి పరచడం వల్ల కాని మనం విడుదల పొందలేదు. మన యుద్ధకాలము పూర్తయింది. దేవుడు తన కుమారుడైన మెస్సీయ ద్వారా మన విడుదలను సాధించాడు కాబట్టి మన బంధనం ముగిసింది.

రెండవదిగా, ఆమె దోష రుణము తీర్చబడెను (past tense). ఆమె దోష రుణము తీర్చబడెను అనే మాటలు ఆమెకు పాప క్షమాపణ ప్రకటించబడటాన్ని తెలియజేస్తున్నాయి. దీని అర్థం యూదా 70 సంవత్సరాల చెరలో యూదా పాపాలు సృష్టించిన అప్పు తీర్చబడటం కాదు. యూదా తన స్వంత అపరాధానికి లేదా మరే ఇతర దేశం యొక్క అపరాధానికి లేదా సమస్త మానవాళి యొక్క అపరాధానికి ప్రాయశ్చిత్తం చెయ్యలేదు. మరి ఆమె దోష రుణము తీర్చబడింది? ఎలా? ఎవరు ఆమె దోష రుణాన్ని చెల్లించారు? వేరొకరు ఆమె బదులుగా ఆమె కొరకు ఆమె దోష రుణాన్ని చెల్లించుదురని తెలియజేసేందుకే దేవుడు ఇక్కడ ఈ మాటలను వాడాడు. 53వ అధ్యాయంలో, ఇది ఎలా జరుగుతుందో యెషయా స్పష్టంగా వివరిస్తున్నాడు. ఆమెకు బదులుగా యెషయా 53 అధ్యాయములో వివరిస్తున్నట్లుగా శ్రమపడు దేవుని పరిచారకుడు ఇశ్రాయేలు పొందుటకు పాత్రమైయున్న దోషమును, శిక్షను తీసుకొంటాడు.

మూడవది, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. మూడవది మిగిలిన రెండింటి కంటే రెండు రెట్లు ఎక్కువగా దేవుని కృపను గూర్చి వక్కాణిస్తుంది. దేవుని ప్రజలు ప్రభువు చేతి నుండి రెట్టింపు కృపను పొందుతారని యెషయా మనకు చెబుతున్నాడు. త్రాసును తీసుకొని దానిలో ఒకప్రక్క ఇశ్రాయేలు పాపాన్ని మరియొకవైపు క్షమాపణను రెండింతలుగా ఉంచడాన్ని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. దేవుని దైవికమైన న్యాయములో ఆమె చేసిన ప్రతి పాపానికి సంపూర్ణముగా రెండింతలు క్షమాపణను పొందెనను నిశ్చయత ఇశ్రాయేలుకు ప్రకటింపబడింది. స్వంత ప్రయత్నంతో విడుదలను సాధించడం వల్ల ఆమె విడుదల కాలేదు. ప్రభువు యొక్క సేవకుని బాధాకరమైన శ్రమ మరణం ద్వారా ఆమె చేసిన ప్రతి పాపానికి వెల చెల్లించబడుతుంది. “మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను”, 53:6.  

ప్రజలు ఈ ఆశీర్వాదాలకు అర్హులు కాదు. వాటిని సంపాదించలేరు. బదులుగా, దేవుడు వాటిని తన ఉచిత కృప ద్వారా మాత్రమే పంపిణీ చేస్తాడు. రెట్టింపు అనే పదానికి దేవుని ఆశీర్వాదాలు పుష్కలంగా, సమృద్ధిగా అంచనాలకు మించి ఉన్నాయని అర్థం. దేవుని ప్రజల పాపాలు శిక్షకు అర్హమైనవి, కానీ దేవుడు శిక్షకు బదులుగా క్షమాపణ మరియు నిత్యజీవాన్ని అందించాడు, పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను, రోమా 5:20.

ఈ మూడు విషయాలు దేవుని సందేశంలోని విషయాన్ని ప్రకటించడమే కాకుండా యెషయా ప్రవచనంలోని మిగిలిన అధ్యాయాలను అనుసరించడానికి ఒక రోడ్ మ్యాప్‌ను కూడా అందిస్తున్నాయి. యెషయా చివరి భాగంలోని 27 అధ్యాయాలను మూడు తొమ్మిది అధ్యాయాల విభాగాలుగా విభజించవచ్చు. మొదటి విభాగం (40–48 అధ్యాయాలు) దేవుని ప్రజలు బబులోను చెర నుండి విడుదల కావడంపై దృష్టి పెడుతుంది మరియు “ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను” అనే ఆలోచనను అభివృద్ధి చేస్తుంది. రెండవ విభాగం (49–57 అధ్యాయాలు) ప్రభువు యొక్క గొప్ప సేవకుడి రాకను ప్రకటిస్తుంది, ఆయన ప్రజల పాపాల కోసం శ్రమపడి మరణిస్తాడని చెబుతుంది. ఈ విభాగం యొక్క కేంద్రం మరియు ప్రవచనం యొక్క యొక్క కేంద్రం 53వ అధ్యాయం కావడం ఎంత సముచితం. ప్రజల పాపాలకు విమోచకుడు పూర్తిగా “చెల్లించాడు”. చివరగా, చివరి విభాగం (58–66 అధ్యాయాలు) మెస్సీయ గొప్ప పని యొక్క గొప్ప ఫలితాలకు మనల్ని తీసుకువెళుతుంది. రక్షకుని శ్రమ మరణం కారణంగా దేవుని ప్రజలు దేవుని నుండి అద్భుతమైన ఆశీర్వాదాలను – రెట్టింపు భాగాన్ని – పొందుతారు అని చెబుతుంది. యెషయా యొక్క మిగిలిన అధ్యాయాల అధ్యయనానికి రెండు వచనాలు తగిన ప్రారంభాన్ని అందిస్తాయి.

ఈ మూడు విషయాలు 600 సంవత్సరాల తరువాత క్రీస్తులో నెరవేర్చబడతాయి. కాని ఈ విషయాలు చెప్తున్న ప్రవక్త “ఇప్పుడే” అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఎందుకని? యెషయా అలా చెప్పటానికి గల కారణం: దేవుడు ఎప్పుడు పలికినా ఆయన పలికినట్లుగానే అది జరుగుతుంది. దేవుడు ఒక విషయాన్ని గురించి చెప్పాడనుకొండి ఆయన చెప్పినట్లుగానే అది జరుగుతుంది అంతే. భూతకాలములో దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే అది అలా జరుగుతుందని తన ప్రేమలో దేవుడు వారికి నిశ్చయత నిచ్చాడు. బబులోను ఈ మాటలు ప్రవచించే కాలానికి ఇంకా శక్తివంతమైన దేశంగా మారలేదు. యూదా ఇంకా బందీగా తీసుకెళ్లబడలేదు. సైరస్ ఇంకా పుట్టలేదు, యూదులు యెరూషలేముకు తిరిగి రావడానికి అనుమతించే శాసనం జారీ చేయబడలేదు, యేసు ఇంకా ఈ లోకము లోనికి రాలేదు. దేవుడు ప్రకటించిన ప్రవచనాలు వాటితో ముడిపడియున్న సంగతులు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో చూడండి. ఇవన్ని ఇప్పటికే పూర్తయినట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. భవిష్యత్తు గురించి ఎటువంటి సందేహం లేదు.

2

3ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా–అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. 4ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. 5యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వ శరీరులు దాని చూచెదరు. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

యెషయా ఇలా చెప్తున్నాడు, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. తన ప్రజలైన యెరూషలేముకు ఓదార్పునివ్వమని దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు ఒక మానవ స్వరం ప్రతిస్పందించింది. తదుపరి తొమ్మిది వచనాలలో స్వరం అనే పదం మూడుసార్లు కనిపిస్తుంది.

దేవుడు తన సందేశాన్ని మానవ ప్రసంగం ద్వారా తెలియజేశాడు—దేవుడు తన ప్రజల హృదయాలపై పనిచేసే మార్గం. దేవుడు టెలిపతి లేదా అంతర్గత ప్రకాశం ద్వారా పనిచేయడు. మానవ స్వరం ద్వారా వ్యక్తీకరించబడిన మానవ మాటల ద్వారా ఆయన తన ఆలోచనలను మానవులకు తెలియజేస్తాడు. అంతర్ దృష్టి లేదా ధ్యానం ద్వారా దేవుని సువార్తను ఏ మానవుడు తెలుసుకోడు. దేవుని ప్రజలు సువార్తకు స్వరం ఇచ్చినప్పుడు మానవులు దేవుని ప్రేమ గురించి తెలుసుకుంటారు. దేవుడు వేరే విధంగా పని చేస్తానని వాగ్దానం చేయలేదు.

ప్రభువు రాకడకు ముందుగా ఆయన ప్రజలను సిద్ధపరచుటకు ఇవ్వబడిన ప్రవచనము ఇది. బబులోను ప్రవాస కాలం పూర్తికానుంది. యెహోవా తన ప్రజలను ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి నడిపించినట్లుగా అరణ్యం గుండా తిరిగి వారిని వారి స్వంతదేశానికి తీసుకెళ్లబోతున్నాడు. అరణ్యము అనే మాట యూదయ ప్రజలు బబులోను నుండి యెరూషలేముకు ఏ మార్గములో ప్రయాణించాలో తెలియజేస్తుంది. బబులోను యూదయ దేశములకు మధ్యన దట్టమైన అరణ్యముంది. అరేబియా ఎడారులుగా పిలువబడే ఈ భాగం ఈ ప్రాంతంలోనే ఉంది. కాబట్టి బబులోనునుండి యెరూషలేముకు ఈ నిర్జన ప్రాంతాము గుండా వెళ్ళవలసియున్నారని అనుకూలమైన రహదారి దేవుని ఆజ్ఞచే సిద్ధపర్చబడుతుందని తెలియజేయబడింది. (యెషయా 35:8-10, అక్కడ దారిగానున్న రాజ మార్గము ఏర్పడును. అక్కడ సింహముండదు క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడిన వారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములుగలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును). వారు చెరలోనికి పోకముందే, చెరలోనుండి తిరిగి వచ్చేందుకు వారికి పరిపూర్ణమైన రూట్ మ్యాప్ ఇవ్వబడింది, దేవుని కృపలో. వారి పాపములే వారిని దేవుని మందిరము నుండి వాగ్దాన దేశము నుండి దూరపర్చాయి. చెర వారి తిరుగుబాటును బట్టి శిక్షగా వారిలో పరివర్తన తెచ్చేందుకు నిర్ణయింపబడినదిగా తెలుస్తుంది. వారి ఆత్మీయ జీవితములలో సిద్ధపాటు అవసరమైంది_దేవునిని ఆరాధించే విషయములో, పరిశుద్ధముగా జీవించే విషయములో.

మార్గము సిద్ధపరచుడి. ఇది ఒక చక్రవర్తి ఆజ్ఞలా ఉంది. యెషయా రోజులలో చక్రవర్తులు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లే ముందు రూట్ మ్యాప్ ఇచ్చి దారి క్లియర్ చేయడానికి అతని కంటే ముందుగా ఒక బృందాన్ని పంపేవారు. చక్రవర్తి ప్రయాణించే మార్గములో అవసరమైన ఏర్పాట్లు చూడటం అందుకు తగినట్టుగా పనిచేసే వారికి సామాగ్రిని అందించడం, వంతెనలను కట్టడం, కొండలను సమం చేయడం, లోయలపై కాజ్‌వేలను నిర్మించడం లేదా వాటిని నింపడం, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉంచడం ఆ దూతల పని. ప్రవాస యూదుల పునరాగమనానికి వర్తింపజేస్తే, అన్ని అడ్డంకులు తొలగించబడతాయని దేవుని ఆదేశం ముందుకు సాగుతుందని అర్థం. ప్రభువగు యెహోవా ఒక చక్రవర్తిగా ఆయనే తన ప్రజలను విమోచించి వారి స్వంత దేశానికి నడిపించ బోతున్నాడు. ఆయన కొరకు ఆయన ప్రజలు సిద్ధపడవల్సియున్నారు. ఎందుకంటే యెహోవాయే వారి రక్షకుడు ఆయనే వారిని విమోచించిన వాడు. (అందరూ కలసికట్టుగా ఒకటిగా ఐక్యతతో పనిచేయవలసియున్నారు. ప్రతిఒక్కరు ప్రతిఒక్కరికి సహాయపడవల్సియున్నారు. వారు ప్రయాణ మార్గములలో ఉన్నను యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచువారిగా విమోచింపబడిన వారుగా ప్రతిఒక్కరు ప్రతిఒక్కరి బాధ్యతను తీసుకోవల్సియున్నారు. దేవుడు వారి మధ్య ఉన్నట్లుగా వాళ్ళు ప్రవర్తింపవల్సియున్నారు, గమ్యమును చేరుకోవల్సియున్నారు, ఆయన నాయకత్వములో).

యెహోవా మహిమ అంటే ప్రజలకు దేవుని యొక్క శక్తిని ప్రేమను తెలియజేయుటకు బయలుపరచు ప్రత్యేకమైన ప్రత్యక్షత. తన ప్రజలను వారి బానిసత్వం నుండి విడిపించడం ద్వారా, వారి స్వంత భూమికి వారిని తిరిగి నడిపించడం ద్వారా తాను ఒడంబడికను కాపాడుకునే దేవుడిగా ఆయన వెల్లడించుకొన్నాడు. ఈ మహిమ మరియు విశ్వసనీయత బబులోనులోని వారి చెరనుండి వారిని విడిపించడంలో చూపబడుతుంది. యెరూషలేము చేసిన పాపాలకు యెహోవా శిక్షించాడు, కాని ఆయన ఉద్దేశ్యం వారి బాధలు కాదు, వారి విముక్తి. వారి అపవిత్రతను ప్రక్షాళన చేయటానికి చెర అనే అగ్ని ద్వారా ఆయన వారిని పంపించాడు. ఆయన  ఎన్నుకున్న ప్రజలుగా వారి పూర్వ స్థితికి వారిని తెచ్చుటకే  ఆయన ఇలా చేశాడు. యెహోవా మహిమను వాళ్ళు సర్వజనులకు బయలుపరచవల్సిన వారై యున్నారు. తరువాతి రోజుల్లో తన ప్రజల విమోచనను నెరవేర్చడానికి మెస్సీయను పంపడంలో ఇది మరింత విశిష్టంగా చూపబడుతుంది.

ఈ చిత్రం తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి ప్రభువు రాకను గుర్తు చేస్తుంది. దేవుడు మోషేను అరణ్యంలో మండుతున్న పొద వద్ద పిలిచి, ఫరో ముందు కనిపించినప్పుడు అతనితో పాటు వెళ్ళాడు. ప్రభువు మోషేతో కలిసి అరణ్యం నుండి వచ్చి తన ప్రజలను ఐగుప్తు నుండి బయటకు అరణ్యంలోని సీనాయి పర్వతానికి తీసుకువచ్చాడు. యెషయా ఇక్కడ అరణ్యానికి సంబంధించిన ప్రస్తావనలు దేవుని ప్రజలకు ఆయన మొదటిసారి వచ్చినట్లే తిరిగి వస్తాడని గుర్తు చేస్తాయి. యెషయా మరో ఆలోచనను జోడించాడు. వారిని నడిపించడానికి మరియు తన ఉనికిని వారికి భరోసా ఇవ్వడానికి ప్రభువు మహిమ వారికి కనిపించినట్లే, “యెహోవా మహిమ మరోసారి వెల్లడి అవుతుంది”. అదే దేవుడు విముక్తిని చేకూరుస్తాడు. మనం ఏదో మారుమూల అరణ్యంలో ప్రభువు తిరిగి రావాలని ఆశించము.

అట్లే మెస్సయ్యాకు ముందుగా పోవు దూతను గూర్చి కూడా ఈ ప్రవచనము తెలియజేస్తూ ఉంది. ఈ మాటలను ఆలకించినప్పుడు యేసుని రాకడ కొరకు తన ప్రజలను సిద్ధపరచుటకు, యెషయా తరువాత 700 సంవత్సరాలకు, ప్రభువు పంపిన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చిన ప్రవచనమని సువార్తల ద్వారా తెలుసుకున్నాం. బాప్తిస్మమిచ్చు యోహాను మరియు ప్రతి దేవుని సేవకుని సందేశమొక్కటే, పశ్చాత్తాపపడండి, దేవుని రాజ్యం సమీపించియున్నది. పశ్చాత్తాపము అంటే పాపము నుండి మళ్లుకొనుట మరియు దేవుడు ప్రకటించే క్షమాపణను నమ్ముకొనుట. సహజంగానే అన్ని మానవ హృదయాలు రాతిలా కఠినమైనవి. సువార్త పిలుపు మానవ హృదయాలు దేవునిని నమ్మడానికి శక్తినిస్తుంది. పశ్చాత్తాపం అంటే పాపం నుండి వైదొలగడం మరియు దేవుడు అందించే క్షమాపణపై నమ్మకం ఉంచడం. సువార్త మాటల ద్వారా, దేవుడు పశ్చాత్తాపపడని, అవిశ్వాస హృదయాల యొక్క తలుపు తట్టి విశ్వాసాన్ని సృష్టిస్తాడు. పరిశుద్ధాత్మ విశ్వాసాన్ని సృష్టించినప్పుడు అడ్డంకులు మాయమవుతాయి.

మెస్సీయకు వర్తింపజేస్తే, దేవుడు తన ప్రజలను విమోచించడానికి వారి వద్దకు రాబోతున్నాడని అర్థం. తన ప్రజలను విమోచించడంలో సర్వశరీరులు దైవికమైన జోక్యాన్ని చూస్తారని ఆయన శక్తి మహిమ యొక్క సాక్ష్యాలను గుర్తిస్తారని ఈ మాటలు చెప్తున్నాయి. అట్లే రక్షకుని పొందుటకు కోరుకొంటున్న వారందరి కొరకు ఇవ్వబడిన నియమాలుగా వీటిని మనము తీసుకోవలసి ఉన్నాం. ప్రభువు హృదయము లోనికి వచ్చు మార్గములో ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను చెయ్యబడవలెను. యేసు ముఖమును మనము చూసే ప్రతి సరి దేవుని మహిమను మనము చూస్తూవున్నాం.

ఈ ప్రవచనాన్ని నెరవేర్చిన ఏకైక స్వరం బాప్తిస్మమిచ్చు యోహాను మాత్రమే కాదు. ప్రపంచమంతటా ఉన్న బోధకులకు, విశ్వాసులకు దేవుని ప్రేమ యొక్క శుభవార్తను ప్రకటించడానికి ఇలాంటి పిలుపు ఉంది. దేవుని బిడ్డలందరూ, సువార్తకు స్వరం ఇచ్చినప్పుడు లేదా ఇతరులకు సాక్ష్యమిచ్చినప్పుడు ప్రభువు పిలుపుకు ప్రతిస్పందిస్తున్నారు.

3

ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు –నేనేమి ప్రకటింతునని మరియొకడడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డియైయున్నారు. వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డివంటివారే. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడి పోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.

ఇక్కడ యెహోవా యెషయాతో ప్రకటించుమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే ప్రకటించుట ద్వారా దేవుని సందేశము మనుష్యులను చేరుకొంటుంది కాబట్టే దేవుని మాటలను ప్రకటించుమని అతడు ఆజ్ఞాపింపబడ్డాడు. అయితే నేనేమి ప్రకటింతునని అతడు అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలో ప్రకటన చేయడానికి అతని సముఖతను మనం చూడొచ్చు, అట్లే ఏమి ప్రకటించాలో తెలుసుకోవడానికి చెప్పుమని అతడు అడుగుతున్నాడు.

 మన దేవుని వాక్యము నిత్యము నిలుచును, సర్వశరీరులు ప్రభువులు, చక్రవర్తులు, సైన్యాలు, న్యాయాధికారులు, దేశాలు, రాజ్యాలు, ప్రజలు అందరూ గతించిపోతూ ఉండేవాళ్ళే, ఏ ఒక్కరు శాశ్వతులు కాదు అందరూ అశాశ్వతులే, దేవుడు మాత్రమే శాశ్వతుడని, ఆయన మాట నిత్యము నిలుచునని, దేవుడు తాను చెప్తున్నట్లే వారిని విడిపించడానికి ఖచ్చితంగా వస్తాడని దేవుడు తన మాటను నెరవేర్చుకొంటాడని ప్రకటించాలి. నెరవేర్చుకొంటాడులో రెండు విషయాలు ఉన్నాయి_ 1. చెరకు కొనిపోయిన వారు ఆయన ప్రజలను శాశ్వతముగా బందీలుగా బానిసత్వములో ఉంచలేరని అట్లే వారి అధికారము కూడా శాశ్వతము కాదని, 2. ఆయన మాట ఇచ్చినట్లుగా వారి విడుదలను ఆయన టైములో ఆయనే వారికి ఇస్తాడని, ఆయన సర్వోన్నతత్వాన్ని ఆయన సర్వశక్తిమంతత్వాన్ని, వారిని గుర్తుచేసుకోమని ప్రోత్సహిస్తున్నాయి. వారి విడుదలను ఏ ఒక్కరు అడ్డుకోలేరనే విషయాన్ని, వాళ్ళు తిరిగి తమ దేశానికి తిరిగి వస్తారని, ఆయన వారికి అనుగ్రహించిన వాగ్దాన దేశమును వారి నుండి ఆయన శాశ్వతముగా తీసివేయటం లేదనే విషయాన్ని వాళ్ళు గుర్తించుకోవాలనే విషయాన్ని వారికి తెలియజేస్తూ దేవుడు నమ్మకమైనవాడని, ఆయన వాగ్దానాలు విఫలం కాదనే విశిష్టమైన సందేశాన్ని ప్రజలకు ప్రకటించుమని ప్రవక్త ఆజ్ఞాపింపబడ్డాడు.

కీర్తనలు 103:15,16 నరుని ఆయువు గడ్డివలె నున్నది. అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. 1 పేతురు 1:24 సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, ఈ ఉదాహరణ ద్వారా, దేవుని గొప్ప మహిమ మరియు శక్తి ముందు మానవులు గడ్డివంటి వాళ్ళు అనే వాస్తవాన్ని మనకు గుర్తుచేస్తున్నాడు. గర్వాంధులు కాకుండుడి అని హెచ్చరిస్తున్నాడు. మనమందరం మనల్ని మనం గొప్పగా ఎంచుకొంటాం. చరిత్ర పుస్తకాలు మన గొప్పతనాన్ని నమోదు చెయ్యొచ్చు. కాని మన కీర్తి పువ్వు వంటిది, కొద్దికాలమే. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వువాడును. ప్రభువు వేడి శ్వాస ముందు, గడ్డిలాంటి ప్రజలు వారి విజయాలు, పువ్వులలాంటివి, అవి వాడిపోయి పడిపోతాయి. మానవులు ఏమి సాధించినా, మరణం మనలో ప్రతి ఒక్కరినీ వెంటాడుతుంది చివరికి మనల్ని మ్రింగివేస్తుంది. కాబట్టి మనం మన ఆశలను కలలను ఏ మానవుడిపైనా ఉంచకూడదు, అది ఎంత మహిమాన్వితంగా కనిపించినా. “యెహోవా శ్వాసము” అనే పదం పాలస్తీనా దాని చుట్టుప్రక్కల నున్న ఎడారుల నుండి తరచుగా వీచే వేడి పొడి గాలులను వారికి గుర్తుచేయటానికి ఇక్కడ వాడబడింది. తక్కువ సమయంలో అలాంటి వేడి, నిరంతర గాలి గడ్డిని ఎండిపోజేస్తుంది, పువ్వులను వాడిపోజేస్తుంది. దేవుని వాక్యం పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపాన్ని మరియు మానవులందరి పట్ల ఆయనకున్న అపరిమితమైన ప్రేమను తెలియజేస్తుంది కాబట్టే దేవుని ప్రేమను ప్రకటించుమని ప్రవక్త ఆజ్ఞాపింపబడ్డాడు.

ముగింపు:దుఃఖించు హృదయాలను బలహీనమైన ఆత్మలను సంతోషపరచటానికి రూపుదిద్దుకొన్న సందేశమిది. మన పాపములను బట్టి మనము దేవుని నుండి ఆయన సన్నిధానము నుండి దూరపరచబడుతున్నాం, (మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను యెషయా 59:2). నిత్యశిక్ష క్రింద నరకమునకు పాత్రులమై ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ మనకు ఆశను నీరీక్షణను ఆదరణను ప్రకటిస్తూ మీ శ్రమలు సమాప్తమయ్యెను మీ అతిక్రమములు క్షమింపబడెను వాటి కొరకు నా కుమారుడు సంపూర్ణముగా వెలను చెల్లించాడు అని ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రజలు ఓదార్చ బడాలని ఆయన కోరుకొంటున్నాడనే విషయాన్ని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. ప్రభువు మీ హృదయము లోనికి వచ్చులాగున మార్గమును సిద్ధపరచుడి. ఆయన కొరకు ఎదుచూస్తూవున్న మీ హృదయము లోనికి యేసు ప్రవేశించిన ప్రతిసారి మీ కొరకు బయలు పరచబడిన యెహోవా మహిమను మీరు చూస్తూ ఉన్నారు. మన ఆయుష్యు క్షణకాలమనే విషయాన్ని మర్చిపోకండి. తీర్పులో  నిలబడవలసియున్నాం. అటువంటప్పుడు మనకు నిరీక్షణ, నిత్యము నిలుచు దేవుని మాటలే. వాటిని మన జీవితాలకు ఆధారము చేసుకొందాం. సువార్త ద్వారా దేవుడు పశ్చాత్తాపపడని, అవిశ్వాసముతో నిండిన హృదయములను తట్టుచున్నాడు. విశ్వాసమును సృజించు చున్నాడు. పరిశుధ్ధాత్ముడు హృదయములో విశ్వాసమును సృజించినప్పుడు అడ్డంకులు తొలగిపోతాయి. ఆయన కుమారుని మనము పుచ్చుకొనునట్లు మన హృదయములను సిద్ధపరచుటకు దేవుడు మనలను ప్రేరేపించును గాక. ఆమెన్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl