బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మము అంటే ఏమిటి?
అపొస్తలుల కార్యములు 19:1-7, అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి–మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా వారు–పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడతడు– ఆలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు–యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు– యోహాను తన వెనుక వచ్చువాని యందు, అనగా యేసు నందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరు ఇంచుమించు పండ్రెండుగురు పురుషులు.
- బాప్తిసమిచ్చే యోహాను బాప్తీస్మాన్ని మనం ఎలా చూడాలి?
- అది అసమర్థంగా ఉందా?
- అది క్రీస్తు బాప్తిసం నుండి భిన్నంగా ఉందా?
- ఇది కేవలం సన్నాహక చర్య మాత్రమేనా?
- యోహాను బాప్తిసం కొత్త నిబంధన బాప్టిజంతో ఎలా పోలుస్తుంది?
- నేడు ఎవరూ నిజంగా “యోహాను బాప్తిసం”తో బాప్తిసం ఇస్తున్నారని నేను అనుకోను.
యోహాను బాప్తిసంను గురించి ఆలోచిస్తుండగా కొన్ని ప్రశ్నలు మనకు రావొచ్చు.
- యోహానుకు బాప్తిసం ఇవ్వమని ఎవరు ఆజ్ఞాపించారు?
- బాప్తిసం గురించి అతడు ఎలా నేర్చుకున్నాడు?
- యోహాను ఏ ఫార్ములాని ఉపయోగించాడు?
- అతడు ముంచడం ద్వారా బాప్తిసం ఇచ్చాడా?
- అతడు శిశువులకు బాప్తిసం ఇచ్చాడా?
- అతని మరణం తర్వాత కూడా అతని శిష్యులు ఆ బాప్తీస్మాన్ని కొనసాగించారా?
- యేసు శిష్యులు ప్రారంభమైన తర్వాత యోహాను బాప్తిసం ఆగిపోయిందా?
- క్రీస్తు మరణానికి ముందు బాప్తిసం అంటే సున్నతికి భిన్నంగా ఉందా?
- లేకపోతే యూదులు ఎందుకు బాప్తిసం పొందారు?
- యోహాను అనుచరులు యేసుపై జ్ఞానం మరియు నమ్మకం లేకుండా, ఆయన శ్రమలు, మరణం మరియు పునరుత్థానం లేకుండా లేదా పెంతెకొస్తుతో సమావేశం లేకుండా నిజమైన విశ్వాసానికి తీసుకురాబడ్డారా?
- యోహాను బాప్తిసం పొందిన వారు శిష్యులు తప్ప మిగతా వాళ్ళు తిరిగి బాప్తిసం పొందారా?
I. బాప్టిజం అంటే ఏమిటి – దాని సారాంశం మరియు ప్రభావం?
లూథర్ ఇలా వ్రాశాడు, “మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు ధన్యుడు, ఆయన తన కృపామహదైశ్వర్యములో తన సంఘములో ఈ మతకర్మను భద్రపరిచాడు. అసమర్థులైన చిన్న పిల్లలు కూడా దాని ద్వారా ఆయన వాక్యపు సాధారణ విశ్వాసంలో బాప్తిస్మమును పొంది పవిత్రం చేయబడాలని ఆయన కోరుకున్నాడు. కాని సాతాను, చిన్న పిల్లలలో బాప్టిజం యొక్క శక్తిని అణచివేయలేకపోయినప్పటికీ, వారిని బాప్తీస్మానికి పెద్దల ద్వారా దూరం చేసి, పెద్దలలో దాని శక్తిని అణచివేయడంలో విజయం సాధించాడు. ఈ రోజుల్లో వారి స్వంత బాప్టిజంను గుర్తుచేసుకునే క్రైస్తవులు చాలా తక్కువ, దానిని కీర్తించే వారు ఇంకా తక్కువ. పాపాలను క్షమించి పరలోకానికి చేరుకోవడానికి చాలా ఇతర మార్గాలు కనుగొనబడ్డాయి, (బాబిలోనియన్ క్యాప్టివిటీ, LW వాల్యూమ్. 36, పేజీ. 57).
బాప్టిజంను అర్థం చేసుకోవడానికి మరియు దానిలో సంతోషించడానికి పునాది దాని ఉనికిలో ఉన్న సార్వత్రిక, నిష్పాక్షికమైన సయోధ్య (క్రీస్తు తెచ్చిన సమాధానము) లేదా సమర్థనలో (నీతిమత్వములో) ఉంది. ఇది చరిత్ర – గతంలో పూర్తయిన సంఘటన, 2 కొరింథీయులు 5:19,21; 1 యోహాను 2:2. రక్షణ కృప అనేది క్రీస్తులో మన పట్ల దేవుని కృప స్వభావము (ఎఫెసీయులు 2:8-9), తప్ప మానవ హృదయంలో నాటబడిన మంచి లక్షణం కాదు (గ్రేస్ ఇన్ఫ్యూస్ కాదు – కాథలిక్కులు, కాల్వినిజం చెప్తున్నట్లుగా). సువార్తలో దేవుని ప్రేమ ప్రకటనలను వినడానికి నమ్మడానికి బదులుగా మన హృదయాలోచనలు మనోభావాల ద్వారా దేవునిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం.
మన కొరకు దేవుడు పాప క్షమాపణ వాగ్దానాన్ని తాను నియమించిన పరిశుద్ధ సంస్కారానికి అనుసంధానించాడు, మత్తయి 28:19; అపొ. కార్య. 2:38; 22:16. బాప్టిజం అనేది దేవుని చర్య మరియు శుద్ధి చేయబడాలనే మానవ నిర్ణయానికి బహిరంగ గురుతు కాదు. సువార్త ప్రకటించబడినప్పుడు, దేవుడు ఉంటాడు. ఆయన బాప్టిజంలో కూడా ఉంటాడు ఎందుకంటే ఆయన అక్కడ ఉండటానికి కట్టుబడ్డాడు. ఈ విషయంలో సంశయవాదులకు లూథర్ జవాబిస్తూ: ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఒక గడ్డిని తీయమని లేదా ఈకను పీకమని ఆజ్ఞాపించి, ఆ ఆజ్ఞతో ఆ క్రమముతో, ఆ వాగ్దానముతో, ఈ చర్య ద్వారా మీరు మీ పాపాలన్నిటినీ, కృపను మరియు శాశ్వత జీవితాన్ని పొందవచ్చని వాగ్దానం చేస్తే, మీరు దానిని చాలా ఆనందంతో కృతజ్ఞతతో అంగీకరిస్తారు దానిని ప్రేమిస్తారు, దానిని ప్రశంసిస్తారు. ఆ గడ్డిని లేదా ఈకను పరలోకం భూమి కంటే ఉన్నతమైన పవిత్రమైన ఆస్తిగా పరిగణించరా? అని ప్రశ్నించాడు, (సెయింట్ లూథర్ XVI: 2296).
బాప్తిసంలో మనకు రెండు గొప్ప బహుమతులు లభిస్తాయి: 1) ఆబ్జెక్టివ్ బహుమతి: పాప క్షమాపణ ద్వారా దేవునితో సరైన సంబంధం. అక్కడ దేవుడు తాను క్రీస్తు ద్వారా పూర్తిగా సమాధానపడ్డానని మరియు క్రీస్తు పని కారణంగా ఆయన వారిని ప్రేమిస్తున్నాడని మానవులకు వెల్లడిస్తాడు మరియు ప్రకటిస్తాడు. 2) సబ్జెక్టివ్ బహుమతి: ఆత్మ, ఇది మనల్ని లోపల నుండి శక్తివంతం చేస్తుంది (ఎఫెసీ 3:20-21). ఈ “కృప సాధనం” ప్రకటించే వెల్లడించే క్షమాపణ, ప్రేమ. కృపపై పరిశుద్ధాత్మ పనిచేసే మరియు విశ్వాసాన్ని బలపరిచే ప్రభావవంతమైన శక్తి ఇది. బాప్తిసం ద్వారా ఆత్మ మన జీవితాల్లో నిశ్శబ్ద శక్తితో పనిచేస్తుంది. మనల్ని క్రీస్తుకు అనుగుణంగా మార్చుకుంటుంది మరియు నిశ్శబ్ద సేవలో మనల్ని లోకంలోకి పంపుతుంది.
బాప్తిసంలో దేవుడు మనతో పొత్తు పెట్టుకుంటాడు మరియు మనలో ప్రతి ఒక్కరినీ ఒక కొత్త వ్యక్తిగా చేస్తూ, దయగల ఓదార్పు నిబంధనలో మనతో ఏకమవుతాడు. బాప్తిసం పొందినవారు నిరంతరం “పశ్చాత్తాప క్షమాపణ” స్థితిలో జీవిస్తున్నారు. బాప్తిసం తర్వాత మన స్వభావంలో మిగిలి ఉన్న పాపాలను మనపై లెక్కించనని లేదా వాటి కారణంగా మనల్ని ఖండించనని దేవుడు ప్రతిజ్ఞ చేస్తాడు. మనం నిరంతరం ఈ పాపాలను జయించడానికి మరియు మన మరణంలో వాటిని వదిలించుకోవడానికి కోరుకోవడాన్ని ప్రయత్నించడాన్ని బట్టి ఆయన సంతృప్తి చెందుతాడు మరియు సంతోషంగా ఉంటాడు, I యోహాను 1:9-10; 2:1-2. భూమిపై బాప్తిసం కంటే గొప్ప ఓదార్పు మరొకటి లేదు, అపొ. కార్య. 2:38; 22:16; ఎఫెసీ 5:26; 1 పేతురు 1:23; తీతు 3:5.
బాప్టిజం అనేది “కనిపించే వాక్యం” మరియు అదే సమయంలో ఆ వాక్యం మరియు ఆచారం ద్వారా దేవుడు హృదయాలను నమ్మేలా కదిలిస్తాడు మరియు విశ్వాసాన్ని ఇస్తాడు, రోమా 10:17. బాప్టిజం అనేది పునరుత్పత్తికి సాధనం (తీతు 3:5) ఎందుకంటే ఇది పాప విముక్తిని ప్రసాదిస్తుంది మరియు దాని ద్వారా విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది, బలపరుస్తుంది, యోహాను 3:5,14-16; రోమా 6:1-11. ఆయన దైవిక వాగ్దానంతో ప్రారంభిస్తాడు: “నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షింపబడతాడు” (మార్కు 16:16) ఆధ్యాత్మిక ఆశీర్వాదాల సంపద కూడా మనదే. దానిలో విశ్వాసం లేకపోవడం ద్వారా మాత్రమే బాప్టిజం యొక్క ఆశీర్వాదాలు రద్దు చేయబడతాయి. మనం దానిపై మన విశ్వాసాన్ని ప్రదర్శించేలా దానిని పరిగణించాలి మరియు మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత, మనం రక్షింపబడతామని ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే విశ్వాసం బాప్టిజంలో ఇవ్వబడకపోతే, బాప్టిజం మనకు ఏమీ ప్రయోజనం కలిగించదు.
బాప్టిజం కూడా పాత నిబంధనలోని వాటికి సమానమైన సంకేతం. ఈ సంకేతాలకు దేవుడు వాగ్దానాన్ని జతచేశాడు. ఆ సంకేతాలు తరచుగా మార్చబడ్డాయి. ఆదాము నుండి అబ్రహం వరకు ప్రజలకు త్యాగాలు సంకేతంగా ఉన్నాయి. తరువాత నోవహు ఇంద్రధనస్సును పొందాడు. అబ్రహం సున్నతి పొందాడు. క్రీస్తు కాలం నుండి బాప్టిజం మన కోసం వేరు చేయబడింది. సంకేతము మరియు వాగ్దానం ఒకదానికొకటి ముడిపడి ఉండాలి. ఒకదాని క్రింద మరొకటి నలిగిపోకూడదు. ఎందుకంటే వాగ్దానం ఎల్లప్పుడూ అక్షరం మరియు ముద్ర కలిసి ఉండే విధంగా నిలుస్తుంది. మరొకటి లేకుండా రెండూ ఉపయోగపడవు. స్వయంగా నిలిచే ముద్రపై అట్లే దానికి జతచెయ్యబడిన వాగ్దానములో మాత్రమే విశ్వాసం ఉంటుంది. ఒకరు చిన్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నారా లేదా పెద్దయినప్పుడా అనేది ప్రాముఖ్యం కాదు. దేవుడు చిన్నవారికి మరియు పెద్దలకు అందరి కోసం తన కుమారుడిని ఇచ్చాడనేది ముఖ్యం. దీనిపైనే మీరు బాప్తిస్మం తీసుకోవాలి, (LW వాల్యూమ్.54, పేజీ.57).
II. యోహాను బాప్తిసం గురించి ఒక పరిశీలన
లేఖనాలలో బాప్తిసం బాప్తిసమిచ్చే యోహాను పరిచర్యలో మొదట ప్రముఖ స్థానాన్ని పొందుతుంది. అతడు దానిని కనిపెట్టలేదు. అతడు దానిని అన్యమతాల నుండి తీసుకోలేదు లేదా యూదులు మతమార్పిడి చేసిన వారికి బాప్తిసం ఇచ్చే ఆచారాన్ని స్వీకరించలేదు. లూకా నివేదించినట్లుగా (3:2) అతనికి దేవుని నుండి ప్రత్యక్ష ఆదేశం ఉంది, ప్రభువు వాక్కు జెకర్యా కుమారుడైన యోహానుకు వచ్చింది. ఇది అతన్ని ప్రభువు ప్రత్యేక సేవలోకి పిలిచింది, యిర్మీయా 1:2,4. యోహాను ఈ పిలుపును, పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించడం, మార్కు 1:4 అని వెల్లడిస్తాడు. యోహాను ప్రజలకు ఇలా చెప్పాడు, నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు… నాకు చెప్పాడు, యోహాను 1:33. యోహాను బాప్తిసం “పరలోకం నుండి” అని యేసు పేర్కొన్నాడు, మత్తయి 21:25.
అయితే, పరిసయ్యులు యోహానుకు బాప్తిస్మం ఇచ్చే అధికారాన్ని ప్రశ్నించి, నీవు క్రీస్తువైనను, ఏలీయావైనను, ప్రవక్తవైనను కాకపోతే ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని? అని అడిగారు, యోహాను 1:24-25. దేవుని ప్రజల శుద్ధీకరణను వివరించే యెహెజ్కేలు 36:25-33 నెరవేర్పుగా వారు బాప్తిసం ఆశించి ఉండొచ్చు. ఈ శుద్ధీకరణ అనేది స్పష్టంగా మెస్సీయ చర్య. అంతేకాకుండా, ఎవరినీ శుద్ధి చేసే ఆచారాలను నిర్వహించడానికి అనుమతించలేదు మరియు యోహాను వారి అనుమతి అడగలేదు.
పాత నిబంధన ప్రవచనాలు (మలాకీ 3:1, యెషయా 40:3) బాప్తిస్మమిచ్చు యోహానును పరిచయం చేస్తున్నాయి. దేవుడు తన కుమారుని రాకను ప్రకటించడానికి మరియు ఆయన ప్రజల హృదయాలను ఆయనను స్వీకరించడానికి సిద్ధం చేయడానికి బాప్తిస్మమిచ్చు యోహానును తన దూతగా పంపాడు. పరిసయ్యులను అతడు కఠినముగా హెచ్చరిస్తూ, సర్పసంతానమా, రాబోవు ఉగ్ర తను తప్పించుకొనుటకు మీకు బుద్ధిచెప్పినవాడెవడు? మత్తయి 3:7 అని ప్రశ్నించాడు. యోహాను బాప్తిసం దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి మార్గం, ఆ బాహ్య ఆచారం మాత్రమే సరిపోదు. అతని ద్వారా హృదయపూర్వకంగా బాప్తిసం పొందేందుకు వచ్చిన వారు “తమ పాపములు ఒప్పుకుంటూ” వచ్చారు, మత్తయి 3:6. పరిసయ్యుల విషయంలో అలా జరగలేదు. యోహాను బాప్తిసం “పాప విముక్తి కోసం పశ్చాత్తాప బాప్తిసం.” పశ్చాత్తాపం బాప్తిసం కోసం ఒక వ్యక్తికి తగినది. పశ్చాత్తాపం (మెటానోయియా – పాపం మరియు అపరాధం నుండి దేవుని కృప ద్వారా శుద్ధి మరియు క్షమాపణకు మారే హృదయం యొక్క మతపరమైన మార్పు) ఇది దేవుని రాజ్యాన్ని పొందేందుకు చాలా అవసరం.
యోహాను బాప్తిసం అనేది వ్యక్తులు తమ పాపాల అపరాధాన్ని ఒప్పుకోవడం మాత్రమే అని కొందరు అంటారు. మరికొందరు దానిలో అంతర్గత హృదయ మార్పు యొక్క బాహ్య వ్యక్తీకరణను చదువుతారు. మరికొందరు అది బాప్తిసం పొందిన వ్యక్తిని పరలోక రాజ్యంలో సభ్యునిగా చేయలేదని, దానికి అతన్ని సిద్ధం చేసిందని వాదిస్తారు. దీనిని క్రీస్తు బాప్తిసం యొక్క ఒక రూపంగా సూచిస్తారు. అయితే యోహాను బాప్తిసం ఒక ప్రభావవంతమైన మతకర్మ. ఇది పునర్జన్మమును మరియు పాప విమోచనను తెచ్చిపెట్టింది. ఇది “పాప విమోచన” (అఫిన్మి) కోసం, తీర్పు రోజున దేవుడు వాటిని కనుగొనలేనంత వరకు పాపి నుండి పాపాలను “పంపడం” కోసం, కీర్తన 103:12; యెషయా 43:25, మీకా 7:19.
క్రీస్తు “సువార్తే” యోహాను సందేశంలో ప్రధానమైనది, లూకా 3:18 ఎందుకంటే అది లేకపోతే అతని బాప్టిజం కేవలం అన్యమతసంబంధమైనదిగా ఉంటుంది. బాప్టిజం మరియు పాప విముక్తి క్రీస్తు సందేశానికి అనుసంధానించబడి ఉన్నాయి. ఆ విషయాన్ని అతడు చెప్తూ, అతడు నాకంటె శక్తిమంతుడు; నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కానని, మార్కు 1:7, అని చెప్పాడు. నేను నీటితో బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చిన కారణం ఆయనను ఇశ్రాయేలుకు వెల్లడి చేయటం, యోహాను 1:31 అని చెప్పాడు. ఆ శుభవార్త లక్ష్యం తన సొంత దేశం “ఇశ్రాయేలు”కు మొదటిగా ఆయనను వెల్లడి చెయ్యడం. ఆ క్రమములోనే అతడు వారికి ఆయనను వెల్లడిచేస్తూ, ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల, అని చూపించాడు, యోహాను 1:29, cf 53. యోహాను శిష్యులలో కొందరికి యేసుపై కొంత ఆగ్రహం ఉండటాన్ని బట్టి అతడు మళ్ళీ యేసును సూచిస్తూ, ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది. పైనుండి వచ్చు వాడు అందరికి పైనున్న వాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, యోహాను 3:30-36 అని చెప్పాడు. చాలా కాలం తరువాత, యోహాను తొలి రోజుల్లో బాప్తిస్మం ఇస్తున్న ప్రాంతానికి యేసు తిరిగి వచ్చినప్పుడు, చాలా మంది ఆయన (యేసు) దగ్గరకు వచ్చి– యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, యోహాను 10:41.
III. పోలిక
అటుతరువాత యేసు తన శిష్యులతోకూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను. సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. గనుక యోహాను శిష్యులలో కొందరు యోహాను నొద్దకు వచ్చి–బోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతోకూడ ఉండెనో, నీ వెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి, యోహాను 3:22,23,26. యేసు యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులను సంపాదించి బాప్తిసం ఇస్తున్నాడు, వాస్తవానికి బాప్తిసం ఇచ్చింది యేసు కాదు, అతని శిష్యులు, యోహాను 4:1-2. యోహాను ఇశ్రాయేలీయుల మధ్య ఇచ్చిన బాప్తిసాన్ని యేసు స్వీకరించి కొనసాగించాడు మరియు తన పునరుత్థానం తర్వాత అన్ని దేశాల కోసం దానిని స్థాపించాడు.
పెంతెకొస్తు దినాన బాప్తిసం “పాపక్షమాపణ నిమిత్తము” అపొ. కార్య. 2:38. యోహాను బాప్తిసం, పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము అని స్పష్టంగా చెప్పబడింది, మార్కు 1:4, లూకా 3:3. క్రైస్తవ బాప్తిసం పునర్జన్మసంబంధమైన స్నానము మరియు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుటగా చెప్పబడింది. దీని ద్వారా, ఆయన మనలను రక్షిస్తాడు, తీతు 3:5. కాబట్టి యోహాను బాప్తిసం పరిశుద్ధాత్మ ద్వారా రక్షణను పునర్జన్మమును తెచ్చే వాహనంగా వర్ణించబడింది, 1 పేతురు 3:21. యేసు నీకొదేముతో మాట్లాడుతూ, ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని చెప్పినప్పుడు యోహాను బాప్తిసం ఆయన మనస్సులో ఉండి ఉండాలి, యోహాను 3:5. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించినట్లు చెప్పబడ్డారు లూకా 7:29-30.
యోహాను క్రీస్తు బాప్తిసంను ఇంకా ఉన్నతమైనదని చెప్పాడు. నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పాడు, మార్కు 1:8. అంటే యోహాను బాప్తిసం ఆత్మ లేకుండా జరిగిందా? అలా అయితే అది కేవలం ఒక ఆచారమే అవుతుంది. కాని అది “పాప క్షమాపణను” మరియు దేవుని రాజ్యంలోకి ప్రవేశాన్ని తెచ్చిపెట్టింది. అది పరిశుద్ధాత్మ యొక్క కృపగల చర్య లేకుండా జరగదు. వాస్తవానికి పరిశుద్ధాత్మ పతనం నుండి మానవ హృదయాలలో దేవుని రక్షణ వాగ్దానాలపై విశ్వాసాన్ని సృష్టిస్తోంది. యోహాను తన బాప్తీస్మాన్ని ఆయన బాప్తీస్మాన్ని పోల్చినప్పుడు, అతడు తాను కేవలం దేవుని చేతిలో ఒక సాధనం మాత్రమేనని అంగీకరిస్తున్నాడు. యోహాను చేయగలిగేది కృప సాధనాలను వర్తింపజేయడం మాత్రమే. బాప్తిసంలో నీటిని పోయడానికి మాత్రమే అతని స్వంత బలం సరిపోతుంది. కాని క్రీస్తు విమోచనను స్వయంగా చేయగలడు. తన స్వంత దైవిక శక్తి ద్వారా, పై నుండి ఆత్మను కుమ్మరించడం ద్వారా దానిని ఇంకను ఘనమైనదిగా చేయగలడు మరియు అది ఆయన తన విమోచనా కార్యమును పూర్తి చేసి, ఆపై పరలోకానికి ఎక్కిన తర్వాత మాత్రమే).
క్రీస్తు యోహాను నీటి బాప్తిస్మాన్ని అంగీకరించాడు. యోహాను ద్వారా తాను బాప్తిస్మం తీసుకొన్నాడు. అయితే, యేసు ఇంకా ప్రజలు అనుభవించని దానిని వాగ్దానం చేశాడు. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడ లేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు, యోహాను 7:38,39. ఆయన త్యాగపూరిత మరణాన్ని ఆయన మహిమను అర్థం చేసుకోనంత వరకు ఏ విశ్వాసి కూడా యేసు కోరుకున్న విధంగా పనిచేయడానికి సిద్ధంగా లేడు లేదా పనిచేయలేకపోయాడు. యేసు విమోచనా కార్యము పూర్తయ్యే ముందు దాకా, విమోచన పని అంతా పాత నిబంధనలో లాగానే ఉంది. యోహాను బాప్తిస్మంతో లేదా యేసు శిష్యుల ద్వారా బాప్తిస్మంతో అనుసంధానించబడినా వాగ్దానంపై నమ్మకమే. యేసు మహిమపరచబడటం ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. ఆపై ఆయన ఆత్మను ప్రత్యేక స్థాయిలో పంపుతాడు, యోహాను 14:25-26; 16:7-14. పరిశుద్ధాత్మ ఒకని పైకి వచ్చే వరకు ఆ వ్యక్తి ప్రపంచానికి గొప్ప ఆశీర్వాదం కాలేడు. యేసు మహిమపరచబడే వరకు ఆత్మ పూర్తి స్థాయిలో రాలేకపోయింది.
పెంతెకొస్తు తర్వాత, వారు పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించారు. ఆయన సంపూర్ణ విమోచన సందేశం ద్వారా పనిచేశాడు. క్రీస్తుపై పూర్తి అవగాహన మరియు ధైర్యమైన విశ్వాసాన్ని చూపించాడు. ఆ రోజు శిష్యుల సంఖ్యకు మూడు వేల మంది చేర్చబడ్డారు. వారి ఆరాధనా జీవితాలు ప్రతిరోజూ కలిసి సమావేశమవడం, అపొస్తలుల బోధనలకు తమను తాము అంకితం చేసుకోవడం, సహవాసం మరియు ప్రార్థన చేయడం, అవసరం ఉన్న ఎవరితోనైనా సువార్తను పంచుకోవడం మరియు అందరి అనుగ్రహాన్ని ఆస్వాదించడం ద్వారా సమృద్ధిగా ఉన్నాయి. (అపొ. కార్య. 2:42f)
పరలోకానికి తీసుకెళ్లబడటానికి ముందు, యేసు తన శిష్యులతో యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరని చెప్పాడు, అపొ. కార్య. 1:5. యోహాను తన బాప్తిసంతో పనిని ప్రారంభించాడు. యేసు పెంతెకొస్తు రోజున చివరి దశకు చేరుకోవలసి ఉంది. ఇక్కడ ఆత్మ శిష్యులను అద్భుతంగా నింపి, క్రొత్త నిబంధన సంఘ యుగాన్ని ప్రారంభించి వారికి గొప్ప శక్తిని ఇచ్చాడు. అప్పుడప్పుడు మనం ఇతరులు కూడా ఆయన అంతర్గత పని యొక్క ప్రత్యేక సంకేతాలతో నిండి ఉన్న సందర్భాలను చూస్తాము. పౌలు నివేదికలో అపొ. కార్య. 11:16లో కొర్నేలియస్ ఇంట్లో సందేశాన్ని విన్న వారు బాప్తిస్మం తీసుకోవడానికి ముందే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేక బహుమతులను వాళ్ళు ఎలా పొందారో అతడు మనతో పంచుకున్నాడు. పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేక కుమ్మరింపు శిష్యులను ప్రపంచంలో క్రీస్తు సాక్షులుగా పిలవడానికి సన్నద్ధం చేయడం కోసం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులుగా ఉంటారు, అపొ. కార్య. 1:8.
అపొల్లోను గురించి ఈ వచనం మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవొచ్చు. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మముమాత్రమే తెలిసికొనిన వాడైనను, యేసునుగూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను, అపొ. కార్య. 18:25. “యోహాను బాప్తిసం” ద్వారా బాప్తిస్మమిచ్చువాడి మొత్తం బోధన మరియు పని ఇక్కడ ప్రస్తావించబడింది. అతనికి యోహాను పరిచర్య మాత్రమే తెలుసు. దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు గురించి అతనికి తెలిసినది ఖచ్చితమైనది అయినప్పటికీ, అతని జ్ఞానం యేసు పని పూర్తి అయ్యే వరకు విస్తరించలేదు. అతను వినడానికి ఎక్కువగా సంతోషించిన విషయాలు ప్రభువు భోజనం, ఆయన సిలువ, పునరుత్థానం, ఆరోహణం, పెంతెకోస్తు మరియు ఇప్పుడు “అన్ని దేశాలకు బాప్తిసం ఇవ్వండి” అనే ఆజ్ఞ గురించిన వార్తలు అయి ఉండొచ్చు. అయినప్పటికీ శిష్యులు మరియు ఇతరుల మాదిరిగానే, యోహాను బాప్తిసం అతనికి అవసరమైనది. త్వరలోనే యేసు బాప్తిసం ద్వారా భర్తీ చేయబడిన యోహాను బాప్తిసం, ఇప్పటికే వచ్చిన మెస్సీయపై స్థాపించబడింది మరియు దానిని సూచిస్తుంది. అదే వాగ్దానంతో అనుసంధానించబడి, ఆత్మలను దేవుని రాజ్యంలోకి తీసుకురావడంలో ఇది ప్రభావవంతంగా ఉంది.
యోహాను బాప్తిసం గురించిన మరొక విషయం, అపొ. కార్య. 19:1-7 క్రైస్తవులు అనే పేరుతో పిలువబడే పన్నెండు మంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని పౌలు వారిని అడిగాడు. చాలా మంది మతమార్పిడి చెందిన వారిని (కొర్నేలియస్ వంటి వారిని) తాకిన పరిశుద్ధాత్మ యొక్క అసాధారణ బహుమతుల గురించి అతడు ఆలోచిస్తున్నాడు. అయినప్పటికీ అది చాలా వరకు కొత్త క్రైస్తవులలో జరగలేదు. పౌలుకు ఆశ్చర్యకరమైన సమాధానం లభించింది, వారు–పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. పాత నిబంధన తెలిసిన వారికి పరిశుద్ధాత్మ ఉనికి ఇప్పటికే తెలిసి ఉండాలి, 2 సమూయేలు 23:2-3; యెషయా 63:10,11,14. అయితే ఈ వ్యక్తులకు పరిశుద్ధాత్మ గురించి సరైన అవగాహన లేదు. పరిశుద్ధాత్మ గురించి ఏమీ తెలియని వారు నిజమైన చెల్లుబాటు అయ్యే బాప్తిసం పొందలేరు. త్రిత్వాన్ని తిరస్కరించడం అంటే నిజమైన దేవుడిని తిరస్కరించడం, బాప్టిజం యొక్క సారాంశాన్ని నాశనం చేయడం.
వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు విశ్వాసం మరియు ఒప్పుకోలుకు ఏమి ప్రతిపాదించబడ్డారని పౌలు అడిగాడు? వారు–యోహాను బాప్తిస్మము అని చెప్పారు. అపొల్లో లాగా కాకుండా వారు తప్పుదారి పట్టారు. యోహాను శిష్యులందరూ క్రీస్తు శిష్యత్వంలోకి ప్రవేశించలేదు. యోహాను బాప్తిసం కొనసాగించడం నిజమైన బాప్తిసం కాదు. అది కేవలం చనిపోయిన ఆచారం. వారు యోహాను నిజమైన అనుచరులైతే వారు క్రీస్తును తెలుసుకుని ఆత్మ గురించి విని ఉండేవారు, యోహాను 3:34, మార్కు 1:8. వారికి పాప విముక్తి మరియు పరిశుద్ధాత్మ పని ఉండేది. క్రీస్తు గురించి ప్రకటన లేదా పరిశుద్ధాత్మతో అగ్నితో ఆయన బాప్తిసం లేనట్లు అనిపిస్తుంది. క్రీస్తు సందేశాన్ని వినడం, సరిగ్గా బాప్తిసం పొందడం మరియు పరిశుద్ధాత్మ వారి జీవితాల్లో తన పనిని కనిపించే విధంగా చూపించడం వారికి ఎంతో ఉత్సాహాన్నిచ్చి ఉంటుంది.
బాప్తిసం మనకు వ్యక్తిగతంగా ఎంతో ఆశీర్వాదకరమైనది మరియు దానిని నిర్వహించడం ఎంతో గొప్ప ఆధిక్యత. ఇది యోహాను బాప్తిసం ఇచ్చిన బాప్టిజం అయినప్పటికీ, క్రీస్తు ఆరోహణ మరియు పెంతెకొస్తు నుండి మరిన్ని విషయాలు దీనికి ఆపాదించబడ్డాయి. యోహాను బాప్తిసం మెస్సీయ పని యొక్క పాక్షిక చిత్రంపై ఆధారపడి ఉంది, క్రీస్తు ఆ రక్షణ యొక్క సాధించిన వివరాలను వెల్లడిస్తుంది. యోహాను రాబోయే క్రీస్తు కొరకు అనుచరులుగా చేసాడు. క్రీస్తు వచ్చిన క్రీస్తుకు అనుచరులుగా చేసాడు. యోహాను బాప్తిసం క్షమాపణను గెలుచుకోబోతుండగా, ఇప్పుడు అది క్రీస్తు గెలిచిన క్షమాపణను తీసుకువచ్చింది. యోహాను ఇశ్రాయేలు కోసం, క్రీస్తు అన్ని దేశాల కోసం. దాని గొప్పతనం ఒక్కసారి కూడా మన ఆలోచనలు, మాటలు లేదా చర్యల నుండి జారిపోకుండా దాని ఆదరణ మరియు శక్తితో ప్రతిరోజూ మనల్ని మనం పునరుద్ధరించుకొందాం.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl