మత్తయి సువార్త 3 వ అధ్యాయము

రెండవ భాగము
యేసుని పరిచర్య ప్రారంభము ( 3:1-4:11)

బాప్తిస్మమిచ్చు యోహాను మార్గాన్ని సిద్ధపర్చడం 1-12

1ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి2–పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. 3ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. 4ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము. 5ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి, 6తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.

మత్తయి సువార్త 1,2 అధ్యాయాలలో ఉన్న యేసయ్య జన్మము నుండి ఇప్పుడు మత్తయి సువార్త 3:1-6 వచనాలలో బాప్తిస్మమిచ్చు యోహాను తన పరిచర్యను ప్రారంభించిన కాలానికి మనం వస్తున్నాం.

బాప్తిస్మమిచ్చు యోహాను జెకర్యా ఎలీసబెతుల కుమారుడు (లూకా 1:57-66), జెకర్యా యాజకుడు, వారిద్దరు బహు కాలము గడచిన వృద్ధులైరి, (లూకా 1:5-7). ఎలీసబెతు మరియ బంధువు, (లూకా 1:36). అతని పరిచర్యలో మతపరమైన వాషింగ్ (బాప్టిజం) ఉన్నందున, యోహాను బాప్తిస్మమిచ్చు యోహానుగా పిలువబడ్డాడు. యేసుకు మార్గాన్ని సిద్ధం చేయడానికి దేవుడు యోహానును పిలిచాడు. పాత నిబంధనలో ప్రవక్తలు మరియు వారి కార్యకలాపాలు తరచుగా అరణ్యంలో ఏర్పాటు చెయ్యబడ్డాయి (ఏలీయా, 1 రాజులు 19:4-8). యోహాను బాప్తిస్మమునకు ఎంచుకొన్న ప్రాంతము యొర్దాను నది మృత సముద్రంలో కలిసే చోటు.

బాప్తిస్మమిచ్చు యోహాను తన పరిచర్యను ఎప్పుడు ప్రారంభించి ఉండొచ్చు అనే ప్రశ్నకు లూకా 1:36 ఒక క్లూ ఇస్తూ ఉంది. మరొక క్లూ కూడా ఉంది. సంఖ్యాకాండము 4:3 చూస్తే పరిచర్యకు 30-50 సంవత్సరాలు ప్రాథమికమైన వయస్సుగా నిర్ణయింపబడింది. కాబట్టి అనేకులు బాప్తిస్మమిచ్చు యోహాను యేసు పరిచర్యకు 6 నెలల ముందుగా (యోహాను యేసు కంటే ఆరు నెలలు పెద్దవాడు) పరిచర్యను ప్రారంభించి ఉండొచ్చని చెప్తారు. మరికొందరు అంతకంటే ముందే బాప్తిస్మమిచ్చు యోహాను తన పరిచర్యను ప్రారంభించి ఉండొచ్చని చెప్తారు.

మత్తయి 2:23 ప్రకారము, యేసు ఇంకా నజరేతులో నివసిస్తూ ఉండగా, బాప్తిస్మమిచ్చు యోహాను బోధించడం ప్రారంభించాడు. అతడు ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను, లూకా 1:80.

బాప్తిస్మమిచ్చు యోహాను కాలములో యుదయ రోమ్ ప్రావిన్స్, గవర్నర్లుచే పరిపాలించబడుతూ ఉంది. వీరిలో ఆరవ వ్యక్తి పొంతి పిలాతు. పిలాతు అధికారం మొదలయ్యి ఎక్కువ రోజులు కూడా కాలేదు.

బాప్తిస్మమిచ్చు యోహాను కాలములో యూదయ సమాజం మునుపటి మాదిరిగానే ఉంది. అదే ప్రాపంచికత గ్రీకు పద్ధతులు, విలాసవంతమైన జీవితం, అదే ఫార్మలిజం, మతోన్మాదం, మార్పుకు ఎటువంటి సంకేతం కూడా యూదయ సమాజంలో లేదు.

జెకర్యా ఎలీసబెతుల కుమారుడైన యోహాను ఎదిగి, ఆత్మయందు బలముపొంది (లూకా 1:80), ప్రవక్తగా పరిచర్యను ప్రారంభించాడనే వార్త కలకలం రేపుతోంది. పాతనిబంధన క్రొత్తనిబంధన మధ్యలోవున్న 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలము తరువాత ప్రవక్త ఆవిర్భవించాడని ప్రజలు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.

ఇక్కడ “ఆ దినములయందు” అంటే? దీనికి లూకా 3:1,2 జవాబుచెప్తూ, తిబెరి కైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియ అధిపతిగాను, అన్నయు, కయపయు ప్రధానయాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో నున్న జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చిన రోజుల్లో అని అర్ధం. ఈ మాటలు ఒక చారిత్రాత్మకమైన వాస్తవాన్ని గురించి తెలియజేస్తున్నాయి. ఈ వాస్తవాలన్నిటిని ఆనాటి చరిత్రకారుడైన జోసిఫస్ కూడా ధ్రువీకరించాడు. బాప్తిస్మమిచ్చు యోహాను తన పరిచర్యను ఎప్పుడు ప్రారంభించాడు అనే ప్రశ్నకు గల చారిత్రాత్మికతను గూర్చి ఈ మాటలు తెలియజేస్తున్నాయి. బాప్తిస్మమిచ్చు యోహాను ఆ రోజుల్లో వచ్చాడు, తన పరిచర్యలో ప్రవేశించాడు, దాని కోసం అతడు తన పుట్టుకకు ముందే ఉద్దేశించబడ్డాడు మరియు సిద్ధం చేయబడ్డాడు, లూకా 1:15-17, 76-79. పాపాలను ఒప్పుకున్న వారికి బాప్తిస్మము ఇచ్చినందున (అతడి బహిరంగ పరిచర్యను బట్టి) అతనిని “బాప్తిస్మమిచ్చు” యోహాను అని పిలిచారు.

యోహాను హెబ్రోనులో అతని తండ్రి నివసించిన కొండప్రాంతంలో అజ్ఞాతంలో నివసించాడు. ఇతడు యూదులలో అత్యంత కఠినముగా వ్యవహరించే ఎస్సేస్న్స్ Essence అనే ఆనాటి యూదా సన్యాసుల తెగకు చెందినవాడని కొందరి అభిప్రాయం. ఈ తెగకు చెందిన వారు స్వచ్ఛంద పేదరికంలో జీవిస్తూ రోజువారి ఇమ్మర్షన్ (baptism) మరియు సన్యాసం, బ్రహ్మచర్యంతో దేవునికి అంకితమైన జీవితంతో ఎంతో నిష్ఠగా బ్రతికే వాళ్ళు. వీళ్ళలో కొందరు ప్రజలకు దూరముగా అరణ్యములలో ఉండేవారు. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క ప్రత్యేకమైన జీవన శైలిని బట్టి బాప్తిస్మమిచ్చు యోహాను ఈ తెగకు చెంది ఉండొచ్చని వారి అభిప్రాయం. డెడ్ సీ స్క్రోల్స్ గా 1946 లో మనకు దొరికిన పాత నిబంధన గ్రంథాలన్ని ఈ తెగకు చెందిన వారే భద్రపరచారని అది వాళ్ళ లైబ్రరి అని కొందరి నమ్మకం.

1ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి2–పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని (పశ్చాత్తాపపడుడని) యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. 3ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే.

ఈ సందర్భంలో మత్తయి ప్రవచనాత్మక భాగాన్ని జోడించిన విధానం విశిష్టమైనది. ప్రవక్తయైన యెషయా బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి ప్రవచిస్తూ, యెషయా 40:3-5లో, 3ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా–అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. 4ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. 5యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు, అని యేసు పుట్టుకకు 700ల సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ప్రవక్తయైన మలాకీ కూడా మలాకీ 3:1లో, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును అని (మలాకీ 4:5) బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి యేసుకు పుట్టుకకు 430ల సంవత్సరాల క్రితమే మరొకసారి ప్రవచించాడు.

ఐగుప్తు బానిసత్వం నుండి తన ప్రజలను విడిపించడానికి వచ్చిన ప్రభువు రాకడను ఈ చిత్రం గుర్తుచేస్తుంది. దేవుడు మోషేను అరణ్యంలో మండుతున్న పొద వద్దకు పిలిచాడు, అతనితో పాటు ఫరో వద్దకు వెళ్ళాడు. యెహోవా మోషేతో పాటు అరణ్యం నుండి వచ్చి తన ప్రజలను ఐగుప్తు నుండి అరణ్యంలో ఉన్న సీనాయి పర్వతానికి తీసుకువచ్చాడు. అరణ్యానికి సంబంధించి యెషయా ఇక్కడ ప్రస్తావించిన విషయాలు, ఆయన మొదటిసారి వచ్చినట్లే మళ్లీ వస్తాడని దేవుని ప్రజలకు గుర్తుచేస్తున్నాయి. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి అను చిత్రం యెషయా రోజులలో చక్రవర్తులు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లే ముందు రూట్ మ్యాప్ ఇచ్చి దారి క్లియర్ చేయడానికి అతనికంటే ముందుగా ఒక బృందాన్ని పంపేవారు. చక్రవర్తి ప్రయాణించే మార్గములో అవసరమైన ఏర్పాట్లు చూడటం అందుకు తగినట్టుగా పనిచేసే వారికి సామాగ్రిని అందించడం వంతెనలను కట్టడం, కొండలను సమం చేయడం లోయలపై కాజ్‌వేలను నిర్మించడం లేదా వాటిని నింపడం, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉంచడం ఆ దూతల పని. ఈ మాటల్ని ప్రవాస యూదుల పునరాగమనానికి వర్తింపజేస్తే, అన్ని అడ్డంకులు తొలగించబడతాయని దేవుని ఆదేశం ముందుకు సాగుతుందని అర్ధం. ప్రభువగు యెహోవా ఒక చక్రవర్తిగా ఆయనే తన ప్రజలను విమోచించి వారి స్వంత దేశానికి నడిపించబోతున్నాడు. ఆయన కొరకు ఆయన ప్రజలు సిద్ధపడ వలసియున్నారు.

యెషయా మరో ఆలోచనను ఇక్కడ జోడించాడు. నిర్గమములో ఉన్న ప్రజలను నడిపించడానికి వారికి భరోసా ఇవ్వడానికి ప్రభువు యొక్క ఉనికి, మహిమ వారికి కనిపించినట్లే, యెహోవా మహిమ మరోసారి బయలుపరచబడునని ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరని ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు అని అంటున్నాడు. యెహోవా మహిమ అంటే ప్రజలకు దేవుని యొక్క శక్తిని ప్రేమను తెలియజేయుటకు బయలుపరచు ప్రత్యేకమైన ప్రత్యక్షత. బబులోను చెరలో ఉన్న తన ప్రజలను వారి బానిసత్వం నుండి విడిపించడం ద్వారా మరియు వారి స్వంత భూమికి వారిని తిరిగి నడిపించడం ద్వారా ఆయన తాను ఒడంబడికను కాపాడుకునే దేవుడిగా వెల్లడించుకొన్నాడు. తరువాతి రోజుల్లో తన ప్రజల విమోచనను నెరవేర్చడానికి మెస్సీయను పంపడంలో ఇది మరింత విశిష్టంగా చూపబడుతుంది. అదే దేవుడు అందరిని ఆయన విమోచించబోతున్నాడు. వాస్తవానికి, ఇది దేవునిని గూర్చిన ఒక ప్రవచనాత్మక చిత్రం. ఈ ప్రవచనము మెస్సయ్యకు ముందుగా పోవు దూతను గూర్చి కూడా తెలియజేస్తుంది. సువార్తికుల ద్వారా ఇది బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చిన ప్రవచనమని అర్ధమవుతుంది. మెస్సీయకు వర్తింపజేస్తే, యెహోవా మహిమ మరోసారి బయలుపరచబడబోతూ ఉంది. దేవుడు తన ప్రజలను విమోచించడానికి వారి వద్దకు రాబోతున్నాడు. ఏదో మారుమూల అరణ్యంలో మెస్సయ్య బయలుపరచబడతాడనే విషయాన్ని అస్సలు ఎదురుచూడం. తన ప్రజలను విమోచించడంలో సర్వశరీరులు దైవికమైన జోక్యాన్ని చూస్తారు. ఆయన శక్తి మహిమ యొక్క సాక్ష్యాలను గుర్తిస్తారు. యేసు ముఖమును మనము చూసే ప్రతిసారి దేవుని మహిమను మనము చూస్తున్నాం.

అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. 4ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెననునవి రక్షకుని పొందుటకు కోరుకొంటున్న వారందరి కొరకు ఇవ్వబడిన నియమాలుగా వీటిని మనము తీసుకోవలసి ఉన్నాము. ప్రభువు హృదయములోనికి వచ్చు మార్గములో ప్రతి లోయను ఎత్తు చెయ్యాల్సి ఉంది. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవల్సి ఉంది. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను చెయ్యాల్సి ఉంది.

వచ్చి పరలోకరాజ్యము సమీపించియున్నది మారుమనస్సు పొందండి, పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని ప్రకటించాడు. అందరి ప్రవక్తలవలె యోహాను కూడా “మీ పాపముల నుండి మళ్లుకొని దేవుని వైపునకు తిరగండి” అని ప్రకటించాడు. అతని బోధలోని ముఖ్యాంశం: పశ్చాత్తాపపడండి, పరలోక రాజ్యం సమీపించింది ([καὶ] λέγων, Μετανοεῖτε, ἤγγικεν γὰρ ἡ βασιλεία τῶν ὐρανῶν). మెస్సీయ ఆగమనానికి సన్నాహకంగా మనస్సు మరియు హృదయంలో పూర్తి మార్పు అవసరమని అతడు ప్రకటించాడు.

దేవుని రాజ్యం, పరలోక రాజ్యం సమీపించింది. అది దాని మహిమతో వెల్లడికాబోతోంది. ఆ ఘడియలు వచ్చేసాయి అని యోహాను ప్రజలను అప్రమత్తం చేస్తున్నాడు. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అనేవి పర్యాయపదాలు. ఇవి దేవుడు పాపులను రక్షించే ప్రక్రియను వివరిస్తున్నాయి. వాగ్దానం చేయబడిన రక్షకుడు లోకంలోకి వచ్చాడు కాబట్టి ఆ ప్రక్రియ యొక్క క్లైమాక్స్ ఆసన్నమైంది. యేసు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించబోతున్నాడు. దేవుని ఆజ్ఞలన్నింటికి సంపూర్ణ విధేయతతో జీవితాన్ని గడిపిన తర్వాత, ఆయన లోక పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి కల్వరి శిలువపై ఇష్టపూర్వకంగా తన జీవితాన్ని అర్పించబోతున్నాడు. సాతాను రాజ్యంపై దేవుని రాజ్యం విజయం సాధించిందని రుజువు చేస్తూ మూడవ రోజున ఆయన మళ్లీ లేస్తాడు. ఈ ముఖ్యమైన సంఘటనలు త్వరలో జరగబోతున్నాయి. అందుకే యోహాను, “పరలోక రాజ్యం సమీపించింది” అని ప్రకటించాడు. ఇది యూదులు కలలుగన్న భూసంబంధమైన రాజ్యానికి వ్యతిరేకమైన పరలోక రాజ్యం, పరలోక ప్రభువే దాని పాలకుడు. ఈ రాజ్యం, దీని మహిమను ఈ లోకము, సాతాను, ప్రస్తుత ఈ భౌతిక జీవితం యొక్క భాధలు మరుగు పరుస్తున్నాయి, కాని పైన ఉన్న భవిష్యత్ కీర్తి వెలుగులో ఒకరోజు ఇది పూర్తిగా వెల్లడి చేయబడుతుంది.

(పశ్చాత్తాపపడుమని) మారుమనస్సు పొందుమని యోహాను ఇశ్రాయేలీయులందరిని ఉద్దేశించి చేసిన ఈ ప్రకటన, ప్రతి ఒక్కరి సంపూర్తి పరివర్తనకు పిలుపునిచ్చింది, ఇది ఒక ప్రాథమిక మలుపు. పశ్చాత్తాపపడడం అంటే అవిశ్వాసం నుండి విశ్వాసానికి మార్చబడడం. ఇది మనస్సు యొక్క మార్పును లేదా జీవిత సంస్కరణను సూచిస్తుంది. మనస్సు/ హృదయములో మార్పు మాత్రమే కాదు దేవుని ఆజ్ఞలకు అవిధేయులమని గుర్తించడం, క్షమాపణ మరియు రక్షణ కోసం మెస్సయ్యపై (ప్రభువైన యేసుక్రీస్తుపై) మాత్రమే నమ్మకం ఉంచడం. యోహాను పశ్చాత్తాపపడమని చెప్పాడు, కొందరు ఎందుకు పశ్చాత్తాపపడాలి? అని, మరికొందరు మాకు పశ్చాత్తాపం అవసరం లేదు? అని అనుకొని ఉండొచ్చు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి, లూకా 7:30.

పరలోక రాజ్యం మరియు మారుమనస్సు అను ఈ రెండిటి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? పరలోకరాజ్యము, మనం చూడగలిగే భూసంబంధమైన భూభాగాన్ని గురించి గాని లేదా లెక్కించగల పౌరులను గురించి గాని మాట్లాడటం లేదు. అది ప్రజల హృదయాలలో దేవుని దయగల పాలనను సూచిస్తుంది. మారుమనస్సు, దేవుడు పాపులను రక్షించే ప్రక్రియను వివరిస్తూ వాగ్దానం చేయబడిన రక్షకుడు లోకంలోకి వచ్చాడు. ఆ రక్షణ ప్రక్రియ యొక్క క్లైమాక్స్ ఆసన్నమైంది. ఆయన “వారి మధ్యలోనే” ఉన్నాడని పాపము యొక్క దోషము, శిక్షనుండి విడిపించు ఆ మెస్సయ్యయందు విశ్వాసముంచండి, మారుమనస్సు పొందండి అని చెప్తుంది. యదార్ధమైన పశ్చాత్తాపం, సాధారణ విశ్వాసాన్ని అనుసరించి ఈ గొప్ప రాజ్యములోనికి మార్గాన్ని తెరుస్తుంది. ఎవరైతే పశ్చాత్తాపపడిన హృదయాలతో బహిర్గతపర్చబడబోవుచున్న రక్షకున్ని అంగీకరిస్తారో వారందరూ ఆయన రాజ్య సంబంధులవుతారు. పశ్చాత్తాపపడుమను సందేశం పాత నిబంధన ప్రవక్తలందరి సందేశాన్ని ప్రతిధ్వనిస్తుంది.

పశ్చాతాపమంటే, బయలుపరచబడిన దేవుని వాక్యాన్ని విశ్వసిస్తున్నవారంగా, అది నన్ను పాపి అని నిందిస్తున్న విషయాన్ని ఒప్పుకోవడం. ఎల్లప్పుడూ నా మాటలు తలంపులు క్రియలను బట్టి దేవునికి అవిధేయుడిగా ఉన్నానని, ఆయన ఆజ్జ్యలను అలక్ష్యము నిర్లక్ష్యము చేస్తున్నానని, శిక్షకు ఖండించబడియున్నానని అంగీకరిస్తూ, నిరాశ చెందక, కనికరం సహాయం కొరకు మెస్సయ్య (యేసుక్రీస్తు) వైపు చూస్తూ, క్షమాపణను, దేవునితో సమాధానాన్ని ఆయనలో కనుగొంటానని గట్టిగా నమ్మడం. యేసు దేవుని గొఱ్ఱెపిల్లయైయున్నాడు (యోహాను 1:36), ఆయన సమస్త లోక పాపములను భరించి, (యెషయా 53:6,12); అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని (మత్తయి 20:28); వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తము చేత, విమోచించియున్నాడని (1పేతురు 1:18,19); దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నదని, (ఎఫెసీయులకు 1:7); కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుమని (రోమా 5:9) నమ్మడం. ఈ ఉద్దేశ్యము కొరకే ఆయన శాశ్వతత్వం నుండి ఉద్దేశించబడ్డాడు.

ఈ ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకోవడానికి దానియేలు 2:31-45, కీర్తన 29, జెఫన్యా 3:14-17లను చదవండి. ఇశ్రాయేలు రాజ్యాన్ని దేవుడు పునరుద్ధరించే సమయం కోసం ఎదురుచూస్తున్న యేసు కాలంలోని ప్రజలకు ఈ లేఖన భాగాలు చాలా బాగా తెలుసు.

బాప్తిస్మమిచ్చు యోహాను ప్రత్యేకముగా ఒక పని కొరకు దేవునిచే ఎన్నుకోబడియున్నాడని మనకు తెలుసు. అతని పని ప్రభువు మార్గం సిద్ధపర్చడం. అతడు ఎలా ప్రభువు మార్గాన్ని సిద్ధపరచాడో తెలుసుకొందాం.

బాప్తిస్మమిచ్చు యోహాను కాలము నాటి యూదులు ఈ లోకసంబంధమైన గొప్ప జాతీయ విమోచకుడిని గురించి ఎదురుచూస్తూ ఆ జాతీయ విమోచకుడు వచ్చినప్పుడు, చనిపోయిన వారందరూ లేపబడతారని, తీర్పు జరుగుతుందని, యూదుల శత్రువులు నాశనం చేయబడతారని ఇశ్రాయేలీయులు గొప్పఘనతను గౌరవాన్ని పొందుతారని, సువర్ణయుగం వస్తుందని నమ్మేవాళ్ళు.

వారి ఆలోచనలకు విరుద్ధముగా బాప్తిస్మమిచ్చు యోహాను అంతర్గత శుద్ధీకరణను ప్రకటించటం అంటే ఇశ్రాయేలీయులు ఆత్మీయముగా ఎంతటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారో తెలియజేస్తుంది.

బాప్తిస్మమిచ్చు యోహానును గురించి గాబ్రియేల్ దూత అతని తండ్రియైన జెకర్యాకు చెప్తూ, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పునని తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియుగలవాడై ఆయనకు ముందుగా వెళ్లునని అతడు చెయ్యవలసిన పనిని గురించి తెలియజేయటం లూకా 1:16,17 నందు చూడొచ్చు.

ఈ మాటలను అర్ధం చేసుకోవడానికి ముందు మనం ఏలీయాను గురించి కొన్ని విషయాలను జ్ఞ్యాపకం చేసుకొందాం. ఏలీయా అనే పేరుకు అర్ధం “యెహోవా నా దేవుడు“, “యెహోవా మాత్రమే నా దేవుడు.” ఇశ్రాయేలును తిరిగి వెన్నక్కు తీసుకురావడమే ఏలీయా లక్ష్యం. అతని పని యెహోవా ధర్మశాస్త్రము గౌరవించబడేటట్లు మరియు పాటించబడేటట్లు చూడటమే. బాప్తిస్మమిచ్చు యోహాను కాలములోని పరిస్థితులు కూడా పునరుద్ధరణ ప్రవక్త అయిన ఏలీయా కాలపు పరిస్థితులానే ఉన్నాయి, డిఫ్ఫరెంట్ గా ఏమి లేవు.

ఏలీయా యొక్క ఆత్మయు శక్తియుగల వాడైన బాప్తిస్మమిచ్చు యోహాను ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పుటకు అంతర్గత శుద్ధీకరణను ప్రకటించాడు. అందుకు కారణాలు అనేకం.

లేఖనాలనుబట్టి ఒకటిగా ఉండవలసిన యూదులు యోహాను కాలంలో అనేక వర్గాలుగా_పరిసయ్యులుగా, సద్దూకయ్యులుగా, శాస్త్రులుగా, ఎస్సెన్లుగా, రాజకీయముగా హేరోదుకు స్నేహితులైన వాళ్ళు హేరోదీయులుగా, పరిసయ్యులలో మరొకశాఖ అయిన గలీలియన్లుగా, ఎస్సెన్లులలో మరొకశాఖ అయిన థెరప్యూటేయనులుగా, గ్రీకు కన్వెర్ట్స్గా ఇంకా చాలా వర్గాలుగా విభజింపబడ్డారు. లేఖనాలపట్ల వారికున్న అవగాహనారాహిత్యమును బట్టి గ్రూప్స్ గా విభజింపబడి ఉండటమే కాకుండా వాళ్ళు ఒకరినొకరు హింసాత్మకంగా వ్యతిరేకించుకొనెడి వాళ్ళు. వాళ్ళు వారి వ్యతిరేకతను చాలా శత్రుత్వంతో కొనసాగించారు. ఈ వ్యతిరేకత కుటుంబాల్లోకి ప్రవేశించింది. ఈ వర్గ వ్యతిరేకతను బట్టి తల్లిదండ్రులు పిల్లలు విభజింపబడ్డారు. వారి విభజనకు కారణమైన వాటి నుండి వారి దృష్టిని మరల్చి ఈ శత్రుత్వాన్ని పోగొట్టి వారందరిని లేఖనాలలో ఐక్యతకు తీసుకురావడం ద్వారా వారి కుటుంబాలలో శాంతిని సామరస్యాన్ని నెలకొల్పి వారినందరిని మెస్సీయ వైపుకు త్రిప్పి వారిని యేసుకు జతచేయడం తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు త్రిప్పడం బాప్తిస్మమిచ్చు యోహాను పని.

అవిధేయులు, అవిశ్వాసులైన ఇశ్రాయేలీయుల అవిశ్వాసమును బట్టి దేవునికి దూరముగా ఉన్న ఇశ్రాయేలీయులను పశ్చాత్తాపము మారుమనస్సు ద్వారా దేవునికి దగ్గర చేసి వాక్యములో ప్రత్యక్షపరచబడియున్న నిజమైన జ్ఞానం అయిన యేసువైపుకు మళ్లించటం అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకు త్రిప్పటమే బాప్తిస్మమిచ్చు యోహాను పని.

దేవుడు వారి మధ్య కనిపించబోతున్నప్పుడు ప్రజలు ప్రత్యేక పద్ధతిలో పవిత్రంగా ఉండాలని హెచ్చరించడమే బాప్తిస్మమిచ్చు యోహాను పని. యెహోవా సీనాయి పర్వతం మీదకు దిగబోతున్నప్పుడు ఇశ్రాయేలీయులు మూడు రోజులు తమ్మును తాము శుద్ధిచేసుకొన్నారు, నిర్గమ 19:14-15. ఆవిధముగానే, కుమారుడైన దేవుడు విమోచకునిగా కనిపించబోతున్నప్పుడు ఆయన రాకడ కోసం ప్రజలు తమ్మునుతాము “సిద్ధం” చేసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. వారిని సిద్ధపర్చడానికి దేవుడు యోహానును పంపాడు. వారిని అతడు సిద్ధపరచే క్రమములో దేవుడు వారితో ఏమైతే చెప్పమన్నాడో వాళ్ళతో చెప్పి బాప్తిస్మమును ఉపయోగించి వారిని శుద్ధి చేసాడు. ప్రభువుకొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుట అంటే అదే.

4ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించు కొనువాడు మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము. అతని సాధారణ దుస్తులు, పూర్తి దుస్తులు కాదు అంగీ కూడా కాదు, ఒంటె వెంట్రుకలతో అల్లిన భుజంపై కప్పబడిన కఠినమైన, అసౌకర్యమైన రక్షణవస్త్రం. ఇది అలంకారము లేకుండా, తోలు నడికట్టుతో నడుము వద్ద కలిసి ఉంచబడింది (2 రాజులు 1:8). అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉండెను (లూకా 1:16,17). బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క ఆహారము ఆనాడు అరణ్యములో సులభముగా లభ్యమయ్యే ఆహారము, ఆ అరణ్య ప్రాంతంలో అడవి తేనె పుష్కలంగా ఉండేది. నేత మిడతగాని చిన్నమిడతగాని ఆకుమిడత గాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును అను ఆజ్జ్యను బట్టి (లేవీయకాండము 11:22), నాజీరు చేయబడిన వ్యక్తిగా అతడు ఆహారము విషయములో చాలా కఠినముగా ఉండేవాడని అతని ఆహారపు అలవాట్లు చెప్తున్నాయి. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క కఠినమైన సన్యాసి రూపం మరియు అతని జీవన విధానం అతని సందేశానికి అనుగుణంగా ఉన్నాయి.

అతని పనిలో అతని దుస్తులు, ఆహారము, నివాసస్థలము వైవిధ్యమైన అతని జీవన శైలి ప్రత్యేకమైనవి. ఇవి అతడు ఎంతటి కఠినమైన పరిస్థితుల మధ్య సిద్ధపరచబడ్డాడో తెలియజేస్తున్నాయి. అరణ్యము అంటే ఈజీ కాదు. అజ్ఞాతం, ఏకాంతము, దుర్భరమైన జీవన పరిస్థితుల మధ్య నెవెర్ కంప్లైన్డ్స్ స్వభావముతో, సంతుష్టిగల జీవితమును జీవించడం. నెవెర్ కంప్లైన్డ్స్ స్వభావముతో సాధారణముగా బ్రతకడమంటే తన దృష్టిని దేవుని పైనుండి ఏది మరల్చకుండా లోకాన్ని వస్తువులను, శరీరాశలను పరిత్యజించి బ్రతకడం. అందుకు ఎంతో నిబద్ధత, చిత్తశుద్ధి అవసరం. దేవునిపై ఆధారపడి దేవునితోనే బ్రతకడం.

అరణ్యాన్ని ప్రవక్తలు నివాసస్థలముగా ఎన్నుకోవడానికి కొన్ని కారణాలు_ దేవునిపట్ల వారికున్న ప్రేమను కఠిన పరిస్థితుల మధ్య సాధన చెయ్యడం. ఎందుకు? 1. అరణ్యములో శోధనలు స్వల్పం ఏకాంతంలో దుర్గుణాల సందర్భాలు తక్కువ. సద్గుణాలతో ధర్మముతో బ్రతుకుట అధికం. 2. మిగతా ప్రపంచముతో తక్కువ కనెక్షన్ ఉంటుంది కాబట్టి శరీర మనస్సులను ప్రశాంతముగా ఉంచుకోవడానికి ఆధ్యాతికమైన జీవితముపై ఎక్కువ ద్రుష్టి పెట్టడానికి అవకాశము ఎక్కువ. 3. అరణ్యము కఠినమైన క్రమశిక్షణను నేర్పిస్తుంది. 4. భక్తికి గోప్యత ఉత్తమం. అంతర్గత సాక్షాత్కారానికి ఏకాంతం అవసరం.

అరణ్యం ఇశ్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక స్థితికి తగిన సింబల్ గా ఉంది. ఇశ్రాయేలీయులు తమ అవిశ్వాసంను బట్టి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి 40 సంవత్సరాలపాటు వారు తిరిగిన అరణ్యాన్ని కూడా ఇది జ్ఞాపకం చేస్తుంది. బాప్తిస్మమిచ్చు యోహాను తన పరిచర్యను యెరూషలేములో ప్రారంభించాలి? యెరూషలేము నుండి ఒక రోజంత దూరములో ఉండే యూదయ అరణ్యమును ఎన్నుకోవడంలో కారణం ఉందా? ఇశ్రాయేలీయులకు ఎంతో ప్రాముఖ్యమైనది వారి మందిరము దాని వ్యవస్థ. దానిని వారిని కాదని అరణ్యమును ఎన్నుకోవడం, ఏంటి? తన కుమారుడు ఈ లోకమునకు వచ్చేటప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో మందిరము దాని వ్యవస్థను వ్యర్ధమైనదిగా ప్రజలు ఎలా మార్చేస్తారో దేవునికి ముందే తెలుసు. కాబట్టే తన ప్రవక్త ద్వారా ఆయన యెరూషలేములోని అవినీతి యాజకత్వాన్ని తిరస్కరిస్తూ అరణ్యమును ఎన్నుకొని ఉండొచ్చుగా అని కొందరు అంటారు. యెహోవా మహిమ మరోసారి అరణ్యంలో ఇశ్రాయేలీయులకు బయలుపరచబడబోతూ ఉంది. ప్రభువు క్రొత్త నిబంధనను చెయ్యబోతున్నాడు. అందుకు ఆయన పాతనిబంధనలో చేసినట్లుగానే ఇప్పుడు మరల మరొకసారి చెయ్యబోతున్నాడు.

5ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతని యొద్దకు వచ్చి, 6తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చిన వార్త వేగంగా ప్రయాణించింది. అతని బోధ విపరీతమైన ఉత్సాహాన్ని కలిగించింది. మొదటగా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు వచ్చారు. సంప్రదాయవాద యెరూషలేము యోహాను పిలుపు మేరకు అరణ్యానికి వెళ్ళింది. తర్వాత యొర్దానుకు ఇరువైపుల నుండి ప్రజలు వచ్చారు. తర్వాత యూదయ వారందరును అతని దగ్గరకు వచ్చారు. వాక్యం బహిరంగంగా నిర్భయంగా ప్రకటించినప్పుడు వాక్యం యొక్క శక్తికి విశేషమైన సాక్ష్యం ఇది. పశ్చాత్తాపపడుమనే అతని శక్తివంతమైన పిలుపు దాని ప్రభావములో భాగముగా అనేకులు తమ పాపాలను స్వచ్ఛందంగా, స్పష్టంగా, బహిరంగంగా ఒప్పుకుంటూ యొర్దానులో అతని చేత బాప్తిస్మం పుచ్చుకున్నారు. మార్కు 1:4, బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. పాప క్షమాపణ నిమిత్తము తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. ప్రజలు తమను తాము ఖండించుకోకపోతే, వారు ఆయన కనికరము కొరకు వెతకలేరు, దానిని కోరుకోలేరు. కాబట్టే పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము దీనికి నడిపించింది.

ఇశ్రాయేలీయులకు నిర్దిష్ట సందర్భాలలో వ్యక్తిగత ఒప్పుకోలు ఉంది, (సంఖ్యా కాండము 5: 5-7). కాని వ్యక్తులచే స్వచ్చందపు పాపపు ఒప్పుకోలు అనేది ఇశ్రాయేలీయులలో ఒక కొత్త విషయం, ప్రాచీన ప్రవక్తల కాలం నుండి ఇశ్రాయేలీయులు చూడని సంఘటన ఇది.

బాప్తిస్మమిచ్చు యోహానుకు ముందే, జుడాయిజంలో ఉన్న వివిధ గ్రూప్స్ బాప్టిజంను ఆచరించే వారు. అప్పటికే యూదులకు అనేక రకాల శుద్ధికారణాచారాలను గురించి తెలుసు, హెబ్రీయులకు 9:10 వచనాన్ని చూడండి, ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చు వరకు విధింపబడి, అన్న పానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమై యున్నవి. ప్రక్షాళనములతోను అనే మాటకు (ఫుట్ నోట్స్ లో బాప్తిస్మములతోను) అని ఉంది చూడండి. స్థితిని పునరుద్ధరించడానికి చేసే శుద్ధికరణములో విభిన్నమైన ప్రక్షాళనలు ఉండేవి. రబ్బానిక్ సాహిత్యం ముఖ్యంగా యూదు మతంలోకి మారే అన్యజనులు సున్నతి మరియు మతమార్పిడి బాప్టిజం పొందుకోవాలని మరియు నైవేద్యాన్ని సమర్పించాలని చెప్తూవుంది. ఈ ఆచారాలు దేవుడు ఎన్నుకున్న సమాజములోనికి వారిని చేర్చుకొనటమే కాకుండా వారికి పూర్తి హక్కులు కలిగించేవి. కాబట్టి యోహాను బాప్తిస్మము క్రొత్త విషయమేమి కాదు అది వారికి వింతగా అనిపించలేదు.

కాని ఇక్కడ యోహాను యూదులు పశ్చాత్తాపపడి బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పాడు, తద్వారా వారు అన్యజనుల కంటే గొప్పవారు కాదని సూచించాడు. ఇది క్రొత్తగా ఉంది. బాప్తిస్మమిచ్చు యోహాను ఆనాడు యూదులు ఉపయోగించే బాప్తిస్మమును తన పరిచర్యలో వాడుకున్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను ప్రజలకు బాప్తిస్మం ఏ విధముగా ఇచ్చాడో మనం ఖచ్చితంగా చెప్పలేము. అతడు ముంచుట ద్వారా బాప్తిస్మము ఇచ్చాడు అనే అభిప్రాయం నిరూపించబడదు. బాప్టిజం అనే పదం నీటితో రకరకాలుగా కడిగే పద్ధతులను వివరించడానికి బైబిలులో ఉపయోగించబడింది.

ఈ విషయాన్నే మార్కు 7:1-4 చెప్తూవున్నాయి, చదువుకొందాం: 1యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడివచ్చి 2ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. 3పరిసయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. 4మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేకాచారములను వారనుసరించెడి వారు. Mark 7:4 καὶ ἀπ’ ἀγορᾶς ἐὰν μὴ βαπτίσωνται οὐκ ἐσθίουσιν, καὶ ἄλλα πολλά ἐστιν ἃ παρέλαβον κρατεῖν, βαπτισμοὺς ποτηρίων καὶ ξεστῶν καὶ χαλκίων [καὶ κλινῶν]. నీళ్లు చల్లుకొంటేనే అనే మాటకు ఇక్కడ గ్రీకు బైబిలులో (బాప్టిసొంటాయి) అనే మాట వాడబడింది. అట్లే నీళ్లలో కడుగుట అనే మాటకు ఇక్కడ గ్రీకు బైబిలులో (బాప్టిస్మస్) అనే మాట వాడబడింది. ఈ రెండు ఒకే మూలపదమైన “బాప్తిస్మము” అనే గ్రీకు మాట నుండే వచ్చాయి. మన తెలుగు బైబిలులో (ముంచుట) అనే మాటకు (ఫుట్ నోట్స్ లో) ఇత్తడి పాత్రల బాప్తిస్మము అని ఉంది చూడండి. బాప్తిస్మము అనే మాటకు నీటితో కడుగుకోవడం, నీటిని చిలకరించడం, నీళ్లలో ముంచడం అని అర్ధం.

మెస్సీయ రావడానికి చాలా కాలం ముందు నుండే యూదులు తమ మతములోనికి మారిన అన్యులకు బాప్తిస్మము ఇచ్చేవాళ్ళు. మరి బాప్తిస్మమిచ్చు యోహాను యూదులకు బాప్తిస్మము ఎందుకిచ్చినట్టు? వాళ్ళేమి మతం మారలేదు కదా? ధర్మశాస్త్రము ద్వారా దేవుడు వారి నుండి కోరిన పవిత్రతను వాళ్ళు కలిగిలేరని వారు అపరిచితుల స్థితిలో ఉన్నారని సూచిస్తు (అన్యులుగా) మెస్సీయచే అంగీకరించబడటానికి లేదా ఆయన రాజ్యంలోకి ప్రవేశించడానికి ముందు కొత్త స్థితిని పొందమని బాప్తిస్మమిచ్చు యోహాను పిలుపు నిచ్చాడు. యోహాను బాప్తిస్మము ఒక ప్రభావవంతమైన మతకర్మ, “పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము” (మార్కు 1:4) ఇది. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడునని నమ్మని వానికి శిక్ష విధింపబడునని మార్కు 16:16 చెప్తూవుంది.

కొంతమంది బైబిలు వ్యాఖ్యాతలు యోహాను బాప్టిజం కేవలం సింబాలిక్ అని ఆ తర్వాత క్రైస్తవ సంఘాల్లో సభ్యులుగా మారిన వారు మళ్లీ బాప్తిస్మం తీసుకున్నారని చెప్తుంటారు, అది తప్పు. యోహాను 3:22,23, అటుతరువాత యేసు తన శిష్యులతో కూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను. సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. వారి బాప్టిజంల మధ్య ఎటువంటి తేడాలు ఉన్నట్లు ఎటువంటి సూచన లేదు. యేసు అపొస్తలులకు కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మరియు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి అని ఆజ్ఞాపించినప్పుడు (మత్తయి 28:19,20), ఆయన కొత్తది భిన్నమైన దాన్ని చేయమని వారికి చెప్పలేదు. బాప్తిస్మమిచ్చు యోహాను చేస్తున్న ఆ పరిచర్యను కొనసాగించుమని, ఆ పరిచర్యను అన్ని దేశాలకు విస్తరించుమని ఆయన వారికి ఆజ్జాపించాడు.

లూథరన్ వేదాంతవేత్తయైన J. యల్విసాకర్ యోహాను బాప్తిస్మమును గురించి చెప్తూ, “యోహాను బాప్టిజం ఒక ప్రభావవంతమైన మతకర్మ, ఇది మారుమనస్సు మరియు పాప క్షమాపణకు మధ్య మధ్యవర్తిత్వం వహించింది” అని ఎంతో స్పష్టముగా పేర్కొన్నాడు. పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము, మార్కు 1:4. మార్కు చెప్తుంది ఇదే.

చాలామంది మీరు బాప్తిస్మము తీసుకున్నారా అని అడుగుతూ ఉంటారు? మీరు బాప్తిస్మము తీసుకున్నారా లేక బాప్తిస్మము పుచ్చుకొన్నారా? రెండింటికి చాలా తేడా ఉందండి. బాప్తిస్మము తీసుకోవడమంటే అది మన స్వంత ఆలోచన, నిర్ణయము, సామర్ధ్యమును బట్టి మనకు మనముగా తీసుకోవడం. క్రీస్తును నమ్మని ప్రతి ఒక్కరు వారి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారై యుండగా, ఎఫెసీ 2:1 వాళ్ళు ఎలా నిర్ణయము తీసుకోగలరు? తమకున్న సామర్ధ్యమును బట్టి బాప్తిస్మమును ఎవడన్నా తీసుకోగలడా? ఏ ఒకడు తన స్వంత నిర్ణయము వలన ఆలోచనవలన యేసుక్రీస్తు నందు నమ్మిక ఉంచలేడు ఆయన యొద్దకు రాలేడు. పరిశుధ్ధాత్ముడు సువార్త వలన మనలను పిలిచి తన వరములవలన మనలను వెలిగించి విశ్వాసమునందు ఉంచుతూ ఉన్నాడు (మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే, ఎఫెసీ 2: 8); పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడు, 1 కొరింథీయులకు 12:3. ఇది దేవుని కృపావరమే. కాబట్టి మనము బాప్తిస్మమును పుచ్చుకొంటూ ఉన్నాము.

యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీ ప్రాంతముల వారందరును, అతని యొద్దకు వచ్చారు, వాళ్ళు ఎందుకని వచ్చినట్లు? రోమన్ కాడి యూదులపై కఠినంగా ఉంది. ఇది వారి మనస్సులలో అశాంతిని  మెస్సీయ రాకడ కోరికను, అసహనాన్ని పెంచింది. ప్రజలు విమోచన మాత్రమే కాకుండా సార్వత్రిక రాచరికాన్ని ఆశిస్తున్నారు. అలాంటి టైములో కొత్త ప్రవక్త ఆవిర్భవించాడనే పుకారు పట్టణం అంతటా వ్యాపించడాన్ని బట్టి ప్రవక్త పుట్టిన పరిస్థితులు, ప్రవక్త యొక్క అసాధారణ రూపం, అతని దుస్తులు అతని కఠినమైన జీవితం, అతని సిద్ధాంతం యొక్క  ప్రాముఖ్యత, అతను అమలు చేసిన బాప్తిస్మము యొక్క కొత్తదనం (సిద్ధపరచుట), అతని భోదలు, వారి చరిత్రకు, సంఘటనలకు ఉన్నటువంటి సారూప్యతను బట్టి ఏమి జరుగుతుందో చూడటానికి చాలా మంది వచ్చారు.

వారిలో కొందరు ఉత్సుకతతో వచ్చి ఉండొచ్చు. మరికొందరు ఇశ్రాయేలుకు తిరిగి మంచి రోజులు వచ్చాయి అనే నిరీక్షణతో వచ్చి ఉండొచ్చు. మరికొందరు నిస్సందేహంగా 4 శతాబ్దాల తరువాత, నిజమైన ప్రవక్త వచ్చాడనే ఆలోచనతో అతనిని చూడాలనే ఉదేశ్యముతో అతని దగ్గరికి వచ్చి ఉండొచ్చు. అతను ఎవరు కావచ్చు? అనే ప్రశ్నతో కొందరు. మరికొందరు, అతను ఒక ప్రవక్త కంటే ఎక్కువ? అతడు క్రీస్తు కాగలడా? అనే సందేహముతో వచ్చి ఉండొచ్చు?

మరికొందరు తమ పాపములు ఒప్పుకొనుచు, వారు బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య ద్వారా పశ్చాత్తాపానికి పిలువబడినప్పుడు వాళ్ళు ఆ సందేశాన్ని తృణీకరింపక పాపులమని యెరిగి ప్రవక్త ఇస్తూవున్న బాప్తిస్మము ద్వారా క్షమింపబడుటకు శుద్ధీకరింపబడుటకు ముందుకు వచ్చారు. దేవుని ఎదుట మనుష్యుల ఎదుట తమ పాపాన్ని ఒప్పుకొన్నారు. దానిని బహిరంగముగా వ్యక్తీకరించారు. యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పుచ్చుకొంటూ వారి మధ్యకు రాబోతూవున్న మెస్సయ్య కొరకు సిద్ధపడ్డారు. నానాటికీ ఈ పరిచర్య పెరుగుతూ పోయింది.

మత్తయి 3:7-12_ 7అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి– సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధిచెప్పిన వాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి. 8-9అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచ వద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. 10ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. 11మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చు చున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. 12ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.

పరిసయ్యులు సద్దూకయ్యులును గురించి ప్రశ్నలు జవాబులు కేటగిరిలో బైబులు వ్యక్తులు అను కేటగిరిలో వివరణ ఉంది చదవండి.

7అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి– సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధిచెప్పిన వాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి. పరిసయ్యులు సద్దూకయ్యులు పశ్చాత్తాపపడకుండా తమ పాపాలను ఒప్పుకోకుండా యోహాను తమకు బాప్తిస్మం ఇవ్వాలని కోరుకున్నారు. వారి క్రియలు నిష్కపటమైన పశ్చాత్తాపానికి సాక్ష్యం ఇవ్వాలి, ఒప్పుకోలు కూడా తప్పుగా, అనిశ్చితిగా లేదా ఊరికినే అన్నట్లుగా ఉండకూడదు. పాపాన్ని ఒప్పుకునే వ్యక్తి తనకు తానుగా స్వాభావికంగా పాపినని తన తలంపులు మాటలు క్రియల ద్వారా దేవునికి అవిధేయునిగా ఉన్నానని సంపూర్ణముగా ప్రతి పాపమును గురించి ఒప్పుకోవాలి (అన్ని పాపాలను, ఏదీ మినహాయించకూడదు, ఏదీ మరచిపోకూడదు). సంతృప్తి అనిశ్చితంగా ఉండదు, అది పాపపు పని కాదు.

పరిసయ్యులు, సద్దూకయ్యులు బాప్తిస్మానికి రావడాన్ని బాప్తిస్మమిచ్చు యోహాను చూసినప్పుడు, వారి జీవితాల్లో పశ్చాత్తాపం యొక్క ఫలాలు లేవు కాబట్టి అతడు వారిని నిరాకరిస్తూ, వారిని “సర్పసంతానమా” అని సంభోదించాడు. పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసును, ఆయన సందేశాన్ని వ్యతిరేకించడం తప్ప వారి మధ్య అంతగా ఏమీ లేదు. పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని పాటించినందున వారు దేవుని దృష్టిలో నీతిమంతులమని నమ్మారు. వారు మోషే ధర్మశాస్త్రానికి వారి స్వంత నిబంధనలను కూడా జోడించారు, కాబట్టి దేవుడు వారిని ఖండించే స్థాయికి కూడా వారు దగ్గరగా లేరని వాళ్ళు అనుకునే వాళ్లు. పశ్చాత్తాపం మంచిదే, కాని వారు వ్యక్తిగతంగా అది అవసరమని భావించలేదు. మరోవైపు, సద్దూకయ్యులు ఎలాంటి పునరుత్థానాన్ని లేదా దేవదూతల ఉనికిని విశ్వసించలేదు. వారు ఈ జీవితం, ఈ ప్రపంచం గురించి మాత్రమే ఆందోళన చెందారు. బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించే పరలోక రాజ్యం పై వారికి ఎటువంటి ఆసక్తి లేదు.

అయితే, ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు బాప్తిస్మం పుచ్చుకోవడానికి యోహాను వద్దకు ఎందుకు వచ్చారు? ప్రజలు యోహాను వద్దకు తరలి రావడాన్ని వారు చూశారు. వారు విడిచిపెట్టబడాలని కోరుకోలేదు. వారు యూదుల మతనాయకులు. వారు గుంపుతో కలిసి వెళ్లడం ద్వారా అటువంటి ప్రసిద్ధ దేవుని దూతను వారు బహిరంగంగా వ్యతిరేకించడం లేదని తద్వారా తమ అధికారాన్ని మరియు ప్రతిష్టను కాపాడుకోవాలని ఆశించారు. కాని వారు బాప్తిస్మమిచ్చు యోహానును మోసం చేయలేక పోయారు.

బాప్తిస్మమిచ్చు యోహాను వారిని “సర్పసంతానమా” అని సంబోధించినప్పుడు, వారిని “అపవాది సంతానమా” అని పిలిచినట్లుగా ఉంది. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను, అనేది ఆదికాండము 3:15, రక్షకునికి సంబంధించిన మొదటి వాగ్దానము. ఇది స్త్రీ సంతానం (యేసు) మరియు అపవాది సంతానం మధ్య ఉండే శత్రుత్వం గురించి మాట్లాడుతుంది. యేసు పరిచర్య సమయంలో ఆ శత్రుత్వం మరింత స్పష్టంగా కనిపించింది. ఆయన విచారణలో, సిలువలో అది దాని పరాకాష్టకు చేరుకుంది. వారు తప్పించుకొనుటకు ప్రయత్నిస్తున్న “రాబోవు ఉగ్ర త” దేవుని తీర్పు యొక్క అగ్నిగా క్రింది వచనాలలో వివరించబడింది. ఈ వ్యక్తులు బాప్తిస్మము ద్వారా దేవుని తీర్పు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కాని వారు విజయవంతం కాలేదు. వారు బాప్తిస్మము పొందడం అనేది, అర్హత లేని కమ్యూనికేట్‌ లు తమపైకి శిక్షావిధిని తెచ్చుకొంటున్నట్లుగా ఉంది (1 కొరింథీ 11:27-30). అది దేవుని ముందు వారి అపరాధాన్నిపెంచుతుంది తప్ప ప్రయోజనమేమి ఉండదు. కపటులకు పవిత్రమైన, శిక్షార్హమైన న్యాయాన్ని తెచ్చే దేవుని కోపం నుండి తప్పించుకోవడం అసాధ్యం, శిక్ష ఖాయం, దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది, రోమా 1:18. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి, ఎఫెసీ 2:3. వారికి బాప్తిస్మము ఇవ్వాలంటే, యదార్థత పశ్చాత్తాపముతో నిండిన మార్పుకలిగిన జీవితము అవసరం. కాబట్టే మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని వారితో బాప్తిస్మమిచ్చు యోహాను గట్టిగా చెప్పాడు.

యోహాను తదుపరి హెచ్చరిక పరిసయ్యుల విషయంలో ప్రత్యేకమైనది: అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచ వద్దు. వాళ్ళు శరీరానుసారంగా, దేవుడు ఎన్నుకున్న ప్రజలలో సభ్యులమని, మేము అబ్రాహాము సంతానము, యోహాను 8:33; మా తండ్రి అబ్రాహాము, యోహాను 8:39, అని ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాళ్ళు. పరిసయ్యులు, సద్దూకయ్యులు ఇంకా చాలా మంది యూదులు అబ్రాహాము మాకు తండ్రి దేవుని రాజ్యము లోనికి మాకు ఇంకేమి అవసరం లేదు అని అనుకొనె వాళ్ళు. అబ్రాహాము వారసులు కావడమంటే ఆటోమేటిక్ గా దేవుని రాజ్యంలోనికి అంగీకరింపబడతారని అర్ధం కాదు. తన పూర్వీకుల విశ్వాసం వల్ల లేదా దైవభక్తి వల్ల ఎవరూ పరలోకాన్ని పొందలేరు. దేవుని రాజ్యములో (చర్చిలో) కేవలం బాహ్య సభ్యత్వం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆయన హృదయాలకు మనస్సులకు న్యాయనిర్ణేతగా ఉంటాడు. ఆ స్కోర్‌పై, ఆయన నకిలీ పిల్లలను ఎప్పుడైనా తిరస్కరించొచ్చు.

పరిసయ్యుల, సద్దూకయ్యుల విశ్వాసం విషయానికొస్తే ఆయన రాళ్లవలన అబ్రాహాముకు పిల్లలను పుట్టించడం చాలా చిన్న విషయం. దైవభక్తిగల తల్లిదండ్రుల సంతానం విశ్వాసం లేకుండా పశ్చాత్తాపపడకుండా ఉండినట్లైతే, వాళ్ళు తమ ప్రభువును ఆయన రక్షణ మార్గాన్ని తెలుసుకొనుటకు ప్రత్యేకమైన అవకాశాలను కలిగి ఉన్నప్పటికిని, వారు దేవుని వాక్యాన్ని అందులో వెల్లడి చేయబడియున్న రక్షకుని నిర్లక్ష్యము చేయడాన్ని బట్టి వాళ్ళు దేవుని ముందు రెండింతలు దోషులుగా ఉంటారు.

దేవునికి మనలో ఎవరూ అవసరం లేదు. మనం మన స్వంత మార్గంలో లేదా మన స్వంత నిబంధనల ప్రకారం బలవంతముగా పరలోకానికి వెళ్లాలని ప్రయత్నిస్తే దేవుడు మనలను తిరస్కరిస్తాడు. పరలోకములో ఉండటానికి ఆయన తన కృపలో అనేకులను కనుగొంటాడు. ఆయనకు మన అవసరం ఉందని మనం ఊహించకూడదు. అదే సమయంలో, ఆయన మనలను ప్రేమిస్తున్నాడని, మన నిత్య రక్షణకు అవసరమైన ప్రతిదాన్ని యేసు చేశాడని మనం ఎప్పటికీ మరచిపోకూడదు.

ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలింపని ప్రతి చెట్టు నరకబడుటకు గుర్తించబడుతుంది. అబ్రహం యొక్క ప్రతి నకిలీ వారసునిపై న్యాయమైన ప్రతీకారం, కఠినమైన శిక్ష సిద్ధంగా ఉంది. ఆయన ఫలాలను డిమాండ్ చేయడమే కాకుండా ఆ డిమాండ్ నెరవేరకపోతే, మరో ప్రత్యామ్నాయం లేదని, పనికిరాని చెట్టు వేరులమటుకు నరకబడుతుందని, అట్లే నమ్మని యూదుడు మెస్సీయ రాజ్యం నుండి మినహాయించబడతాడని బాప్తిస్మమిచ్చు యోహాను ఇశ్రాయేలీయులను కఠినముగా హెచ్చరిస్తున్నాడు. యేసు తన వివాహ విందు ఉపమానంలో కూడా అదే విషయాన్ని చెప్పాడు. పెండ్లి కుమారుడు అందించిన వివాహ వస్త్రాలను ధరించడానికి నిరాకరించిన వారు మరియు వారి స్వంత నిబంధనల ప్రకారం అంగీకరించబడాలని పట్టుబట్టిన వారు వెలుపటి చీకటి లోనికి త్రోసివేయబడతారు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును, (మత్తయి 22:1-14). అదే విధంగా, విశ్వాస ఫలాలను ఫలించకుండా క్రైస్తవులము అని చెప్పుకునే వారు కూడా దేవుని తీర్పులో విశ్వాసుల నుండి వేరు చేయబడతారు, ఎప్పటికీ ఆరిపోని అగ్నిలోనికి వేయబడతారు.

ఎవరి మార్గాన్ని సిద్ధం చేయడానికి పంపబడ్డాడో సూచించకుండా బాప్తిస్మమిచ్చు యోహాను తన ప్రసంగాన్ని ముగిస్తే అది అసంపూర్ణంగా ఉంటుంది కాబట్టే, మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చు చున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్న వాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. 12ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పి తన ప్రసంగాన్ని ముగించాడు.

బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య యొక్క ఉద్దేశ్యం తన కోసం అనుచరులను సంపాదించుకోవడం కాదు గాని లోక పాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్లయైన యేసు వైపుకు ప్రజలను నడిపించడం. మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అతని బాప్టిజం కేవలం సన్నాహకమైనది. పశ్చాత్తాపపడేలా మనుష్యులను ప్రేరేపించడం ద్వారా మరియు బాప్టిజం యొక్క వాషింగ్ను నిర్వహించడం ద్వారా, మెస్సీయ యొక్క ఉన్నతమైన మిషన్ ను అర్ధంచేసుకొనేలా అతడు ప్రజలను సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు వస్తున్నవారు, నన్ను వెంబడిస్తున్నవారని అయితే నా వెనుక వచ్చుచున్న వాడు నాకంటె శక్తిమంతుడని తాను ఆయనకు ఒక హెరాల్డ్ మాత్రమేనని, ఆయన వ్యక్తిత్వం ఎంతో గొప్పదని ఎంతో ఉన్నతమైనదని, ఆనాటి తూర్పు దేశాల పద్ధతుల ప్రకారము అత్యల్ప బానిసల పని అయిన ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కానని బయలుపరచబడబోతున్న ఆయనను గూర్చి ప్రకటిస్తూ ప్రజల అటెంషన్ న్ని తన పై నుండి ఆయన పైకి మరలిస్తున్నాడు.

ఈయన పరిచర్య అద్భుతమైనది. ఈ శక్తిమంతుడు “పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును”. రెండు రకాలైన క్రీస్తుని పరిచర్య ఇక్కడ చెప్పబడింది: పశ్చాత్తాప హృదయాలతో ఆయనను రక్షకునిగా అంగీకరించే వారికి, ఆయన అద్భుతమైన వరాలు శక్తితో కూడిన తన పరిశుధ్ధాత్మ అనే విలువైన వరం ఇస్తాడనేది, యోహాను 1:33; మార్కు 1:8; అపొస్తలుల కార్యములు 1:5. ఇది పెంతెకొస్తు రోజున పరిశుధ్ధాత్ముడు పంపబడుటను గూర్చిన స్పష్టమైన వాగ్దానం. పరలోక ఆరోహణకు ముందు, యేసు తన అపొస్తలులతో “యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరని” చెప్పాడు (అపొస్తలుల కార్యములు 1:5). పెంతెకొస్తులో యేసు తన శిష్యులకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చాడు, (అపొస్తలుల కార్యములు 2:33). వాక్యము సంస్కారముల ద్వారా ఆయన విశ్వాసులలో ఆత్మను క్రుమ్మరిస్తున్నాడు. పశ్చాత్తాపం లేని హృదయాలతో ఆయనను తిరస్కరించే వారిని ఆయన అగ్నితో నాశనం చేస్తాడు.

ఈ విషయాన్ని అతడు ఇంకా స్పష్టముగా వివరిస్తూ, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునను దేవుని తీర్పుకు మరొక ఉదాహరణతో ఈ ప్రసంగాన్ని ముగించాడు. ఒక రైతు నూర్చిన ధాన్యాన్ని గాలిలోకి విసరగా గాలి తేలికైన పొట్టును వేరుచేస్తుంది. బరువైన గింజలు నేలపై పడతాయి. అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. అదే విధంగా, తీర్పు ద్వారా ఆయన లోకములోని ప్రతి వ్యక్తి యొక్క విధిని నిర్ణయిస్తాడు. దాని ద్వారా విశ్వాసులను, అవిశ్వాసులను (పశ్చాత్తాపపడిన మరియు పశ్చాత్తాపపడని) వేరు చేస్తాడు. పశ్చాత్తాపపడని వారిని నరకానికి పంపి, పశ్చాత్తాపపడిన వారిని పరలోకపు భవనాలలోనికి చేర్చుతాడు. మలాకీ 4:1 ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైననులేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మత్తయి 25:41 అప్పుడాయన యెడమవైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.

యోహాను, యేసు యొక్క సందేశం శాశ్వతమైనది, విశ్వవ్యాప్తితమైనది. దేవుని తీర్పు నుండి ఎవరూ తప్పించుకోలేరు. మరొక కోర్టుకు అప్పీల్‌లు ఉండవు. “నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును” (మార్కు 16:16). బైబిల్ అంతా ఈ విషయాన్నే చెప్తూవుంది.

బాప్తిస్మమిచ్చు యోహానువలె మార్టిన్ లూథర్ గారు కూడా పశ్చాత్తాపంని గురించి బోధించిన బోధకుడు. విశ్వాసులమైన మనం మన పాపాలను హృదయపూర్వకంగా ఒప్పుకోవడమే కాకుండా క్షమాపణ గురించి నిశ్చయతను కలిగియుండమని అతడు వక్కాణించాడు. అటువంటి బోధకులను బట్టి దేవునికి వందనాలు. సర్వశక్తిమంతుడైన దేవా, పాపాత్ముడైన నన్ను కరుణించుము. నా పొట్టును కాల్చండి, పవిత్ర బాప్టిజం యొక్క రోజువారి కడగడం ద్వారా నా పాపపు కోరికలను అణచివేయండి. ఆమెన్.

మత్తయి 3:13-17_ 13ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గర నున్న అతని యొద్దకు వచ్చెను. 14అందుకు యోహాను –నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని 15యేసు– ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. 16యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. 17మరియు– ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.    

యేసు తన పరిచర్యలోనికి ప్రవేశించే సమయం ఆసన్నమైంది. ఒక బహిరంగ సెరిమొని (ఆచారము) ద్వారా ఆయన తన పరిచర్య లోనికి ప్రవేశించాలి. కాబట్టి ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గర నున్న అతని యొద్దకు వచ్చెను. దేవుని కుమారుడు తన గోప్యత (కన్ సీల్ మెంట్) నుండి కార్యార్థియై బయలుదేరి బహిరంగంగా, స్నేహపూర్వకంగా, బాప్టిజం స్వీకరించడానికి ఆయన యోహాను వద్దకు వచ్చాడు. యేసు నజరేతులో పెరిగాడు కాబట్టి, ఆయన బాప్తిస్మం పొందుకోవడానికి అక్కడి నుండి యోర్దాను నదికి వెళ్ళుండొచ్చు. ఆయన ప్రయాణించిన ఖచ్చితమైన మార్గం మనకు తెలియకపోయినా, నజరేతు యోర్దాను నది మధ్య దూరం దాదాపు 60 మైళ్ళు. వాస్తవానికి, ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. యేసు అప్పటి దగ్గర మార్గంలో ప్రయాణించి ఉండొచ్చు లేదా దారిలో ఆగి ఆగి ప్రయాణించి ఉండొచ్చు, కాబట్టి ఈ దూరం ఎంత అనేది మనం కచ్చితంగా చెప్పలేం.

ఈ సమయంలో యోహానుకు యేసును గురించి ఎంత బాగా తెలుసు అనే విషయాన్ని మనం చెప్పలేము. అతనికి యేసు గురించి ఖచ్చితంగా తెలుసు. వారి తల్లులు బంధువులు. యేసు తల్లియైన మరియ యేసు పుట్టకముందే యోహాను తల్లియైన ఎలీసబెతును సందర్శించిన విషయం మనకు తెలుసు, లూకా 1:39-56. తరువాతి 30 సంవత్సరాలలో యేసు మరియు యోహాను మధ్య ఎటువంటి సంబంధం ఉన్నట్లు బైబిల్ రికార్డు లేదు. యోహాను, నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు– నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చు వాడని నాతో చెప్పెను, యోహాను 1:33,35 ఈ మాటల్లో యోహాను తనకు యేసు తెలియదని చెప్పాడు. మరి ఇక్కడేమో, అందుకు యోహాను –నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను అని ఉంది. ఇవి రెండూ వైరుధ్యంగా ఉన్నట్లు కనిపించొచ్చు కాని స్పష్టమైన వైరుధ్యం అనువాదంలో మాత్రమే ఉంది. ఒరిజినల్ మాటలలో ఉపయోగింపబడిన మాట ᾔδειν Hdein (had perceived) యోహాను, “సందేహన్ని దాటి ఆయనను గుర్తించాడని, గుర్తింపును నిర్ధారించుకొన్నాడని” తెలియజేస్తుంది. మొదటిగా యోహాను తన తల్లి నుండి ఆయనను గురించి ఆలకించి ఉండొచ్చు. తర్వాత దేవుని ప్రత్యక్షత ద్వారా మెస్సీయ ఉనికిని గురించి అతడు తెలుసుకున్నాడు తప్ప అతనికి ఆయనను గురించి వ్యక్తిగతంగా అయితే ఏమి తెలియదు.

యేసునుండి వెలువడుతున్న ఔనత్యము యోహానుకు తన గుర్తింపును గుర్తుచేసింది. కాబట్టే నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచాడు. యేసు సమక్షంలో యోహాను తనను అపవిత్రునిగా భావించాడు, (యెషయా 6:1-5). ఎవరూ చేయలేనిది యేసు తన కోసం చేయబోతున్నాడని అతడు గుర్తించాడు. ఈ వ్యక్తి తన కంటే గొప్పవాడనే అభిప్రాయాన్ని అతడు త్రోసిపుచ్చలేదు. చిన్నవాడు గొప్పవాని చేతిలో బాప్టిజం పొందడం ఎంతో గొప్ప విషయము. యోహాను పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు పశ్చాత్తాప ఫలాలను చూపించనందున వారికి బాప్తిస్మం ఇవ్వడానికి నిరాకరించాడు. యేసును నివారింపజూచెను, అంతే.

బాప్టిజం మరియు యేసు నుండి క్షమాపణ అవసరం గురించి యోహాను మాటలను యేసు ఖండించలేదు. యోహాను పాపియని, యేసు పాపం లేనివాడన్నది నిజం.

అయితే యేసు యోహాను అభ్యంతరాన్ని తోసిపుచ్చి – ఇప్పటికి కానిమ్ము బాప్తిస్మమివ్వమని యోహానుతో చెప్పాడు. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను. ఇప్పటికి అనే మాటలు మత్తయి రికార్డు చేసిన యేసు యొక్క మొదటి మాటలు. ప్రస్తుత సందర్భంలో, యేసుని మిషన్ పాపులను రక్షించుటే (మత్తయి 1:21). విధేయత మరియు నెరవేర్పు మెస్సీయ యొక్క ప్రత్యామ్నాయ పని యొక్క అత్యుత్తమ లక్షణాలు. ప్రతి ధర్మబద్ధమైన శాసనం, ప్రజలపై విధించిన అన్ని మతపరమైన చర్యలను ఆయన నెరవేర్చాలి. అలా చెయ్యాలనేది దేవుని చిత్తము కాబట్టి ఇప్పటికి ఇలా కానిధ్ధాం, అనేది యేసుని సింపుల్ ఆన్సర్. యోహానుకు అది తగినంత వివరణ. ఆదిమ సంఘ ఉపదేశకులు నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదను మాటలను సులభముగా అందరికి అర్ధమయ్యేల వివరిస్తూ: పాపులు నీతిలోనికి వచ్చి రక్షింపబడటానికి ఇలా జరగాలి, యోహాను నాకు బాప్టిజం ఇవ్వండి. వారు నా ద్వారా నీతిమంతులుగా మారేలా దేవుడు పాపులకు ఆజ్ఞాపించినది నేను చేయాలి, అని యేసు చెప్తున్నాడు అని వివరణను ఇచ్చారు. చర్చి ఫాదర్ యైన హిప్పోలిటస్ (199-217): నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడిని; నేను దానిని సంపూర్తిగా నెరవేర్చాలను కొంటున్నాను, దేనినీ వదిలివేయాలని కోరుకోవడంలేదు. ఎవరూ బాప్టిజంను తృణీకరించకుండా ఉండటానికి, యోహాను, నాకు బాప్టిజం ఇవ్వండి అని యేసు చెప్తున్నాడు అను వివరణను ఇచ్చాడు. ఈ వివరణలు చాల మృదువుగా స్పష్టముగా త్రోసివేయలేనంత దృఢముగా ఉన్నాయి.

బాప్టిజం తొలగించే పాపం, అపవిత్రత యేసులో లేవు, మరి ఆయన బాప్టిజం ఎందుకు పొందుకున్నాడు? అని కొందరు ప్రశ్నిస్తుంటారు. యేసు బాప్టిజం ఆయనను పాపుల ప్రపంచంతో ఐడెంటీఫైడ్ చేసింది. యేసు పాపం లేనివాడు సేమ్ టైం ఆయన సమస్త లోక పాపమును మోసుకొని పోతూవున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన సమస్త లోక పాపాన్ని భరిస్తున్నాడు, మోస్తున్నాడు. ఈ కారణంగా ఆయన తనను తాను బాప్టిజం పొందేందుకు అనుమతించుకొన్నాడు. ఈ చర్యతో ఆయన తన కోసం కాదు, మన కోసం తాను ఇక్కడ నా స్థానాన్ని మీ స్థానాన్ని తీసుకున్నాడు. పాపులమైన మన స్థానంలో ఉన్నాడు. క్రీస్తు మన స్థానాన్ని తీసుకోవడాన్ని పౌలు వివరిస్తూ, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను, 2 కొరింథీయులు 5:21 అని చెప్తున్నాడు. పాపులతో తన గుర్తింపును ధృవీకరించడానికి మరియు వారికి పరిపూర్ణ నీతిని అందించడానికి, పాపులు పొందే విధంగానే యేసు యోహాను బాప్టిజంను పొందుకొన్నాడు. యేసు యొక్క బాప్టిజం మరియు తండ్రి, పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం యేసును దేవుని గొర్రెపిల్లగా బహిరంగంగా గుర్తించింది, ఆయన లోకములోని పాపాన్ని తీసివేయడానికి శరీరధారిగా వచ్చాడు.

యేసు బాప్టిజం ఆయన బహిరంగ పరిచర్యకు నాంది పలికింది. సిలువపై ఆయన మరణాన్ని ఊహించింది (మార్కు 10:38; రోమా 6:3). నాలుగు సువార్తలు యేసు బాప్టిజం గురించి నివేదించిన వాస్తవం దాని ప్రాముఖ్యతను సూచిస్తూ ఉంది. లూథర్ ఆయన బాప్టిజం యొక్క ప్రాథమిక అర్థాన్ని సంక్షిప్తపర్చి: ఆయన మన స్థానంలోకి ప్రవేశిస్తున్నాడనే కారణంతో (క్రీస్తు) యోహాను నుండి దీనిని అంగీకరించాడు, నిజానికి, మన వ్యక్తిగా, అంటే, ఆయన చేయని పాపాలను ఆయన తనపైకి తీసుకున్న వ్యక్తిగా, వాటిని తీసివేస్తూ వాటిని తన పవిత్ర బాప్టిజంలో ముంచివేసాడు అని చెప్పాడు.

యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చిన నిర్దిష్ట విధానం ఏది సూచించబడలేదు. మత్తయి కేవలం అది జరిగింది అని పేర్కొన్నాడు. ఈ రోజు మనం బాప్తిస్మం పుచ్చుకోనేటప్పుడు నీటిని ఉపయోగించే ఏదైనా ఒక నిర్దిష్ట పద్ధతికి మనం పరిమితం కాకూడదని ఇది చెప్తూవుంది. ఆయన ఖచ్చితంగా యోహాను బాప్టిజంపై తన ఆమోద ముద్ర వేసాడు. మనం కూడా బాప్టిజం యొక్క ఆశీర్వాదాలను పొందాలని కోరుకుంటున్నట్లు సూచించాడు.

యేసు “నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను” అంటే, ఆయన నది ఒడ్డునకు చేరుకున్నాడని మరియు యోహాను తన బాప్టిజంలో యేసుకు నీటిని ఎలా ప్రయోగించాడో మనకు స్పష్టమైన సూచన ఇవ్వలేదని అర్థం. ఆయన గుర్తింపును నిశ్చయపరచి అతనికున్న సందేహాలను తొలగించిన, యేసుని గుర్తింపును సంపూర్ణం చేసే వాస్తవ సంకేతం, యేసు బాప్టిజం తర్వాత జరిగింది.

యేసు బాప్తిస్మం పొందుకొన్న తర్వాత, అద్భుతకరమైన రీతిలో, ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా, ఆకాశము తెరవబడెను. ఇది అత్యంత మహిమాన్వితమైన దృశ్యం, ఇది ఒక దర్శనం కాదు, వాస్తవం. ఇది యెహెజ్కేలు ప్రవక్త అనుభవాన్ని పోలి ఉంది: ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను, యెహెజ్కేలు 1:1 లేదా మొదటి క్రైస్తవ హతసాక్షియైన స్తెఫను అనుభవాన్ని పోలి ఉంది: ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను, అపొస్తలుల కార్యములు 7:56. ఇక్కడ ఆకాశము తెరవబడుట యేసు మాత్రమే చూశాడా లేదా యోహాను కూడా చూశాడా అనేది మనం చెప్పలేము.

అయితే యోహాను సాక్ష్యమిచ్చుచు–ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, యోహాను 1:32 అని చెప్తున్నాడు. పావురం యొక్క శారీరక రూపం పవిత్ర ఆత్మకు తగినది, ఎందుకంటే పావురం పవిత్ర గ్రంథంలో అమాయకత్వం మరియు శాంతికి చిహ్నంగా ఉపయోగించ బడింది. మార్టిన్ లూథర్ గారు ఇది పరిశుద్ధాత్మచే ఉపయోగించబడిన సహజమైన పావురం అని నమ్మాడు. పవిత్రాత్మ పావురం యొక్క కనిపించే రూపాన్ని ధరించిందని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఇది దేవ దూతలు మానవ రూపంలో కనిపించిన సందర్భాలతో పోల్చొచ్చు. వారు మనుషులుగా మారలేదు లేదా మానవుల శరీరాలను అరువు తీసుకోలేదు. వారు కేవలం కనిపించే రూపాన్ని తీసుకొన్నారు. అవి కనిపించి అదృశ్యమయ్యాయి.

4వ శతాబ్దపు చర్చి ఫాదర్ యైన క్రిసోస్టమ్, ఇది నోవహు ఓడ నుండి పంపిన పావురాన్ని గుర్తుచేస్తుందని, ఆ పావురం శాంతికి చిహ్నమైన ఆలివ్ కొమ్మను తీసుకుని తిరిగి వచ్చిందని ఈ పావురం (పవిత్రాత్మ) క్రీస్తుపైకి దిగివచ్చి, పాపంపై దేవుని ఉగ్రత ప్రళయం ఆగిపోయిందని, మనిషికి శాంతి కలుగుతోందని తెలియజేస్తుందని అభిప్రాయపడ్డాడు.

దీనికి ముందు యేసు పరిశుద్ధాత్మ లేకుండా లేడు. ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యయైన మరియ యందు పుట్టాడు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ యేసుకు మెస్సీయగా తన కార్యాలయ బాధ్యతలను నిర్వహించడానికి అవసరమైన ప్రత్యేక బహుమతులను ప్రసాదించాడు. ప్రవక్తయైన యెషయా ఈ బహుమతులలో ఏమేమి ఇమిడి ఉంటాయో ముందే చెప్పాడు: యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును, యెషయా 11:2. అట్లే యెషయా 61:1లోని, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, అను మాటలను నజరేతులోని ప్రార్థనా మందిరంలో యేసు చదివి, వాటిని తనకు అన్వయించుకొని, “నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పాడు” (లూకా 4:21). అందునుబట్టి, దేవుడు తన కుమారునికి తన మానవ స్వభావానికి అనుగుణంగా పరిశుద్ధాత్మను అపరిమితంగా అందించాలనే ఆలోచనను తెలియజేయాలనుకున్నాడు అనే వాస్తవాన్ని మనం నొక్కి చెప్ధ్ధాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే, అపొస్తలుల కార్యములు 10:38.

అప్పుడు –ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇది ప్రేమతో కూడిన తండ్రి మాటలు. ఈ మాటల ద్వారా తండ్రి కొడుకును ఆదరిస్తూవున్నాడు. తండ్రి ఆనందం, ఆయన సమ్మతితో, ఆశీర్వాదంతో క్రీస్తు తన పరిచర్యలో ప్రవేశించాడు. త్రియేక దేవుడు, యేసు యొక్క బాప్టిజం వద్ద, విమోచన పనిపై తన ఆమోద ముద్రను ఉంచి ఉండటాన్ని ఈ మాటలు తెలియజేస్తున్నాయి.

దాదాపు మూడు సంవత్సరాల తరువాత, యేసు పరిచర్య ముగిసే సమయానికి, తండ్రి రూపాంతర కొండపై పరలోకం నుండి ఇదే మాటలను మళ్ళి మాట్లాడాడు (మత్తయి 17:5). ఈ మాటలు మనకు ఎంతో నిశ్చయతను ఇస్తూవున్నాయి – మన రక్షణ కొరకు తన ప్రియ కుమారుడు చేసిన మరియు సహించిన ప్రతిదానికీ తండ్రి సంతోషించాడని కాబట్టి మనం దేవునితో సమాధానపడ్డామని మరియు యేసుని బట్టి నిత్యజీవానికి వారసులమని మనం నిశ్చింతగా ఉండొచ్చు.

యేసు యొక్క బాప్టిజం దేవుడు తనను తాను త్రియేకుడని వెల్లడించుకొనిన సందర్భాలలో ఒకటి. బైబిల్ త్రియేకుడు లేదా ట్రినిటీ అనే పదాలను ఎన్నడూ ఉపయోగించలేదన్నది నిజం. కాని క్రైస్తవ సంఘము చాలాకాలంగా వాటిని సరిగ్గానే ఉపయోగిస్తూ ఉంది. సజీవమైన దేవుడు తనను తాను ముగ్గురు వ్యక్తులుగా: తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మునిగా, లేఖనాలలో బయలుపరచుకొనియున్నాడు. ఈ ముగ్గురూ విభిన్న వ్యక్తులు, ఒకే దేవుడు. వారు దేవుని అన్ని లక్షణాలలో క్రియలలో సమానులు. అయినప్పటికీ, సృష్టిని తండ్రి యొక్క ప్రత్యేక పనిగా, విమోచన కుమారుని యొక్క ప్రత్యేక పనిగా మరియు పవిత్రీకరణను పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేక పనిగా మనం సరిగ్గానే మాట్లాడుతున్నాము. ఈ సత్యాలను క్రైస్తవులందరూ అంగీకరిస్తారు.

యేసు మనకు ప్రత్యామ్నాయం కాబట్టి, మన పాపాలను బట్టి ఇక మనం ఆయన కోపానికి శిక్షకు భయపడాల్సిన అవసరం లేదు. మన కొరకు బాప్తిస్మ జలాలను సిద్ధం చేసిన గొర్రెపిల్ల రక్తంతో మనం శుభ్రంగా కడగబడుతున్నాం. ప్రభువైన యేసు, మీరు యొర్దాను నీటిలో పాపుల పక్కన నిలబడ్డారు. ఇప్పుడు నాతో నిలబడి, నా పాపాలను కడిగివేయండి, ఆమెన్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl