
లెంట్ 2 బి సిరీస్
పాత నిబంధన పాఠము: ఆదికాండము 28:10-17; పత్రిక పాఠము: రోమా 5:1-11; సువార్త పాఠము: మార్కు 8:31-38; కీర్తన 73.
సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: ఆదికాండము 28:10-17
10-11యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండుకొనెను. 12అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. 13మరియు యెహోవా దానికి పైగా నిలిచి–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. 14నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును; నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమి యొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. 15ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా 16యాకోబు నిద్ర తెలిసి–నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని 17భయపడి–ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమేగాని వేరొకటికాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను.
బేతేలులో యాకోబుకు దేవునితో జరిగిన ఆశ్చర్యకరమైన ఎన్కౌంటర్ మన పాఠం. మన జీవిత ప్రయాణంలో వ్యక్తులుగా, సంఘాలుగా అనుకోకుండా దేవునిని కలుసుకునే సందర్భాలు రావొచ్చు.
దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని కలిగియున్న జేష్ఠత్వము యొక్క ఆశీర్వాదము నిమిత్తమై యాకోబు తన తండ్రియైన ఇస్సాకును మోసగించాడు. ధనవంతునిగా శక్తిమంతునిగా దేవుని యొక్క మంచితనము యొక్క సంరక్షణలో ఎల్లప్పుడూ ఉండేలా ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాన్ని ఆశించిన ఏశావుకు ఈ విషయం కోపం పుట్టించింది. తన తండ్రి మరణము తరువాత యాకోబును చంపాలని ఏశావు గట్టిగా తీర్మానించుకొన్నాడు. కాబట్టి వారి తల్లియైన రిబ్కా యాకోబుకు పక్షపాతియై అక్కడి నుండి 500 మైళ్ళ దూరములో నివసిస్తున్న తన సహోదరుడైన లాబాను దగ్గరకి పంపించి వేసింది. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి (అంటే దక్షిణం నుండి) ఉత్తరాన ఉన్న హారానుకు ప్రయాణిస్తున్నాడు. హారానులోని తమ స్వస్థలం నుండి అతని పితరులు, దేవుడు వారి సంతతికి వాగ్దానం చేసిన దేశానికి విశ్వాసంతో ప్రయాణిస్తే ఇతడు వెను తిరిగి వారి స్వస్థలానికి వెళ్తున్నాడు, (ఆదికాండము 12:1-9). ప్రయాణం మధ్యలో, రాత్రి కారణంగా విశ్రాంతికి అతడు ఎంచుకున్న స్థలంలో, యాకోబు తన జీవితాన్ని మార్చే ఒక అసాధారణమైన కల కన్నాడు. దేవుడు యాకోబుతో మాట్లాడాడు.
నేడు మనలో చాలా మంది దేవుని నుండి వినాలనుకుంటున్నాం. మనకు కూడా భరోసా కావాలి, దిశానిర్దేశం కావాలి, పనులు జరిగేలా హామీలు కావాలి. మనకు కూడా బేతేలు కావాలి. యాకోబు కథ బైబిల్ యొక్క పెద్ద సందేశాలలో ఒకటి. దేవుడు మన గురించి పట్టించుకుంటాడు మనల్ని చేరుకుంటున్నాడు అనే సందేశం ఈ కధలో ఉంది.
తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసి, ఆ స్థలానికి బేతేలు అని (దేవుని మందిరము) పేరు పెట్టాడు. అబ్రాహాము కూడా ఈ స్థలములో ఆరాధించాడని, ఆదికాండము 12:8 చెప్తూవుంది.
నేడు ఆ స్థలానికి ఇవ్వబడిన పేరులా అది లేదు. అక్కడ చెల్లాచెదురుగా నున్న రాళ్లు రప్పలు పిచ్చిగా పెరిగిన కలుపు మొక్కలు తప్ప మరేమి చూడలేము. ఒకప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మన పితరులు సమావేశమైన స్థలమిదేనా అని మనలను మనమే ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉదయకాలాన్న మన పాఠము యేసు ఉన్న చోటెల్లా దేవుని మందిరమే అని తెలియజేస్తూవుంది. అది సంఘము కానివ్వండి లేదా మీ ఇల్లు కానివ్వండి, విశ్వాసులముగా మనమున్న ప్రతి స్థలం అది దేవుని మందిరమే.
యేసు ప్రతి స్థలమును బేతేలుగా చేయుచున్నాడు
- ఆయన దేవుని సన్నిధికి మార్గమును తెరచుచున్నాడు 10-12
- దేవుని వాగ్దానములను గురించి ఆయన మనకు నిశ్చయత నిచ్చుచున్నాడు 13-15
- దేవునితో పరిపూర్ణమైన జీవితమునకు ఆయన మనలను నడిపించుచున్నాడు 16-17
1
10-11యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను.
యాకోబు రిబ్కాల క్రియను బట్టి, ఇస్సాకు కుటుంబం అల్లకల్లోలంగా ఉంది. ఇంట్లో పరిస్థితులు సద్దుమణిగే వరకు యాకోబు కనానును విడిచిపెట్టి కొంతకాలం తన బంధువుల వద్దకు వెళ్లాలని రిబ్కా కోరుకుంది. ఎప్పుడు తలితండ్రులతో కలిసి ఉండేవాడు స్వస్థలాన్ని స్వంత వ్యక్తులను వదిలి తాను మునుపెప్పుడు వెళ్లని స్థలానికి వెళ్ళవలసి వచ్చింది.
యాకోబు యొక్క వాస్తవ స్థితిని గమనిస్తే, తన ప్రాణాన్ని కాపాడుకొనే ప్రయత్నములో పారిపోతున్నవానిగా, భయపడుతూ, ఒంటరిగా, భవిష్యత్తు ఏవిధముగా ఉండబోతుందో తెలియని వానిగా, దయనీయముగా, నిర్జన్యమైన ప్రదేశములో నిస్సహాయునిగా, తన స్వభావంలో మోసగించాలనే ప్రవుత్తిని కలిగియున్న వానిగా, ఇతరులను పణంగా పెట్టి తన సొంత ప్రయోజనాలను చూసుకొనేవానిగా, తన తండ్రిని మోసగించుటను బట్టి అపరాధ భావముతో ఉన్నాడు.
యాకోబు కనానుకు ఉత్తరాన ఉన్న హారాను నగరానికి 500 మైళ్ల ప్రయాణంలో ఉన్నాడు. నేడు ఈ భూమి సిరియా అని పిలువబడుతుంది. ఈ ప్రయాణములో, అతడు మోసం ద్వారా తాను కోరుకున్న వాగ్దానాన్ని పొందగలిగానని గర్వపడుతూ ఉండొచ్చు. అట్లే తన అపరాధ భావన అతనిని భయపెడుతూ ఉండొచ్చు. కాని తన తండ్రి రెండవమారు తనకు మళ్ళీ చెప్పిన వాగ్దానంతో అతను ఉత్సాహంగాను ఉండొచ్చు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారానువైపు వెళ్తూ, బేతేలు అనబడే స్థలానికి చేరుకొన్నాడు.
యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. 12అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.
యాకోబు ప్రయాణములో ఉన్నాడు. అతడు దాదాపు 70 మైళ్ళు ప్రయాణించాడు, ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, యాకోబు బయలుదేరటానికి ముందు తన తండ్రియైన ఇస్సాకు ఇష్టపూర్వకంగా తనను దీవిస్తూ, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామున కిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసికొనునట్లు ఆయన నీకు, అనగా నీకును నీతోకూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక, అను మాటలను నెమరువేసుకొంటూ ఉండొచ్చు, ఆదికాండము 28:3-5. మెస్సియాను గూర్చిన ఆశీర్వాదము ఎలా నెరవేరబోతుందో అందుకు తాను ఎంతటి వెల చెల్లించాలో యాకోబుకు తెలియదు. లాబాను నుండి తనకు ఎలాంటి స్వాగతం లభిస్తుందో అని ఆలోచిస్తుండొచ్చు. తన తండ్రి గుడారాలను మళ్ళీ తిరిగి చూస్తానా అని మధనపడుతుండొచ్చు. ఈ విషయాలను గురించి అతడు ఆలోచిస్తూ పండుకొనగా, నిద్రలో యాకోబుకు ఒక కల వచ్చింది. ఈ కల చాలా ప్రత్యేకమైంది. ఆ కల జరిగిపోయిన విషయాలను జ్ఞాపకం చెయ్యటం లేదు. భవిష్యత్తు యాకోబు కొరకు దాచి ఉంచిన విషయాలను గురించి చెప్పేది కాదు. అందులో ఒక నిచ్చెన కనబడింది అది భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.
మొదటిగా దేవుడు ఈ కల ద్వారా అతడు ఒంటరి కాదనే విషయాన్ని తెలియజేసాడు. ఈ విషయం యాకోబుకు మాత్రమే కాకుండా విశ్వాసులైన ప్రతి ఒక్కరికి ఎంతో ఆదరణను కలిగిస్తుంది. మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు గాని, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నప్పుడు గాని, మన కష్టాలలోగాని మనం కూడా ఒంటరి వాళ్లమని బాధపడుతూ ఉంటాం. అలా ఆలోచించమని సాతాను కూడా మనల్ని ప్రోత్సహిస్తాడు. మనకు తోడుగా దేవుడు మనతో లేడని, మన జీవితాలలో జరుగుతున్న విషయాలు ఆయనకు తెలిసినా ఆయన మనల్ని పట్టించుకోడని సాతాను చెప్తుంటాడు. ఆ అబద్దాన్ని నిచ్చెన తీసివేసింది. దేవుని దగ్గరికి మార్గము పూర్తిగా తెరువబడింది.
ఆ కలలో అతను తాను ఉన్న ప్రదేశం నుండి పరలోకానికి చేరుకునే మెట్ల మార్గాన్ని చూశాడు. పరలోకం భూమి ఇవి రెండూ నిజానికి పాపం ద్వారా వేరు చేయబడ్డాయి. కాని యాకోబుకు కలలో కనిపించిన ఆ నిచ్చెన భూమిని పరలోకమును కలుపుతూ ఉంది. ఈ నిచ్చెన వాటి మధ్యన సంబంధాన్ని తిరిగి స్థాపించింది. దీని ద్వారా దూతలు దయగల పనులపై అటూ ఇటూ వెళ్తూ ఉన్నారు. ఈ నిచ్చెన పరలోకం భూమికి మధ్య కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉంది. “ప్రభువు దాని పైన నిలబడ్డాడు” ఆయన కృపలో యాకోబు క్రింద ఉన్నాడు. మెట్ల మీద దేవదూతలు పైకి ఎక్కుతూ, యాకోబు అవసరాలు అభ్యర్థనలను దేవుని దగ్గరకు మోసుకెళ్తున్నారు. అలాగే దిగుతూ, దేవుని సహాయం హామీతో తిరిగి వస్తున్నారు. ఇక్కడ ఇది యాకోబు దేవునితో సంభాషించేందుకు అవకాశమిచ్చింది. అతడు మధ్యవర్తి ద్వారా అంగీకరించబడ్డాడనే బలమైన పాఠాన్ని అతనికి నేర్పుతుంది.
ప్రభువైన యేసు ఒకసారి యాకోబు కలను ప్రస్తావించి, యాకోబు చూసిన మెట్ల మార్గంతో తనను తాను పోల్చుకున్నాడు (యోహాను 1:51). ఆకాశాన్ని భూమిని కలిపే మెట్ల మార్గాన్ని నేనేనని యేసు చెప్తున్నాడు. మన పాపములకు మూల్యమును చెల్లించుట ద్వారా దేవుని యొద్దకు వెళ్ళడానికి దేవుని సన్నిధానంలో నిలబడటానికి మన కొరకు యేసు మార్గాన్ని తెరచాడు. ఆయన సిలువ మనకొక నిచ్చెనగా ఉంది. దానిపై ఆయన మన దగ్గరకు వస్తాడు. దానిపై మనం ఆయన వద్దకు వెళ్లొచ్చు. మనం ఒంటరివారము కామని ఇది మనకు నిశ్చయతను కలిగిస్తుంది. ఈ నిచ్చెన ద్వారా దేవుడు మీతో సంబంధాన్ని కలిగియుండాలని ఆశపడుతూవున్నాడు.
2
13మరియు యెహోవా దానికి పైగా నిలిచి–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. 14నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును; నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమి యొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.
ఈ కలను ఇచ్చి దీని మర్మాన్ని కనుక్కొనెలా దేవుడు యాకోబును వదిలేయలేదు. ఇంతకు ముందు దేవుడు అతనితో ఎప్పుడూ వ్యక్తిగతంగా మాట్లాడింది లేదు. తన తండ్రి దేవుని నుండి అతనికి వచ్చిన హామీల గురించి మాట్లాడటం అతడు విన్నాడు. మొట్టమొదటిసారి దేవుడు యాకోబుతో మాట్లాడాడు. యెహోవా దానికి పైగా నిలిచి–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను అని తనను తాను పరిచయము చేసుకొన్నాడు. ఇక్కడ దేవుడు అనే మాటకు, సరిపోల్చలేని సర్వశక్తిమంతుడనైన వాడను అని, యెహోవా అను మాటకు కృపామయుడునైన వాడను అని అర్ధం. దానికి తోడుగా ఆయన తాను నీ తండ్రియైన ఇస్సాకు దేవుడను నీ తాతయైన అబ్రాహాము దేవుడనని చెప్తూ తనను యాకోబు కుటుంబముతో కలుపుకొంటున్నాడు.
యాకోబు కల యొక్క పరాకాష్ట ప్రభువు స్వయంగా పరలోకపు మెట్ల ముందు నిలబడి అతని తాతయైన అబ్రహంకు ఇచ్చిన వాగ్దానాలను యాకోబుకు మరలా చెప్పటం. యాకోబు తన తండ్రిని మోసగించి పొందిన వాగ్దానాలను ఇప్పుడు అతడు దేవుని పెదవుల నుండి విన్నాడు. ఇక్కడ మోసం లేదు. అతని వారసులు అనేకులు అవుతారని, వారు భూమిని వారసత్వంగా పొందుతారని వారి ఒక గొప్ప వారసుడి ద్వారా భూమిపై ఉన్న అన్ని దేశాలు ఆశీర్వదించబడతాయని దేవుడు యాకోబుకు వాగ్దానం చేశాడు. ఈ వ్యక్తీకరణ అబ్రాహాము సంతానము యొక్క ప్రపంచవ్యాప్త సార్వత్రికతను సూచిస్తుంది. వీళ్ళు అబ్రాహాము సహజ సంతానాన్ని మించిపోతారు.
అబ్రాహాము ఇస్సాకులకు ఇచ్చిన అవే వాగ్దానాలను ఆయన యాకోబుకు ఇవ్వడం ద్వారా తాను యాకోబుకు కూడా దేవుడునై యుందునని సెలవిచ్చాడు. 13వచనంలో నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదనని దేవుడు యాకోబుకు చెప్పాడు. యాకోబు ఆ భూమిని వదిలి వెళ్లబోతున్నాడు కాని దేవుని మాట ప్రకారం యాకోబు దానిని పోగొట్టుకోడు. భూమిమీదనున్న ఇసుక రేణువులవలె యాకోబు సంతానము విస్తరిస్తుంది. ఆ టైములో ఆ మనుష్యునికి కాబోయే భార్య విషయము ఏ మాత్రము తెలియనప్పటికిని అతని సంతానము భూమియందంతట విస్తరించునని ఆయన సెలవిచ్చాడు. దేవుని శిక్షణా తరగతిలో చేరడానికి ముందుగా యాకోబు ఈ వాగ్దానాలను బట్టి బలమును పొందుకొన్నాడు. ఈ వాగ్దానాలను యాకోబు ఎప్పుడు మర్చిపోలేదు. ఎల్లప్పుడూ వాటిని అతడు తన హృదయములో ఉంచుకొన్నాడు.
దేవుడు విశ్వాసులందరికి పరిశుద్ధ లేఖనాలలో ఎన్నో వాగ్దానాలను ఇచ్చాడు. ఉదాహరణకు, ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పరచెదవు, కీర్తన 50:15; యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు, యెషయా 40:31. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను, హెబ్రీ 13:5 లాంటివి. ప్రతి ఒక్కటి మీకు జ్ఞాపకముందా? బైబిలులో ప్రతి పేజీలో ఒక వాగ్ధానముంది. ప్రతి వాగ్దానము విశ్వాసికి ఎంతో ఆదరణను ఇస్తున్నాయి. ఈ వాగ్దానాలన్నీ మన అవసరతలలో ఈ జీవిత ప్రయాణములో ప్రతి సందర్భములో మనకు సహాయముగా ఉండేలా, మనలను ఆదరించేలా, మనలను బలపరచేలా, మనలను నిర్ధేశించేలా మనకు ఇవ్వబడ్డాయి.
దీనికి దేవుడు మరో వాగ్దానాన్ని జోడించాడు: “ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను.” ఇక్కడ యాకోబు తాను ఎరుగని హారానుకు వెళ్తున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. ఆ రాత్రి తాను బ్రతికి ఉంటానని గాని, తిరిగి తన కుటుంబాన్ని చూస్తాననిగాని, తన స్వదేశాన్ని మరలా చూస్తాననిగాని యాకోబు తలంచలేదు. అలాంటి పరిస్థితులలో దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి యాకోబుకు ఉన్న అన్ని అనుమానాలను తీర్చి అతనికి ఉన్న అస్థిరమైన విషయాలలో అతనికి ఈ వాగ్దానం ఇచ్చాడు. అతడు కానానుకు మళ్ళి వస్తాడు, రావటమే కాదు దానిని అతడు తన కొరకును తన సంతానము కొరకును స్వాస్థముగా పొందుకొంటాడు.
యేసునందు దేవుడు మనతో కూడా ఈవిధముగానే ప్రవర్తిస్తున్నాడు. మనకు ఖచ్చితముగా అవసరమైనవి ఆయనకు తెలుసు. హెబ్రీ గ్రంధకర్త, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెనని (4:15) మనకు జ్ఞాపకం చేస్తూవున్నాడు. యేసు మన రక్తమాంసములను తీసుకొని మనవలె శోధింపబడ్డాడు. శ్రమలను బాధలను అనుభవించాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన పాఠములోని యాకోబుతో మాట్లాడుతున్నట్లుగా, ఆయన మన ఒంటరితనంలో మన అస్థిర విషయాలలో అవసరతలలో ఆయన మనతో మాట్లాడుతున్నాడని జ్ఞాపకముంచుకోండి. ఆయన మనతో ఉన్నాడని, ఆయన వాగ్దానాలన్నీ మనతో నిలచియున్నవనే విషయాన్ని అది మనకు జ్ఞాపకం చేస్తువుందని జ్ఞాపకముంచుకోండి.
ఆయన వాగ్ధానాలను ఆయన నెరవేరుస్తాడని నిశ్చయత కలిగివుందాం. భూనివాసులందరు నీ ద్వారాను నీ సంతానము ద్వారాను ఆశీర్వదింపబడుదురను ఆయన ఆశీర్వాదాన్ని గమనించండి. నేడు మనము కూడా ఆశీర్వదింపబడియున్న యాకోబు సంతానమై యున్నాము. ఈ ఆశీర్వాదము భూమిమీద ఉన్న అన్ని కుటుంబముల యొద్దకు ప్రవహిస్తూ ఉంది. యాకోబు కుమారుడైయున్న యేసు ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి దేశానికి ప్రతి ఒక్కరి దగ్గరకు ప్రవహిస్తూవున్నాయి. కల్వరి మీద ఆయన బలి ప్రజలందరి కొరకు. ఆయనను విశ్వసిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన క్షమిస్తున్నాడు, రక్షణను దయచేస్తున్నాడు, ప్రతి దీవెనతో ఆశీర్వదిస్తున్నాడు.
3
16యాకోబు నిద్ర తెలిసి–నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని 17భయపడి–ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమేగాని వేరొకటికాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను.
మరుసటి రోజు ఉదయం యాకోబు కొన్ని మిశ్రమ భావోద్వేగాలతో మేల్కొన్నాడు. దేవుడు తనకు చెప్పిన దానికి అతను కృతజ్ఞుడయ్యాడు. కాని ప్రధానమైన భావోద్వేగం విస్మయం యొక్క భావన. “నిజంగా ప్రభువు ఈ ప్రదేశంలో ఉన్నాడు, నాకు అది తెలియదు” అని ఆశ్చర్యపోయాడు. దేవుని ఇంట్లో స్వర్గ ద్వారం వద్ద తనను తాను చూసుకొనుటను బట్టి అతడు విస్మయంతో నిండిపోయాడు. ఇక్కడ, అతడు ఒంటరిగా బహిష్కరించబడ్డానని భావించిన చోట, అతడు స్వర్గ ద్వారం వద్దకు వచ్చానని కనుగొన్నాడు. ఆ సమయంలో అతని ప్రియమైన తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుండొచ్చు. కాని అతడు దేవుని ఇంట్లో ఉన్నాడు. దేవదూతల సంరక్షణలో ఉన్నాడు. అతడు అన్యులతో చుట్టుముట్టబడిన అపరిచితుడు. అయినప్పటికీ, అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ వింత ప్రదేశంలో, దేవుడు అతనితో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు అతనితో మాట్లాడాడు, అతన్ని ఆశీర్వదించాడు.
తనకు కలిగిన అద్భుత దర్శనాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, యాకోబు తన తలపై ఉన్న రాయిని తీసుకొని దానిని ఆ సంఘటన యొక్క స్మారక చిహ్నంగా నిలిపాడు. దేవుడు తనకు కనిపించిన విలువైన ప్రదేశాన్ని గుర్తించడానికి, దానిని వేరు చేయడానికి అతడు దానిని నూనెతో అభిషేకించాడు. దానిపై నూనె పోయడం అనేది అక్కడ అతనికి కనిపించిన దేవునికి ప్రతిష్టించే చర్య, సంఖ్యాకాండము 7:1. అతడు ఈ ప్రదేశానికి బేతేలు (హీబ్రూలో “దేవుని ఇల్లు”) అని పేరు పెట్టాడు.
ఈ రోజు ఈ ఇల్లు లేదా ఈ మందిరము పరలోకపు గవినియై ఉంది. దేవుడు తన వాక్యము సంస్కారముల ద్వారా మనందరి దగ్గరకు వచ్చుచున్నాడని చెప్పగలం. యేసు నందు దేవుడు తన క్షమాపణను ప్రేమను మనపై క్రుమ్మరించినప్పుడు, ఆయన మనలో ప్రతి ఒక్కరి కొరకు పరలోకపు మార్గాన్ని తెరుస్తూ ఉన్నాడు. మనము ఎక్కడ ఉన్నప్పటికినీ, ఏ స్థలములోనైతే మన ప్రభువు మన దగ్గరికి వచ్చి మనలను చేర్చుకొంటున్నాడో అదే బేతేలు.
దేవుడు ఎల్లప్పుడు మనతో ఉన్నాడని ఆయన వాగ్దానాలు ఇంకను మన మీద నిలిచి ఉన్నాయనే స్థిరమైన నిశ్చయతను మనము యేసు నందు కలిగియున్నాం. ఆ దేవుని ప్రేమ యొక్క రుజువును, రోమా 8:32లో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అను మాటలలో మనం చూడగలం.
మన జీవిత ప్రయాణము, యాకోబునకు వలె కష్టముగా ఉన్నను, మనం అనిశ్చితి మార్గములలో ఉన్నను, మన ముందు మన కొరకు వేచియున్న దానిని గురించి మనకేమి తెలియకపోయినను, మన ప్రక్కన యేసు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకుండా ఉందాం.
దేవుడు ఇక్కడ నిశ్చయముగా ఉన్నాడని మనము చెప్పునట్లుగా, యేసునందు ప్రతి స్థలము మనకు ఒక బేతేలులా ఉండులాగున దేవుడు దయచేయును గాక. మనము క్రొత్తగా దేవుని సన్నిధికి మార్గమును చూడగలుగునట్లుగా, ప్రతి దినము మనము దేవుని యొక్క వాగ్దానాలను స్వీకరించునట్లుగా, ఖచ్చితమైన దేవునితో పరిపూర్ణ జీవితమును ఎల్లప్పుడు కలిగియుందుమను నిశ్చయతను కలిగియుండునట్లుగా, తండ్రీ, ప్రతి స్థలమును ఒక బేతులుగా మార్చండి. ఆమెన్.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl