
లెంట్ 3 బి సిరీస్
పాత నిబంధన పాఠము: నిర్గమకాండము 20:1-17; పత్రిక పాఠము: 1 కొరింథీయులకు 1:22-25; సువార్త పాఠము: యోహాను 2:13-22; కీర్తన 19.
సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: నిర్గమకాండము 20:1-17
నిర్గమకాండము 20:1-6: 1దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను. 2–నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని; 3నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 4పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమి క్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహము నయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. 5ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు 6నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యితరముల వరకు కరుణించువాడనై యున్నాను.
ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులు తమ ప్రయాణములో భాగముగా సీనాయి పర్వతము వద్దకు తేబడ్డారు. వారి జీవితాల కొరకైనా ఆయన చిత్తాన్ని ఆయన ప్రత్యక్షపర్చడానికి కోరుకొంటూ వారందరు ఏవిధముగా నడవాలో, ఆయనను ఏవిధముగా ఆరాధించాలో, వారి అనుదిన జీవితాలలో వారి వ్యక్తిగత ప్రవర్తన ఏవిధముగా ఉండాలో తెలియజేస్తూ, అందులో భాగముగా దేవుడు వారికి ప్రత్యక్షమై, పౌర సంబంధమైన, శుద్ధికారణాచార సంబంధమైన, నీతి సంబంధమైన ఆజ్ఞలను ఆయన వారికి తెలియజేశాడు. ఆయన అక్కడ ఇశ్రాయేలీయులతో నిబంధనను చేసుకొన్నాడు.
నేటి ఈ ఆధునిక ప్రపంచములో జీవిస్తున్న మనమందరం మన జీవితాలలో కొన్నిటికి ప్రధమ స్థానాన్ని ఇస్తూ ఉంటాం తప్ప ప్రాముఖ్యము ప్రధానమైన దేవునికి మాత్రం మన జీవితాలలో ప్రధమ స్థానాన్ని ఇవ్వలేక పోతున్నాం. నిజానికి మన జీవితాలలో ఎల్లప్పుడూ దేవుడే ప్రధమ స్థానములో ఉండాలి. మనం ఎక్కడ ఉన్నాం? ఎలా ఉన్నాం? అనేది ప్రాముఖ్యము కాదు. కాని అన్ని సమయాలలో దేవుడే మన అందరి జీవితాలలో ప్రధమ స్థానములో ఉండాలి. ఈ ఉదయకాలాన్న మనముందర ఉన్న ఈ పాఠములో ఈ సత్యాన్ని ప్రభువు తనకు తానుగా మనకు వక్కాణిస్తున్నాడు.
విమోచకుడైన దేవునిని మొదటి స్థానములో ఉంచండి
- దేవుడు మన కొరకు చేసియున్న వాటిని జ్ఞాపకం చేసుకొందాం 1,2
- దేవుడు ఇప్పుడు మన నుండి ఆశిస్తున్న వాటిని గుర్తిద్దాo 3,4
- దేవుడు మనకు అనుగ్రహించుచున్న దీవెనలను పుచ్చుకొందాం 5,6
1
1,2 వచనాలను చదువుకొందాం: నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. ఇక్కడ దేవుడైన యెహోవా తన గుర్తింపును తెలియజేస్తూ _ సర్వశక్తిమంతుడను కనికరముగల దేవుడనైన యెహోవానగు నేనే నిన్ను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని అని చెప్తున్నాడు.
మిమ్మల్ని ఐగుప్తు దాస్యము నుండి వెలుపలికి తీసుకు వచ్చిన నీ దేవుడనైన యెహోవాను నేనే అని చెప్తున్నాడు. ఈ విషయం వాళ్ళకి తెలుసు కదా మళ్ళీ ఎందుకని దేవుడు వారికి గుర్తుచేస్తున్నాడని మనం ఆశ్చర్యపోవొచ్చు. ఐగుప్తు నుండి వాళ్ళు యెట్లు విడిపింపబడ్డారో వాళ్లలో ఎవరు మర్చిపోగలరు? నిజం చెప్పాలంటే వాళ్లలో ఎవరూ ఆ విషయాన్ని మర్చిపోలేరు. అయితే ఈ విషయాన్ని వాళ్ళకి మళ్ళీ జ్ఞాపకం చెయ్యడానికి దేవుని కొక కారణముంది.
ఐగుఫ్తులో వాళ్ళు మునుపు దాసులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితాలు దుర్లభంగా ఉండేవి. అణచివేత అనే ప్రక్రియలో భాగముగా దుర్మార్గముగా అతి క్రూరులైన పాలకుల క్రింద ఎలాంటి హక్కులు లేకుండా నిస్సహాయులైన దాసులుగా వాళ్ళు ఉండేవాళ్ళు. దానిని గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి ఏమి లేదు. తప్పించుకోవడానికి వారు చెయ్యగలిగినది ఏమి లేదు. వారికి స్వేచ్ఛ కూడా లేదు. విడిపింపబడుదుమన్న ఆశేలేని ఇశ్రాయేలీయులను యెహోవా తన బాహుబలము చేత విడిపించి వారిని ఆ దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించడమే కాకుండా వారిని ఆయనకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఆయన సొత్తయిన ప్రజలుగా ఉండులాగున ఆయన వారి స్థితిని మార్చాడు. పది ఆజ్ఞల ప్రారంభములో దేవుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడో అర్ధం చేసుకోవడానికి కష్టముగా లేదు. వాళ్ళు ఆయన 10 ఆజ్ఞలను పాటించేలాగున ఆయన వారికొక కారణాన్ని ఇస్తున్నాడు.
యెహోవా వారి కొరకు చేసియున్న దానిని బట్టి, ఇశ్రాయేలీయులు ఇష్టపూర్వకంగా ప్రేమతో కృతజ్ఞాతతో ఆయనకు విధేయత చూపాలని, ఆ విధేయత లోపలి నుండి రావాలని అంటే హృదయాంతరాలలో నుండి రావాలని, అన్ని విషయాలలో వారి దేవునిగా ఆయనకే పరిపూర్ణముగా మహిమను ఇవ్వవలెనని ఆయన ఆశపడుతున్నాడు. బలవంతముగా గాని భయముతో గాని ప్రజలు ఆయనకు లోబడాలని ఆయన కోరుకోవడం లేదు.
ఈ రోజు అనేక విధాలుగా ఆయన మన పట్ల చూపియున్న ప్రేమను బట్టి మనం స్పందించాలని ఆయన మనలను ఆహ్వానిస్తూ, “నా యెడల కృతజ్ఞత కలిగియున్నవారిని నేను ఇష్టపడుతున్నాను” అని చెప్తున్నాడు. 1 యోహాను 4:19, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము, ఈ విషయాన్నే తెలియజేస్తూవుంది.
Application: మన మునుపటి స్థితిలో, మన బ్రతుకులేంత దుర్లభముగా ఉండేవో ఆలోచించండి. అతి క్రూరుడైన పాలకుని క్రింద ఎలాంటి హక్కులు లేకుండా నిస్సహాయులైన దాసులుగా నిరీక్షణలేని జనులుగా ఉండేవారం. పాపమనే గొలుసులతో బంధింపబడి వాడి నుండి తప్పించుకొనే మార్గమేమి కానరాక ఎలాంటి దుస్థితిని అనుభవించియున్నామో మనకు తెలుసు. కాని దేవుడు యేసు ద్వారా మనలను ఆ భయంకరమైన దాస్యత్వమునుండి విడిపించాడు, విమోచించాడు. మన పక్షముగా యేసు పాపముతోను సాతానుతోను నరకము యొక్క అన్ని శక్తులతోను ఆయన పోరాడాడు. ఆ క్రమములో ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించవలసి వచ్చినను అప్పగించి జయించిన వానిగా ఉన్నాడు. అందును బట్టి ఆయన ప్రజలముగా ఇష్టపూర్వకంగా ప్రేమతో కృతజ్ఞాతతో ఆయనకు విధేయత చూపాలని ఆ విధేయత లోపలి నుండి రావాలని అంటే హృదయాంతరాలలోనుండి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఇష్టపూర్వకంగా ప్రేమతో కృతజ్ఞాతతో ఆయనకు విధేయత తెలియజేస్తూ జీవిధ్ధాం. అన్ని విషయాలలో ఆయనకే ప్రాముఖ్యతను మహిమను ఇద్దాం.
2
3నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 4పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహము నయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు అని దేవుడు చెప్తూవున్నాడు అంటే అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, ప్రతిమా స్వరూపముగా నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
పది ఆజ్ఞలలో, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు నైతిక ధర్మశాస్త్ర సారాంశాన్ని ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఏది రైట్ ఏది తప్పు అను వాటి మధ్య ప్రాథమిక వ్యత్యాసాన్ని వారికి తెలియజేసేందుకు వారికి అందించబడ్డాయి. వాటి నిషేధాలు కేవలం బాహ్య ప్రవర్తనకు మాత్రమే వర్తించలేదు. అన్ని మంచికి ఏకైక మూలమైన ఏకైక నిజమైన దేవుడి పట్ల భక్తి యొక్క ప్రాముఖ్యతను సూచించడం ద్వారా అవి ప్రారంభమయ్యాయి.
ప్రభువు ఇక్కడ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తున్నాడు అంటే ఇతర దేవుళ్లను కలిగియుండ కూడదని అర్ధం. విగ్రహారాధన పాపమని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. 17 శతాబ్దానికి చెందిన జాన్ కెల్విన్ అను సంస్కర్త మానవుల మనస్సు విగ్రహాల తయారీ కర్మాగారం అని చెప్పాడు.
విగ్రహారాధన రెండు రకాలు. 1. బహిరంగ విగ్రహారాధన 2. రహస్య విగ్రహారాధన. క్రైస్తవులమైన మనము ఈ ఆజ్ఞను వినినప్పుడు, మన జీవితాలలో విగ్రహాలు లేవని అనుకోవొచ్చు. కాని మన జీవితాలలో అనేకమైన వాటికి దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తు ఉన్నాం, వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం, వాటిని నమ్ముకొంటు ఉన్నాం. మరి అది విగ్రహారాధన కాదా?
ప్రజలు నిజమైన దేవునికి ప్రాధాన్యత నివ్వడం కంటే ఎక్కువగా తమ జీవితాలలో డబ్బుకు, ఆస్తికి, అంతస్తుకు, బంగారానికి, వస్తువులకు, కీర్తికి, అధికారానికి, లైంగిక సంబంధాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. ఇవే మనుష్యుల జీవితాలను నిర్ధేశిస్తు నడుపుతూ ఉన్నాయి. ఇవే మనకు ప్రాముఖ్యము. కాబట్టే ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడుచు ఉన్నాడు అని వ్రాయబడింది.
ఉదాహరణకు, దేవునికి కాకుండా ఇతరమైన వాటికీ మనం మన జీవితాలలో ప్రాధాన్యతనిస్తే ఏం పోగొట్టుకుంటామో తెలుసా? లూకా 12:15-21 వచనాలలో ధనవంతుడైన బుద్ధిహీనుడు దేవునికన్నా కూడా తన కొరకు సమస్తాన్ని సమకూర్చుకోడానికి సిద్ధపడ్డాడు, ఏమైంది? శాశ్వతమైన నరకాన్ని సంపాదించుకున్నాడు, ఇందుకా అతడు శ్రమపడింది? మత్తయి 19:16-22 వచనాలలో ధనవంతుడైన యవ్వనస్తుడు యేసును వెంబడించుట కన్నా తన సంపదనే ప్రేమిస్తూ నిజదేవుని పిలుపును లెక్కచెయ్యక వెళ్ళిపోయాడు. వీళ్ళు చేసిన తప్పు ఏమిటో తెలుసా? దేవునికన్నా ఈ లోక విషయాలకు తమ జీవితాలలో ప్రధమ స్థానాన్ని ఇవ్వటమే, పాపముగా మారింది. వీళ్ళు రహస్యముగా తమ హృదయాలలో విగ్రహారాధన చేస్తున్నారు. వారి విగ్రహాలు వారి సంపదే. దేవుడు వారిని సంరక్షించున్నాడని వారికి కావలసిన వాటిని ఆయనే వారికి దయచేస్తున్నాడని నమ్మకుండా ఉండటానికి వారి ఐశ్వర్యమే కారణమయ్యింది.
పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహము నయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు అని దేవుడు చెప్తున్నాడు. సాగిలపడడం అంటే, గౌరవించడం, లేక నీకంటే గొప్పవాడు లేక శక్తిమంతుడు లేడని చెప్తూ ఒకని ఎదుట తలవంచడం. పూర్తిగా ఒకరికి లొంగి ఉన్నామనే విషయాన్ని సాగిలపడడం ద్వారా కూడా తెలియజెయ్యొచ్చు. పూజించడమంటే, మనం పూజించే వాటికీ మన జీవితాలను నిర్దేశించి నడుపుమని వాటికి మన జీవితాలను అప్పగించుకోవడం అని అర్ధం కూడా వస్తుంది. సాతాను చాలా తెలివిగలవాడు మనము ఎన్నుకోవడానికి అనేకమైన దేవుళ్లను ఇచ్చాడు.
బహిరంగ విగ్రహారాధనలో గాని రహస్య విగ్రహారాధనలో గాని క్షయమైన వాటిని గౌరవిస్తూ వాటికంటే గొప్పవి శక్తిమంతమైనవి వేరే ఏవి లేవని చెప్తూ వాటి ఎదుట సాగిలపడుతూ జీవము లేని వాటికి మన జీవితాలను నిర్ధేశించమని మనలను మనం అప్పగించుకొంటూ మన స్వకీయమైన దురాశలు చేత మనకు మనమే మరులు కొల్పబడి వాటిచేత ఈడ్వబడుతూ ఉన్న జ్ఞానులం.
Application: సమస్తమైన వాటిలో దేవునికే ప్రాధాన్యమిస్తూ, ఆయనను అధికముగా ప్రేమిస్తూ, దేవుడు మనలను సంరక్షిస్తున్నాడని మనకు కావలసిన వాటిని ఆయనే మనకు దయచేస్తున్నాడని నమ్ముతూ, మాట చేత గాని క్రియచేత గాని, మనమేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సమస్తమును ఆయన పేరట చేద్దాం. ఆయన మన అందరి కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసాడో వాటన్నిటిని తలంచుకొంటూ, మన మందరం యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవిద్దాం.
3
5ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను; నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు 6నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరముల వరకు కరుణించు వాడనై యున్నాను.
నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను అని యెహోవా ఎందుకని చెప్పాడు? దీనికి అర్ధం ఏమిటంటే, తనకు రావలసిన మహిమను కాపాడుకొనువాడని మరియు ఆయనకు చెందవలసిన పూజలను పుచ్చుకొనువాడని అర్ధం. అన్నిటిని చేసిన దేవుడు తనకు చెందవలసిన ప్రేమను, పూజలను తాను చేసిన వాటిలో దేనికైనను ఇచ్చుటకు కోరుకోవడం లేదనే విషయాన్ని మరచిపోకండి. సృష్టించబడినవి తమ సృష్టికర్త యొక్క స్థానాన్ని తీసుకోకూడదు. ఆ విధముగా జరిగితే దేవుడు ఆ విషయాన్ని తేలికగా తీసుకోడు. ఒకవేళ ఆయనకు ఇవ్వవలసిన ప్రేమను పూజలను మనము ఇవ్వకపోతే ఆయన ఆ విషయాన్ని తేలికగా తీసుకొననని ఆయన ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రేమను పూజలకు తానే అర్హుడనని ఆయన కఠినముగా చెప్తున్నాడు.
ఆయన పట్ల ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారను వాటి ఆధారంగా ఆయన దానికి శిక్ష ఆశీర్వాదమును జతచేసాడు. కాబట్టే, నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుదునని చెప్పాడు. తండ్రుల దోషమును మూడు నాలుగు తరముల మీదికి రప్పించుదును అను మాటలు అన్యాయం అని అంటారా? దేవునిని ఎవరైతే ప్రధమ స్థానము నందు ఉంచరో వాళ్ళు తమ జీవితాలలో తమ పిల్లలు లేదా తమ తర్వాత వచ్చే తరాలను గూర్చి వారికి శ్రద్ధ లేదనేగా అర్ధం. ఉదాహరణకు, భక్తిహీనులైన తల్లిదండ్రులు భక్తిహీనులైన పిల్లలకే జన్మనిస్తారు. ఆ భక్తిహీనులైన తల్లిదండ్రులు వారి పిల్లలు వారి పాపాలకు శిక్ష అనుభవిస్తారని అర్ధం. సౌలు యొక్క అవిధేయతను బట్టి దేవుడు అతను రాజుగా ఉండకుండ తిరస్కరించాడు. అతని పిల్లల పిల్లలు ఎంతటి దీవెనను పోగొట్టుకొన్నారో తెలుసా?
దేవునిని ద్వేషించేవారముగా కాకుండా ఆయనను ప్రేమించేవారముగా ఉందాం. మనలో ఉండే పాపపు స్వభావము దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుందని, చెడును మాత్రమే చేయడానికి ఆసక్తిని చూపెడుతుందని మనకు తెలుసు. కాబట్టే పాపులును శిక్షించుదునన్న దేవుని మాటలను seriousగా తీసుకొందాం. ఆయన కోపానికి భయపడి ఆయన ఆజ్ఞలకు విరోధముగా ప్రవర్తింపక ఉందాం.
అలాగే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యితరముల వరకు కరుణించువాడనైయున్నాను అని ఆయన చెప్పాడు. దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండటం మన విధి. కాని మన విధేయతను ఆశీర్వదించుదునను ఆయన వాగ్దానము నిజముగా పొందతగని బహుమానము. దేవుని ఈ వాగ్ధానాన్ని బట్టి దేవునిని ప్రేమించి ఆయన యందు నమ్మికయుంచి ఆయన ఆజ్ఞాపించు వాటిని సంతోషముతో చేద్దాం.
దేవుడు ఇక్కడ చెప్తున్న భయానకమైన హెచ్చరికతో పాటు ఆశీర్వాదసంభంధమైన వాగ్ధానాన్ని చూడగలుగుచున్నామా? గ్రహించగలుగుచున్నామా? ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనువారందరి మీద దయను క్రుమ్మరించెదనని ఆయన చెప్తున్నాడు. ఆయన ఆశీర్వాదాలు పరలోకము నుండి వచ్చు వర్షమువలె ఉంటాయి. తమ జీవితాలలో ఆయన చిత్తాన్ని వెంబడించు వారందరి మీదకు అంతులేని కొలతలతో అవి పైనుండి క్రుమ్మరింపబడతాయి.
ముగింపుగా, మన పాఠాన్ని బట్టి దేవుడు మన జీవితాలలో ప్రధమ స్థానములో ఉండుటకు ఆశపడుతున్నాడనేది స్పష్టం. మన దేవుడు అనేక విధాలుగా మనపట్ల తన మంచితనాన్ని చూపెడుతూ మన జీవితాలలో ప్రధమ స్థానములో ఉండాలనుకొంటున్నాడు. ఆయనను మన మందరం మన మాటలలో ఆలోచనలలో నడతలలో కనపరచవలసి ఉన్నాం. మన జీవితాలకు ఆయనే నిజమైన ప్రభువని మనము ఆయనను స్పష్టముగా ఇతరులకు చూపెట్టవలసి ఉన్నాం.
చివరిగా ఒక ప్రశ్న మీ హృదయములో, జీవితములో మొదటి స్థానములో ఎవరున్నారు? పరిశీలించుకోండి, విమోచకుడైన కీస్తుకు ప్రధమ స్థానాన్ని ఇవ్వండి. అందుకు ఆయనే మనకందరికీ సహాయము చేయును గాక. ఆమెన్.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl