
బుద్ధిగల కన్యకలు బుద్ధిలేని కన్యకలు
మత్తయి 25:1-13, 1పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది. 2వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు. 3బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడ నూనె తీసికొనిపోలేదు. 4బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడ సిద్దెలలో నూనె తీసికొనిపోయిరి. 5పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. 6అర్ధరాత్రివేళ– ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. 7అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని 8బుద్ధిలేని ఆ కన్యకలు– మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారి నడిగిరి. 9అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. 10వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; 11అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి–అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా 12అతడు–మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 13ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
పదిమంది కన్యకలకు సంబంధించిన ఈ ఉపమానం పై అధ్యాయంలో ప్రారంభించిన ఎస్కాటోలాజికల్ ప్రసంగంలో ఒక భాగం. ప్రభువు రెండవ రాకడకు ఖచ్చితమైన సమయం యొక్క అనిశ్చితి కారణంగా ఇది అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తూ ఉంది.
మత్తయి సువార్త 24వ అధ్యాయం ఆయన రాకడను గురించి మాట్లాడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం తుది తీర్పును గురించి మాట్లాడుతుంది. మత్తయి సువార్త 25:1-13లోని పదబంధం తీర్పు రోజున ఆయన రాకను సూచిస్తుంది. మనుష్యకుమారుడు తీర్పు తీర్చడానికి తిరిగి వచ్చినప్పుడు, ఆ సందర్భము తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన పదిమంది కన్యకలను పోలి ఉంటుంది. ఆయన తీర్పులో బుద్ధిలేని కన్యకలను బుద్ధిగల కన్యకల నుండి, నమ్మకమైన సేవకులను నమ్మకద్రోహ సేవకుల నుండి, గొర్రెలను మేకల నుండి వేరు చేస్తాడు.
ఆ తీర్పులో, క్రీస్తు తన ప్రజలను తన వద్దకు స్వీకరించడానికి రావడం తరచుగా వివాహం యొక్క సారూప్యతలో సంఘం వధువుగా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ కారణంగా ఇది క్రీస్తుతో విశ్వాసుల ఐక్యతను సముచితంగా సూచిస్తుంది.
బాప్తిస్మమిచ్చు యోహాను గతంలో యేసును వరుడు అని పేర్కొన్నాడు (యోహాను 3:27–30 చూడండి). ఈ చిత్రం పాత నిబంధన ప్రవక్తల భాషపై నిర్మించబడింది (యెషయా 54:5; 62:1–5; యిర్మీయా 3:14, 20; 31:32; హోషేయ 1:2, 3; 2:2, 7, 16; మరియు పరమగీతము). యేసు ఈ చిత్రాన్ని మత్తయి 9:15 మరియు 22:1–14లో కూడా ఉపయోగించాడు. అలాగే యోహాను 3:29; ప్రకటన 19:7; ప్రకటన 21:9; ఇవన్నీ ఎఫెసీయులు 5:21–33 లో చెప్పబడిన విషయాలను సుసంపన్నం చేస్తున్నాయి.
కన్యక, నిస్సందేహంగా, చర్చికి ప్రాతినిధ్యం వహిస్తూవుంది. సంఘము స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనది కాబట్టి దానికి ఇవ్వబడిన పేరు ఇది, 2 కొరింథీయులు 11:2; విలాపవాక్యములు 1:15; 2:13. కన్యకలు వ్యక్తిగత క్రైస్తవులను సూచిస్తున్నారు. ఇక్కడ పది సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత లేదు, దానిని సాధారణమైనదిగా లేదా సరి సంఖ్యగా పరిగణించాలి. ఇక్కడ పదిమంది కన్యకలు స్పష్టంగా వధువుతో పాటు వచ్చే తోడిపెళ్లికూతురులను సూచిస్తున్నారు. అయితే ఈ ఉపమానంలో వధువు గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు.
బుద్ధిమంతులకు మరియు బుద్ధిహీనులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి యేసు కొండమీది ప్రసంగం చివరిలో బుద్ధిమంతులైన మరియు బుద్ధిహీనులైన నిర్మాణకుల కధలో ప్రస్తావించాడు (మత్తయి 7:24–27 చూడండి). ఇక్కడ మరియు మత్తయి 25లో (రెండు చోట్లా), మనం బుద్ధిమంతులను “విశ్వాసులని” మరియు బుద్ధిహీనులను “అవిశ్వాసులు” అని తీసుకుంటే, మనం అసలు విషయాన్ని కోల్పోతాము. ఎందుకంటే, యేసు ఈ విషయాలను తన సంఘానికి ప్రకటిస్తున్నాడు. ఆయన బుద్ధిహీనులను “బుద్ధిమంతులుగా చేసుకోండి” అని హెచ్చరిస్తున్నాడు. ఇది విత్తువాని ఉపమానం యొక్క వైవిధ్యం, దీనిలో యేసు అపవాది ప్రమాదాలు (13:19), హింస (13:21) మరియు దురాశ (13:22) గురించి మనల్ని హెచ్చరించాడు.
ఈ ఉపమానంలో కన్యకలందరూ ఒకేలా లేరు. వారిలో ఐదుగురు బుద్ధిగలవారు ఐదుగురు బుద్ధిలేనివారు. బుద్ధిలేనివారు అంటే నిత్యజీవానికి ప్రాధాన్యమివ్వని మూర్ఖులు. బుద్ధిగలవారు అంటే తెలివైనవారు, ఆలోచనాత్మకులు, వివేకవంతులు. (బుద్ధిగలవారు, బుద్ధిలేనివారు) ఈ రెండు పదాలు క్రియా విశేషణాలు. బుద్ధిగల వారిలో వివేకం లేదా ఆలోచనాత్మకతను చూడొచ్చు. భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులు మరియు సంఘటనలకు వారు సిద్ధంగా ఉన్నారు. వారు తక్షణ ఉపయోగం కోసం అవసరమైన విషయాల గురించి మాత్రమే కాకుండా, భవిష్యత్తును కూడా ఆలోచించారు (దూరదృష్టిని కూడా కలిగి ఉన్నారు). తలెత్తే ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో, మిగిలిన ఐదుగురు ఆలోచనా రహితులు, మూర్ఖులు. తాత్కాలిక వ్యవహారాలలో, హ్రస్వదృష్టిని మాత్రమే కలిగిన వారు, అజ్ఞానులు. భవిష్యత్తును నిర్లక్ష్యం చేసే క్రైస్తవుడు నాశనం చేయబడతాడు. హింస లేదా బాధ లేదా కష్టాలు లేదా మరణ గంట లేదా ప్రభువు రాకడ ద్వారా తలెత్తే ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోతే నాశనమే. అప్పుడు తయారుగా లేకపోవడం ఖరీదైనదిగా నిరూపించబడుతుంది, రక్షణను కోల్పోవడం ఇందులో ఉంటుంది.
బుద్ధిగలవారి ప్రవర్తన క్రీస్తు రాకడకు “సిద్ధంగా” ఉన్నవారిని అంటే నిజమైన భక్తిని కలిగి ఆయన అనుచరులుగా సిద్ధంగా ఉండటాన్ని సూచిస్తుంది. బుద్ధిలేనివారి ప్రవర్తన ఆయనను ప్రేమిస్తున్నామని చెప్పుకునే వారి ప్రవర్తనను వ్యక్తపరుస్తుంది, వీరు ఆయనను కలవడానికి సిద్ధంగా లేరు.
వారు తమ దీపాలను తమతో తీసుకెళ్లారని విన్నప్పుడు మనకు గుర్తుకు వచ్చే చిత్రం బహుశా పూర్తిగా ఖచ్చితమైనది కాకపోవచ్చు. ఆ రోజులలో చిన్న మట్టి దీపాలను సాధారణంగా ఇంటి లోపల ఉపయోగించడానికి వాడేవారు. బహిరంగ ఊరేగింపులో, “దీపాలు” దివిటీల వలె ఉండేవి. పైభాగంలో నూనెతో తడిసిన గుడ్డలతో కూడిన దివిటీ చాలా కాంతిని ప్రసరింపజేస్తుంది, కాని ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నూనెను వాటిపై పోయాల్సి ఉంటుంది, మండుతున్న గుడ్డల కాలిపోయిన చివరలను కత్తిరించాల్సి ఉంటుంది.
వారు తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారని మనం విన్నాం. ఈ ప్రకటన కొంత అస్పష్టంగా ఉంది. వారు ఎవరి ఇంటి నుండి బయలుదేరారు? వారి సొంత ఇంటి నుండా లేదా వధువు ఇంటి నుండా? అయితే ఇక్కడ ఈ విషయం అప్రధానమైనది మరియు ఉపమానం యొక్క వివరణతో దీనికి సంబంధం లేదు. వారు పెండ్లి కుమారుని కలవడానికి బయలుదేరారు. పెండ్లి కుమారుడు, క్రీస్తు, తన వధువు వద్దకు వస్తున్నాడు, వధువు ఆయన వద్దకు వెళ్ళటం కాదు. ఇక్కడ క్రీస్తు చివరి రాకడ అంటే, వధువును తన పరలోకపు ఇంటికి మహిమతో తీసుకెళ్లడానికి రావడం.
బుద్ధిలేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడ నూనె తీసికొని పోలేదు. బుద్ధిలేని వారి దివిటీలలో మాత్రమే నూనె ఉంది. కాని ఏదైనా అత్యవసర పరిస్థితికి అనుగుణంగా వారు ఎక్స్ట్రా నూనెను తీసికొని పోలేదు.
బుద్ధిలేని కన్యలు అదనపు నూనెను తీసుకురావడంలో విఫలమవడం అంటే, వరుడు కనిపించే వరకు వారు అంత కాలం వేచి ఉండాల్సి వస్తుందని వారు ఊహించలేదనే విషయాన్ని అది సూచిస్తుంది. బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడ ఎక్స్ట్రా గా సిద్దెలలో నూనె తీసికొని పోయారు. మతమార్పిడి నమ్మకమైన పట్టుదలతో జతచేయబడాలి. మీరు చివరి వరకు స్థిరంగా నిలబడకపోతే విశ్వాసానికి రావడం మీకు మంచి చేయదు (24:13). లేదా మునుపటి ఉపమానం యొక్క చిత్రాలలో: వివాహ విందుకు ఆహ్వానాన్ని అంగీకరించడం మాత్రమే సరిపోదు; మీరు వివాహ వస్త్రాలను కూడా ధరించాలి (22:11–14).
నూనె అంటే ఏమిటి? అది పరిశుద్ధాత్మనా? అది విశ్వాసమా? అది సత్క్రియలతో కూడిన జీవితమా? కొందరు పరిశుద్దాత్మను సమర్థించారు, మరి కొందరు విశ్వాసాన్ని సమర్ధించారు ఇంకొందరు సత్క్రియలతో కూడిన జీవితాన్ని సమర్ధించారు. ఒక వైపు, విశ్వాసం లేదా పరిశుద్ధాత్మను కొనొచ్చు మరియు అమ్మొచ్చు అని చెప్పడం సమస్యాత్మకం. కాని మరోవైపు, పొలంలో దాగి ఉన్న నిధి మరియు గొప్ప ధర గల ముత్యం యొక్క ఉపమానాలలో యేసు ఇలాంటి చిత్రాలను ఉపయోగించాడు (13:44–46). నూనె సత్క్రియలతో కూడిన జీవితమైతే, ఈ అధ్యాయం చివరిలో ఉచ్ఛరించే తీర్పుతో సంబంధాన్ని కలిగి ఉంది (25:40,45).
రాజులు, యాజకులు మరియు ప్రవక్తలను నూనెతో అభిషేకించే పాత నిబంధన ఆచారం ఖచ్చితంగా నూనె మరియు పరిశుద్ధాత్మ మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. పరిశుద్ధాత్మ పనిని మార్టిన్ లూథర్ తన మూడవ ఆర్టికల్ వివరణలో అద్భుతంగా వివరిస్తూ, పరిశుద్దాత్మ సువార్త ద్వారా మనల్ని విశ్వాసానికి పిలుస్తాడని, తన పవిత్ర సంఘము లోనికి మనల్ని సేకరిస్తాడని, తన ఆధ్యాత్మిక బహుమతులతో మనకు జ్ఞానోదయం చేస్తాడని, సత్క్రియలతో కూడిన జీవితం కోసం మనల్ని పవిత్రం చేసి, మన చివరి వరకు నిజమైన విశ్వాసంలో మనల్ని ఉంచుతాడని చెప్పాడు. ఈ విషయాలన్నీ “బుద్ధిలేని” వారిని “బుద్ధిగల” వారిగా చేయవా?
చాలా మంది వ్యాఖ్యాతలు నూనెను విశ్వాసం అని చెప్తారు. నూనెను విశ్వాసంగా తీసుకొంటే, బుద్ధిలేని కన్యలకు అస్సలు విశ్వాసం లేదు. వారు నిజానికి చర్చిలో వేషధారులు. బయటికి క్రైస్తవులుగా వ్యవహరించారు. నోటితో క్రీస్తును ఒప్పుకున్నారు. మంచి జీవితాన్ని గడిపారు, ఆరాధనకు హాజరయ్యారు, చర్చి కోసం పనిచేశారు. కొన్నిసార్లు నిజమైన క్రైస్తవుల కంటే ఎక్కువ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. కాని వారి దీపాలలో నూనె లేదు, విశ్వాసం లేదు, ఆత్మ వరం లేదు, నిజమైన ప్రేమ మరియు మంచి పనులు లేవు. ప్రభువును నమ్ముకునే బదులు, వారు తమ సొంత నీతిని మరియు వారి ఊహాజనిత క్రైస్తవ ధర్మాలను నమ్ముతారు. బుద్ధి లేని కన్యలు పూర్తిగా నూనె లేకుండా లేరు. వారు దివిటీలు వెలిగించారు అంటే వారు తమ దివిటీలలో నూనెను కలిగి ఉన్నారు, కాని అది సరిపోలేదు. వారి దీపాలు ఆరిపోతున్నప్పుడు వారు నూనెను దివిటీలలో తిరిగి నింపలేక పోయారు. బదులుగా వారి దగ్గర చాలినంతగా నూనె కూడా లేదు. అందువల్ల త్వరలోనే వారి దివిటీలు ఆరిపోయి ఉండొచ్చని నేను అనుకొంటున్నాను.
ఈ వివరణలో, అటువంటి క్రైస్తవులను రాతి నేలపై లేదా ముండ్ల చెట్ల మధ్య పడిన విత్తనంతో పోల్చుతూ వాళ్ళు చాలా బలహీనమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారని, అంటే వేర్లు లేని విశ్వాసాన్ని కలిగి ఉన్నారని, అయితే వారిలో వేరు లేనందున వారు కొంతకాలము నిలుచుదురు గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడుదురని లేదా ముండ్ల పొదలలో విత్తబడిన వారు వాక్యము వినువారే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వారు నిష్ఫలులవుదురని (ప్రతి క్రైస్తవుడికి వచ్చే శోధనలను తట్టుకోలేనివారని) నేను భావిస్తున్నాను. అలాంటి వారిని కనుగొనడానికి మనం ఎక్కువగా శ్రమపడవల్సిన అవసరం లేదు. సంఘాలలో, ఆదివారం పాఠశాలలో లేదా వయోజన నిర్ధారణ తరగతిలో తగినంత జ్ఞానం లేని విద్యార్థులు/ సంఘ సభ్యులు ఎందరో ఉన్నారు. అటువంటి వారు వారి సందేహాలతో చర్చి సభ్యత్వంలోకి అంగీకరించబడతారు. వారికి బెనిఫిట్ అఫ్ డౌట్ ఇవ్వబడుతుంది. వారికి విశ్వాసం ఉండొచ్చు కాని అది చాలా బలహీనమైన విశ్వాసం. ఈ విషయాన్ని తృణీకరించకూడదు. ఎందుకంటే దేవుని ఉద్దేశ్యం ప్రకారం, బలహీనమైన విశ్వాసం పెరగాలి. ఈ క్రైస్తవులు తమ విశ్వాసం బలపడటానికి వాక్యాన్ని అధ్యాయనం చెయ్యడం ద్వారా తమను తాము మరింత నూనెతో నింపుకోవాలి. కాని అనేకులు అలా చేయడానికి నిరాకరిస్తున్నారు. వాళ్ళు పది ఆజ్ఞలను మరియు విశ్వాసప్రమాణాన్ని నేర్చుకున్నందున, క్రైస్తవత్వంలో తెలుసుకోవలసినవన్నీ నేర్చుకున్నామని వారు ఊహించుకుంటారు. వారు తమ క్రైస్తవ మతం పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. వారి విశ్వాసం పరీక్షించబడినప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు, వారి పాత్రలలో అదనపు నూనె ఉండదు. వారికి ఉన్న చిన్న విశ్వాసం త్వరలోనే తగ్గిపోతుంది వారి ప్రయాణంలో వెలుగు నింపడానికి నూనె లేకుండా ఉంటారు. వారి వద్ద ఉన్న కొద్దిపాటి నూనె వారి ప్రస్తుత అవసరాలకు సరిపోదని వారు చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. అందువల్ల వారు నిస్సహాయంగా ఉన్నారు. విశ్వాసాన్ని అరువు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు వ్యర్థం. భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుమని పౌలు ఇచ్చిన ఉపదేశం (ఫిలిప్పీ 2:12) మాత్రమే జాగరూకత మరియు నిజమైన సంసిద్ధతకు సురక్షితమైన మార్గం.
ఈ ఉపమానంలోని కొన్ని వివరాలు జీవితానికి సంబంధించినవి కావు. మొదట, వధువు గురించి ప్రస్తావించబడలేదు మరియు యూదుల ఆచారం ప్రకారం వరుడి కంటే తోడిపెళ్లికూతురులు వధువు వద్దకు హాజరు కావాలి. అలాగే, అలాంటి సందర్భాలలో ఆలస్యం అసాధారణం. ఆలస్యంగా వచ్చిన వారిని వివాహ విందుకు అనుమతించకపోవడం కూడా సాధారణ విషయం కాదు. కాని యేసు తన ఉపమానాలలో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మరియు తాను చెప్పాలనుకుంటున్న విషయాన్ని వక్కాణించడానికి అవాస్తవ అంశాలను ఎలా ఉపయోగించాడో మనం ఇంతకు ముందు గమనించాము. (ద్రాక్షతోటలోని పనివారి ఉపమానం, 20:1–16; మరియు అద్దెదారుల ఉపమానం, 21:33–41 చూడండి.)
బుద్ధిలేని కన్యలు చాలా ఆలస్యంగా తిరిగి వచ్చారు. వారి డబుల్ “అయ్యా, అయ్యా!” అనేది విలాపంలో భావోద్వేగం. అవి యేసు కొండమీది ప్రసంగం ముగింపులో ఇచ్చిన హెచ్చరికను గుర్తుచేస్తున్నాయి : ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి–ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు –నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్ద నుండి పొండని వారితో చెప్పుదును, 7:21–23.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యంలో దానిని భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ఈ ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl