ఎఫెసీయులకు 1: 3-7 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించిన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు ఇచ్చియుండుటే మనలను అత్యంత అదృష్టవంతులుగా మార్చియున్నది కాబట్టి. అలాగే పరలోక విషయములలో జత చెయ్యబడివున్న ప్రతి ఆశీర్వాదము క్రీస్తులో, క్రీస్తు ద్వారా మాత్రమే వస్తూ ఉన్నాయని, కాబట్టే, క్రీస్తు చాల చాల ప్రాముఖ్యమని చెప్తూ, మనము తండ్రియగు దేవునిఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తుపునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని తెలియజేస్తూవున్నాయి.

ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పరచుకున్నాడు అంటే జగత్తు ఉనికిలోనికి రాకముందే, నిత్యత్వములో కాలము ఉనికిలోనికి రాకముందే, మనల్ని తనకుటుంబ సభ్యులుగా తన కుమారులు కుమార్తెలుగా తన ఇంటిలోకి తీసుకురావాలని తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున అంటే తన ఆనందం, ఇష్టానికి అనుగుణంగా ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు అని పౌలు చెప్తూవున్నాడు. జగత్తుపునాది వేయబడక మునుపే తాను సృష్టించబోయే వాటి విషయములో, ఆ సృష్టిలో జరగబోయే వాటి విషయాలలో దేవునికి ఒక పక్క పర్ఫెక్ట్  ప్లాన్ ఉందనే విషయాన్ని కూడా ఈ వచనాలు తెలియజేస్తూవున్నాయి.

మనము క్రీస్తులో పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని దేవుడు మనలను ఎన్నుకొనియున్నాడని, మనం పరిశుద్దులము నిర్దోషులముగా ఉన్నందున దేవుడు మనలను ఇష్టపడి ఎన్నుకోలేదని మనలో పరిశుద్ధత నిర్దోషత్వము లేనప్పుడే ఆయన మనలను ఎన్నుకొనియున్నాడని, అదికూడా సృష్టి ఉనికిలోనికి రాకముందే, మనం పుట్టకముందే ఆయన మనలను ఎన్నుకొనియున్నాడని క్రీస్తులో మనలను నీతిమంతులుగా మార్చడానికి పాపులమైన మనలను ఆయన ఎన్నుకొనియున్నాడని, ఆత్మీయమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తుపై మరియు ఆయన రక్షణ యోగ్యతపై ఆధారపడి ఉన్నదని అంటే మానవులు తమ స్వంత ప్రయత్నాల ద్వారా పాపము నుండి విముక్తిని సంపాదించుకోలేరు కాబట్టే ఆయన మానవుల రక్షణను క్రీస్తుపై మరియు ఆయన రక్షణ యోగ్యతపై ఉంచాడని దేవుని ఉచితమైన కృప మాత్రమే, విముక్తిని రక్షణను క్రీస్తులో ప్రసాదించుచున్నదని, అది మరెక్కడా దొరకదని దేవుని కృపకు క్రీస్తు మాత్రమే మార్గమని ఈ వచనాలు తెలియజేస్తూవున్నాయి.

దేవుడు మనల్ని నిత్యత్వములో తనకోసము నిర్ణయించుకోవడాన్ని/ఏర్పరచుకోవడాన్ని తరచుగా ఎన్నిక చెయ్యబడటం అని దీనినే ముందుగా నిర్ణయించుకోవడం అని కూడా అంటారు. ఎన్నిక లేక ముందుగా నిర్ణయించడం అనే ఈ రెండు వేర్వేరు, సంబంధంలేని విషయాలు కాదు. నిజానికి, పౌలు ఈ రెండు వ్యక్తీకరణలను చక్కగా జతచేస్తూ 11వ వచనంలో దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను అని తెలియజేస్తూవున్నాడు. దీని వెనుకవున్న లక్ష్యం, “మానవులు రక్షింపబడాలనే” అంతే. ఆ క్రమములోనే, దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు యిచ్చియున్నాడని ఇందుకు మనం పూర్తిగా అనర్హులమని ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుని కృపకు స్వచ్ఛమైన బహుమతియని తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడని పరిశుద్దత్ముడు పౌలు ద్వారా ఈ వచనాలలో తెలియజేస్తూవున్నాడు.

2 థెస్సలొనీకయులకు 2:13,14 ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై యున్నాము. మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.

మనుష్యులు పాపములో పడి పాపమును సంక్రమించుకొనిన తరువాత “సత్యాన్ని తిరస్కరించడాన్ని ఎంచుకొనుట” అనే సామర్ధ్యము వారి లోనికి వచ్చి చేరుతుందని దేవునికి తెలుసు. సంక్రమింపబడిన పాపమును బట్టి మనుష్యులు తమ ఏకైక రక్షకునిగా క్రీస్తును విశ్వసించడాన్ని ఎన్నుకోలేరని కూడా దేవునికి ముందే తెలుసు. కాబట్టే రక్షణ మనుష్యుల బలహీనమైన చేతుల్లో కాకుండా దేవుని జ్ఞానం మరియు శక్తిపై ఆధారపడి ఉన్నదని ఈ వచనాలు తెలియజేస్తూవున్నాయి.

మానవహృదయంలో “విశ్వాసం కలుగజెయ్యడం” అనే అద్భుతం పరిశుద్దాత్ముని పని. అందుకనే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని 1కొరింథీయులు 12:3 చెప్తూవుంది. యేసును తమ ప్రభువుగా వారి రక్షకుడిగా నమ్మునట్లు పరిశుద్దాత్ముడు థెస్సలొనీకయులను విశ్వాసములోనికి తెచ్చుట ద్వారా వారిని పరిశుద్ధపరచియున్నాడు. అంటే థెస్సలొనీకయులు సువార్తను విన్నప్పుడు రక్షణకు ఏకైక మార్గంగా లోకాన్ని విమోచించిన యేసుని సందేశాన్ని నమ్మేటట్లు, అది నిజమని అంగీకరించేటట్లు పరిశుద్దత్ముడే వారిని నడిపించాడని అంటే సువార్త ద్వారా పరిశుద్దాత్ముడు వారిని విశ్వాసానికి పిలిచియున్నాడని అర్ధం.

మీరు క్రీస్తు సత్యాన్ని విశ్వసించి అబద్ధాన్ని తిరస్కరిస్తూ ఉన్నట్లయితే, ఇదంతా దేవుని పనని మీది కాదని గ్రహించండి. దీన్ని గ్రహిస్తే, బాధ్యతగా ఉంటాం. మనపట్ల దేవునికున్న ప్రేమనుబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించ బద్ధులమై ఉంటాం. కాబట్టే అపొస్తలుల కార్యములు 13:48 అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి అని చెప్తూవుంది.

రోమా 8:28-30 దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను.

[దేవుని] సంకల్పముచొప్పున పిలువబడిన వారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నాయి అనే మాటలు క్రీస్తును నమ్మినవారు తమ రక్షణకు సంబంధించిన ప్రతిదాన్ని దయగల దేవుడు చూసుకుంటారనే నిశ్చయతను కలిగి ఉండొచ్చు అని చెప్తూ నిత్యత్వము నుండి ఆయన వారి రక్షణ విషయములో Activeగా ఉన్నాడని తెలియజేస్తూ మనకు భరోసానిస్తూ ఉన్నాయి.

ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు వాగ్దానము చెయ్యబడిన స్వాస్థ్యము కొరకై  దేవుని బిడ్డగా ఖచ్చితంగా నిశ్చయతను కలిగి ఉండండి అని  పౌలు తెలియజేస్తూ, ఎందుకని నిశ్చయతను కలిగి ఉండాలో చెప్తూ, ఎఫెసీ 1: 3-7లో మీరు తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తనకోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తుపునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని తెలియజేస్తూవున్నాడు. ఎఫెసీ 2:8-10లో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసు నందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము అని తెలియజేస్తూవున్నాడు. ఇదే కృప అంటే. మన యోగ్యత ఏమి లేకుండగానే, ఆయన చిత్తములో ఆయన స్వచ్ఛమైన కృపలో నిత్యజీవమునకై ఆయనే మనల్ని ఎన్నుకొనియున్నాడు.

తనకుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు…మీరు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు అను మాటలు మనమందరం దేవుని కుటుంబములో ఒకభాగం కావాలన్నదే ఆయన ఉద్దేశ్యము అని తెలియజేస్తూవున్నాయి. ఆదియందు మనం దేవుని స్వరూపములో చెయ్యబడియున్నాము. కాని ఆదాము హవ్వలు పాపములో పడిన తరువాత ఆ స్వరూపము పాడు చెయ్యబడింది, ఆ స్వరూపాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. మనుష్యులు పాపములో పడి దేవుని స్వరూపాన్ని పోగొట్టుకొంటారని దేవునికి ముందే తెలుసు. కాబట్టే మనలను ఆయన కుమారునిలా ఆయనే తన కృపలో మార్చడంద్వారా మనం పోగొట్టుకొనిన స్వరూపాన్ని పునరుద్ధరించాలని ఆయన ముందుగా నిర్ణయించాడు, మనలను ఏర్పరచుకున్నాడు. క్రీస్తు స్వరూపమును మనమందరం ధరించుకొని క్రీస్తులా ఉండాలనేదే దేవుని ఉద్దేశ్యము. క్రీస్తుకు మాత్రమే చెందియున్న అనంతమైన ఆశీర్వాదాలను మనం కూడా పంచుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడని కూడా ఈ మాటలు తెలియజేస్తూవున్నాయి.   

ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. దేవుడు కొందరిని నిత్యత్వములో ముందుగా నిర్ణయించాడు, వారిని తన కుటుంబము లోనికి తీసుకొనివచ్చే క్రమములో, ఆయన భూమిపై వారి సమయములో వారిని కృప వాహనముల ద్వారా (వాక్యము సంస్కారముల ద్వారా) క్రీస్తుయొక్క నీతిని అంగీకరించుటకు తద్వారా దేవుని పిల్లలగుటకు పరలోక వారసులగుటకు ఆయనే వారిని పిలిచాడు.

ఆయన ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. కృప వాహనముల ద్వారా (వాక్యము సంస్కారముల ద్వారా) పరిశుద్దాత్ముడు పనిచేస్తూ, అందరికొరకు క్రీస్తు సంపాదించిన నీతిని విశ్వాసులు ఆబ్జెక్టివ్ జస్టిఫికేషన్ మరియు సబ్జెక్టివ్ జస్టిఫికేషన్ ను అంగీకరించేటట్లు వారిలో విశ్వాసమును సృజిస్తూవున్నాడు. అవిశ్వాసమునుండి దేవుని యందలి విశ్వాసమునకు తిప్పి మనకు పునర్జన్మనిఛ్చి మరణమునుండి జీవమునకు లేపుటకుగాను పరిశుద్దాత్ముడు మనలో జరిగించే పనిని విశ్వాసము యొక్క అద్భుతముగా బైబులు వర్ణిస్తూవుంది. దీనినే మారుమనస్సు, క్రొత్తగా జన్మించుట, పునర్జన్మ, జీవింపజేయుట అని కూడా అంటారు. దేవుడు క్రీస్తులో నిబంధనను పునరుద్ధరించి, దేవుడే ప్రజలందరిని నీతిమంతులని ప్రకటించడాన్ని ఆబ్జెక్టివ్ జస్టిఫికేషన్ అని అంటారు. సొంత సత్క్రియలయందు నమ్మిక ఉంచక క్రీస్తు నందున్న దేవుని కృప ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న నీతిని నమ్మడాన్ని సబ్జెక్టివ్ జస్టిఫికేషన్ అని అంటారు.

ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. విశ్వాసులు దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడి, ఆ దయగల దేవుని సంరక్షణలో సురక్షితముగా ఉన్నారు, దేవుని మహిమను పంచుకొంటూ ఉన్నారు. దాని పూర్తి సాక్షాత్కారం, తీర్పు రోజున బయలుపరచబడుతుంది. విశ్వాసికి పూర్తి మహిమ పరలోకములో మాత్రమే వస్తుంది. పౌలు ఇక్కడ మహిమపరచాడు అనే వెర్బ్ ను పాస్ట్టెన్స్ లో వాడుటలో అతని ఉదేశ్యము, క్రైస్తవుడి ఉనికి యొక్క మొత్తం గమనాన్ని అందులో దేవుడు అతనికి ఏవిధముగా సహాయపడియున్నాడో మనకు జ్ఞాపకం చెయ్యడమే. మన రక్షణకు అవసరమైన ప్రతిదాన్ని దేవుడు ఖచ్చితంగా చేసియున్నాడని పౌలు ఇక్కడ చెప్తూవున్నాడు.

మనం పరిశీలించిన లేఖనాల సారాంశమును మనం పరిశీలించినట్లయితే,

  1. జగత్తు పునాది వేయబడకమునుపే తాను సృష్టించబోయే వాటి విషయములో, ఆ సృష్టిలో జరగబోయే వాటి విషయాలలో దేవునికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉందనే విషయం మనకు అర్ధమయ్యింది.
  2. మనుష్యులు పాపములో పడి దేవుని స్వరూపాన్ని పోగొట్టుకొంటారని దేవునికి ముందే తెలుసు.
  3. కాబట్టే మనలను ఆయన కుమారునిలా ఆయనే తన కృపలో మార్చడం ద్వారా మనం పోగొట్టుకొనిన స్వరూపాన్ని పునరుద్ధరించాలని క్రీస్తు స్వరూపమును మనమందరం ధరించుకొని క్రీస్తులా ఉండాలని, క్రీస్తుకు మాత్రమే చెందియున్న అనంతమైన ఆశీర్వాదాలను మనం కూడా పంచుకోవాలని,
  4. ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను జగత్తు పునాది వేయబడక మునుపే అంటే సృష్టి సృజింపబడక ముందే, అంటే నిత్యత్వములో కాలము ఉనికి లోనికి రాకముందే, మనల్ని తన కుటుంబ సభ్యులుగా తన కుమారులు కుమార్తెలుగా తన ఇంటిలోకి తీసుకు రావాలని తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున, అంటే తన ఆనందం మరియు ఇష్టానికి అనుగుణంగా ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు.
  5. మనం పరిశుద్దులము నిర్దోషులముగా ఉన్నందున దేవుడు మనలను ఇష్టపడి ఎన్నుకోలేదని మనలో పరిశుద్ధత నిర్దోషత్వము లేనప్పుడే క్రీస్తులో మనలను నీతిమంతులుగా మార్చడానికి ఆయన మనలను ఎన్నుకొనియున్నాడని,
  6. ఆత్మీయమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తుపై మరియు ఆయన రక్షణ యోగ్యతపై ఆధారపడి ఉందని అంటే మానవులు తమ స్వంత ప్రయత్నాల ద్వారా పాపమునుండి విముక్తిని సంపాదించుకోలేరు కాబట్టే ఆయన మానవుల రక్షణను క్రీస్తుపై మరియు ఆయన రక్షణ యోగ్యతపై ఉంచాడని,
  7. దేవుని ఉచితమైన కృప మాత్రమే, విముక్తిని రక్షణను క్రీస్తులో ప్రసాదించుచున్నదని, అది మరెక్కడా దొరకదని దేవుని కృపకు క్రీస్తు మాత్రమే మార్గమని,
  8. దేవుడు ఆ క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు యిచ్చియున్నాడని ఇందుకు మనం పూర్తిగా అనర్హులమని,
  9. ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుని కృపకు స్వచ్ఛమైన బహుమతియని తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడని,
  10. ఆ రక్షణ మనుష్యుల బలహీనమైన చేతుల్లో కాకుండా దేవుడు తన జ్ఞానం మరియు శక్తిపై ఆధారపడి ఉండేటట్లు తన చేతులలోకి తీసుకొనియున్నాడని,
  11. ఎందుకంటే మనుష్యులు పాపములో పడి పాపమును సంక్రమించుకొనిన తరువాత, “సత్యాన్ని తిరస్కరించడాన్ని ఎంచుకొనుట” అనే సామర్ధ్యము వారిలోనికి వచ్చి చేరుతుందని సంక్రమింపబడిన ఆ పాపమునుబట్టి మనుష్యులు తమ ఏకైక రక్షకునిగా క్రీస్తును విశ్వసించడాన్ని ఎన్నుకోలేరు కాబట్టి మానవ హృదయంలో “విశ్వాసం కలుగజెయ్యడం” అనే అద్భుతాన్ని, మనుష్యుల బలహీనమైన చేతుల్లో కాకుండా దేవుని జ్ఞానం మరియు శక్తిపై ఉంచాడు.
  12. అంటే యేసును తమ ప్రభువుగా, రక్షకుడిగా, నమ్మునట్లు దేవుడే తాను ఎన్నుకొనిన వారిని విశ్వాసము లోనికి తెచ్చుట ద్వారా అంటే వారిని విశ్వాసానికి పిలిచి వారిని పరిశుద్ధపరచి తద్వారా మనమందరం దేవుని కుటుంబములో భాగమయ్యేలా చేసియున్నాడు.
  13. ఆ క్రమములో మన రక్షణకు అవసరమైన ప్రతిదాన్ని దేవుడు ఖచ్చితంగా చేసాడు.
  14. మన యోగ్యత ఏమి లేకుండగానే, ఆయన చిత్తములో, దేవుని స్వచ్ఛమైన కృపలో నిత్యజీవమునకై మనల్ని ఎన్నుకొనియున్నాడు. కృపలో ఏర్పరచబడటం అంటే ఇది.

2తిమోతి 1:9-10 మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసు నందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తుయేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడినదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అని తెలియజేస్తూ ఉన్నాయి.

విశ్వాసములోనికి తేబడియున్నవారందరు నిత్యత్వము నుండే దేవుని ద్వారా అనుగ్రహింపబడియున్న విశ్వాసమును నీతిమత్వమును పరిశుద్ధతను కలిగియున్నారు, మరియు విశ్వాసములో భద్రపరచబడియున్నారు. దేవుని కృప ద్వారా మాత్రమే, క్రీస్తుని బట్టి, కృప వాహనముల ద్వారా అంటే వాక్యము సంస్కారముల ద్వారా అవిశ్వాసపు లోకమునుండి పరిశుద్దునిగా ఉండుటకు ఆయనే మనల్ని పిలిచాడు. ఎందుకంటే మన స్వంత ఆలోచనవలననైనను మన స్వంత నిర్ణయము వలననైనను మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నమ్మిక ఉంచలేము మరియు ఆయన యొద్దకు చేరనేలేము కాబట్టే యేసునందు విశ్వాసముంచుటకు పరిశుద్దత్ముడే మనలను పిలిచి తన చెంత చేర్చి వెలిగించి పరిశుద్ధపరచి నిజమైన ఏక విశ్వాసము నందు యేసుక్రీస్తుతో మనలను ఉంచుతూ ఉన్నాడు. క్రీస్తుని బట్టి నీతిమంతులుగా ప్రకటింపబడియున్నాము, పరిశుద్ధ పరచబడియున్నాము.

మత్తయి 24:22-24 ఈ వచనాలలో ఎన్నుకొనబడిన వారికొక హెచ్చరిక ఉంది. దేవుని ప్రజల నాశనం కోసం దుర్మార్గులు ఉద్దేశించిన ప్లాన్లో భాగముగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్తే నమ్మకండి. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచకక్రియలను మహత్కార్యములను కనబరచెదరు, కాబట్టి ఇతరుల నమ్మకమైన ప్రవర్తనతో మోసపోకండి, మీరు దేవునిచేత ఏర్పరచబడి ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అని ఈ వచనము తెలియజేస్తూవుంది.

ఈ ఆర్టికల్ ని ఆలకించిన మీ అందరికి ఒక ప్రశ్న వచ్చే ఉంటుంది. దేవుడు కొందరిని నిత్యత్వములోనే నిర్ణయించుకొని ఏర్పరచుకొని ఉంటే మిగతా వాళ్ళు ఉగ్రతకై ఏర్పరచబడ్డారా లేదా నరకానికి నిర్ణయింపబడియున్నారా అని? దేవుడు, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు అని 1తిమోతి 2:4 చెప్తూవుంది. అలాగే యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, అందరి యెడల దేవుడు దీర్ఘశాంతముగల వాడైయున్నాడు అను 2 పేతురు 3:9 వచనము మాటేమిటి? అని మీరు అనుకోవొచ్చు. ఈ ప్రశ్నకు జవాబును ఈ వచనాలు ఏమి చెపుతున్నాయో 2వ భాగములో తెలుసుకొందాం.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.