
తీతుకు 1వ అధ్యాయము వ్యాఖ్యానము
ప్రథమ భాగము
ప్రారంభ శుభాకాంక్షలు (1:1–4)
1దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తమును, 2-4నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతోకూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటనవలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను. తండ్రియైన దేవునినుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.
సహజంగానే పౌలు ఈ లేఖను తీతు కోసం మాత్రమే వ్రాయలేదు, అతడు చదవడానికి మరియు అందరికొరకు భద్రము చేయడానికి వ్రాసియున్నాడు. ఇది తీతు కోసమే అయితే, తన గురించి తన పరిచర్య గురించి ఇంత సుదీర్ఘమైన సంభాషణ అవసరం లేదు. అట్లే, పౌలు కొద్దికాలం మాత్రమే ఉన్న క్రేతులో తీతు సేవ చేస్తున్న ప్రజలకు, అతడు “దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడును” అని గుర్తుచేస్తూ వ్రాయడం విశేషం.
ఇక్కడ పౌలు తనను “దేవుని దాసుడును” అని పరిచయము చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. ఎందుకంటే ఇక్కడ మాత్రమే పౌలు తనను తాను దేవుని దాసునిగా పిలుచుకుంటున్నాడు, ఇతర పత్రికల్లో అతడు తనను తాను యేసుక్రీస్తు దాసునిగా పిలుచుకొనియున్నాడు (రోమా 1:1; గలతీయులకు 1:10; ఫిలిప్పీయులకు 1:1). దాసుడు అనే మాట బానిసత్వం, మరణం నుండి రక్షింపబడియుండటాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ చిత్రాన్ని వర్తింపజేసుకొంటే, దాసుడు అనే మాట దేవుని రక్షణ కృపకు కూడా వర్తిస్తుంది. “దేవుని దాసుడు”అంటే తాను పూర్తిగా తన యజమానియైన దేవునికి చెందినవాడనని వెనుకకు వెళ్ళే స్వేచ్ఛ లేనివాడనని మరియు తన యజమానియైన దేవునికి సేవ చేయడానికి ఆయన ఇష్టపూర్వకంగా ఎంచుకున్నవాడనని మరియు ఆ దేవుని నుండి తప్ప మరెవ్వరి నుండి ఆజ్ఞలు తీసుకోనివాడనని, ఈ మాట ద్వారా పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు పౌలు జీవితాన్ని రక్షించాడు మరియు అతని ప్రయత్నాలను నిర్ధేశించాడు. పౌలు చిత్తము దేవుని చిత్తానికి లోబడి ఉంది. దేవుడు ఏమైతే భోదించమని చెప్పాడో, వ్రాయమని చెప్పాడో పౌలు వాటినే బోధించాడు మరియు వ్రాసాడు. ఆయన నిర్ధేశించిన చోటెల్లా అతడు పరిచర్యను చేసాడు. పౌలు పత్రికలను చదివేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవడం చాలా, చాలా ముఖ్యం.
అదనంగా, యేసు పౌలును తన ప్రతినిధిగా మరియు తన సంఘానికి బహుమతిగా ఎంపిక చేసి ప్రత్యేక పని నిమిత్తమై నియమించాడు, అపొ. కార్య. 9:15, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచు కొనిన సాధనమై యున్నాడు; ఎఫెసీయులకు 4:13, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను. కాబట్టే పౌలు తనను తాను “యేసుక్రీస్తు అపొస్తలుడనని” పిలుచుకున్నాడు. సంఘానికి శిరస్సైన యేసు, తన పన్నెండు మంది శిష్యులను పంపినట్లుగా పౌలును కూడా ఆయన అపొస్తలునిగా నియమించాడు.
దేవుడు ఏర్పరచుకొనిన వారి/ ఎన్నుకున్న వారి విశ్వాసాన్ని స్థిరపరచడం కోసం, వారు దైవ భక్తికి అనుగుణమైన సత్యం గురించిన ఎరుకలో నిలకడగా ఉండేలా పౌలు నియమింపబడ్డాడు. ప్రజలను క్రీస్తు విశ్వాసములోకి నడిపించి, వారిని ప్రోత్సహిస్తూ, దేవుని సత్యం ద్వారా వారి విశ్వాసాన్ని మరింత బలపర్చడమే పౌలు పరిచర్యలో కీలకమైన అంశాలు. దేవుడు ఏర్పరచుకున్న వారికి విశ్వాసాన్ని ప్రకటించడానికి, దైవిక జీవితాలను ఎలా జీవించాలో వారికి చూపించే సత్యాన్ని నేర్పడానికి సహాయపడే విషయములో అతడు పంపబడ్డాడు.
పౌలు పత్రికల్లో విశ్వాసం అనే మాట సాధారణంగా యేసుక్రీస్తులో నమ్మకాన్ని సూచిస్తూ ఉంది. అయితే, ఇక్కడ మాత్రం ఈ పదం సత్యమైన బోధను సూచిస్తూ ఉంది. దైవ భక్తికి అనుగుణముగా అంటే దైవ భక్తికి అనుగుణమైన యోగ్యమైన జీవన విధానమని అర్ధం. పౌలు పత్రికల్లో మరి దేనిలోనూ ఈ పదం మనకు కనిపించదు. పౌలు ప్రకటించిన సత్యం “దైవ భక్తికి అనుగుణమైన సత్యం“- ఇది యేసుక్రీస్తు పట్ల నిజమైన భక్తిని, పవిత్రమైన జీవితాన్ని కలుగజేస్తుంది. క్రీస్తుపై విశ్వాసం మరియు దేవుని సత్యాన్ని గూర్చిన జ్ఞానం భక్తికి ఆధారమగు దైవిక జీవనంలో యోగ్యమైన జీవితాన్ని జీవించేలా చేస్తుంది.
మరి క్రీస్తులో దేవుని కృపా సత్యములను గూర్చిన ఈ సందేశాన్ని, సత్యమైన బోధను గూర్చిన సందేశాన్ని ప్రజలు వినక పోతే వారు ప్రభువును ఎలా విశ్వసించగలరు? ఎవరైనా వారికి బోధించకుండా వారు క్రీస్తుని గురించి ఎలా ప్రోత్సహింపబడగలరు? బోధింపబడకుండా దేవుని సత్యం ద్వారా వారి విశ్వాసాన్ని వాళ్ళు ఎలా బలపర్చుకోగలరు? బోధించేవారు పంపబడకపోతే పంపబడిన వారు ఎలా బోధించగలరు? సువార్తను పంచు కోవాలనే సాధారణ నిర్దేశాన్ని దేవుడు క్రైస్తవులందరికి ఇవ్వడమే కాకుండా, ఆయన ప్రత్యేకంగా బహిరంగ పరిచర్యను కూడా స్థాపించాడు, “మత్తయి 28:19,20 కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి” అని ఆయన అపొస్తలులను వారి సహోద్యోగులను పంపాడు. నేటికీ క్రీస్తులో దేవుని ప్రేమ సందేశాన్ని బోధించడానికి ఆయన తాను పిలుచుకొనిన వారిని పంపుతూనే ఉన్నాడు. ఆ సందేశము ప్రకటింపబడుతూనే ఉంది, ఆలకించబడుతూనే ఉంది. ఆలకించబడిన వాక్యం ప్రజలకు, విశ్వాసులకు ప్రభువు నామాన్ని పిలిచేలా చేసే విశ్వాసాన్ని వారికిస్తూనే ఉంది. ఆ విశ్వాసములో వారిని స్థిరపడేలా చేస్తూనే ఉంది. దైవ భక్తికి అనుగుణముగా దైవిక జీవితాలను ఎలా జీవించాలో వారికి నేర్పిస్తూ వారి దైవిక జీవనంలో యోగ్యమైన జీవితాన్ని జీవించేలా చేస్తూనే ఉంది. కాబట్టే విశ్వాసుల హృదయాలలో జీవితాలలో దాని జీవమిచ్చే శక్తి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది దేవుని పట్ల భక్తిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. “విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును”, యాకోబు 2:17.
అట్లే దైవభక్తి అనేది క్రియ ద్వారా చూపించే విశ్వాసం. దేవుని న్యాయస్థానంలో ఒకడు క్షమింపబడేందుకు, నిర్దోషి అని దేవుని చేత ప్రకటింపబడేందుకు వాని సత్క్రియలు, అందుకోసమైన వాని స్వంత ప్రయత్నాలు విలువలేనివి. యేసుక్రీస్తు యొక్క నీతివంతమైన జీవితం, మరణం మరియు పునరుత్థానం మాత్రమే అది చేయగలదు. ఒకడు రక్షకునిపై విశ్వాసానికి వచ్చినప్పుడు, వాడు నీతిమంతునిగా ప్రకటింపబడతాడు, వాడు మరలా జన్మిస్తాడు, వాని పట్ల దేవుని కున్న చిత్తాన్ని వాడు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు. దేవుని చిత్తాన్ని కోరుకోవడానికి ఆత్మ వానికి సహాయం చేస్తూ, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తిని వానికి ఇస్తుంది. నిజమైన విశ్వాసం అనివార్యంగా సత్క్రియలను ఇస్తుంది. సత్క్రియలు లేనట్లయితే, క్లెయిమ్ చేయబడిన విశ్వాసం మోసపూరితంగా ఉండాలి. అందుకనే పౌలు, “వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనియైయున్నాము” అని ఎఫెసీయులకు 2:10 లో తెలియజేసి యున్నాడు.
అట్లే క్రైస్తవుల యొక్క మొత్తం విశ్వాసం మరియు భక్తి జీవితం, నిరీక్షణపై నిర్మించబడ్డాయి, ప్రత్యేకముగా, “శాశ్వత జీవం గురించిన నిశ్చయత పై” నిర్మించబడ్డాయి. అవిశ్వాసి యొక్క ఆశలు ఈ జీవితకాలము మట్టుకు మాత్రమే సంబంధించినవిగా ఉంటాయి. అతడు సులభమైన జీవితం, సంపద, గౌరవం, సంతోషకరమైన వృధ్యాపం మరియు ముగింపు, మొదలైన వాటి కోసం ఆశిస్తాడు. అయితే “ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము“, అని 1 కొరింథీయులకు 15:19 చెప్తూ ఉంది. పాపపు లోకంలో సుదీర్ఘమైన మరియు మెరుగైన జీవితం కోసం క్రీస్తు మనలను విమోచించలేదు. ఇక్కడ ఇప్పుడు మనం అనుభవించే దానికంటే జీవితంలో ఇంకా చాలా ఉంది: అక్కడ క్రైస్తవుని నిరీక్షణయైన శాశ్వత జీవముంది.
శాశ్వత జీవమును గురించి ఇశ్రాయేలీయుల అభిప్రాయములు: తాము తమ వారసుల ద్వారా ఎప్పటికి జీవించి ఉంటామని ప్రాచీన కాలములో ఇశ్రాయేలీయులు నమ్మెడివారు. వారి దృష్టిలో వంశాన్ని కొనసాగించడానికి కుమారులు లేకపోవడం శాపం. మనుష్యులు చనిపోయి మట్టిలో కలిసిపోతారని కొందరు భావించేవారు (ప్రసంగి 12:7; కీర్తన 104:29; యోబు 7:9,10). అయితే మృతుల ఆత్మలు ఏ అనుభూతులు లేని ఒక స్థలానికి చేరుకొంటాయని మరికొందరు నమ్మేవాళ్ళు (ప్రసంగి 9:10; యెషయా 30:10). కొందరు మరణించకుండానే దేవునితో ఉండటానికి కొనిపోబడ్డారని కూడా బైబులు ప్రస్తావిస్తూ ఉంది (ఆదికాండము 5:21-24; 2 రాజులు 2:1-14). అలాగే మంచివారైనా చెడ్డవారైనా సరే మృతులందరూ తిరిగి లేస్తారని మంచివారు శాశ్వత జీవానికి చెడ్డవారు నిత్య శిక్షను అనుభవిస్తారని దానియేలు గ్రంథం తెలియజేస్తూ ఉంది (దానియేలు 12:1-3). తనను విశ్వసించే వారిని దేవుడు పాతాళానికి పంపడని, వారికి ఆయన శాశ్వత జీవాన్నిస్తాడనే నమ్మకం కొన్ని కీర్తనలలో వ్యక్తమవుతూ ఉంది (కీర్తన 16:10,11; 49:13-15; యెషయా 26:19). క్రీ.పూ. 586లో ఇశ్రాయేలీయులు బబులోనుకు బందీలుగా వెళ్లారు. తర్వాత క్రీ.పూ. 538లో పారసీకరాజు బబులోనును జయించి ఇశ్రాయేలీయులు స్వదేశానికి తిరిగి వెళ్లే వీలు కల్పించాడు. సాతాను (దేవుని శత్రువు) ఓడిపోతాడని మృతులు తిరిగి జీవిస్తారని పారశీకులు నమ్మేవాళ్ళు. ఈ నమ్మకం యూదులను సైతం ప్రభావితం చేసింది. క్రీస్తు పుట్టుకకు నాలుగు వందల సంవత్సరాల పూర్వం వర్ధిల్లిన గ్రీకు తత్వం కూడా యూదులను బాగా ప్రభావితం చేసింది. గ్రీకు తత్వం దేహం అశాశ్వతమని అది క్షయమై పోతుందని అయితే దృగ్గోచరం కాని ఆత్మ నిరంతరం ఉంటుందని భోదించేది.
యేసు కాలములో యూదుల్లోని సద్దూకయ్యులు పునరుత్థానము గురించి యేసుని ప్రశ్నించారు (లూకా 20:27). బదులుగా పునరుత్థానులైన దేవుని ప్రజలు పరలోకములో దేవదూతల్లా ఉంటారని యేసు వారికి చెప్పాడు (మార్కు 12:18-27). దేవుని రాజ్యములో ఎవరు ఉంటారని కూడా వారు యేసుని ప్రశ్నించారు. యేసు ఇచ్చిన జవాబును లూకా 14:15-24లో చూడండి. దేవుడు యేసును మృతులలో నుంచి తిరిగి లేపాడు గనుక దేవుని ప్రజలు కూడా తిరిగి లేస్తారని ఆదిమ క్రైస్తవుల విశ్వాసం (అపొ.కార్య. 2:22-24,29-32, 1 కొరింథీ 15:20-28; 1 థెస్సలొనీ 4:13-17). నూతన యెరూషలేం దేవుని నివాసమని అక్కడ ఆయన తన ప్రజల మధ్య ఉంటాడని ఆయన వారిని నిత్యం కాపాడి పోషిస్తాడని ప్రకటన 21 అధ్యాయములో ఉంది. యెహెఙ్కేలు 37:26,27; మత్తయి 1:23; 2 కొరింథీ 4:16-5:5 కూడా చూడండి. క్రీస్తు అనుచరుల భౌతిక దేహాలు క్షయమై పోతాయని, దేవుడు వారిని లేపినపుడు వారి దేహాలు ఆత్మ సంబంధమైన దేహాలుగా మారతాయని అపొస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు (1 కొరింథీయులకు 15:35-54). శరీరము నశించిన తర్వాత ఆత్మ మాత్రమే సజీవంగా ఉంటుందనే భావనకు ఇది భిన్నమైంది. ఆత్మ శరీరము రెండూ నూతనమై పునరుజ్జీవం పొందడమే నిత్య జీవమని పౌలు భావన. ఆ ఉద్దేశ్యములోనే పునరుత్థానమును జీవమును నేనే అని యేసు కూడా అన్నాడు (యోహాను 11:25,26). తనను నమ్మిన వారికి తాను శాశ్వత జీవాన్ని ఇస్తానని యేసు వాగ్దానం చేశాడు (యోహాను 3:16).
ఈ నిరీక్షణ ఒక కల కాదు, కొలొస్సయులకు 1:5, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధవలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. అది శాశ్వత జీవ నిరీక్షణపై ఆధారపడి ఉంది, యోహాను 3:15, విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా శాశ్వత జీవము పొందునట్లు, దీనిని “అబద్ధమాడనేరని దేవుడు” అనాదికాలమునకు ముందే వాగ్దానం చేసి, తన నిర్ణీత సమయంలో సువార్త ద్వారా వెల్లడించాడు. ఈ అబద్ధమాడని దేవుడు క్రేతీయులకు (12), అపవాదికి (యోహాను 8:34) భిన్నంగా అబద్ధమాడడు, యథార్థుడు, కీర్తనలు 33:4. ఆయన సత్యానికి కర్త మరియు అంతిమ న్యాయనిర్ణేత, పూర్తిగా నమ్మదగినవాడు. ఈ దేవుని మాట తప్పు కాదు. ఈ దేవుని వాగ్దానాలు నిజమైనవి, నిశ్చయమైనవి మరియు ఖచ్చితమైనవి. కాలక్రమేణా, అవి రద్దు చేయబడవు కాని నెరవేరుతాయి. రక్షకునిగా తన ప్రియమైన కుమారుని ద్వారా తాను ఎన్నుకున్న వారిని ఆశీర్వదించబడిన నిత్యత్వానికి తీసుకురావాలని ఈ దేవుడు తన హృదయంలో నిశ్చయించుకున్నప్పుడే, “అనాదికాలమందే” కాలానికి ముందే వాటిని వాగ్దానము చేసాడు. మన రక్షణ కోసమైన దేవుని ప్రణాళిక చరిత్ర ప్రారంభం కంటే ముందే ఉంది, ఎఫెసీయులకు 1:4 మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ లోక కాలములకు ముందు, భూమి పునాదులు వేయబడక ముందు, నిత్యత్వములో, ఆయన క్రీస్తు యేసులో ఇచ్చిన కృప ఆధారంగా, అంటే తన స్వంత వారికి నిత్యజీవము ఇవ్వడానికి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ నిత్యజీవాన్ని ఒక బహుమతిగా ఏర్పాటు చేశాడు, తరువాత అది ప్రకటించబడింది ఆయన నిర్ణయించిన సమయంలో, ఆయన నిర్ణయించిన సంపూర్ణ కాలంలో.
దేవుడు అన్ని కాలాలకు మరియు చరిత్రకు ప్రభువు, కాబట్టి ఆయన తనను తాను మరియు యేసుక్రీస్తులో తన వాగ్దాన రక్షణ ప్రణాళికను సరైన సమయంలో వెల్లడించాడు, (మార్కు 1:15, కాలము సంపూర్ణమైయున్నది, దేవుని రాజ్యము సమీపించి యున్నది, మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను; గలతీయులు 4:4, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను). వ్యక్తిగత స్థాయిలో, మన రక్షణ అవసరాన్ని తీర్చడానికి సరైన సమయంలో ఆయన తనను మరియు తన వాగ్దానాన్ని మనలో ప్రతి ఒక్కరికీ పరిచయం చేస్తాడు. దేవుని ప్రోగ్రాంలో కీలకమైన సంఘటనలు చరిత్రలో ఆయన సమయాల్లోనే జరుగుతాయి. తన వాగ్దానాలను నెరవేర్చడంలో, దేవుడు తన స్వంత సమయ షెడ్యూల్ను ఉపయోగిస్తాడు (1 తిమోతి 2:6, ఈయన అందరి కోసం విమోచన వెలగా తనను తానే సమర్పించుకున్నాడు. సరైన సమయంలో దేవుడు దీన్ని ధృవీకరించాడు. 1 తిమోతి 6:15, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు).
“అయితే సరైన సమయం వచ్చినపుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు“, గలతీయులకు 4:4; యోహాను 7:30. తన కుమారుని సందేశం ఎవరి ద్వారా బోధించబడాలో కూడా దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టే “సరైన సమయంలో (తన నిర్ణీత కాలంలో) ఆయన ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకారము నాకు అప్పగించిన సందేశం ద్వారా ఆయన తన వాక్యమును వెల్లడి చేశాడు“, అని పౌలు చెప్తూ ఉన్నాడు (ఎఫెసీయులకు 3:2-11, 1 తిమోతికి 1:12-13; గలతీయులకు 1:11-12).
మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకారము, పౌలును తన అపొస్తలుడిగా ఎంచుకున్న దేవుడు, తద్వారా ఈ జీవాన్ని ఇచ్చే సందేశాన్ని ప్రకటించే బాధ్యతను అతనికి అప్పగించాడు. ఇది అతని స్వంత ఎంపిక కాదు, కానీ ఇప్పుడు అది అతనికి ఇవ్వబడినందున, రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం అతడు తన పదవిని కలిగి యున్నాడని అతను చాలా గట్టిగా నొక్కి చెప్తూ ఉన్నాడు. అతడు ఆ దేవుని దైవిక ఆజ్ఞ క్రింద పనిచేస్తూ ఆ దేవుని నిర్దేశానికి విధేయత చూపిస్తూ క్రీస్తును గురించిన అధికారిక సందేశాన్ని బోధించాడు, గలతీయులకు 1:1-12; 1 కొరింథీయులకు 1:1; రోమా 1:1-4. అపొస్తలుడైన పౌలు కంటే ఎవ్వరూ దేవుని వాక్యాన్ని విస్తృతంగా మరియు స్పష్టంగా బోధించలేదు. క్రేతు ప్రజలు పౌలు వారి మధ్య ఏమి బోధించాడో, విశ్వాస విషయములో అతని నిజమైన కుమారుడైన తీతు ఏమి బోధిస్తున్నాడో మరియు వారు ఈ లేఖలో చదివినది నిజంగా దేవుని వాక్యమని, క్రీస్తులో దేవుని వాగ్దానాలు మరియు నెరవేర్పు యొక్క ప్రత్యక్షత అని, దేవుని సాధికార దూత ద్వారా ప్రకటించబడుతూ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవల్సి యున్నారు.
పౌలుకు దేవుడు ఆజ్ఞాపించిన బోధలను మనం ఇప్పటికీ ఇష్టపడతాము. వాటి ద్వారా దేవుడు తన వాక్యమైన క్రీస్తు సువార్తను వెలుగులోకి తెస్తూనే ఉన్నాడు. దేవుడు ఆ విధంగా ప్లాన్ చేశాడు. ఈ ప్రేరేపిత అపొస్తలుడి బోధల ద్వారా దేవుడు అనుమతించిన ప్రత్యక్షత ఫలితం బైబులు మొత్తం స్పష్టమవుతూ ఉంది. అపొస్తలుడైన పౌలు యొక్క వ్రాతలను అధ్యయనం చేయని వ్యక్తి, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారా, కృప ద్వారా రక్షణ అనే లేఖనాలలో ఉన్న స్పష్టమైన ప్రత్యక్షతను ఉపయోగించుకోకుండా తనను తాను వంచించుకొంటున్నాడు.
తనకు దైవికంగా ఇవ్వబడిన ఆదేశాన్ని స్థాపించే దీర్ఘ సంభాషణ తర్వాత, పౌలు ఈ లేఖ గ్రహీత అయిన తీతును ఉద్దేశించి ప్రసంగించాడు. తిమోతిలాగే, పౌలు కన్వర్ట్ చేసిన వారిలో తీతు కూడా ఒకడు. యూదు తల్లిని కలిగి ఉన్న తిమోతికి భిన్నంగా, తీతు అన్యజనుడు. పౌలు అన్యుడైన తీతును క్రీస్తుపై విశ్వాసం వైపు నడిపించి ఉండొచ్చు, ఫలితంగా అతనికి ఆధ్యాత్మిక తండ్రి అయ్యాడు.”విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు” అను మాటలు అతడు తిమోతిని సంబోధించిన విధానాన్ని మనకు గుర్తుచేస్తూ ఉన్నాయి, (1 తిమోతి 1:2). అదే సమయంలో పౌలు మాటలు తీతుకు, అతడు తన ఆధ్యాత్మిక తండ్రియైన పౌలు మనస్సును మరియు ఆత్మను కలిగి యున్నాడని సూచిస్తూ ఉన్నాయి. పౌలు సహచరులలో మరియు పరిచర్యలో సహకరించిన వారిలో తీతు కూడా ఒకడు. పౌలు తీతుకు ముఖ్యమైన పనులను అప్పగించాడని తెలుస్తోంది.
తీతు అన్యుడు పౌలు యూదుడు (పాత నిబంధనలో భాగమై ఉన్నవాడు). ఇరువురి మధ్యన ఈ లోకరీతిగా సంబంధమే లేదు. దీనికి విరుద్ధంగా, సువార్తలో వెల్లడైనట్లుగా, రక్షకుడైన క్రీస్తు అనే లక్ష్యంతో ఉన్న విశ్వాసం అనెడి బంధము ద్వారా వారు ఒకటిగా ఉన్నారు. కాబట్టే పౌలు తన అపోస్టోలిక్ ఆశీర్వాదాన్ని పలుకుతూ, తండ్రియైన దేవుని నుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక అని జోడించాడు. దేవుని కృప కనికరము అనెడి ఐశ్వర్యములలో, విశ్వాసులకు చెందిన సమాధానములో, క్రీస్తు ద్వారా ఏర్పడిన సయోధ్యలో, తద్వారా రక్షణ యొక్క సంపూర్ణతలో అతడును భాగస్వామి కావాలని, దేవుడు మాత్రమే ఇవ్వగల కృప సమాధానము తీతుకు కలగాలని పౌలు కోరుకుంటున్నాడు. అతడు క్రీస్తు యేసును మన ప్రభువుగా సూచిస్తూ, ఇక్కడ ఆయనను “మన రక్షకుడు” అని పిలుస్తున్నాడు. మునుపటి వచనంలో (3లో) అతడు దేవుణ్ణి “మన రక్షకుడు” అని పేర్కొన్నాడు. అవును, మొత్తం త్రిత్వమే “మన రక్షకుడు.” దేవుడు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నిజంగానే ఉన్నారని వారిని “మన రక్షకుడు” అని పిలవవచ్చని తెలుసుకోవడం ఎంతో ఓదార్పునిస్తుంది!
1-4 వచనాల సంక్షిప్త సారాంశము, పౌలు తీతుకు మరియు క్రేతులోని సంఘాలకు లేఖను వ్రాస్తూ తన అధికారాన్ని నొక్కి చెప్పే శుభాకాంక్షలతో ప్రారంభించి దేవుని రక్షణ ప్రణాళికను తిరిగి పునశ్చరణ చేస్తూ తీతుతో తనకున్న వ్యక్తిగత బంధాన్ని గుర్తు చేసుకొంటూ ఉన్నాడు. అతని శుభాకాంక్షలలో ఎక్కువ భాగం సువార్త చుట్టూ తిరుగుతున్నాయి ఎందుకంటే సువార్త పౌలు జీవితంలో చాలా ముఖ్యమైనది, అతడు దానిని ప్రస్తావించకుండా మాట్లాడలేడు (లేదా వ్రాయలేడు). దేవుడు మనలను పాపం మరియు శిక్ష నుండి రక్షించాడు మరియు మనలను తన రాజ్యానికి తగినవారిగా చేసాడు. అటువంటి ప్రేమ, కృప మరియు దాతృత్వానికి ఏకైక తార్కిక ప్రతిస్పందన, పౌలు వలె, స్తుతులతో నిండిపోయి ఈ ఆనందకరమైన వార్తను ఇతరులతో పంచుకోవడం.
ప్రార్ధన: దేవా, నా రక్షకుడైన క్రీస్తుయేసునందు నాకు కృపను, సమాధానమును ఇచ్చినందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను! పరిశుద్ధుల సహవాసంలో నన్ను నిజాయితీగల నమ్మకమైన బిడ్డగా చేయుము. ఆమెన్.
రెండవ భాగం
క్రేతులో తీతు అసైన్మెంట్ (1:5–16)
5నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.
మొదటి పెంతెకొస్తులో (అపొ. కార్య. 2:11) యెరూషలేములో ఉన్నవారిలో క్రేతీయులు ఇప్పటికే ప్రస్తావించబడ్డారు. ఖైదీ అయిన పౌలును రోమ్కు తీసుకెళ్లిన ఓడ గ్రీస్కు దక్షిణంగా మధ్యధరా సముద్రంలో ఉన్న క్రేతు ద్వీపంలో కొంతకాలం ఆగింది (అపొ. కార్య. 27:7,8). క్రేతులోని మంచిరేవులులో పౌలు ప్రయాణిస్తున్న ఓడ అక్టోబరు మొదటి వారం, క్రీ.శ 61 చివరిలో ఆగింది. ఇక్కడ ఓడ గాలి మారడం కోసం వాళ్ళు మూడు వారాల పాటు వేచి ఉండి ఉండొచ్చు. మంచిరేవులు (లేదా కలోయి లిమెనెస్) అనేది క్రేతు యొక్క దక్షిణ తీరంలో ఉన్న ఒక చిన్న గ్రామం, బే మరియు ద్వీపాల సమూహం. క్రీ.శ 62 మొదటి రోమన్ చెర నుండి విడుదలైన తర్వాత, పౌలు ఎఫెసుకు వెళ్లే మార్గంలో అక్కడ ఆగి తీతుతో కలిసి కొంత మిషన్ వర్క్ చేసినట్లుగా కనిపిస్తుంది. పౌలు తీతు మిషనరీలుగా క్రేతును సందర్శించి ఉండొచ్చు. ఈ 4వ మిషనరీ ప్రయాణం గురించి అపొస్తలుల కార్యములలో ప్రస్తావించబడలేదు, కాని రోమా 15:24,28 పౌలుకు అదనపు మిషన్ పని ఉందని సూచిస్తుంది. అపొస్తలుల కార్యముల ముగింపులో గృహ నిర్బంధం నుండి విడుదలైన తర్వాత పౌలు తాను కోరుకున్న చోటికి ప్రయాణించే స్వేచ్ఛను కలిగి ఉన్నాడు, తీతు 3:12. ఆ టైములో పౌలు తీతులు క్రేతును సందర్శించి ఉండొచ్చు. పౌలు ఎఫెసుకు, ఫిలిప్పీకు వెళ్ళడానికి క్రేతు నుండి బయలుదేరే సమయానికి, ఈ ద్వీపంలోని ప్రతి పట్టణంలో క్రైస్తవుల సమూహాలను కనుగొనవచ్చు. అక్కడ అతడు తీతును తన ప్రతినిధిగా వదిలిపెట్టి, విషయాలను చక్కదిద్దడానికి, మంచి ఆరాధన క్రమాన్ని మరియు పరిచర్యలను ప్రతిచోటా ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ చేశాడు.
అట్లే మరొక ప్రాముఖ్యమైన “అసంపూర్తిగా” ఉన్న పని పూర్తి కావడానికి వేచి ఉంది, ముఖ్యంగా వివిధ పట్టణాలలో పెద్దలను నియమించడం. ఎందుకంటే ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పర్చడం పౌలు రెగ్యులర్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు, అపొ. కార్య. 14:23. పౌలు వెళ్లేముందు, ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోమని తీతుకు చెప్పాడు. ఇప్పుడు అతడు తీతుకు వ్రాతపూర్వకంగా సూచనలను కూడా ఇచ్చాడు.
ఇక్కడ సంఘ నాయకత్వం కోసం పౌలు “పెద్ద” (ఎల్డర్, వచనం 5) మరియు “అధ్యక్షుడు” (ఓవర్ సీర్, వచనం 7) అనే పదాలను ఉపయోగించాడు. “పెద్ద” (ఎల్డర్) అనే పదం (పరిపక్వత మరియు అనుభవము) అనే అర్హతను సూచిస్తుంది, “అధ్యక్షుడు” (ఓవర్సీర్) అనే పదం (దేవుని మందను చూసుకోవడం) అనే బాధ్యతను సూచిస్తుంది. ప్రజాదరణ కంటే వారి అర్హతల ఆధారంగా సంఘ నాయకులను తీతు నియమించవల్సి ఉన్నాడు.
సంఘాలకు అధ్యక్షత వహించే వారికి సువార్తను బోధించమని (మత్తయి 28:19), పాపాలను క్షమించమని (యోహాను 20:23), మతకర్మలను నిర్వహించమని మరియు అధికార పరిధిని అమలు చేయమనే (అంటే తప్పు చేసిన వారిని బహిష్కరించమని మరియు పశ్చాత్తాపపడే వారిని క్షమించమనే) ఆజ్ఞను సువార్త అప్పగిస్తూ ఉంది. ఈ శక్తి సంఘాలకు దైవిక హక్కు ద్వారా అధ్యక్షత వహించే వారందరికీ సాధారణం, వారిని పాస్టర్లు, పెద్దలు లేదా బిషప్లు అని పిలుస్తారు.
సంఘాలు ఎలా నిర్వహించబడాలనే దానిపై పౌలు వివరణాత్మక సూచనలేమి ఇవ్వలేదు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే క్రేతులోని సంఘాలకు అర్హత కలిగిన పెద్దలు లేదా పాస్టర్లు ఉన్నారు. వీరిని ఎలా నియమించారో మనకు చెప్పబడలేదు. సంఘాలను సంప్రదించకుండా తీతు ఈ నియామకాలు చేశాడని అనుకోవడం తప్పు. యెరూషలేములోని సంఘానికి డీకన్లు అవసరమైనప్పుడు (అపొ. కార్య. 6:2-6) వారు చేసినట్లుగా ఎన్నిక ద్వారా అతడు కూడా అలాగే చేసినట్లు తెలుస్తోంది. మన సంఘాలు తమ పాస్టర్లను మరియు ఉపాధ్యాయులను ఎలా పిలవాలో చెప్పేందుకు దేవుడు ఎక్కడా నిర్దిష్టమైన ఆదేశాలను ఇవ్వలేదు. ప్రక్రియ పట్ల శ్రద్ధ చూపే బదులుగా, పౌలు నియమించబడిన వారి అర్హతలను నొక్కి చెప్పాడు.
తీతు శీతాకాలానికి ముందు నికొపొలిలో పౌలుతో చేరడానికిగాను తీతు స్థానంలో మరొక వ్యక్తిని అర్తెమానైనను లేదా తుకికునైనను (3:12) పంపాలని పౌలు ఆశించాడు.
పెద్దల అర్హతలు
6ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగల వాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును. 7ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందారహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛా పరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక, 8అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహము గలవాడునై యుండి, 9తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.
సంఘానికి అధిపతియైన ప్రభువు తన సంఘములో ప్రతిదీ మర్యాదగా క్రమంగా జరగాలని కోరుకుంటున్నాడు. ఆయన ఇక్కడ నిర్దేశించిన సూత్రాలను స్థిరపడిన ప్రతి ఒక్క సంఘంలో పాటించాలి. ప్రతి పట్టణంలో పెద్దలను నియమించడంలో, తీతు మరియు సంఘాలు సరైన అర్హతలు ఉన్న పురుషుల కోసం చూడాలి. ఈ అర్హతలు ఏమిటనే వాటిని పౌలు తిమోతికి కూడా వ్రాసాడు, అక్కడ అతడు డీకన్లు మరియు వారి భార్యల అర్హతలను చేర్చాడు (1 తిమోతి 3:2-12). అతడు తీతుకు వ్రాస్తున్నప్పుడు, అతడు పెద్దలను లేదా అధ్యక్షులను గూర్చి మాత్రమే పేర్కొన్నాడు. పాత ఎఫెసు సంఘంలో అప్పటికే ఉన్న ఆఫీసెస్ అన్ని ఈ కొత్త సంఘాలకు అవసరం లేదు. అయినప్పటికీ, రెండు జాబితాలలో చాలా పోలికలు ఉన్నాయి. అయితే వీటి మధ్యన ఉన్న తేడాలు స్థానిక చర్చి అవసరాలను తీర్చడానికి కొంతవరకు ఫ్లెక్సిబిలిటీని సూచిస్తున్నాయి. ఉదాహరణకు, 1 తిమోతి 3:6 పెద్దలు ఇటీవల సంఘములో క్రొత్తగా చేరినవారై యుండకూడదని కోరుతూ ఉంది, కాని తీతులో ఈ విషయము ప్రస్తావించబడలేదు. బహుశా క్రేతులోని క్రైస్తవులందరూ ఇటీవలే మతమార్పిడి చెందినవారు కావచ్చు. జాబితాలోని ఈ ప్రమాణాలు తన సంఘములో నాయకులుగా పనిచేసే వారి కోసం దేవుని అంచనాలను ప్రతిబింబిస్తూ ఉన్నాయి. పెద్దలకు లేదా పాస్టర్లకు అర్హతలు ఒక ప్రాంతములో ఒకలా మరొక ప్రాంతములో ఒకలా లేదా కాలానుగుణంగా మారవు. అవి నేటికీ వర్తిస్తాయి. ప్రభువా, నీ మహిమకు అనుగుణంగా జీవించడానికి నాకు సహాయం చేయుము అనే పాస్టర్ గారి ప్రార్థన ఎల్లప్పుడూ ఒకలానే ఉంటుంది.
పౌలు “నిందారహితతో” ప్రారంభించాడు, (1 తిమోతి 3:2,10). “అతడు బాహాటంగా, బహిరంగంగా నిందించలేని వ్యక్తిగా ఉండాలి.” ఎందుకంటే చర్చి నాయకత్వం అందరికీ తెరిచి ఉండదు. పెద్దల అభ్యర్థులు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా ఉండాలి, పౌలు ఈ విషయాన్ని స్పష్టముగా ప్రస్ఫుటపరుస్తూ ఉన్నాడు తప్ప పేర్కొనలేదు. పవిత్ర పదవికి అవమానం కలిగించే నిందలకు/ అనైతికత అనే కళంకానికి అతడు అతీతంగా ఉండాలి. ఈ పునాది నుండి ప్రారంభించి, పెద్దల అభ్యర్థులు నిందారహితమైన, నిర్దోషమైన జీవితాన్ని గడపవలసి యున్నారు. అట్లే అతని వైవాహిక జీవితం నిందలకు అతీతంగా అతడు “ఏకపత్నీపురుషుడుగా” ఉండాలి, (1 తిమోతి 3:2,12). ఇది ఆరవ ఆజ్ఞకు సంబంధించినది. అతడు ఒకే భార్యకు భర్తగా ఉండాలి, అతని వివాహ జీవితం మచ్చ లేకుండా ఉండాలి. కొత్త నిబంధన సంఘాలలో స్టార్ట్-అప్ సంఘాలను నిర్వహించడానికి సహాయం చేసిన వ్యాపారవేత్తలు (అపొ.కార్య. 16:14-15) మరియు భార్యాభర్తల బృందంలో భాగంగా బోధించిన మహిళలు (అపొ.కార్య. 18:24-26) ఉన్నారు. దేవుని సంఘములో భాగంగా సేవ చేయడానికి లేదా పని చేయడానికి పురుషులు మరియు స్త్రీలకు లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి. కాని లేఖనం ప్రకారం పెద్దలు మరియు అధ్యక్షులు పురుషులుగా, ఏకపత్నీ పురుషులుగా, క్రైస్తవ వివాహాల నుండి వచ్చిన భర్తలుగా ఉండాలి (1 తిమోతి 3:2). ఇవి దేవుడు నిర్వచించిన వివాహాలు. ఈ వివాహాలు లౌకిక సంస్కృతి నిర్వచించిన లేదా ఆచరించినవి కాదని గమనించండి. క్రైస్తవ వివాహంలో అనుభవం మంచి సమయాల్లో మరియు కష్ట సమయాల్లో విజయవంతమైన వ్యక్తిగత సంబంధాలను కొనసాగించే సామర్థ్యాన్ని రుజువు చేస్తుంది. ఇది క్రీస్తు మరియు ఆయన వధువు సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అలాగని అర్హత కలిగిన అవివాహిత పురుషుడు పెద్దగా ఉండకుండా నిషేధించబడలేదు. దీని అర్థం ఏమిటంటే, నమ్మకమైన, ఏకపత్నీవ్రత వివాహ జీవితాన్ని పెద్దలు మరియు అధ్యక్షులు కొనసాగించాలనేదే. అట్లే ఒక పెద్ద తన భార్య మరణిస్తే తిరిగి వివాహం చేసుకోవడాన్ని బైబులు నిషేధించటంలేదు, (రోమీయులు 7:2-3; 1 కొరింథీయులు 7:39). అట్లే అతని పిల్లలు “దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన” వారిగా ఉండాలి, అతడు సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటి వారిని బాగుగా ఏలువాడునై యుండాలి (1 తిమోతి 3:4,5). ఒక క్రైస్తవ తండ్రి చర్చిని నడిపించడానికి ముందు తన కుటుంబానికి ఆధ్యాత్మిక నాయకుడిగా ఉండాలి. తన సొంత కుటుంబంలో తన సాక్ష్యం అత్యంత ప్రాధాన్యమైనది. ఇక్కడ పౌలు, పెద్దల అధ్యక్షుల పిల్లలు కూడా “విశ్వాసులుగా” ఉండాలని చెప్తూ ఉన్నాడు, అయితే ఈ విషయం తిమోతికి వ్రాయబడలేదు. పెద్దలు అధ్యక్షులు తమ పిల్లలను క్రీస్తు వైపు నడిపించడంలో, వారికి నిజమైన క్రైస్తవ జీవిత విలువను చూపించడంలో తమ విధిని నిర్వర్తించవల్సి యున్నారు. వారు తమ పిల్లలకు క్రైస్తవ హితబోధలో తగిన శిక్షణను మరియు బోధనను అందించాలి. పతనమైన పిల్లలు తమ తండ్రి క్రమశిక్షణ లేక ఆధ్యాత్మిక బోధనా లోపాన్ని ప్రతిబింబించొచ్చు అంటే పిల్లలు నిరంతరం అదుపుతప్పి, దురుసుగా ఉంటే, ఈ పరిస్థితి తల్లిదండ్రుల శిక్షణపై, ముఖ్యంగా తండ్రిపై ప్రతిబింబిస్తుంది. నిరంతరం అవిధేయులుగా ఉండే పిల్లలు తమ తండ్రి అధికారాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని లేదా తమ తండ్రి అధికారాన్ని తిరస్కరించారని అర్థం. తద్వారా, వాళ్ళు క్రీస్తును కూడా వారి ప్రభువుగా తిరస్కరించియున్నారని అది సూచిస్తూ ఉంది. పాస్టర్ పిల్లలు ఇతరుల పిల్లల మాదిరిగానే పాపంలో పడతారని సంఘాలు ఊహించాలి. పాస్టర్ తన పిల్లలకు ధర్మశాస్త్రాన్ని సువార్తను వర్తింపజేయాలని, వారిని దేవుని ప్రేమ కనికరములో పునరుద్ధరించాలని కూడా వారు ఆశించవచ్చు. పైన చెప్పబడిన వాటన్నింటిని బట్టి, ఇంకను అన్యమతస్థులుగా ఉన్న కుటుంబాలలోని పురుషులను, ఇంట్లో క్రైస్తవ క్రమశిక్షణను సరిగ్గా పాటించలేని పురుషులను సంఘానికి నాయకత్వం వహించడానికి పెద్దలుగా ఎన్నుకోకూడదు. అటువంటి వారికి సంఘాన్ని అప్పగించకూడదు. ఒక వ్యక్తి పరిచర్యకు నియమించబడకపోవడానికి అతనికి క్రమరహిత కుటుంబం ఉండటం కారణం కావొచ్చు. ఇది క్రేతులో నిర్వహించ బడుతున్న యువసంఘాలలోని పరిస్థితులను ప్రతిబింబిస్తుంది.
7వ వచనంలో పౌలు అర్హతల జాబితాను కొనసాగిస్తూ, అతడు “అధ్యక్షుడు” అనే పదాన్ని ఉపయోగించాడు, దీనిని “బిషప్” అని కూడా అనువదించొచ్చు. తొలి తరం క్రైస్తవులలో స్థానిక సంఘానికి అధ్యక్షుడే ప్రముఖ పెద్ద గా వ్యవహరించేవాడు. ఆ తర్వాత కాలములో వీరిని ఇతర సంఘాల మీద పెద్దలుగా నియమించారు. “పెద్ద” క్రైస్తవ పరిపక్వతను వక్కాణిస్తున్నాడు, “అధ్యక్షుడు” “దేవుని పని అప్పగింపబడిన” వ్యక్తి యొక్క పాలనను, నాయకత్వ పనితీరును పర్యవేక్షించుటను వక్కాణిస్తున్నాడు. ఈ పదాన్ని “మేనేజర్” లేదా “స్టీవార్డ్” అని కూడా అనువదించ వచ్చు. నాయకులు స్థానిక సంఘములో భాగమైన సామాన్యులకు సేవ చేయాలి, నిర్వహించాలి మరియు శ్రద్ధ వహించాలి, అలాగే దాని పరిచర్యలకు కూడా సేవ చేయాలి. చాలా సంఘాలలో, ఒక పాస్టర్ గారు పెద్దల మద్దతుతో ఈ పాత్రను పోషిస్తాడు. దేవుని పని నిర్వహించడానికి గాను తనకు అప్పగింపబడిందని పాస్టర్ ఎప్పటికీ మరచిపో కూడదు. అందుకే అతడు “నిందారహితునిగా” ఉండాలి. అతడు చేసే ప్రతిదీ మన దయగల దేవునిపై ప్రతిబింబిస్తుంది మరియు దేవుని పనిని ప్రభావితం చేస్తుంది కాబట్టి దేవుని గృహనిర్వాహకుడిగా ఆ పదవి యొక్క విధులను నిర్వర్తించడానికి, ఆ వ్యక్తి తనపై ఎటువంటి ఆరోపణలు ఉండకూడని వ్యక్తిగా ఉండాలి.
“నిందారహితునిగా” ఉండటం అనే ఈ సాధారణ అర్హతను మళ్ళీ ప్రస్తావించిన తర్వాత, పౌలు ఐదు ప్రతికూలతలతో దీనిని మరింతగా విశదీకరిస్తూ, అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాకుండా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. స్వేచ్ఛాపరుడును అంటే ఇది అద్దంలో తనను తాను చూసుకుని ఇతరులను తృణీకరించే కఠినమైన మరియు అహంకారపూరిత వైఖరిని సూచిస్తుంది. అధ్యక్షుడు “ముక్కోపిగా” ఉండకూడదు. శీఘ్రముగా కోపానికి లోనయ్యేవాడు, తరచుగా అహంకారంతో లింక్ అయ్యి ఉంటాడు. అతి త్వరగా కోపం తెచ్చుకొనే సంఘ పెద్ద ప్రజలను నొప్పించడమే కాకుండా చాలా కీడు కలిగించొచ్చు. అట్లే ఒకరి స్వంత అభిప్రాయాన్ని వక్కాణించి చెప్పడంలో గర్వము మొండితనానికి దారితీస్తుంది, మొండితనం అతిశయోక్తి కోపాన్ని పెంపొందించుకోవడానికి దారితీస్తుంది. కాబట్టి పాస్టర్ గారు తనను తాను అన్ని సమయాల్లో నియంత్రించుకోగలగాలి. “త్రాగుబోతుగా” ఉండకూడదు (1 తిమోతి 3:3). తాగుబోతుగా మారితే, తద్వారా తన ఇంద్రియాలు మద్యపానంతో గందరగోళానికి గురవుతాయి. అట్లే అతడు తన అభిప్రాయాన్ని నిలబెట్టుకోవడానికి హింసాత్మక చర్యలకు, గొడవలకు కూడా దిగుతూ ఉంటే, అప్పుడు అతని పవిత్ర పరిచర్యకు మచ్చ రావడమే కాకుండా పవిత్ర పరిచర్యకు అవసరమైన వ్యక్తిత్వ దృఢత్వాన్ని అతడు కోల్పోతాడు. “కొట్టువానిగా ఉండకూడదు” (1 తిమోతి 3:3), అంటే, దౌర్జన్యం చేయువానిగా ఉండకూడదు మరియు ఎప్పుడు కలహించే వానిగా ఉండకూడదు. హింసను ఉపయోగించుకునే స్ట్రైకర్ గా ఉండకూడదు. “దుర్లాభము అపేక్షించువాడు కాకుండా” ఉండాలి అంటే “ధనాపేక్షలేనివాడై” (1 తిమోతి 3:3), అక్రమలాభాన్ని వెంబడించు వాడు కాకుండా ఉండాలి” (1 తిమోతి 3:8; 6:5-11). ప్రభువు సేవకుడు నీచమైన లాభం కోసం ఆసక్తి చూపకూడదు, తన పరిచర్యను డబ్బు సంపాదించే మార్గంగా చేసుకోవాలని కోరుకోకూడదు.
ఇప్పుడు సానుకూల అర్హతలను చూద్దాం : “అతిథిప్రియుడును” (1 తిమోతి 3:2). “సజ్జన ప్రియుడు” అంటే మంచిని ప్రేమించువాడు. అతడు భక్తిని, పరిశుద్ధ పత్రికలను, శాంతి, సామరస్యం మరియు పొరుగువారి మధ్య స్నేహం వంటి కారణాలను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. మంచి వ్యక్తులకు మరియు మంచి విషయాలకు సహాయం చేయడానికి అతడు ఉత్సాహంగా ఉంటూ, సత్యమైన, మాన్యమైన, న్యాయమైన, పవిత్రమైన వాటి మీద ద్రుష్టి ఉంచిన వాడు. అతడు “స్వస్థబుద్ధిగలవాడునై“, అంటే స్వీయ నియంత్రణ” కలిగి (1తిమోతి3:2), ఉద్రేకంతో కాకుండా నిగ్రహంగా ఉండాలి. “నీతిమంతుగానిగా” అంటే ఇతరులతో వ్యవహరించడంలో నిజాయితీగా న్యాయంగా ఉండాలి. నిజాయితీలేని వాడు అన్యాయస్థుడు మోసగాడు అయిన మనిషి సంఘానికి శాపమే గాని ఆశీర్వాదము కాదు. “పవిత్రంగా” తన వ్యక్తిగత ప్రవర్తనలో భక్తిగా ఉండాలి. ప్రభువు సేవకు అంకితమైన వ్యక్తిగా అతడు అపవిత్రమైన ప్రతిదానికీ దూరంగా ఉంటాడు, ముఖ్యంగా ఆత్మకు వ్యతిరేకంగా పోరాడే అన్ని శరీర కోరికల నుండి కాపాడుకుంటాడు. అపవిత్రుడు సంఘాన్ని సక్రమంగా నడుపలేడు, వారికి మార్గదర్శిగా ఉండలేడు. అట్లే అతడు “క్రమశిక్షణతో,” “ఆశానిగ్రహముగల వాడునై యుండి” తన ఇంద్రియ కోరికలను అదుపులో ఉంచుకోవాలి అంటే కోరికలు మరియు చర్యలను నియంత్రించడానికి అంతర్గత శక్తిని కలిగి ఉండటం, 2 తిమోతి 1:7 తద్వారా నిజమైన వ్యక్తిత్వ బలాన్ని కలిగి ఉంటాడు. క్రేతులో ఇది చాలా చాలా అవసరం (12). ఇది క్రైస్తవ జీవితంలోని పరిశుద్ధాత్ముని ఫలం (గలతీయులు 2:22-23). ఆవిధముగా ప్రభువు సేవకు అంకితమైన వ్యక్తిగా అతడు అగౌరవమైన అపవిత్రమైన ప్రతిదానికీ దూరంగా ఉంటాడు, ముఖ్యంగా ఆత్మకు వ్యతిరేకంగా పోరాడే అన్ని శరీర కోరికల నుండి కాపాడుకుంటాడు. ఆ విధంగా పాస్టర్ గారు, తన మొత్తం మంద ముందు అన్ని క్రైస్తవ ధర్మాలలో తనను తాను ఒక ఉదాహరణగా చూపిస్తూ, తన సభ్యులను ప్రభువుకు ఇష్టమైన జీవితంలో జీవించే విధముగా అభ్యాసము చేయడానికి ప్రోత్సహిస్తాడు మరియు ప్రేరేపిస్తాడు.
చివరిగా, పౌలు అతి ముఖ్యమైన అర్హతగా పరిగణించాల్సిన దానితో ముగించాడు. ఈ చివరి అర్హత లేకుంటే ప్రస్తావించబడిన అన్ని ఇతర అంశాలు ఒక వ్యక్తిని పాస్టర్ గా (పెద్దగా, అధ్యక్షునిగా) అర్హత పొందనివ్వవు. “ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండాలి” అనేదే ఆ చివరి అర్హత. పాస్టర్ గారు ఉపదేశమును గట్టిగా చేపట్టి ఉండేవాడే కాకుండా దాన్ని నేర్పిస్తూ వారి తప్పులను ఖండించేటంత బాగా వాక్యాన్ని తెలుసుకోవాలి. అతడు హితబోధ విషయమై నమ్మకమైన వాక్యాన్ని గట్టిగా పట్టుకోవడం మూలాన్న అతడు హితబోధను వ్యతిరేకించే వారిని, తిరస్కరించే వారిని ఆరోగ్యకరమైన బోధనలో హెచ్చరించ గలడు. అటువంటి బోధకుడు సత్యాన్ని సమర్థించగలడు మరియు బోధించగలడు. అతడు నిరంతరం ప్రకటించే ఉపదేశం మరియు ఉద్బోధలో దైవిక జ్ఞానం యొక్క ఆరోగ్యకరమైన పదాలలో జాగ్రత్త మరియు వివరణాత్మక బోధన అలాగే హితబోధకు అనుగుణంగా పవిత్ర జీవితాన్ని గడపడానికి ఆహ్వానం ఉంటాయి. హితబోధతో పూర్తిగా తెలిసిన ఈ శక్తిని అతడు నియంత్రించగలడు మరియు నిర్దేశించగలడు. అలాంటి పాస్టర్ గారు అభ్యంతరం చెప్పే వారికి వారి అభిప్రాయలలోని లోపాలను చూపించగలడు, వ్యతిరేకించే వారిని ఒప్పించగలడు, గొప్ప జ్ఞానం అవసరమయ్యే వాక్యాన్ని ఉపయోగించగలడు. కాబట్టే అధ్యక్షులు లేదా పాస్టర్లు, వారు ప్రకటించే సందేశం గురించి, వారి హితబోధ గురించి ఖచ్చితంగా ఉండాలి.
క్రేతీయులు “బోధించబడినట్లుగా” అంటే పౌలు మరియు అతని సహచరుడు తీతు ద్వారా బోధించబడిన సందేశాన్ని లేదా వాక్యాన్ని గట్టిగా పట్టుకోవలసియున్నారు, 2 థెస్సలొనీకయులకు 2:15. ఎందుకంటే స్థిరమైన ఆరోగ్యకరమైన హితబోధ వారి శిష్యత్వ వృద్ధికి ఒక ప్రారంభ బిందువును అందిస్తుంది కాబట్టి. పాస్టర్లందరూ వారి ఉపాధ్యాయులు వారికి బోధించిన ప్రతి దానిని గట్టిగా పట్టు కోవాలని పౌలు నిర్దేశించడం లేదు. లూథర్ గారు లేదా మన పాస్టర్ గారు లేదా గౌరవనీయమైన ప్రొఫెసర్ గారు బోధించినది ఇదేనని చెప్పగలగడం మాత్రమే సరిపోదు. వారు మనకు బోధించిన ప్రతిదీ క్రీస్తు వాక్యం మరియు ఆయన ఎంచుకున్న ప్రేరేపిత అపొస్తలుల ఆధారంగా “నమ్మదగినదేనా” అని మనం నిర్ధారించుకోవలసి యున్నాము, దానిని ఎల్లప్పుడూ గట్టిగా పట్టుకోవలసి యున్నాము.
ఒక పెద్దకు ఈ అర్హత ఎందుకు చాలా అవసరం అంటే, అతడు “ఈ నమ్మదగిన హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.” హితబోధ అంటే విశ్వాసాన్ని బలపర్చేది అట్లే అబద్ధ బోధకుల అవినీతి ప్రభావం నుండి రక్షించేది. ఎందుకంటే విశ్వాసం స్వచ్ఛంగా ఉండాలి తప్ప తప్పుడు బోధనలతో లేదా మన స్వంత ఆధ్యాత్మిక విజయాన్ని కనిపెట్టే ప్రయత్నాలతో రాజీపడేదై ఉండకూడదు. యేసు మాత్రమే మనల్ని దేవునితో సమాధానపరచగలడు. ఆరోగ్యకరమైన హితబోధ మాత్రమే విశ్వాసాన్ని ఉత్పత్తి చేయగలదు దానిని బలోపేతం చేయగలదు, ఒకనికి ఓదార్పునివ్వగలదు, మార్గనిర్దేశం చేయగలదు, ప్రేరేపించ గలదు మరియు పోషించగలదు. గుర్తుంచుకోండి, బదులుగా ఏ ప్రత్యామ్నాయమైనను గింజకు బదులుగా పొట్టును మాత్రమే ఇస్తుంది.
సంఘము యొక్క నిర్వాహకులుగా లేదా సంరక్షకులుగా, నాయకులు తప్పుడు బోధను గుర్తించాలి, ఆపాలి మరియు సరిదిద్దాలి. అట్లే హితబోధను వ్యతిరేకించే వారి నుండి పాస్టర్ గారు మందను రక్షించాల్సిన అవసరం ఉంది. అనేక తప్పుడు మతాలు తప్పుడు బోధనలు మందను బెదిరిస్తున్నాయి కాబట్టి, పాస్టర్ గారు “విశ్వసనీయ సందేశం”పై గట్టి పట్టును కలిగి ఉండాలి. అతడు తన పరిచర్యలో ఈ ప్రతికూల అంశానికి, అంటే “ఎదుర్కొనేవారిని ఒప్పించడం” కోసం బాగా సన్నద్ధమై ఉండాలి. క్రేతులో సువార్తను వ్యతిరేకించే వారికి కొరత లేదు. సంఘచరిత్రలో ఏ యుగం కూడా తప్పుడు మతాలు తప్పుడు బోధనలు లేకుండా లేదు. ఈ తుది అర్హత యొక్క ప్రాముఖ్యతను గుర్తించడంలో సంఘము ఎప్పుడూ విఫలం కాకూడదు.
క్రేతులోని సమస్యలు
10అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు. 11వారి నోళ్లు మూయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు. 12వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను–క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండి పోతులునై యున్నారు. 13-14ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక, విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. 15పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి. 16దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.
క్రేతులో పోరాడటానికి ఇబ్బందులు ఉన్నాయి, అవి ఎఫెసులో తిమోతిని ఇబ్బంది పెడుతూ ఉన్నవే/ ఉన్నవారే, 1 తిమోతి 1:4-7. క్రేతులో తీతు నియమించాల్సిన అధ్యక్షులు, వారిని ఎదుర్కోవాల్సి యున్నారు. ఆ తప్పుడు బోధకులకు ఇది ఒక హెచ్చరిక. అట్లే వారు ఎదురుకొనవల్సిన వారిని పౌలు స్పష్టముగా పేర్కోనియున్నాడు.
మొదటిగా పౌలు వారిని గురించి పేర్కొంటూ వారిని “అవిధేయులు” అంటే “తిరుగుబాటుదారులు” అని పిలుస్తున్నాడు, వీళ్ళు వాక్యానికి లేదా దేవుని అపొస్తలుడైన పౌలు వంటి ఉన్నత అధికారానికి లోబడి ఉండటానికి ఇష్టపడని వారు. దేవుని మీద, సంఘ అధికారము మీద తిరుగుబాటు చేసేవారు, హెబ్రీయులకు 3:8,12; ద్వితీ. కాం. 9:7,24. నేడు, క్రైస్తవ బోధకులు, నాయకులు అని పిలవబడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది, అయితే వీరిలో అనేకులు వాక్యము తప్పుపట్టలేనిదనే విషయాన్ని అధికారంగా గుర్తించకున్నారు. వారు తమ స్వంత తర్కానికి ఆలోచనలకు వాక్యాన్ని కంటే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ దాని స్పష్టమైన బోధనను అనుసరించడానికి నిరాకరిస్తూ ఉండటం విచారకరం.
వారు “కేవలం వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు.” వదరుబోతులు అంటే దేవుడు ఇచ్చిన అధికారం లేదా ఉపయోగకరమైన సందేశం లేకుండా, నమ్మదగిన కథలను చెప్పే వారు. వారు చాలా మాట్లాడతారు కాని అవన్నీ “నిష్ప్రయోజనమైన ముచ్చటలు/ అర్థరహితమైన మాటలు” (1 తిమోతి 1:6). వీళ్ళు, వట్టి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు. క్రైస్తవ మతం మరియు వాక్యాన్ని గురించి తమకు ఉన్నతమైన మరియు లోతైన అవగాహన ఉందని వారు తమ శ్రోతలను ఒప్పించాలనుకుంటున్నారు. వాస్తవానికి వారు దానిని నాశనం చేస్తున్నారు. నేటికీ అనేక మతాలు మరియు తెగలు యేసుక్రీస్తు సువార్తకు మానవ నిర్మిత నియమాలను జోడిస్తూనే ఉన్నాయి. మోసగాళ్లు (మత్తయి 24:24; రోమా 3:13; 16:18; 2 కొరింథీయులకు 11:13; ఎఫెసీయులకు 4:14.)
క్రేతులో అలాంటి వ్యతిరేకులు చాలామంది ఉన్నారు, కాని వారిలో అత్యంత చెడ్డవారు “విశేషముగా సున్నతి సంబంధులు” (యూదు క్రైస్తవులు). వీరికి సంఘాల్లోకి ప్రవేశించడంలో పెద్దగా ఇబ్బంది లేదు. నాటి సంఘాలలో వారి సంఖ్య ఏ విధంగానూ తక్కువ కాదు. ఆ వాస్తవం వారికి ధైర్యాన్ని ఇచ్చింది. వీరు క్రైస్తవ మతంలోకి మారినట్లు అనిపించినా సున్నతి మరియు కొన్ని పాత నిబంధన ఆచార ధర్మశాస్త్ర అవసరాన్ని పట్టుబట్టారు. వీళ్ళు, క్రైస్తవులు సున్నతి చేయించుకోవాలని, రక్షణ లేదా పవిత్రీకరణ లేదా రెండింటికీ యూదుల ధర్మశాస్త్రాన్ని ఆచార నియమాలన్నింటిని పాటించాలని బోధించిన వ్యక్తులు (అపొ.కార్య. 15:1). యెరూషలేములోని కౌన్సిల్లో సంఘము క్రైస్తవులుగా మారిన యూదులతో యెట్లు వ్యవహరించాలో చర్చించి ఉండుటను వ్యవహరించి ఉండుటను (అపొస్తలుల కార్యములు 15) లో చూడొచ్చు. పౌలు గలతీయులకు రాసిన లేఖలో వారిని వ్యతిరేకిస్తూ: “చూడుడి; మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను”, అని చెప్పుటను గలతీయులు 5:2లో చూడొచ్చు. వారు ఈ నియమాలను దేవుని కృప సువార్తకు జోడించారు, పాక్షికంగా ఒక వ్యక్తి యొక్క పనుల ఆధారంగా రక్షణను నిర్వచించారు. దేవుని వాక్యం కంటే పైగా మానవ నిర్మిత నియమాలను ఉంచారు. అట్లే వారు అపోస్టోలిక్ బోధల యొక్క అధికారాన్ని అంగీకరించడానికి నిరాకరించారు. వారి బోధన ప్రమాదకరమైనది మరియు తప్పు. అంతేకాకుండా, వారు వారి అభిప్రాయాలను వ్యర్థమైన మాటల ద్వారా, ఖాళీ వాదనల ద్వారా, గొప్ప జ్ఞాన ప్రదర్శనతో వ్యాప్తి చేయడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. అలా చేయడం ద్వారా, వారు సత్యం యొక్క ముసుగులో అబద్ధాన్ని ప్రదర్శించే ప్రమాదకరమైన సామర్థ్యాన్ని ప్రదర్శించారు. దీని ఫలితంగా వారు చాలా మందిని మోసగించారు. క్రైస్తవ సంఘాల్లోకి యూదుల నియమాలను ఆచారాలను ప్రవేశపెట్టడానికి వారు చేసిన ప్రయత్నాలు అపొస్తలుడి మనస్సులో భయాన్ని రేకెత్తించాయి. ఇది చాలా తీవ్రమైన విషయం కాబట్టే “వారి నోళ్లు మూయింపవలెను” అని పౌలు తీతుకు వ్రాశాడు. ఇక్కడ “ఎపిస్టోమిజైన్” అనే గ్రీకు మాట వాడబడింది ఇది కొత్త నిబంధనలో మరెక్కడా మనకు కనిపించదు. దీని అర్ధం అబద్ద బోధకుల నోటికి కళ్లెం వేయడం; ఆపై, వారిని నిశ్శబ్దం చేయడం. ఇది సరైన విధంగా మరియు సువార్త స్ఫూర్తికి అనుగుణంగా జరగాలని ఇక్కడ సూచించ బడింది. తీతు మరియు అతడు నియమించిన పెద్దలు తప్పుడు బోధనను నిరోధించి సరిదిద్దాలి. హితబోధ ద్వారా మాత్రమే అబద్ద బోధకుల నోళ్లు మూయింప వలసియున్నారు. శాంతికి భంగం కలిగించే అటువంటి వ్యక్తుల హానికరమైన కార్యకలాపాలు ప్రభువు పనికి హాని కలిగించకుండా ఉండటానికి మన రోజుల్లో కూడా ఇలాంటి సందర్భాలలో అదే పద్ధతిని వర్తింపజేయాలి.
వారి మోసపూరితమైన, ఖాళీ మాటలు ప్రమాదకరమైనవి మరియు అవి హానికరమైన ఫలితాలను ఇచ్చాయి. “వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు“, అక్షరాలా ఇళ్లను నాశనం చేస్తున్నారు అంటే, వారు విశ్వాసులను వారి విశ్వాసం నుండి దూరం చేస్తున్నారు. విశ్వాసుల కుటుంబాలను తప్పుదారి పట్టించి ఆధ్యాత్మిక వినాశనానికి తీసుకువస్తున్నారు. ఇక్కడ “కుటుంబము” అనే పదం వాస్తవ కుటుంబ సభ్యులను దాటి సేవకులకు మరియు ఆ కుటుంబంతో ఏదో ఒక విధంగా అనుసంధానించబడి ఉన్న ఇతరులకు కూడా వర్తిస్తుంది. బహుశా ఇందులో ఒక నిర్దిష్ట కుటుంబములో ఒక చిన్న “హౌస్ చర్చిగా” కలిసే వ్యక్తులు కూడా ఉండొచ్చు. వ్యక్తిగత కుటుంబాలలోకి తమను తాము చొప్పించుకోవడం ఒక ప్రత్యేకతగా చేసుకున్న ఈ తప్పుడు బోధకులు, (2 తిమోతికి 3:6,7), వారి హానికరమైన కార్యకలాపాలలో కొనసాగితే, విశ్వాసులు సరైన మందలింపును పట్టించు కోకపోవడాన్ని బట్టి సంఘములో అత్యంత దయనీయమైన పరిస్థితులు ఏర్పడతాయి. వారి సమ్మోహనకరమైన మాటలకు ప్రాముఖ్యతను ఇస్తే, కుటుంబాల మధ్యలో విభేదాలు తద్వారా చీలికలు ఏర్పడతాయి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తప్పుడు బోధనలకు బలైతే అది వారి మొత్తం ఇంటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితి వారు బోధించకూడని బోధలను బోధించడం వల్ల వచ్చింది. భోదించకూడని వాటిని వారు వారి స్వార్ధాన్ని బట్టి బోధిస్తూ ఉన్నారు. వారి ప్రకటిత లక్ష్యం డబ్బు సంపాదించడం.
“దైవభక్తి లాభసాధనమనుకొను” వీళ్ళు, దైవభక్తి ఆర్థిక లాభానికి ఒక మార్గమని భావించే తప్పుడు బోధకులు, (1 తిమోతి 6:5,9,10) వీరిని గురించి పౌలు తిమోతిని కూడా హెచ్చరించియున్నాడు. చర్చి నాయకులు జీవనాధారము పొందుకోవడానికి అర్హులు (1 తిమోతి 5:18), కాని తప్పుడు బోధకులు డబ్బు కోసమే పరిచర్యలో ఉన్నారని ఈ మాటలు సూచిస్తూ ఉన్నాయి. ఈ తప్పుదారి పట్టించే వారు “అక్రమ లాభం” సంపాదించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. లాభం కోసం వారు చేయకూడని వాటిని బోధిస్తారు. తాము ప్రజాదరణ పొందేలా మరియు ప్రజల విశ్వాసాన్ని పొందేలా చేసే బోధలను ప్రవేశపెడతారు. వారు ఆత్మల పట్ల ప్రేమ కంటే డబ్బు పట్ల ప్రేమతో ప్రేరేపించబడతారు. మతం అనేది మనస్సును నియంత్రించే అత్యంత శక్తివంతమైన సూత్రం; ఒక అబద్ద బోధకుడు దానిపై నియంత్రణ కలిగి ఉంటే, ప్రజలు తమ ప్రాపంచిక ఆస్తులను వదులుకునేలా ప్రేరేపించడం కష్టం కాదు. వారు చేస్తున్నది మోసపూరితమైనది, నిజాయితీ లేనిది మరియు క్రైస్తవ మతాన్ని నాశనం చేసేది.
పౌలు మాట్లాడే సున్నతి సంబంధులు వంశపారంపర్యంగా యూదులు, కాని జాతీయత ప్రకారం క్రేతీయులు. ఇక్కడ ఉదహరించబడిన కొటేషన్ పౌలు అక్కడి యూదు బోధకులపైనే కాకుండా, స్థానిక క్రేతు ప్రజలపై కూడా దృష్టి పెట్టాడని చూపిస్తుంది. దీని అర్థం ఏమిటంటే, యూదు ఉపాధ్యాయులు మరియు స్థానికంగా జన్మించిన క్రేతు ప్రజల విషయంలో, పరిచర్య కోసం వ్యక్తుల ఎంపికలో అత్యంత అప్రమత్తత అవసరం అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది అజాగ్రత్తగా ఎవరినీ పరిచర్యలోకి ప్రవేశపెట్టకూడదని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి, పౌలు ఎంపిక విషయములో జాగ్రత్తగా వ్యవహరించాలనే ఉద్దేశ్యములో వారి ప్రయోజనార్ధమై, క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో “ఎపిమెనిడెస్” అనే వారి ప్రముఖ కవి/ ఆధ్యాత్మికవేత్త నుండి వచ్చిన కొటేషన్ న్ని వారికి గుర్తుచేస్తూ ఉన్నాడు. పౌలు అతన్ని “వారి స్వంత ప్రవక్తలలో ఒకడు” అని పిలుస్తున్నాడు. ఎపిమెనిడెస్ తన ప్రజలలో దేవతల ప్రతినిధిగా పరిగణించబడేవాడు. అతను గ్రీస్లోని ఏడుగురు జ్ఞానులలో ఒకడు. అతడు ఒకసారి తన ప్రజలైన క్రేతీయులను గురించి వారి దుర్గుణాలు చెడుల గురించి మాట్లాడుతూ, “క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండిపోతులునై యున్నారు” అని చెప్పాడు. ఇది బయటి వ్యక్తి చేస్తున్న జాత్యహంకార ప్రకటన కాదు. ఇది క్రేతుకు చెందిన వ్యక్తి తన సొంత ప్రజల గురించి మాట్లాడిన మాటలు. వారికి ఈ ఖ్యాతి ఉంది. ఇక్కడ ప్రస్తావించబడిన వ్యక్తిత్వ లక్షణం స్థానిక క్రేతు ప్రజలకే కాకుండా, అక్కడ నివసించే యూదుల వ్యక్తిత్వానికి కూడా సంబంధించినదని అనిపిస్తుంది. అట్లే పరిశుద్ధాత్మ ఈ తీర్పును ధృవీకరిస్తున్నాడు: “ఈ సాక్ష్యము నిజమే.” ఈ మాటలు ప్రేరేపిత అపొస్తలుడి ద్వారా చెప్పబడిన దేవుని తీర్పు కూడా. పౌలు ఈ వ్యాఖ్యను ఉటంకించడానికి కారణం, క్రేతీయులు వారి జాతీ బలహీనతల గురించి స్పృహను కలిగి మార్చుకోవాలనే కోరిక, తద్వారా సరైన పరిష్కారానికి పునాది వేయాలనేదే పౌలు ఉద్దేశ్యము. కొన్నిసార్లు ఒక నిర్దిష్ట సమాజంలో ప్రముఖంగా కనిపించే ప్రత్యేక దుర్గుణాలు, ప్రత్యేక పాపాలు ఉంటాయి. కొరింథు నగరం అనైతికతకు ప్రసిద్ధి చెందింది మరియు సొదొమ దాని అసహజ లైంగిక ఆచారాలకు ప్రసిద్ధి చెందింది. క్రేతు ప్రజల మధ్య తమ పరిచర్యలో వారు ఎదుర్కొన్న ప్రత్యేక సమస్యలను తీతు మరియు అధ్యక్షులు అర్థం చేసుకోవాలి. మనం ప్రత్యర్థిని సమర్థవంతంగా వ్యతిరేకించాలంటే మనం అతన్ని గురించి తెలుసుకోవాలి.
ఈ కారణంగా, విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము అని పౌలు తీతుకు చెప్తూ ఉన్నాడు. తప్పుదారి పట్టించే వారి అనారోగ్యకరమైన ఉపదేశాలకు బోధలకు వారు చెవియొగ్గకుండా వారి వెంబడిపోకుండా అత్యంత దృఢమైన పదునుతో తీతు క్రైస్తవులకు విశ్వాసం యొక్క అన్ని విషయాలలో ఆరోగ్యకరమైన వివేకం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పాలి. మోసగించే బోధకులను మరియు వారి మోసపూరిత అనుచరులను వ్యతిరేకించడంలో నిజాయితీగా హృదయపూర్వకంగా దృఢమైన పదునుతో మాట్లాడే స్పష్టమైన, సరళమైన భాష అవసరం. పాపాన్ని పాపం అని పిలవాలి మరియు తప్పును అది ఏమిటో చూపించి కఠినంగా సరిదిద్దాలి. ప్రజల పాపాలను సరిదిద్దడంలో లక్ష్యం వారిని పరివర్తనకు నడిపించడం. గద్దింపు ఉద్దేశ్యం “వారిని విశ్వాసంలో స్థిరపర్చడం.” వారు వాక్యాన్ని అంగీకరించారు, కాని వారు ఇంకా స్థిరంగా మరియు వారి విశ్వాసంలో నిశ్చయంగా లేరు. దృఢమైన విశ్వాసానికి దృఢమైన హితబోధ అవసరం. అయితే వారు కోలుకునే మార్గంలోనే ఉన్నారు. స్వస్థులగు నిమిత్తము వారు “యూదుల కల్పనాకథలకు లేదా సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలకు శ్రద్ధ చూపెట్ట కూడదు.” కాబట్టే విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారికి కఠినమైన గద్దింపు అవసరం. ఆ గద్దింపు అనేది సమస్య సృష్టించే వారిపై తీర్పుగా మరియు వారు పశ్చాత్తాపపడి దేవుని కృపను అనుభవించడానికి ఒక అవకాశంగా ఉండాలి. తీతు ధర్మశాస్త్రం మరియు సువార్తతో తప్పుడు బోధకులను ఎదుర్కోవాలి.
“యూదుల కల్పనాకథలు” అంటే పాత నిబంధన నుండి మినహాయించబడిన రచనలు లేదా తప్పుడు బోధన యొక్క ఒక అంశం కావొచ్చు. యూదుల ఆచారాలు, కల్పనాకథలు, శుద్ధికారణాచారసంబంధమైన ధర్మశాస్త్రానికి సంబంధించి యూదులు ఏర్పరచుకొన్న నియమాలు అన్నియు మనుష్యుల బోధలే. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సువార్త బోధనతో సమన్వయం చేయకూడదు. “కల్పనాకథలకును మితములేని వంశావళులకును” అంకితం కావద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని పౌలు తిమోతిని కోరినప్పుడు, పౌలు “యూదుల కల్పనాకథల” గురించి వాటి ప్రమాదాన్ని గురించి కూడా తిమోతిని హెచ్చరించియున్నాడు (1 తిమోతి 1:3-4). పాత నిబంధనకు జోడించబడిన అనేక యూదుల కల్పనాకథలు క్రీస్తులో ఉచిత రక్షణతో కూడిన రక్షణ సువార్తను నాశనం చేశాయి. వారి కల్పనాకథల కోసం వారు క్లెయిమ్ చేస్తున్న ఉన్నత జ్ఞానం, దాని అనుచరులు కలిగి ఉన్నారని చెప్పుకుంటున్న మోక్షము (ప్రత్యేకమైన జ్ఞానం ద్వారా మోక్షమనే) జ్ఞానవాదాన్ని (గ్నోస్టిసిజం) గుర్తు చేస్తూ ఉంది.
సత్యాన్ని తిరస్కరించిన వీళ్ళు సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను ప్రజలపై ఉంచి వారిని బానిసలుగా చేసుకోవడానికి ప్రయత్నించారు. “మనుష్యుల కట్టడలు” అంటే దేవుని కృపను తగ్గించే లేదా ఆయన రక్షణ ప్రణాళికను వక్రీకరించే విధముగా దేవుని ధర్మశాస్త్రమునకు మనుష్యునిచే ఏర్పరచబడిన నియమాలు లేదా తప్పుడు వివరణలు (మత్తయి 23:23). వీళ్ళు ప్రజలు వివాహం చేసుకోవద్దని నిషేధించారు, కొన్ని ఆహార పదార్థాలను తినకూడదని ఆజ్ఞాపించారు, (1 తిమోతి 4:2,3). ఈ తప్పుడు బోధకుల ఆలోచనలన్నీ “పవిత్రమైనవి” మరియు “అపవిత్రమైనవి” అనే పదాల చుట్టూనే తిరిగాయి, మత్తయి 15:1-11. 18; 23:16-28. కానీ కొత్త నిబంధనలో ఈ వ్యత్యాసం ఇకపై చెల్లదు. ఆత్మ మరియు శరీరం యొక్క స్వచ్ఛత కొన్ని ఆహారాలను తినడం లేదా తిరస్కరించడంపై ఆధారపడి లేదు. దేవుడు విమోచించబడిన వారి కోసం ప్రతిదీ విమోచించాడు (1 తిమోతి 4:4), క్రీస్తును విశ్వసించి విశ్వాసం ద్వారా నీతిమంతులైన వారికి ప్రతిదీ పవిత్రమైనది.
క్రేతులోని మోసగాళ్ళు చెప్తున్న ఇలాంటి ఆజ్ఞలను గురించి పౌలు మాట్లాడుతున్నాడు, కాబట్టే పవిత్రులకు అన్నియు పవిత్రములేగాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు (15) అను పౌలు మాటల ద్వారా మనకు అర్ధమవుతూ ఉంది. యేసు కూడా, నోటపడునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాడు, మత్తయి 15:11. యూదులు అపవిత్రమైన దానితో తమను తాము కలుషితం చేసుకోకుండా ఉండటానికి చాలా శ్రద్ధ తీసుకొన్నారు. విమోచించబడని వారి తార్కికం, ఆలోచనలు మరియు రైట్ లేదా రాంగ్ విషయములో వారి భావన ప్రాణాంతకమైన లోపభూయిష్టంగా ఉన్నాయి. సున్నతి సంబంధులు మనస్సాక్షిని చట్టబద్ధమైన ఆచారాలతో బంధించడానికి ప్రయత్నించారు. కాబట్టే పౌలు “చేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు!”అను విధులకు మీరు లోబడనేల?” అని హెచ్చరిస్తూ, “అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛా నిగ్రహవిషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు”, కొలొస్సయులు 2:21,23 అని తెలియజేస్తూ ఉన్నాడు. నిజం ఏమిటంటే “దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు”, 1 తిమోతి 4:4. పవిత్రులకు, అన్నియు పవిత్రములే. కాని అపవిత్రులు మరియు అవిశ్వాసులకు ఏదీ పవిత్రమైనది కాదు.
మరోవైపు, మానవులు రూపొందించిన కట్టడాలు మరియు అనేక ఇతర నియమాలను నెరవేర్చాలని గట్టిగా పట్టుబట్టే వ్యక్తులు తరచుగా హృదయం మరియు మనస్సు యొక్క అపవిత్రతతో బాధపడుతూ ఉంటారు. “వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడినప్పుడు,” క్రీస్తు యేసు యొక్క శుద్ధి చేసే శక్తిపై వారికి విశ్వాసం లేనప్పుడు, వారికి “ఏదీయు పవిత్రమైనది కాదు.” వారు సువార్త యొక్క శుద్ధి శక్తిని తిరస్కరించడం వలన వారి దుష్ట మనస్సాక్షిని వదిలించుకోలేరు. అపవిత్రపరచబడిన మనస్సు ఉన్న వ్యక్తి తాను తాకిన ప్రతిదాన్ని అపవిత్రం చేస్తాడు. ఎందుకంటే వారు దేవుని కుమారుణ్ణి తిరస్కరించే పాపులు గనుక వారు ముట్టిన దేదైనను అపవిత్రమవుతుంది. పవిత్రమైన విషయాలు కూడా ఈ ప్రజల వైఖరి ద్వారా కలుషితమవుతాయి. అపవిత్ర పరచబడిన మనస్సాక్షి ఉన్నవాడు నైతిక స్వచ్ఛతతో దేవుణ్ణి సేవించలేడు. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము, హెబ్రీయులు 11:6.
అయితే, ఈ తప్పుడు బోధకుల ప్రవర్తనలో అత్యంత అభ్యంతరకరమైన లక్షణం ఏమిటంటే, వారు బోధకులుగా పరిగణించబడాలనే వారి ధైర్యం. కాబట్టే క్రేతులోని ఈ మోసపూరిత బోధకులపై పౌలు తీవ్రమైన నేరారోపణ చేస్తూ వీళ్ళు, “దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు” అని అంటున్నాడు. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొంటారు దేవుడిని అందరికంటే బాగా తెలుసుకున్నట్లుగా చాలా అధికారంతో మాట్లాడతారు. అయితే, వారు తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు అంటే వారి క్రియలు వారు తమ నోటితో ఒప్పుకొంటున్న ఆయనను ఎరుగమన్నట్లుగా ప్రకటిస్తున్నాయి. వారి ప్రవర్తన వారికి ఆయనతో నిజమైన పరిచయం లేదని చూపించేలా ఉంది. అబద్ధ బోధకులు తమకు దేవుడు తెలుసు అని చెప్పుకుంటారు, కాని వారి చర్యలు లేదా పనులు వారు ఆయన ప్రజలు కాదని నిరూపిస్తాయి, మత్తయి 7:15-20. వారు వేషధారులైన మోసగాళ్ళు. వారు చేసే పనులను బట్టి దేవుణ్ణి ఎరుగరని, దేవుడంటే వారికి లెక్కలేదని కనపరచుకొంటారు, రోమా 2:24; 1 యోహాను 2:4-6; 3:10; మత్తయి 7:17-20. వారు చేసిన ఏదీ దేవుని దృష్టిలో మంచిది కాదు. క్రీస్తుపై విశ్వాసం ఆయన ఇచ్చే మంచి పనుల ద్వారా ఫలాలను ఇస్తుంది, ఎఫెసీయులకు 2:10, కాని క్రీస్తు రక్షణలేని వారు ఈ ఫలాలను ఫలించలేరు. ప్రతి మంచిచెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు, మత్తయి 7:17,18.
వాళ్ళు “తిరుగుబాటుదారులు, కేవలం వదరుబోతులు, మోసగాళ్ళు, అసహ్యకరమైనవారు, అవిధేయులు మరియు ఏ మంచి పనికి పనికిరాని వారు” – ఇది క్రేతులోని అబద్ధ బోధకుల గురించి పౌలు వర్ణించిన వివరణ, వారిని తీతు వ్యతిరేకించాలి మరియు తీవ్రంగా ఖండించాలి. ఈ వివరణ అబద్ధ బోధకులకులందరికి సరిపోతుంది. వారు నిజంగా “దేవుని ఎరుగుదుమని చెప్పుకోవచ్చు” కాని, చివరికి, “వారు తమ క్రియల ద్వారా ఆయనను నిరాకరిస్తారు.” వీరిని వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు, మత్తయి 7:16, అనేది మన రక్షకుని సలహా.
క్రేతు ప్రజల గురించి పౌలు చెప్పిన దాని దృష్ట్యా, ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. పాస్టర్లు, మనమందరం, ఒక నిర్దిష్ట జాతి లేదా జాతీయతకు చెందిన ప్రతి సభ్యుడిని స్టీరియోటైప్ (మూస పద్దతి, ఎవరైనా లేదా ఏదైనా ఎలా ఉంటారు/ ఉంటుందనే దాని గురించి ప్రజలలో ఉన్న ఒక స్థిర ఆలోచన, ముఖ్యంగా తప్పుడు ఆలోచన) చేయకుండా జాగ్రత్త వహించాలి. మన సువార్త పనిని అడ్డుకునే పక్షపాతాలు అభివృద్ధి చెందకుండా మనం జాగ్రత్త వహించాలి. కొన్ని సంస్కృతులు లేదా జాతులు లేదా జాతీయతలలో కొన్ని లక్షణాలు ఉంటాయని గుర్తించడం సహాయకరంగా ఉండొచ్చు. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు అని పౌలు గుర్తించాడు (1 కొరింథీయులు 1:22). ఆ విధంగా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం “యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను” ఉందని అతడు గ్రహించాడు ((1 కొరింథీయులు 1:24). సిలువ వేయబడిన క్రీస్తును ఇద్దరికీ ప్రకటించడానికి ఇది అతనికి ఏమాత్రమును ఆటంకం కలిగించలేదు సరికదా విజయాన్ని ఇచ్చింది. మనమందరం పాపులమని, పాపులైన ప్రజలకు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని మనం ఎప్పుడూ గ్రహించాలి. మనకందరికీ రక్షణ మార్గం ఆ క్రీస్తు మాత్రమే. ఈ దేవుని శక్తి, జ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జాతులు, దేశాలు మరియు సంస్కృతులలో దేవునికి విజయాలు ఇస్తూ ఉంది.
5-16 వచనముల సంక్షిప్త సారాంశము: దేవుని సంఘానికి నిర్వాహకులుగా నాయకత్వం వహించాలనుకునే వారి అర్హతలను పౌలు దశలవారీగా వివరించాడు. తరువాత అతడు తన దృష్టిని తప్పుడు బోధకుల వైపు మళ్ళించాడు. సత్యాన్ని అర్థం చేసుకోవడంలో లేదా బోధించడంలో, తప్పుపట్టే వారి ప్రవర్తనలో లేదా వారి ఉద్దేశ్యాలలో తప్పుడు బోధకులు ఈ అర్హతలకు ఏమాత్రమును సరిపోరు. దేవుని సంఘములో జీవించే, చురుకైన సభ్యులుగా, సంభావ్య నాయకులు ఆయన సత్యాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆయన అందించే పాత్రలలో సేవ చేయడానికి ఒదిగిపోవాలి. వారు వారి కుటుంబాలు ఖాళీ మాటలు, మోసం మరియు దేవుని సత్యం నుండి దూరం చేసే ఏదైనా బోధనను నివారించే దైవిక జీవితాన్ని గడపాలి. అయితే, స్వచ్ఛత అనేది ఒక గొప్ప క్రమం, మనల్ని మనం పవిత్రంగా చేసుకోలేము. అయినప్పటికీ దేవుడు మన జీవితాల్లోకి అడుగుపెట్టి తన సువార్త ద్వారా మనలను శుద్ధి చేసాడు. యేసుక్రీస్తు ద్వారా, ఆయన మనలను పవిత్రులను చేసాడు, దేవునికి వందనములు.
ప్రార్ధన: యేసు నన్ను నీ నీతితో శుద్ధి చేయుము తద్వారా నేను నా కుటుంబాన్ని నడిపించగలను మరియు నీ ప్రజలలో నమ్మకంగా సేవ చేయగలను, ఆమెన్.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.