
పరిసయ్యులు అంటే ఎవరు?
క్రొత్త నిబంధనలో, పరిసయ్యులు సద్దూకయ్యుల గురించి మనం పదే పదే వింటూ ఉంటాం. పాత నిబంధనలో వీరిని గురించి మనం ఎప్పుడూ వినలేదు. కారణం, వీళ్ళు ఇంటర్ టెస్టమెంటల్ కాలంలో ఏర్పడ్డారు. ఇంటర్టెస్టమెంటల్ కాలం (పాత నిబంధన ముగింపు మరియు కొత్త నిబంధన ప్రారంభం మధ్య దాదాపు 400 సంవత్సరాలు) యూదుల జీవితంలో వారి మతపరమైన ఆచారాలలో గణనీయమైన మార్పును చూసింది. ఈ కాలంలో వివిధ సామ్రాజ్యాల (పర్షియన్, గ్రీకు మరియు రోమన్) ప్రభావ ఫలితంగా యూదులలో సాంస్కృతిక మతపరమైన మార్పులెన్నో చోటుచేసుకున్నాయి.
క్రీ.పూ.332లో అలెగ్జాండర్ ది గ్రేట్ పర్షియాను జయించినప్పుడు యూదు చరిత్రలో హెలెనిస్టిక్ కాలం ప్రారంభమైంది. క్రీ.పూ. 323లో అలెగ్జాండర్ ది గ్రేట్ మరణం తరువాత, అతని సైన్యాధ్యక్షులు సామ్రాజ్యాన్ని తమలో తాము విభజించుకున్నారు. తరువాతి 30 సంవత్సరాలు వారు సామ్రాజ్యంపై నియంత్రణ కోసం పోరాడారు. అలెగ్జాండర్ మరణం తరువాత, క్రీ.పూ.301-198 వరకు యూదయను ఈజిప్షియన్-హెలెనిక్ టోలెమీలు పాలించారు. తరువాత ఆంటియోకస్ III ఆధ్వర్యంలో సిరియన్-హెలెనిక్ సెలూసిడ్ సామ్రాజ్యం యూదయ పై నియంత్రణను సాధించింది, (క్రీ.పూ. 200–142). ఈ కాలంలో, ఇశ్రాయేలు మందిర ప్రధాన యాజకున్ని గ్రీకు పాలన యొక్క ప్రత్యక్ష ఆమోదంతో నియమించారు, మత రాజకీయాలను ప్రభుత్వంతో కలపడం కొనసాగించారు. ఆ కాలంలో క్రీ.పూ.167లో, సెలూసిడ్ రాజు ఆంటియోకస్ IV యూదయను ఆక్రమించి, ఆలయంలోకి ప్రవేశించి, దాని డబ్బును ఆచార వస్తువులను లాక్కున్నాడు. అతడు బలవంతపు హెలెనైజేషన్ కార్యక్రమాన్ని విధించాడు. యూదులు తమ ధర్మశాస్త్రాన్ని ఆచారాలను విడిచిపెట్టాలని ఆదేశించాడు. అతడు సాంప్రదాయ యూదు పద్ధతులపై హింసను ప్రారంభించాడు. యూదయను హెల్లెనైజ్ చేయడానికి ఆంటియోకస్ చేసిన ప్రయత్నాలు మతపరమైన రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. అతని విధానాలను ప్రతిఘటించడంలో హసిదిమ్ లు ఉద్భవించారు, కీలక పాత్ర పోషించారు. అది యూదాలో తిరుగుబాటుకు దారితీసింది. అత్యంత విజయవంతమైన తిరుగుబాటుదారులను హస్మోనియన్ కుటుంబం నడిపించింది, ఇది మక్కాబీయన్ తిరుగుబాటుగా మారింది. క్రీ.పూ.165లో జెరూసలేం విముక్తి పొందింది. ఆలయం పునరుద్ధరించబడింది.
“హసిదిమ్”: సెల్యూసిడ్ మరియు హస్మోనియన్ కాలంలో ఇశ్రాయేలులో నివసిస్తున్న యూదులను హెలెనైజ్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. కొంతమంది పాలకులు యూదులను గ్రీకు సంస్కృతి దాని ఆచారాలను అవలంబించాలని (యూదుల మత విశ్వాసాలను అనుసరించవద్దని) బలవంతపెట్టారు. ఈ సమయంలో, వారి సాంప్రదాయాలు సంస్కృతికి, మతానికి నమ్మకంగా ఉన్న యూదులలో కొందరు కలిసికట్టుగా ఉండటం ప్రారంభించారు. వీళ్ళు యూదులను హెలెనైజ్ చేయడానికి చేసిన అన్ని ప్రయత్నాలను వ్యతిరేకించారు. హెలెనిస్టిక్ ప్రభావాలు ఆచారాలకు వ్యతిరేకంగా నిలిచారు. ఈ సాంస్కృతిక సంప్రదాయవాద సమూహం “హసిదిమ్” (అక్షరాలా, “సెపెరేటెడ్” “వేరు చేయబడిన వారు”) అని పిలువబడ్డారు. “హసిదిమ్” అనే పదం ధర్మశాస్త్రానికి యూదుల సాంప్రదాయ పద్ధతులకు కట్టుబడి ఉండే భక్తిగల యూదుల సమూహాన్ని సూచిస్తుంది. హసిదిమ్లు మతపరమైన స్వచ్ఛత, టోరా పట్ల విశ్వసనీయత, వారి అచంచలమైన నిబద్ధత, నీతివంతమైన జీవన విధానాన్ని బట్టి ప్రత్యేకించబడ్డారు. సంవత్సరాలుగా అందించబడిన అనేక మతపరమైన సంప్రదాయాలను (ఓరల్ టోరాను) అనుసరించాలని పట్టుబట్టారు. వీళ్ళే పరిసయ్యుల పూర్వీకులుగా పరిగణించబడ్డారు.
హెలెనైజేషన్ను సమర్థించే వారికి (సద్దూకయ్యులు) దానిని ప్రతిఘటించిన వారికి (పరిసయ్యులు) మధ్య వివాదం సాంస్కృతికమైనది, న్యాయ-మతపరమైనది. ఆలయ ఆచారాలు సేవలతో దాని ప్రాముఖ్యతను నొక్కిచెప్పే వారికి (సద్దూకయ్యులు) మరియు ఇతర మొజాయిక్ చట్టాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పే వారికి (పరిసయ్యులు) మధ్య మతపరమైన సంఘర్షణ అంశంలో తోరా యొక్క విభిన్న వివరణలు దానిని యూదు జీవితానికి ఎలా అన్వయించాలి అనే విషయములో యూదులు విభజింపబడ్డారు. సద్దూకయ్యులు వ్రాతపూర్వక తోరాను మాత్రమే గుర్తించి ప్రవక్తలు, వారి రచనలు, మౌఖిక తోరా, మృతుల పునరుత్థానం వంటి సిద్ధాంతాలను తిరస్కరించారు.
“హసిదిమ్”లు దేవుని ధర్మశాస్త్రము ఇశ్రాయేలు యొక్క సాంస్కృతిక సంప్రదాయాలకు కట్టుబడి వాటిని కాపాడుకోవటం కోసం సెల్యూసిడ్స్కు వ్యతిరేకంగా పోరాడుతూవున్న మక్కాబీస్తో చేరి పోరాడారు. సెల్యూసిడ్ దళాలను ఓడించిన తర్వాత, జూడాస్ మక్కబీయస్ మేనల్లుడు జాన్ హిర్కానస్, క్రీ.పూ.152లో హస్మోనియన్ రాజవంశం రూపంలో కొత్త రాచరికాన్ని స్థాపించాడు. ఇది స్వతంత్ర యూదు రాజ్యం (హస్మోనియన్ రాజవంశం) స్థాపనకు దారితీసింది. ఫలితంగా హస్మోనియన్ రాజవంశం ఏర్పడింది. జాన్ హిర్కానస్ తన ఇష్టానుసారంగా యాజకులను ఇతర రాజకీయ మతపరమైన అధికారులును ఏర్పర్చుకొన్నాడు. సెల్యూసిడ్లను ప్రతిఘటించినందుకు హస్మోనియన్లను హీరోలుగా పరిగణించినప్పటికీ, వారి పాలనలో మొదటి ఆలయ యుగం యొక్క డేవిడిక్ రాజవంశం యొక్క చట్టబద్ధత వీరికి లేదు. క్రీ.పూ.141లో, సైమన్ మక్కబీయస్ ప్రధాన యాజకునిగా/ నాయకుడిగా ఎన్నిక చేయబడ్డాడు.
ఇంటర్టెస్టమెంటల్ కాలంలో యూదు చరిత్ర గమనాన్ని రూపొందించడంలో హసిడిమ్లు ముఖ్యమైన పాత్ర పోషించారు. హెలెనిస్టిక్ ప్రభావాలకు వారి ప్రతిఘటన, టోరా పట్ల వారి నిబద్ధత మరియు మక్కాబీన్ తిరుగుబాటులో వారి పాత్ర యూదుల మత సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడానికి సహాయపడింది. యూదులకు ఆరాధన అర్పణలకు కేంద్ర స్థలంగా ఉన్న యెరూషలేము ఆలయంతో హసిదిమ్లు లోతైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు. వారు దాని పవిత్రతను దాని ఆచారాల స్వచ్ఛతను కాపాడటానికి ప్రయత్నించారు. ఆలయం విదేశీ జోక్యం నుండి విముక్తి పొందిన తర్వాత, వారు రాజకీయ స్వేచ్ఛ కోసం పోరాడటానికి నిరాకరించారు.
హస్మోనియన్ల కాలములో వారి మధ్య రాజకీయ విభేదాలు మరింత పెరిగాయి. ఇది క్రీ.పూ.63లో రోమన్ జనరల్ పాంపే జోక్యం చేసుకుని యెరూషలేమును స్వాధీనం చేసుకున్నప్పుడు ఇది ఒక కొలిక్కి వచ్చింది. ఆ కాలంలో, జోసెఫస్ ప్రకారం, పరిసయ్యులు పాంపే ముందు హాజరై, హస్మోనియన్ల రాజరికాన్ని పూర్తిగా రద్దు చేస్తూ, జోక్యం చేసుకుని పాత యాజకత్వాన్ని పునరుద్ధరించమని కోరారు. పరిసయ్యులు రోమన్లకు యెరూషలేము ద్వారాలను కూడా తెరిచారు. వారికి వ్యతిరేకంగా రోమన్లకు మద్దతు ఇచ్చారు. చివరకు రోమన్లు యెరూషలేము ఆలయ ప్రవేశ ద్వారం బద్దలు కొట్టినప్పుడు, సబ్బాత్ రోజున ఆలయ సేవలను నిర్వహిస్తున్న యాజకులను పరిసయ్యులు చంపారు. వారు యెరూషలేములో ఆలయాన్ని పాంపే అపవిత్రం చేయడాన్ని హస్మోనియన్ /సద్దూసియన్ దుష్ప్రవర్తనకు దైవిక శిక్షగా భావించారు. పాంపే క్రీ.పూ.63లో రాచరికాన్ని ముగించాడు. అతడు హిర్కనస్ IIని ప్రధాన యాజకునిగా నియమించాడు.
ఒక వ్యక్తి గ్రీకు ఆచారాలలో దేనినైనా స్వీకరించి నమ్మకమైన యూదుడిగా ఉండగలడా లేదా అనే విషయంలో ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నంలో ఇశ్రాయేలు మత పెద్దల మధ్య చీలిక వచ్చింది. ఇది జాన్ హిర్కనస్ ప్రధాన యాజకునిగా ఉన్నప్పుడు జరిగింది. అప్పటినుండి హాసిడిమ్ పరిసయ్యులుగా, ఇతరులు సద్దుకయ్యులుగా యూదులలో ఇతర పార్టీలుగా చీలిపోయారు. ఈ పార్టీలకు అధికారిక సభ్యత్వ జాబితాలు లేనప్పటికీ, ప్రజలు తమ స్వంత రాజకీయ మత విశ్వాసాలకు అనుగుణముగా ఉండే పార్టీలకు మద్దతు ఇవ్వటం జరిగింది.
పరిసయ్యులు
బైబిల్లో, పరిసయ్యులు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 70లో ఆలయం నాశనం అయ్యే వరకు క్రియాశీలకంగా ఉన్న ఒక ప్రముఖ యూదు శాఖ. వారు ప్రవక్తల నుండి అందించబడిన మౌఖిక సంప్రదాయాలతో సహా మోషే ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించాలని నొక్కిచెప్పారు. మృతుల పునరుత్థానం మరియు భవిష్యత్ మెస్సీయను విశ్వసించారు.
ఈ మతశాఖ ఇశ్రాయేలులోని ఇతర మతపరమైన పార్టీలలో అతిపెద్దది అత్యంత ప్రభావవంతమైనది. దీని కారణంగా కొత్త నిబంధనలో మనం ఇతర గుంపుల కంటే పరిసయ్యుల గురించే ఎక్కువగా వింటూ ఉంటాం. “హసిదిమ్”లు, పరిసయ్యులు ధర్మశాస్త్రం సాంప్రదాయ పద్ధతులపై ఉమ్మడి ప్రాధాన్యతను పంచుకున్నప్పటికీ, పరిసయ్యులు మరింతగా అధికారిక ధర్మశాస్త్రపరమైన సంప్రదాయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. యూదయ రాజకీయ సామాజిక జీవితంలో ఎక్కువగా పాల్గొన్నారు.
పరిసయ్యుల విశ్వాసం మోషే ధర్మశాస్త్రము దాని నుండి ఉద్భవించిన అనేక సంప్రదాయాలపై కేంద్రీకృతమై ఉంది (ఓరల్ టోరా). వారు దేవాలయంలో ఆరాధించడం గురించిన అన్ని ఆజ్ఞలను పాటించేవారు. ధర్మశాస్త్రం పై ఈ ప్రాధాన్యత కారణంగా, అనేకమంది ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యుల సిద్ధాంతాలకు అనుకూలంగా మారారు. పాత నిబంధనలో, ఈ ధర్మశాస్త్రోపదేశకులను “శాస్త్రులుగా” పిలిచేవారు. వారి ప్రధాన పని పాత నిబంధన కాపీలను తయారు చేయడం. ఇలా చేయడం ద్వారా, వారు పాత నిబంధన గ్రంధాలలో చాలా జ్ఞానవంతులయ్యారు. అందువలన, వారు క్రమంగా ధర్మశాస్త్రోపదేశకులుగా మరియు ధర్మశాస్త్రములో నిపుణులుగా పరిగణించబడ్డారు. కొత్త నిబంధన సమయానికి, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యుల మాదిరిగానే, ధర్మశాస్త్రానికి, పెద్దల సంప్రదాయాలకు గొప్ప రక్షకులుగా మారారు. క్రొత్త నిబంధనలో పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు యేసును ఆయన బోధనలను ఐక్యంగా వ్యతిరేకించడాన్ని చూడొచ్చు (మత్తయి 12:38).
పరిసయ్యులు దేవుని ధర్మశాస్త్రం దానికి జోడించబడిన వందలాది సంప్రదాయాలు రెండింటినీ సంపూర్ణంగా పాటిస్తున్నారని నమ్మేవాళ్ళు. వారు లేఖనాలతో పాటు మౌఖిక తోరాను, సీనాయి దగ్గరనుండి ప్రస్తుత కాలము వరకు ఉన్నటువంటి పెద్దల పరంపర్యాచారములను అంగీకరించారు. అనేక సందర్భాల్లో, వారు ధర్మశాస్త్రం యొక్క ప్రతి మాటను పాటిస్తున్నామని అనుకొన్నారు కాని దాని నిజమైన ఉద్దేశాన్ని వారు అర్థం చేసుకోలేదు లేదా అనుసరించలేదు. ధర్మశాస్త్రాన్ని పాటించడంలో వారి అసమర్థతను, సొంత పాపాన్ని చూడటానికి బదులుగా వారు చిన్న చిన్న నియమాలను పాటించడంలో తమ గొప్పతనాన్ని గురించి గర్వపడ్డారు (లూకా 18:10ff).
వారసత్వంగా వచ్చిన ఆచారాలు యాజకత్వము ద్వారా గుత్తాధిపత్యం చేయబడవు, వయోజన యూదులందరూ వ్యక్తిగతంగా లేదా సామూహికంగా వాటిని పాటించొచ్చు. పరిసయ్యులు పుట్టుకతో నిర్ణయించబడరు కాని కఠినముగా లేఖన శిక్షణ ద్వారా నిర్ణయించబడ్డారు. పరిసయ్యుల, రబ్బీల పాఠశాలలు ఎంతో కఠినమైనవి పవిత్రమైనవి : వాటిలో తోరాను అధ్యయనం చేయడం, వారి గురువుల ప్రవర్తనను అనుకరించడం ద్వారా పవిత్రతను సాధిస్తారు అని శిక్షణ పొందేవాళ్ళు, శిక్షకులు ఇద్దరు నమ్మేవాళ్ళు. అలా చేయడం ద్వారా, వారు పరలోకపు మాదిరికి అనుగుణంగా ఉంటారని నమ్మేవాళ్ళు. దేవుడు “తన స్వరూపంలో” తోరాను సృష్టించాడని, సీనాయి దగ్గర దానిని వారి గురువులకు అప్పగించాడని, గురువులు శిష్యులు మోషే యొక్క దైవిక బోధనను పాటిస్తే, అప్పుడు వారి సమాజం, పాఠశాల, భూమిపై పరలోకపు పాఠశాలను ప్రతిబింబిస్తుందని, శిష్యుడు మోషేయొక్క నమూనాను అనుసరించి పరలోకపు మాదిరికి అనుగుణముగా ఉంటాడని నమ్మేవాళ్ళు. ధర్మశాస్త్రము ద్వారా దైనందిన జీవితానికి మతాన్ని అనుసంధానించాలనే నిబద్ధతతో రెండవ ఆలయ యుగంలో ఇతర శాఖల కంటే పరిసయ్యులు ఎక్కువ ధర్మశాస్త్రబద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు.
పరిసయ్యులు వారి దైనందిన ప్రపంచాన్ని పవిత్రం చేయడానికి యూదుల ధర్మశాస్త్రాన్ని వారి ప్రాపంచిక కార్యకలాపాలకు వర్తింపజేస్తూ, జుడాయిజం యొక్క రూపాన్ని కొనసాగించారు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన యెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదేగదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము అను నిర్గమకాండము 19:3–6 యొక్క విస్తృతమైన అక్షరార్థమైన వివరణను పరిసయ్యులు గట్టిగా నమ్మేవాళ్ళు. ఇశ్రాయేలీయులందరు యాజకులవలె ఉండాలనే ఆలోచనను పరిసయ్యులు విశ్వసించారు. ఆలయ అర్చకత్వం లేదా ఆలయాన్ని సందర్శించే యూదులు మాత్రమే కాకుండా వారి సాధారణ జీవితంలో యూదులందరూ శుద్ధీకరణకు సంబంధించిన నియమాలు ఆచారాలను తప్పనిసరిగా పాటించాలని పరిసయ్యులు నమ్మేవాళ్ళు.
పరిసయ్యులు దేవుని ధర్మశాస్త్రము యొక్క కఠినమైన బాహ్య ఆచారాలను పాటించడంలో ప్రసిద్ధి చెందారు. పాత నిబంధన ప్రకారం, ప్రతి యూదుడు ధర్మశాస్త్రాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి దాని ప్రకారం తన జీవితాంతం జీవించాలి. దీనిని వాళ్ళు అక్షరాలా పాటించారు. వారు లేఖనాల ముక్కలను తోలు పట్టీలకు కట్టి, ఆ పట్టీలను వారి చేతులకు మరియు ముందరి తలలకు కట్టుకున్నారు. వీటిని రక్షరేకులు అని పిలుస్తారు (మత్తయి 23:5). అదనంగా, పరిసయ్యులు దశమ భాగం (అంటే తమ ఆదాయంలో పదోవంతు ప్రభువుకు ఇవ్వండి) అనే ఆజ్ఞను కఠినంగా పాటించే వారు. వాళ్ళు తమ పెరటి తోట ఉత్పత్తి చేసిన చిన్న చిన్న వాటిని కూడా దశమ భాగంగా ఇచ్చేవారు (మత్తయి 23:23). వారు బాగా అలంకరించబడిన ప్రార్థన శాలువాలు ధరించే వారు. వారికి విందులు ప్రార్థనా మందిరాలలో గౌరవ సీట్లు కేటాయించబడేవి, (మత్తయి 23:6,7). ధర్మశాస్త్రము పై వారికున్న జ్ఞానం కారణంగా, వారిని “రబ్బీ” లేదా “బోధకుడా” అని పిలిచేవారు. వారు అన్ని శుద్ధికారణాచారములను పాటించడం గర్వంగా భావించారు (మత్తయి 23:25). పాత నిబంధన ప్రవక్తలకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు (మత్తయి 23:29). వారు విశ్రాంతి దినానికి సంబంధించిన అన్ని నియమాలను పాటించడంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపేవారు (మార్కు 2:23-3:6). అదనంగా, వారు యూదుడు కాని వారితో ఎలాంటి పరిచయాన్ని కలిగి ఉండేవారు కాదు. అన్యులను అన్నివిధాలుగా “అపవిత్రులుగా” పరిగణించేవారు. ఇతర యూదులను తమ పక్షాన ఉంచుకోవడానికి ప్రయత్నించే వారు.
పరిసయ్యులు వారి స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి వారి సంప్రదాయాలను వాడుకోవడంలో మరియు దేవుని ధర్మశాస్త్రానికి వారి స్వంత వివరణలను జోడించడంలో సిద్ధహస్తులు. ఉదాహరణకు, వారు వివాహం మరియు విడాకుల విషయంలో దేవుని ఉద్దేశాలను ఎలా వక్రీకరించారో (మార్కు 10:1ff) చూపిస్తుంది.
కొన్నిసార్లు వారు లేఖనాలను వక్రీకరించినా లేదా తప్పుగా చదివినా, పరిసయ్యులు తరచుగా బైబిల్ సత్యాలను బోధించారు. వారు బైబిల్ బోధలైన శరీరం యొక్క అంతిమ పునరుత్థానం, నీతిమంతులకు బహుమతులు మరియు దుర్మార్గులకు శిక్షలు అను వాటిని సరిగ్గా నొక్కి చెప్పారు. వారు మెస్సీయ రాకడ కోసం ఎదురు చూశారు. అయితే వారు భూసంబంధమైన ఆధ్యాత్మిక రాజ్యాన్ని కలిగి ఉండే మెస్సీయ కోసం ఎదురు చూస్తున్నారు. వారు ఇశ్రాయేలు యొక్క భూసంబంధమైన వైభవం పునరుద్ధరింపబడాలని ఆకాంక్షించారు. ఇది రాబోయే క్రీస్తు ఆయన శాశ్వత రాజ్యం గురించిన వాగ్దానాల పై నుండి వారి దృష్టిని మరల్చి వేసింది.
వారు ఆలయం వెలుపల ప్రార్థనా స్థలంగా ప్రార్థనా సమాజమందిరాన్ని అభివృద్ధి చేసి ప్రోత్సహించారు. వారు ధర్మశాస్త్రం వివిధ పరిస్థితులకు దాని అన్వయంపై తీవ్ర శ్రద్ధ వహించారు. వారు దానధర్మాలు చేయడం, చనిపోయిన వారిని సమాధి చేయడం వంటి పవిత్రమైన చర్యలను నొక్కిచెప్పారు, వీటిని ధర్మశాస్త్రం సమర్థిస్తున్నట్లు భావించారు. వారు రబ్బినికల్ జుడాయిజం అభివృద్ధిలో యూదు సంప్రదాయాల పరిరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషించారు. వారి ధర్మశాస్త్ర వివరణలు శతాబ్దాలుగా యూదుల చట్టపరమైన ఆలోచనను ప్రభావితం చేశాయి.
ధర్మశాస్త్రం యొక్క కఠినమైన ఆచరణ కోసం వారు సాధారణ ప్రజలను డిమాండ్ చేసేవారు కాబట్టి వాళ్ళు ప్రజలకు భారంగా కనిపించారు. పరిసయ్యుల వేషధారణ, ధర్మశాస్త్రబద్ధత అంతర్గత నీతి కంటే బాహ్య నియమాలపై దృష్టి పెట్టేటట్లు చెయ్యడం మూలాన్న యేసు తరచుగా వారిని విమర్శించాడు.
యేసు కాలంలోని పరిసయ్యుల సంఖ్య వారికున్న ప్రజాదరణను గురించి పండితులు విభేదించినప్పటికి, వారికి సమాజంలోని అన్ని తరగతుల నుండి మద్దతు ఉండేది (ధర్మశాస్త్రోపదేశకులు మరియు యూదు పాలక మండలి సన్హెడ్రిన్ నుండి కూడా). నీకొదేము (యోహాను 3:1-21) అరిమతీయాకు చెందిన యోసేపు (యోహాను 19:38), సౌలు (ఫిలిప్పీ 3:2-11) ప్రముఖ పరిసయ్యులైన వీరు నిజమైన మెస్సీయయైన క్రీస్తుకు అనుచరులుగా మారారు.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl