యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చుట (యేసుని మొదటి సూచక క్రియ)

యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చుట

యోహాను 2:_1 మూడవదినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. 2యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి. 3ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి–వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా 4యేసు ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయమింకను రాలేదనెను. 5ఆయన తల్లి పరిచారకులను చూచి –ఆయన మీతో చెప్పునది చేయుడనెను. 6యూదుల శుద్ధీకరణా చారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడి యుండెను. 7యేసు–ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. 8అప్పుడాయన వారితో–మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొని పోయిరి. 9ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారుని పిలిచి 10–ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను. 11గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలు పరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.

  1. మూడవదినమున అంటే? కానా ఎక్కడవుంది?
  2. యేసు పెండ్లికి ఎందుకని ఆహ్వానించబడ్డాడు?
  3. వైన్ త్వరగా ఎందుకని అయ్యిపోయి ఉండొచ్చు?
  4. మరియ యేసును ఎందుకని జోక్యం చేసుకోమంది?.
  5. మరియ ఈ విషయాన్ని యేసుతో ఎందుకు చెప్పింది?
  6. ఆమె ఒక అద్భుతాన్ని ఆశిస్తుందా?
  7. యేసు ఆమెకు జవాబిస్తూ ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? అను మాటలకు అర్థమేమిటి?
  8. మరియ యేసుకు చెప్పడంలో ఆమె ఉదేశ్యము ఏంటి?
  9. నా సమయమింకను రాలేదని యేసు చెప్పడంలో యేసుని ఉదేశ్యము?
  10. ఆయన మీతో చెప్పునది చేయుమని చెప్పడంలో మరియ అంతర్యం?
  11. నీటిని ద్రాక్షారసముగా మార్చడానికి యేసు ఏమి చేసాడు? నీళ్లను పట్టుకొన్నాడా? ప్రార్ధన చేశాడా? ఆకాశమువైపు కన్నులెత్తి చూసాడా? నీరు ద్రాక్షారసముగా మారు అని చెప్పాడా?
  12. అద్భుతం అనేది ప్రకృతికి విరుద్ధంగా జరిగే ఒక అసాధారణమైన సంఘటన, ఇక్కడ ఏమి జరిగింది?
  13. ఓయినోస్ అంటే అర్థమేమిటి? యేసు ద్రాక్షారసమును చేశాడా లేదా రియల్ వైన్ ని చేశాడా?
  14. ఈ అద్భుతం The manifestation of Christ’s glory ని ఏవిధముగా బయలుపరుస్తూవుంది?
  15. యేసు చేసిన ఈ అద్భుతం యేసుని గురించి ఏయే విషయాలు తెలియజేస్తూ వుంది?

మూడవదినమున అంటే? యేసు తన మొదటి శిష్యులను పిలిచిన మూడు రోజుల తర్వాత, నతనయేలుతో అతని సంభాషణ తర్వాత మూడవ రోజున, యేసు తన శిష్యులతో, అంద్రెయ పేతురు యోహాను యాకోబు ఫిలిప్పు మరియు నతనయేలు అను వారితో కలసి గలిలయ సముద్రానికి మధ్యధరా సముద్రానికి ఉత్తర-మధ్య ప్రాంతంలో నజరేతుకు ఈశాన్య, గలిలీ సముద్రానికి వెళ్లే దారిలో ఉన్న కానా అను ఒక ఊరికి ఒక వివాహానికి వచ్చాడు. నజరేత్‌కు ఈశాన్యంగా 6 మైళ్ల దూరంలో ఉన్న ఒక చిన్న ఊరు కానా. యోహాను  21:2 ప్రకారం కానా నతనయేలు స్వస్థలం. ఇది ఇప్పుడు కెర్ కెన్నా అని పిలువబడుతూ వుంది.

యేసు ఎందుకు ఆహ్వానించబడ్డాడు? అనే ప్రశ్నకు, యేసు తల్లి అక్కడ ఉండెను; ఆమె కొరకు యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి. యేసుని తల్లి అయిన మరియ కూడా ఆ వివాహానికి హాజరైనట్లుగా ఈ వచనాలు తెలియజేస్తూ ఉండటమే కాకుండా 12వ వచనంలో, పెండ్లి తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి అను మాటలను బట్టి యేసుని కుటుంబమంతా ఈ పెండ్లికి హాజరైయిందని మనం చెప్పొచ్చు. యేసుని తల్లికి వధూవరులకు ఉన్న సంభంధ మేమిటో మనకు తెలియదు కాని ఆ వివాహములో యేసుని తల్లియైన మరియ సర్వింగ్ ని సూపర్వైజ్ చేస్తూ ఉండటం సేవకులపై అధికారాన్ని కలిగి ఉండటాన్ని బట్టి వధూవరులు మరియకు సన్నిహితులై ఉండొచ్చు అని మనం చెప్పొచ్చు.

యూదుల పెళ్లిలో, పెండ్లి తరువాత వివాహ ఉత్సవాన్ని కొందరు వారం రోజులపాటు జరుపుకొనే వాళ్ళు. పేదవారైతే ఒక రోజే. యూదులకు పెండ్లి అంటే ఒక పరిశుద్ధ సంస్కారము వంటిది. పెండ్లికి ముందు జరగబోయే పెండ్లి కొరకు వాళ్ళు ఉపవాసాలు వుండేవాళ్ళు. పాపములు ఒప్పుకొనే వాళ్ళు. వివాహ స్థితిలోనికి ప్రవేశించడమంటే పరిశుద్ధమైన స్థితి లోనికి ప్రవేశించడమని వాళ్ళు అనుకొనే వాళ్ళు. కాబట్టి ఈ వివాహ వేడుకను అంటే ఆ పరిశుద్ధ సంస్కారములోని పరిశుద్ధతను సంతోషమును శ్రద్దగా ప్లాన్ చేసివుంటారని మనం అనుకొంటాము కాని, ఆ వివాహ వేడుకలో అసాధారణమైన ఒక సంఘటన జరిగింది. యూదులకు భోజనంలో వైన్ ప్రధానమైనది. ఆ సెలెబ్రేషన్స్ లో వైన్ అయిపోయింది. వైన్ ఎందుకని అయ్యిపోయిందో కారణమూ తెలుపబడలేదు (అతిధులు అధికముగా రావడం బట్టి వైన్ అయ్యిపోయిందా లేక అతిధులు వైన్ ను అధికముగా తీసుకొనుటను బట్టి అయ్యిపోయిందా లేక సరిగా ప్లాన్ చెయ్యక పోవడాన్ని బట్టి అయ్యిపోయిందా). అట్లే పెండ్లి విందులో ఏ రోజున కొరత ఏర్పడిందో బైబిలులో చెప్పబడలేదు.

వైన్ త్వరగా ఎందుకని అయ్యిపోయి ఉండొచ్చు? అనే ప్రశ్నకు యేసు అదనపు అతిథులతో వచ్చినందున, వారు వైన్‌ కొరతకు కారణమై ఉండవచ్చని కొందరు చెప్తారు. మరికొందరు వధూవరులు పేదవారని తగినంత వైన్ని సమకూర్చలేక పోయారని చెప్తుంటారు. ఈ రెండు జవాబులు హాస్యాస్పదమేనని చెప్పాలి.

మరియ యేసును ఎందుకని జోక్యం చేసుకోమంది? అనే ప్రశ్నకు కొందరు ఈ వివాహము మరియ బంధువులలో ఒకరిదని, మరియ బంధువులు ద్రాక్షారసం అయిపోయి ఆతిథ్యం ఇవ్వలేని ఎంబర్రస్సింగ్ పరిస్థితిలో ఉండగా మరియ యేసును జోక్యం చేసుకోమని అడిగి ఉండొచ్చు అని చెప్తారు. వివాహ ఉత్సవంలో వైన్ అయ్యిపోవడం చాలా ఎంబర్రస్సింగ్ సిట్యుయేషన్. ఇబ్బందికరమైన పరిస్థితి.

యేసుని తల్లి అయిన మరియ యేసుని దగ్గరకువచ్చి వివాహ వేడుకలో  “వైన్ లేదు” అనే విషయాన్ని ఆమె యేసుకు చెప్పింది. మరియ ఈ విషయాన్ని యేసుతో ఎందుకు చెప్పింది? పెండ్లిలో వైన్ అయ్యిపోయింది యేసు నీవును నీ శిష్యులును వెళ్లిపోవచ్చు అనే హింట్ ఏమన్నా ఇచ్చి వుండొచ్చు అంటారా? కొందరి వివరణ ఏమిటంటే, ఆ రోజుల్లో కుటుంబ గౌరవానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. వివాహాలు సాధారణంగా ఏడురోజుల పాటు కొనసాగేవి. ఆ సమయంలో వధువు వరుడి కుటుంబాలు ఆహారాన్ని వైన్ని పెండ్లికి వచ్చిన అందరికి సమృద్ధిగా అందుబాటులో ఉంచేవారు. ఆహారము వైన్ లో కొరత అంటే ఆలోచన లేని దారుణమైన వారి ఆతిధ్యాన్ని సూచించడమే కాకుండా ఇంటి పేరు మీద పరువు పోతుంది. కాబట్టే కొందరేమో మరియ బంధువుల కుటుంబం సమాజములో అవమానించబడకుండా ఏమి చెయ్యాలనే విషయంలో ఆమె తన కొడుకును జనరల్ గా సలహా అడిగుండొచ్చు అని చెప్తారు.

యేసు ఏమి చేయగలడు? ఆమె ఒక అద్భుతాన్ని ఆశిస్తుందా? యేసు అప్పటికి ఇంకా ఎలాంటి అద్భుతాన్ని చేయనప్పటికి, యేసు ఆ ఇబ్బందికర పరిస్థితిని మార్చగలడనే నమ్మకంతో అయిపోయిన ద్రాక్షారసము విషయములో యేసు ఏదైనా చేయాలని మరియ ఆశించివుండొచ్చు అనే విషయాన్ని మనం తోసిపుచ్చలేము. ఆ వివాహ వేడుకలో ఎదురైనా సమస్యను యేసుని అసాధారణ సహాయం ద్వారా వెంటనే పరిష్కరించి ఇబ్బందిని నివారించాలని మరియ కోరుకొంటుందనేది సుస్పష్టం. ఎందుకంటే, ఆమెకు యేసు ఎవరో వ్యక్తిగతముగా తెలుసు. (యేసుజన్మమును గురించి దేవదూత తనతో మాట్లాడడం, గొర్రెల కాపరుల సందర్శన, యేసును శిశువుగా మందిరమునకు తీసుకొని వెళ్ళినప్పుడు సుమెయోను హన్నల మాటలు, జ్ఞానుల రాకడ, 12 సంవత్సరాల బాలుడైన యేసు యూదా మత పెద్దలతో మాట్లాడటం, యేసుని బాప్తిస్మమును గురించి ఆ బాప్తిస్మములో ఇవ్వబడిన దేవుని సాక్ష్యమును గురించి శిష్యులను ఆయన ఏర్పరచుకోవడం గురించి ఆమె ఆలకించి ఉండొచ్చు). ఇవన్ని మరియకు కలిగిన ప్రత్యక్షతలను నిర్ధారిస్తూ వున్నాయి. మరియ తన హృదయంలో యేసు గురించిన అనేక విషయాలను భద్రము చేసుకొనియున్నదని లూకా 2: 51 వచనము స్పష్టముగా తెలియజేస్తూవుంది. తన కుమారుడైన ఈ యేసే మెస్సయ్య అని ఎరిగివుండటం మూలాన్న ఆ విశ్వాసమును బట్టే తన కొడుకు తప్ప ఏ మనిషి సహాయపడలేని ఆ పరిస్థితులలో మరియ తన కొడుకు వైపు తిరిగింది. అద్భుతాన్ని ఆమె ఆయన నుండి ఎదురు చూస్తూ ఉండొచ్చు. తాను ఒక అద్భుతం చేయాలని మరియ కోరుకుంటోందనే విషయం యేసుకు అర్ధం అయ్యింది.

అయితే యేసు ఆమెకు జవాబిస్తూ ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? అని పలికిన మాటలను మనమెలా అర్ధం చేసుకొందాం. ఎందుకంటే, తెలుగు బైబులులో మరియను “అమ్మ” అని ఇక్కడ తర్జుమా చేసారు కాని గ్రీకు బైబిలులో యేసు ఆమెను “స్త్రీగా” సంభోదించినట్లుగా వ్రాయబడియున్నది అంటే యేసు ఆమెకు జవాబిస్తూ ఆమెతో– స్త్రీ నాతో నీకేమి (పని)? యేసు తన తల్లి అయిన మరియను స్త్రీగా సంబోధించడం ఆమెను మందలించడం కాదు లేక అగౌరవపర్చడం కాదు. మరేమైవుండొచ్చు?

దేవుని రాజ్యము విషయానికి వచ్చేటప్పటికి భూసంబంధమైన సంబంధాలకు ఎలాంటి తావు లేదు కాబట్టే యేసు మరియను దేవుని రాజ్యములోని స్త్రీలలో ఒకరిగా ఆమెను కూడా స్త్రీగా సంభోదించియున్నాడు. అలాగే ఇది ఆమెకు ఒక హింట్ ఇస్తూ ఉంది_ అదేమిటంటే మెస్సయ్య కార్యనిర్వహణ విషయములో ఆమె యేసుకు తల్లిగా ఎలాంటి జోక్యం చేసుకోకూడదు అనే విషయాన్ని ఇది తెలియజేస్తూ ఉందని చెప్పొచ్చు. ఈ పాఠాన్ని మరియ నేర్చుకోలేదు కాబట్టే మత్తయి 12:48లో నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి యేసు తన శిష్యులవైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును అని మళ్ళి చెప్పవలసి వచ్చింది.

యేసు పరిచర్యలో మొదటి అద్భుతానికి సిద్ధమైన వేదికగా ఈ వివాహ ఉత్సవంలో కొరత ఏర్పడుతుందని దేవునికి ముందే తెలుసు. ఈ కొరత ద్వారా తన కుమారుని ఎలా హైలైట్ చెయ్యాలో నిత్యత్వములోనే నిర్ణయించబడింది. వైన్ అయ్యిపోయిన విషయాన్ని మరియ యేసుకు తెలియజేస్తుందని కూడా దేవునికి ముందే తెలుసు. కాకపోతే ఇక్కడ మరియ ఉదేశ్యము ఎలా ఉందంటే, ఇబ్బందికర పరిస్థితిని అధిగమించ డానికి వైన్ విషయములో తక్షణమే స్పందించి వెంటనే దేవునికుమారునిగా ఏదైనా చేయుమనే ఉదేశ్యముతో క్రీస్తు కార్యనిర్వహణ విషయములో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వుంది. నేనైతే విషయాలు భిన్నముగా ఉండెడివి అనే ఆమె అంతర్ స్వభావమును బట్టే యేసు అమ్మా నాతో నీకేమి (పని)? అని కఠినముగా చెప్పవలసివచ్చింది.

ఈ మాటలలో యేసు నేనేమి చేయలేనని చెప్పడం లేదు. కాబట్టి ఈ మాటలను తిరస్కరణగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ విషయములో తాను సహాయపడగలనని ఆమె తెలుసుకోవాలనేదే యేసుని ఈ మాటలకు అర్ధం. ఈ విషయాన్నే “నా సమయమింకను రాలేదని“ యేసు పలికిన మాటలు ధ్రువీకరిస్తూ ఉన్నాయి.

నా సమయమింకను రాలేదని“ యేసు పలికిన మాటలకు అర్ధం నా పరిచర్యలోని మాటలు క్రియలు సంఘటనలు అన్ని నిత్యత్వములో ముందుగానే నిర్ణయించబడ్డాయి. కాబట్టి ప్రతిది దేవుడు నిర్ణయించిన టైములో మాత్రమే జరుగుతాయని తండ్రి పరలోకంలో నాకోసం నిర్ణయించిన ఘడియలో నేను దీనిని చేయుదునని యేసు చెప్తున్నాడు. నా సమయమింకను రాలేదని చెప్పటంలో యేసు తన మహిమను కనపర్చేందుకు ఇంకా రైట్ టైం రాలేదని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ వివాహ ఉత్సవంలో బహుశా వైన్ ఇంకా పూర్తిగా అయిపోలేదు. వైన్ అయ్యిపోవడం ప్రారంభించింది. అది పూర్తిగా అయ్యిపోవాలి. ఎప్పుడు చెయ్యాలో ఆ ఘడియ ఖచ్చితముగా దేవునికి మాత్రమే తెలుసు.  ఆ ఘడియలో చేసే అద్భుతం విశిష్టమైనదిగా ఉంటూ మెస్సయ్యా యొక్క మహిమను కనపర్చుతుంది. దేవుని ఉదేశ్యమును నెరవేరుస్తుంది. ఇదే యేసు చెప్తూవున్నాడు తప్ప తాను సహాయపడనని మరియ విన్నపాన్ని యేసు తిరస్కరించటం లేదు.

మరియ విశ్వాసము యేసు మాటలలో దాగివున్న ఈ వాగ్దానాన్ని పట్టుకొంది. ఇంకా రాలేదు అంటే వస్తుంది రైట్ టైం రానిమ్మనేగా అర్ధం. కాబట్టే మరియ పరిచారకులను చూచి –ఆయన మీతో చెప్పునది చేయుమని చెప్పింది. ఆమెలో కోపము అసహనము లేదు. ఆమె తన కొడుకుకు వైన్ విషయంలో టైంని గాని పద్ధతిని గాని నిర్దేశించడానికి ప్రయత్నించలేదు. ఆమె ఆ విషయాన్ని యేసుకే  వదిలివేసింది.

అక్కడ యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు వారికి సమీపంలో ఉంచబడియుండెను, యూదులు ఆచారబద్ధంగా శుద్ధి కోసం (తినడానికి ముందు మరియు తరువాత చేతులు కడుగు కొనుటకు, కాళ్ళు కడుగుకొనుటకు మరియు విందుపాత్రలను కడుగుకొనుటకు) ఆ రాతిబానలలోని నీళ్లను వాడుకొనే వాళ్ళు ఈ విషయం (మార్కు 7:3, 4) వచనంలో ఉంది చూడండి.

యేసు–ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. ద్రాక్షరసం అయ్యిపోయింది అనే మాటలు యేసు ఆయన తల్లి మాట్లాడుకొంటుండగా సేవకులు విన్నారు అట్లే ఆ విషయములో ఆయనేమి చెప్పిన మీరు చెయ్యండని మరియ సేవకులకు చెప్పింది ఈయనేమో రాతి బానలను నీళ్లతో నింపుమని చెప్తూవున్నాడు. సేవకుల రెస్పాన్స్ ఏవిధముగా ఉండొచ్చొ ఊహించండి. ఈయన ద్రాక్షారసము బదులు నీళ్లు పొయ్యమంటాడా ఏంటి అని అనుకొని వుండొచ్చు కదా. ఆయన మాటలు వారిని అసహనానికి గురిచేసివుండొచ్చు. అంచులమట్టుకు నింపారు ఇంక దానిలో ఏమి కలపకుండా. నీళ్లను ద్రాక్షారసముగా మార్చడానికి నీళ్లలో ఏదన్నా కలపడానికి కూడా ఖాళీ లేదు.

అప్పుడాయన వారితో–మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి. ఈ మాటలలో యేసు సేవకులకు రెండు ఆజ్జ్యలు ఇచ్చాడు_ మొదటి ఆజ్జ్య ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. రెండవ ఆజ్జ్య అప్పుడాయన వారితో–మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసికొని పొండని చెప్పగా వారు తీసికొని పోయారు. యేసుని శక్తిగల మాట నీటిని ద్రాక్షారసముగా ఎప్పుడు మార్చెనో మనకు తెలియదు.

ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని (దీనిలో ఎలాంటి సందేహము లేదు) విందు ప్రధానికి తెలియకపోయెను. సేవకులు నీళ్ళనుఁ రాతిబానలలో నింపారు, తప్ప ఆ నీళ్లు ద్రాక్షారసముగా చెయ్యడానికి వాళ్ళెలాంటి ఎక్స్ట్రా వర్క్ చెయ్యలేదు. యేసు నీళ్లను కూడా ముట్టుకోలేదు. ఎలాంటి ప్రార్ధనా చెయ్యలేదు. ఎలాంటి Earthly Elements ఆ నీళ్లకు కలుపబడలేదు యేసుని శక్తి ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చేసింది.  

ద్రాక్షారసమైన ఆ నీళ్లను విందు ప్రధాని రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పాడు.

చాలామంది కామెంటేటర్స్ యేమని చెప్తారంటే, విందు ప్రధాని ఆ నీళ్లను రుచి చూసేముందుగా ఆ నీళ్లు ద్రాక్షారముగా మారిపోయాయి అని చెప్తారు. ఈ రోజులలో సాధారణముగా మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు cheap quality పోసేవాళ్ళు అనే విషయాన్ని ఈ స్టేట్మెంట్ తెలియజేస్తూవుంది. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావనే మాటలు యేసు చేసినది రియల్ వైన్ అని బెస్ట్ క్వాలిటీ వైన్ అని తెలియజేస్తూ వున్నాయి.

నిజం చెప్పాలంటే నీళ్లు నీళ్లుగానే ఉంటాయి తప్ప ద్రాక్షారసముగా మారే ఛాన్స్ లేనేలేదు. ఆయన శక్తిగల మాట నీటిని లావిష్ వైన్ గానే కాకుండా సుపీరియర్ క్వాలిటీ వైన్ గా చేసింది. వైన్ తయారీలో అనేక ప్రక్రియలు అవసరం. ద్రాక్ష మొక్క యొక్క పరిపూర్ణమైన పెరుగుదల. మంచి కాపు. ద్రాక్ష పండ్ల మంచి పరిపక్వత. ద్రాక్ష పండ్లను జ్యూస్‌గా తొక్కడం. పులియబెట్టే ప్రక్రియకు అవసరమైన ఏజింగ్ టైం. ది బెస్ట్ వైన్ తాయారు కావటానికి పులియబెట్టడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ మొత్తం కాలవ్యవధిని యేసు రెప్పపాటులో దాటేశాడు. ఇక్కడ ప్రకృతి యొక్క సాధారణ నియమాలను అధిగమించి ది బెస్ట్ వైన్ తాయారు కావటానికి అవసరమైన కామన్ ఎక్సపెక్టషన్స్ ని ధిక్కరించి యేసుని శక్తివంతమైన చర్య ద్వారా ది బెస్ట్ వైన్ ఉనికిలోనికి వచ్చింది. అద్భుతం అనేది ప్రకృతికి విరుద్ధంగా జరిగే ఒక అసాధారణమైన సంఘటన, దీనిని నేచురల్ సైంటిఫిక్ laws ద్వారా వివరించలేము. అద్భుతం జరగడానికి సూపర్ నేచురల్ శక్తి మాత్రమే కారణం ఔతుంది. ఆ ఆరు రాతిబానలలో 129 గాలెన్స్ నీళ్లు పడతాయి. ఇది చిన్న విషయమేమి కాదండి. దీనిని బట్టి ఈ మొదటి సూచకక్రియ ఎంత పెద్దదో చూడండి. తర్కముతో అద్భుతాలను వివరించలేము. అద్భుతాలు అర్థం చేసుకోలేనివి కాబట్టే అవి అద్భుతాలు. అద్భుతాలు లేవంటే ఎలా? మనచుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి దేవుని అద్భుతమే. ఒప్పుకోవడానికి అహం అడ్డువస్తుందా? తప్పదు దేవుని క్రియలు అద్భుతాలే. 

ఇంత విస్తారముగా నీళ్లను ద్రాక్షారసముగా యేసు ఎందుకని మార్చియున్నాడు? యేసు తన దైవికమైన దాతృత్వము లో ఇంత ధారాళముగా వైన్ని ఇవ్వడం కొందరిని ఎంతగానో ఆశ్చర్యపర్చి ఉండొచ్చు. “వైన్” అను మాటకు ఇక్కడ వాడబడిన గ్రీకు పదం “ఓయినోస్, ఇది పులియబెట్టిన/ఆల్కహాలిక్ వైన్ అనే విషయాన్ని తెలియజేస్తూవుంది. మద్యం సేవించడాన్ని వ్యతిరేకించే వారు, యేసు నీటిని ఆల్కహాలిక్ వైన్ గా మార్చలేదని వాదిస్తారు, యేసు మద్యము యొక్క వినియోగాన్ని ప్రోత్సహించుచున్నాడా? అని కాన్ఫ్యుజ్ అవుతు ఉంటారు. సద్వినియోగం చేయగల పదార్థాన్ని ఒకడు సృష్టించినప్పుడు మరొకడు దానిని దుర్వినియోగం చేయడానికి మూర్ఖంగా ఎంచుకున్నప్పుడు దాని సృష్టికర్త ఆ విషయములో ఎలాంటి బాధ్యత వహించడు. యేసు ఆల్కహాలిక్ వైన్‌ని సృష్టించడం ఏ విధంగానూ తాగుబోతుతనమును ప్రోత్సహించడం కాదు.

ఎందుకంటే, ఈ అద్భుతం The manifestation of Christ’s glory ని బయలుపరుస్తూవుంది. శరీరధారిగా భూమిపైకి దిగి వచ్చిన దేవునికుమారుని సర్వశక్తిమంతత్వమును దైవత్వమును తెలియజేస్తూవుంది. ఈ అద్భుతము ద్వారా ఐశ్వర్యవంతమైన తండ్రికి కుమారునిగా యేసు తనను తాను నిరూపించుకొనియున్నాడు. వివాహం ముగిసిన తర్వాత కూడా ఆ ద్రాక్షారసము నిజముగా రూపాంతరం చెందిందనుటకు రుజువుగా అక్కడ వుంది. లిటరల్ గా అక్కడ అందరి కంటికి కనబడుతూ వుంది. ఆయన ద్వారా జరిగిన అద్భుతం గురించి అతిథులకు తెలిసినప్పుడు అది వారిని విస్మయానికి గురిచేసింది. అది మెస్మరిక్ ట్రిక్ కాదు. అక్కడ సమృద్ధిగా వైన్ ఉంది. ఆ వైన్ని అందరూ చూసారు టేస్ట్ చేసారు ఆ వార్త దావాలనంలా వ్యాపించివుంటుంది. ఈ సమాచారం ప్రజలలో యేసుపట్ల Attentiveness ని కలుగ జేసింది. యేసుని మాటలు కున్న అధికారాన్ని తెలియజేసింది. ప్రజలను యేసు వైపు ఆకర్షితులను చేసింది. ఈ మొదటి సూచకక్రియ యేసుని బహిరంగ పరిచర్యకు చాలా పెద్ద platform ని  ఏర్పాటు చేసింది.

యేసు చేసిన ఈ అద్భుతం యేసుని గురించి ఏయే విషయాలు తెలియజేస్తూ ఉందంటే, ఈ అద్భుతము ద్వారా యేసు తన సర్వశక్తిమంతత్వమును బయలుపరచినప్పుడు మనుష్యుడు తిరస్కరించలేని రీతిలో దేవుని మహిమ శిష్యులకు అక్కడవున్న అనేకులకు ప్రత్యక్షపరచబడింది_ అది యేసు దేవునినుండి పంపబడియున్నాడని తెలియజేస్తూ ఉంది, యేసు దేవుని కుమారుడని దేవుని ఆమోదాన్ని తెలియజేస్తూ వుంది. దేవుని ఉదేశ్యము ప్రకారము ఈ సూచక క్రియ ద్వారా యేసు తన శిష్యుల విశ్వాసాన్ని బలపర్చాడు మెస్సీయగా తన శక్తిని బహిర్గతపర్చాడు.

అంతేనా, 11వ వచనములోని గలిలయలోని కానాలో, అనే మాటలు  క్రీస్తు తన మొదటి అద్భుతాన్ని యెరూషలేము దేవాలయములో చెయ్యలేదు. మెస్సయ్య మొదటిగా తన మహిమను యెరూషలేములోని దేవాలయములోనే చూపిస్తాడని యూదులు ఎక్స్పెక్ట్ చేసివుండొచ్చు కాని దూరంగా ఉన్న గలిలయను మాత్రం ఎక్స్పెక్ట్ చేసివుండరు. యేసు తన మొదటి సూచక క్రియకు గలిలయలోని కానాను ఎంచుకోవడం లేఖనానుసారమే, మత్తయి 4: 12-16 లో ఉన్న ప్రవచనాన్ని నెరవేర్చుటకే.

అంతేనా, 11వ వచనములోని తన మహిమను బయలు పరచెను అనే మాటలు, ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను ఆయన దైవికమైన లక్షణాలలో కనుగొంటిమి అనే వచనాన్ని జ్జ్యపాకం చేస్తూవుంది. ఇక్కడ యేసు తన దైవికమైన లక్షణాలలో ఒక్కటియైన ఆయనకున్న క్రియేటివ్ పవర్ ను, ఆయన సర్వశక్తిమంతత్వమును బయలుపరచి యున్నాడు. సర్వశక్తిమంతత్వము ఒక్కటే ఉండదు కదండి. ఆయనలో సర్వశక్తిమంతత్వము ఉందంటే ఓమిని ప్రెసెన్స్ ఓమిని సైన్స్ కూడా వున్నట్లే కదా. “నా సమయమింకను రాలేదని“ యేసు పలికిన మాటలలో నా పరిచర్యలోని మాటలు క్రియలు సంఘటనలు అన్ని నిత్యత్వములో ముందుగానే నిర్ణయించబడ్డాయి. కాబట్టి ప్రతిది నా తండ్రి  నిర్ణయించిన టైములో మాత్రమే జరుగుతాయని తండ్రి పరలోకంలో నాకోసం నిర్ణయించిన ఘడియలో నేను దీనిని చేయుదునని చెప్పడంలో ఆయన ఓమిని ప్రెసెన్స్ ఓమిని సైన్స్ చూస్తున్నాం. ఆయన ఆ పెండ్లి విందులో సహాయపడటం అనేది – ఆయనకు ప్రజలపై ఉన్న ప్రేమను తెలియజేస్తూవుంది.   

హిస్టారికల్ గా పురావస్తు శాస్త్రవేత్తలు పెద్ద రాతి పాత్రల ముక్కలను కానాలో  కనుగొన్నారు. కాని ప్రత్యేకించి ఆనాటి కానా యొక్క లొకేషన్ విషయములో విభేదిస్తు ఉన్నారు.

మనుష్యులముగా మన బలహీనతలు పరిమితులు ఏమిటో మనకు తెలుసు అయినను దేవుని సూపర్ నేచురల్ పవర్ కున్న శక్తిని నమ్మం. అదే మన సమస్య.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.