లెంట్ 4 బి సిరీస్

పాత నిబంధన పాఠము: సంఖ్యాకాండము 21:4-9; పత్రిక పాఠము: ఎఫెసీయులకు 2:4-10; సువార్త పాఠము: యోహాను 3:14-21; కీర్తన 38.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: సంఖ్యాకాండము 21:4-9

సంఖ్యాకాండము 21: 4-9_ వారు ఎదోము దేశమును చుట్టి పోవలెనని హోరుకొండ నుండి ఎఱ్ఱసముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి– ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల లోనికి తాపకరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి– మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి; యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా–నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.

మీరు ఎప్పుడైనా నిరాశకు లోనయ్యారా? అందరం ఎన్నోసార్లు నిరాశకు లోనవుతునే ఉంటాం. నిరాశలో కోపగించుకొంటాం. నిరాశలో పొరపాటు దేవునిలోనే ఉన్నదని అనుకొంటూ దేవునిని “ఇలా ఎందుకు చేసావు” అని ప్రశ్నిస్తుంటాం. ఈ ఉదయకాలాన్న అలా అనుకొంటున్న ప్రజలను ఈ పాఠములో మనం చూడొచ్చు. దేవుడు ఆ ప్రజలకు నేర్పిస్తున్న పాఠాల నుండి మనం కూడా నేర్చుకొందాం. మన పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము నిరాశలో, కోపములో మీరు దేవుని వైపునకు తిరగండి అని మనకు చెప్తూవుంది. నిరాశలో, కోపములో ఎందుకని దేవుని వైపుకు తిరగవలసి ఉన్నామో తెలుసుకొందాం.

నిరాశలో, కోపములో మీరు దేవుని వైపునకు తిరగండి

  1. నిరాశ సణుగుడుకు నడిపించొచ్చు దేవునికి కోపము తెప్పించొచ్చు (4,5)
  2. నిరాశ దేవుని మీద తిరగబడేటట్లు ప్రేరేపించొచ్చు శిక్షను మనపైకి తేవొచ్చు (6,7)
  3. నిరాశలో దేవుని వైపుకు చూడండి, బాగుపడండి (8,9)

1

40 సంవత్సరాల వారి ప్రయాణము ముగింపుకు రాబోతుంది. మృతసముద్రానికి కుంచెం దక్షిణంగా పడమటి వైపునున్న ఉన్నటువంటి కాదేషు బర్నియా దగ్గరనున్న నీటికుంట దగ్గర హోరు పర్వత ప్రాంతంలో ఇశ్రాయేలీయులు విడిదిచేసారు. అక్కడనుండి కనానుకు బయలుదేరమని దేవుడు చెప్పాడు. కాని అక్కడ సమస్య ఒకటి ఉంది.

4 వచనమును చదువుకొందాం: వారు ఎదోము దేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఎందుకని? ఇశ్రాయేలీయులు వాగ్దానదేశానికి ఉత్తరాన దానికి చాల దగ్గరలో ఉన్నారు. కాని ఆ వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్లే దారిలో ఎదోము దేశముంది. దాని గుండా వాళ్ళు వెళ్ళ వలసి ఉన్నారు. ఎదోము దేశం సాధారణంగా ప్రస్తుత నైరుతి జోర్డాన్‌లో, డెడ్ సీ మరియు అకాబా గల్ఫ్ మధ్య ఉన్నట్లు పరిగణించబడుతుంది. కాని ఎదోమీయులు వారిని అనుమతించలేదు. ఎదోమీయులతో మాట్లాడటానికి ఇశ్రాయేలీయులు రాయబారులను కూడా పంపారు. వారికి ఎలాంటి హాని తలపెట్టమని రాజమార్గములోనే ప్రయాణిస్తామని వాగ్దానము కూడా చేసారు. ఎదోమీయుల భూభాగము గుండా ప్రయాణిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందునిమిత్తమై డబ్బును కూడా చెల్లిస్తామని వాళ్ళు చెప్పారు. కాని ఎదోమీయులు అందుకు ఒప్పుకోలేదు వారి భూభాగము గుండా వస్తే వాళ్ళతో యుద్ధం చేస్తామని ఇశ్రాయేలీయులను వాళ్ళు బెదిరించారు.

ఎదోమీయుల మూర్ఖత్వాన్ని బట్టి ఇశ్రాయేలీయులు ఏమి చెయ్యలేకపోయారు. కనానుకు నేరుగా వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళవలసి వచ్చింది. వారు ఇప్పుడు దక్షిణం వైపుకు వెళ్లి అక్కడనుండి తూర్పుకు ప్రయాణించి తరువాత చివరిగా ఉత్తర దిశలో ఉన్న కనానుకు ప్రయాణించవల్సి ఉన్నారు. వారికి ఎదురైనా ఈ పరిస్థితిని బట్టి ఇశ్రాయేలీయులు నిరాశ చెందారు, అసహనానికి లోనయ్యారు. ఇశ్రాయేలీయులను తిరస్కరించడానికి ఎదోమీయులకు కొన్ని కారణాలు ఉండొచ్చు. కాని 40 సంవత్సరాలు దేవుని కృపలో 12,00,000 జనాంగము దేవుని మేళ్ళను సంరక్షణను అనుభవిస్తూ మార్గాయాసము చేత సొమ్మసిల్లిరి అని బైబులు చెప్తుంది.

5వచనమును చదువుకొందాం: కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి– ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి.

చుట్టూ తిరిగి వెళ్ళవలసి రావడం వాళ్ళని నిరాశకు గురిచేసింది. వాళ్ళు అనుకొన్న దాని ప్రకారము జరగ లేదు కాబట్టి వాళ్ళు నిరాశ పడ్డారు. చుట్టూ తిరిగి వెళ్ళవలసి రావడం టైం తీసుకుంటుంది, అలాగే ప్రయాసము భారము కూడా కాబట్టే వాళ్ళు నిరాశపడ్డారు. వేరొకరి మాట వినాల్సి రావడం (మోషే మాటలు) వాళ్ళని నిరాశకు గురిచేసాయి. సహనం చూపెట్టాల్సి రావడం వాళ్ళని నిరాశకు గురిచేసింది. ఫలితాన్నీ చూడలేక పోవడం వాళ్ళని నిరాశకు గురిచేసింది. వాస్తవికతను అంగీకరించలేక వాళ్ళు నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఇది వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీసింది కాబట్టి వాళ్ళు నిరాశపడ్డారు. వాళ్ళు కోపముతో నిండుకొని శోధింపబడ్డారు. దీనిని వారి మాటలలో మనం చూడొచ్చు. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి. వారి నిరాశను మనం అర్ధం చేసుకోవొచ్చు. కాని వాళ్ళ నిరాశ వాళ్ళను దేవుని మీద తిరుగబడేటట్లు చేస్తూవుంది.

యూదులు కేవలము మోషేని గురించి మాత్రమే ఫిర్యాదు చెయ్యడం లేదు. వాళ్ళు దేవునికి విరోధముగా మాట్లాడుతున్నారని మన పాఠము ప్రత్యేకముగా చెప్తూవుంది. 40 సంవత్సరాల వారి ప్రయాణములో దేవుడు వారి సమాజానికి పశువులకు చాలినంతగా నీటిని అందించాడు. 40 సంవత్సరాల వారి ప్రయాణములో వారు పంటలు నాటలేదు కోత కోయలేదు. దేవుడు పరలోకపు ఆహారంతో వారిని సమృద్ధిగా పోషించాడు. నిరాశలో దేవునిని నిందిస్తున్నారు. ఇది మొదటిసారి కాదు. వాళ్ళు దేవుని ప్రేమను సంరక్షణను తప్పుపడుతున్నారు. వాళ్ళు దేవునిపైన ఫిర్యాదు చేస్తున్నారు. ఈ గొణుగుడు నిరాశ లేక తిరుగుబాటా? ఇది దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న తిరుగుబాటు. మనం మన చిన్న చిన్న జీవిత అవసరాలలో నిరాశను బట్టి ఎన్నిసార్లు దేవుని మీద తిరగబడ్డాం, ఆలోచించండి.

అపొ. కార్య 6:1_ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. ఫిలిప్పీయులకు 2:14-15_మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.

సాతాను కనుగొనగలిగిన సారవంతమైన భూమి నిరాశ అని ఒకరు చెప్పారు. అది నూరుశాతం కరెక్ట్. మన జీవితాలలో నిరాశను చూడటానికి సాతాను ఎంతగానో ఇష్టపడతాడు.వాడు దానిని కనుగొన్నప్పుడు , అసంతృప్తితో కూడిన కొన్ని విత్తనాలను లేదా చికాకు అనే విత్తనాలను మనలో చల్లుతాడు. అప్పుడు తిరుగుబాటు అనే మొక్కలు మొలకెత్తుతాయి. వారి సణుగులు సంశయములను బట్టి వాళ్ళు నిరాశావాదులుగా ఉన్నారు. నిరాశ భరింపలేని భారాన్ని కలుగజేస్తుంది, అవిధేయతకు చోటిస్తుంది, ఒంటరిని అని ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది. చచ్చిపోతే బాగుణ్ణు అనిపిస్తుంది, వ్యర్ధమైన వాటి విషయములో గొడవపడేటట్లు చేస్తుంది. దేవునిని తృణీకరించేటట్లు చేస్తుంది, దేవునిపై తిరుగబడేటట్లు చేస్తుంది, నిరీక్షణలేనట్లుగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. దీనికి కారణం_ ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడటమే. దేవునిపై తిరుగుబాటు పాపమును పెంచుతుంది, దేవుని దీవెనల నుండి దూరము చేస్తుంది. దేవుని ఉగ్రత క్రిందకు తెస్తుంది. 

అన్వయము: నిరాశ సణుగుడుకు నడిపించొచ్చు. దేవునికి కోపము తెప్పించొచ్చు. మనము కూడా కొన్ని విషయాలలో దేవునిపై ఫిర్యాదు చేసే ఉంటాం. మన కష్టాలను బట్టి, రోగాలను బట్టి, ఇబ్బందులను బట్టి దేవునిపై సణుగుకొనే ఉంటాం. అంతేనా కొన్నిసార్లు దేవునిని వదిలేస్తాం, దేవునికి దూరముగా వెళ్ళిపోతాం. నిశ్చయముగా దేవుడు ఎవరిని శోధింపడు. కాని మనం శోధనను బట్టి దేవునిని నిందిస్తాం. ఇక్కడ సణుగుడులో ఇశ్రాయేలీయులు దేవుని ప్రేమను అసహ్యించుకొంటున్నామని చెప్తున్నారు. ఎంత భయంకరమైన విషయమో ఆలోచించండి. మనకు దిశా నిర్ధేశనం చేస్తూ మన జీవితాలను నడిపిస్తూ శ్రమలలో మనకు తోడుగా ఉంటూ ఆశీర్వాదాల్ని మనకు ఇస్తూవున్న దేవునిపై మనము సణుగుతున్నామా? సాతాను మన జీవితాలలో అసంతృప్తి అనే విత్తనాలను మన చుట్టూ చల్లినప్పుడు తిరుగుబాటు అనే మొక్కలు మొలకెత్తుతాయి. అప్పుడు మనం కూడా దేవునిపై తిరుగబడుతూ ఉంటాం.

2

తిరుగుబాటును దేవుడు ఒప్పుకోడు, తేలికగా తీసుకోడు. 6వ వచనాన్ని చదువుకొందాం, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.

ఇంత చిన్న పాపానికి ఇంత పెద్ద శిక్ష అని అనుకుంటున్నారా? ఇశ్రాయేలీయులను క్రమశిక్షణలో ఉంచడం కోసం యెహోవా ప్రజల లోనికి తాపకరములైన సర్పములను పంపాడు. ఆ పాములు దేవుని చేత నిర్ధేశింపబడ్డాయి. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును, అని యెహెజ్కేలు 18:4 చెప్తూవుంది. సణుగుకొంటేనే ఇంతమందిని చంపేస్తారా అని మనం అడగొచ్చు. ఇది కరెక్ట్ కాదు అని మనం అనుకోవొచ్చు. పాపమంతటికి ఒకే ఫలితం మరణమే.

తిరుగుబాటుదారులు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. ఆదేశాలను స్వీకరించరు, లోబడటానికి ఒప్పుకోరు. వాళ్ళు చెప్పినట్లు జరగాలని కోరుకొంటూ ఆదేశాలను ఇవ్వడానికి కోరుకొంటారు. నిగ్రహంగా ఉండటానికి అసలు ఒప్పుకోరు. పైగా నిగ్రహంగా ఉండటాన్ని ద్వేషిస్తారు. వాళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళు చెప్పినట్లుగా జరగడాన్ని ఆశిస్తూ వాళ్ళు నాయకులను దుర్మార్గముగా దూషిస్తారు. అధికారాన్ని ఒప్పుకోరు, అధికారానికి తలవంచరు. తిరుగుబాటు స్వభావము అప్రజాస్వామికమైన పద్దతులలో ఇతరులకు హానిచేస్తూ ముందుకు వెళ్లాలని కోరుకొంటుంది. వారి ఆలోచనలు భయంకరంగా ఉంటాయి. ఇతరులకు ఇబ్బందిగా ఉంటాయి. కృతజ్ఞత లేని జీవితం వారిది. మూర్ఖత్వం మొండితనంతో 40సంవత్సరాలు నడుపుతున్న దేవునిని వద్దనుకొన్నారు, తృణీకరించారు, తమ్మును తాము నమ్ముకోవాలనుకుంటున్నారు. వీరిని చూసి క్రొత్తతరం చెడిపోవొచ్చు. దేవుడు వీరికి ఒక పాఠాన్ని నేర్పించాడు. 

ఇశ్రాయేలీయులు పాఠాన్ని నేర్చుకున్నారని మన పాఠము తెలియజేస్తుంది. 7వ వచనాన్ని చదువు కొందాం: కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి–మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి; యెహోవా మా మధ్యనుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి.

ఇప్పుడు ప్రజలు మోషేతో ఏళ్ళ మాట్లాడుతున్నారో గమనించండి. ఫిర్యాదులు గాని సణుగులుగాని లేవు. తగ్గింపుతో మేము పాపము చేశామని ఒప్పుకొన్నారు. ప్రభువు వద్దకు వెళ్ళడానికి మేము తగనివారము అని తెలియజేస్తూ వారి పక్షమున యెహోవాను ప్రార్ధించమని వాళ్ళు మోషేను అడుగుతున్నారు. ఈ ఘోరమైన పాముల ఉనికిని చూసి ఆశ్చర్యపోయిన ఇశ్రాయేలీయులు తమ ఫిర్యాదులకు శిక్షగా ఏమి జరుగుతుందో గుర్తించారు. కాబట్టి వారు త్వరగా పశ్చాత్తాపపడి, వారిని రక్షించడానికి యెహోవాతో మధ్యవర్తిత్వం చేయమని మోషేను కోరారు.

ఆయన ఎంత సులభముగా పాములను పంపాడో అంతే సులభముగా ఆ పాములను తొలగించాడు.

అన్వయము: నిరాశ తెచ్చే తిరుగుబాటు దేవుని శిక్ష క్రిందికి తెస్తుంది. నిశ్చయముగా దేవుడు ఎవరిని శోధింపడు. ఈ లోకము సాతాను మన పాపపు స్వభావాన్ని బట్టి శోధింపబడుతూ కొన్నిసార్లు దేవునికి సంబంధము లేకపోయినను దేవుని నిందిస్తూ ఆయనను తూలనాడుతూ ఆయనను వీడుదుమని కూడా బెదిరిస్తుంటాం. మన నిరాశ దేవుని మీద తిరగబడేటట్లు మనలను ప్రోత్సహించడమే కాకుండా మన పైకి మనం శిక్షను తెచ్చుకొనేటట్లు చేస్తుంది. మన జీవితాలను దుర్లభం చేసుకొనేటట్లు చేస్తుంది. మన కష్టాలకు మన పాపమే కారణమేమో గుర్తిధ్ధాం, పశ్చాత్తాపపడదాం. మన మధ్యవర్తి అయిన క్రీస్తుని మధ్యవర్తిత్వం చెయ్యమని వేడుకుందాం. 

3

8,9 వచనాలను చదువుకుందాం: మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా–నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.

ఆయనను వేడుకొనగా ఆయన పరిహారాన్ని తెలియజేసాడు. ఆ పరిహారంలో భాగముగా, దేవుడు చెప్పినట్లుగా తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టగా అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికాడు. పాము కాటుకు ఇది దేవుని చికిత్స.

దేవుడు విగ్రహాన్ని ఎందుకు పెట్టమన్నాడు అని మీరు అడగొచ్చు. ఇక్కడ దేవుడు విగ్రహాన్ని పూజించమని చెప్పటం లేదు. అలాగే సర్పము కాటు తిని మనుష్యులు చచ్చిపోతూవుంటే, సర్పము ప్రతిమను చూడాలా? చూస్తే బ్రతుకుతామా? అని ఇశ్రాయేలీయులలో కొందరు అనుకొని చచ్చారు. పైకెత్తబడిన పాము ప్రతిమను చూస్తే బ్రతుకుతామా అని అనుమానించి చూడక చచ్చారు కొందరు. అలాగే పాముకాటు తినిన వాడు పరుగెత్తి వెళ్లి ఆ పాము ప్రతిమను చూస్తే నన్ను పిచ్చివాడు అనుకుంటారేమోనని అనుకోని ఆ ప్రతిమను చూడక చచ్చారు మరి కొందరు.

దేవుడు వారిని శిక్షించడానికి సర్పములను పంపాడు. వారి పాపమును బట్టి వారిపైకి వచ్చిన మరణానికి కారణమైన పాము యొక్క ప్రతిరూపాన్ని దేవుడు వారి మధ్యలో నిలబెట్టమన్నాడు. ఆ ఇత్తడి సర్పము వారి పైకి వచ్చిన శిక్షను సూచిస్తుంది. ఆ ఇత్తడి సర్పమును చూడటమంటే వారి పాపమును జ్ఞాపకం చేసుకుని తప్పు ఒప్పుకొని వారి పాపము వారిపైకి తెచ్చిన దండన నుండి విడుదల కొరకు ఎదురుచూడటం. స్వస్థత కొరకు దేవుని మాటలపై సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచడం అని బైబులు చెప్తూవుంది. కాబట్టే సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికారు అని బైబులు చెప్తూవుంది.

ఇక్కడ విశ్వసించుట తప్ప మరొక ఆప్షన్ లేదు ఇశ్రాయేలీయులకు. అవిధేయులు తిరుగుబాటుదారులు తమ అవిశ్వాసమును బట్టి చచ్చారు. దేవుని చికిత్స సర్పము ప్రతిమను చూడటం. చూచిన వాడు బ్రతికాడు అంటే దేవుని మాటలను విశ్వసించి ఆయన వాగ్దానాన్ని నమ్మినవారు, విషపుకాటు తినినను వాళ్ళు బ్రతికారు, క్రొత్త జీవితాన్ని పొందుకొన్నారు. దేవుని మాటలను విశ్వసించని వారు చచ్చారు. 

క్రొత్త నిబంధనలో యోహాను 3:3,4లో_యేసు నీకొదేముతో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పగా అప్పుడు నీకొదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని యేసును ప్రశ్నించాడు, అప్పుడు యేసు అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను అని యేసు జవాబిచ్చాడు(14-15). అంటే యేసు యేమని చెప్తున్నాడంటే, మనుష్యుల పాపమును బట్టి వారిపైకి వచ్చిన మరణమును తొలగించుటకుగాను దేవుడు పంపిన ప్రాయశ్చితపు గొర్రెపిల్ల అయిన యేసును దేవుడు మనుష్యులందరి మధ్యలో నిలబెట్టియున్నాడని దేవుడు మన కొరకు ప్రొవైడ్ చేసిన ప్రాయశ్చిత్త అర్పణగా సిలువపై పైకెత్తబడియున్న యేసును చూడటమంటే మనుష్యులు వారి పాపమును జ్ఞాపకం చేసుకుని ఒప్పుకొని వారి పాపము వారిపైకి తెచ్చిన దండన నుండి విడుదల ఆయనేనని విశ్వసిస్తూ స్వస్థత కొరకు దేవుని మాటలపై సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచుతూ మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారు దేవుని క్రొత్త జీవితాన్ని పుచ్చుకొంటే తప్ప దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాడు. యేసును విశ్వసించుట తప్ప మరొక ఆప్షన్ లేదు, మనుష్యులకు. 

అంటే ఎవరైతే పైకెత్తబడిన యేసును విశ్వసిస్తారో వాడు క్రొత్తగా జన్మించునని యేసు చెప్తున్నాడు. మరొకప్రక్క ఆయనను విశ్వసింపని వారు మరణిస్తారు అనేగా అర్ధం. ఈ లోకములో ప్రతి ఒక్కరిని తాపకరమైన పాపము కాటువేసింది. ఆ కాటుతో వచ్చిన విషం మనకందరికీ ఎక్కింది. అది మరణాన్ని తెస్తూవుంది, భౌతిక మరణం మరియు నిత్య మరణం. ఆ పాపము యొక్క కాటునుండి బ్రతకాలంటే, బాగుపడాలంటే మన అందరి కొరకు దేవుడు అనుగ్రహించియున్న యేసును మనము విశ్వసించి క్రొత్త జీవితాన్ని పుచ్చుకొని జీవింపవలసియున్నాం. పాపానికి ఇంతకంటే మరొక చికిత్స లేదు. యేసును చూడండి రక్షింపబడండి.

మరొకమాట, మీ అందరి మధ్యలో దేవుడు తన జ్ఞాపకార్ధముగా మీ మందిరమును కట్టించుకొన్నాడు. ఆయన మీ ఈ మందిరములో తన కుమారుని పైకెత్తియున్నాడు. మీ కష్టములొ మీరు మీ మందిరము వైపు చూచి ప్రార్ధించండి. అంతేనా మీకొరకు ఆయన తన సేవకులను మీ మందిరములో మీ కొరకు మధ్యవర్తిత్వము చెయ్యడానికి మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఉంచియున్నాడు. మీకు తెలుసా మీ సేవకులు మీకొరకు మీకుటుంబాల కొరకు కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటారు. తండ్రీ, నీ బిడ్డలను క్షమించమని, దీవించమని, మీ పనిపాటలలో కాయుమని, మీ రాకపోకలలో తోడుగా ఉండమని, మీ చుట్టూ ప్రతిరోజు దేవుని కంచెను వేస్తూ ఉన్నారనే విషయాన్ని మర్చిపోకండి.

ముగింపు: కాని ప్రజలు నిరాశలో దేవుడు ఎవరిని శోధింపడు అని పోతున్నారు. వారి ప్రతి శోధనలో దేవునిని బాధ్యుని చేస్తూ ఆయన మీద తిరగబడుతున్నారు. కష్టాలను వారి జీవితాలలోనికి తెచ్చుకొంటున్నారు. అంతేనా దేవుని కంచెను తొలగించుకొంటున్నారు. కాని మీ సేవకులు కన్నీళ్లతో కష్టముతో మీ కొరకు ప్రతి రోజు దేవునిని ప్రాధేయపడుతూ ఉన్నారు. కాని మీరేమో దేవుని మందిరానికి రారు. ఇది మీ కొరకు పైకెత్తబడియున్న యేసును మీకు చూపే చోటు. మిమల్ని మీరు సరిదిద్దుకొనే చోటు ఇది. మీ పాపములను మీరు ఒప్పుకొనే చోటు ఇది. దేవుని క్షమాపణను పుచ్చుకొనే చోటు ఇది. మీ చుట్టూ దేవుని కంచెను వేసే చోటు ఇది. మీరు నెలలు నెలలు రాకపోతే మీ సేవకులు తమ ప్రార్ధనలో మిమల్ని గూర్చి మధ్యవర్తిత్వము చేసినను మీ ప్రవర్తన మిమల్ని దేవుని నుండి దూరము చేసి ఉన్నది కాబట్టి మీరు ఎలా ఉంటారంటే దేవుని కంచె దేవుని సంరక్షణ దేవుని ప్రేమ తొలగింపబడిన ఆనాటి ఇశ్రాయేలీయులవలె ఉంటారు.

ఈ క్షణమే మీకొరకు మీ మందిరములో పైకెత్తబడియున్న యేసును చూడండి. మీ ప్రతి విషయములో మార్పును మీరు చూస్తారు. మీ చీకటి రోజులు మారిపోతాయి. ఎదోమీయులాంటి వాళ్ళు మీ జీవితాలను అడ్డగించినను నిరాశ పడకండి. దేవునిపై కోపగించుకోకండి. ఎందుకంటే ఆయనే మిమల్ని నడిపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, మీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు, మీ విడుదల నాయకుడు. మిమ్మల్ని అనాధలుగా విడువడు, తప్పు దారిన నడిపించడు. మీకు సహాయము చేయువాడు మీతోనే ఉన్నడనే  విషయాన్ని మర్చిపోకండి. ఆమెన్. 

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl