2వ యోహాను పత్రికకు పరిచయము

యోహాను 1వ, 2వ పత్రికలు మత విశ్వాసాలతో వ్యవహరిస్తే, 3వ పత్రిక ఒక మిషనరీ సమస్యతో వ్యవహరిస్తూ వుంది.

ప్రేమ మరియు సత్యంలో నడవండి
తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను, 1 కొరింథీయులకు 10:12 అను పౌలు మాటలు యోహాను యొక్క ఈ చిన్న పత్రికకు ఉపశీర్షికగా చక్కగా సరిపోతాయి. గ్రహీతలు, ఏర్పరచబడినదైన అమ్మ గారు, ఆమె పిల్లలు. వారు తండ్రివలన ఆజ్ఞను పొందిన ప్రకారము సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని యోహాను బహుగా సంతోషిస్తున్నాడు. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటనుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు, మనము ఒకరి నొకరము ప్రేమింప వలెనని నిన్ను వేడుకొనుచున్నాను అని వారికి అతడు జ్ఞాపకం చేస్తూ వున్నాడు. మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమని అతడు వక్కాణిస్తూ వున్నాడు.

అయితే ఈ ప్రేమ వివేచనాత్మకంగా ఉండాలని యోహాను సూచిస్తూవున్నాడు. ఇది అనుభవం, జ్ఞానం, ఆలోచితమైనదై ఉండాలి తప్ప అన్నింటిని ఒకే రకముగా ప్రేమించమని కాదు. బైబులు ప్రేమ వివేచనాత్మకమైనది: అన్నింటిని ఒకే రకముగా నిష్కపటమైన ప్రేమతో ప్రేమించడం ప్రమాదకరం మరియు మూర్ఖత్వం. అన్ని బోధలు ఒక్కటేనని అన్నింటిని ప్రేమించడం తప్పు. క్రీస్తు శరీరధారియై వచ్చినట్లు గుర్తించని తప్పుడు బోధకులు అనేకులు. దయతో కూడిన మీ ఔదార్యంని సాతానుడు ఉపయోగించుకొంటూ అబద్ద భోధలకు మీరే తలుపులు తెరిచేటట్లు చేస్తాడు. మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి, క్రైస్తవులతో సహవాసం కలిగి ఉండాలి, కాని తప్పుడు బోధకులతో సహవాసం కలిగి ఉండకూడదు.

రచయిత
ఏ పత్రికలోనూ దాని రచయిత పేరు లేదు. మీ బైబిల్‌లోని పేజీ ఎగువన ఉన్న శీర్షికలు ఆధునిక సంపాదకుల నుండి వచ్చాయి. కాని ప్రాచీన కాలం నుండి, వీటి రచయిత అపొస్తలుడైన యోహాను కాదనే సందేహం ఎప్పుడూ లేదు. రెండు పత్రికలు 1 యోహానులాగా ఉంటాయి కాబట్టి వీటిని దానికి సంబంధించిన చిన్న పుస్తకాలుగా పిలుస్తారు. ఇరేనియస్, లియోన్స్ బిషప్ (క్రీ.శ. 130-200), మురాటోరియన్ కానన్ (సుమారు క్రీ.శ. 200 నాటి కొత్త నిబంధన పుస్తకాల ఫ్రాగ్మెంటరీ లిస్ట్), క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా (క్రీ.శ. 155-215), ఓరిజెన్ (క్రీ.శ. 185 –253) మరియు యూసేబియస్ (క్రీ.శ. 265–339) వీరందరూ యోహానునే దీని రచయితగా పేర్కొన్నారు.

(యోహాను 2 మరియు 3) రెండింటి రచయితయైన యోహాను వీటిలో తనను తాను “పెద్దగా” పిలుచుకున్నాడు. యేసుని జీవితచరిత్రలో అతడు ఎప్పుడూ తన పేరు పెట్టుకోనట్లే, ఇక్కడ కూడా అతడు లేడని ఎవరైనా అనుకోవచ్చు. అతడు తనను తాను వృద్ధుడిగా పిలుచుకోవడం అతని తగ్గింపుకు అతని అధికారానికి ఆనందాన్ని కలిగిస్తుంది. అతడు తన పత్రికలు వ్రాసే సమయానికి అతడు వృద్ధుడై ఉండవచ్చు. అతడు పశ్చిమ ఆసియా మైనర్‌లోని క్రైస్తవ సంఘాలలో దశాబ్దాలుగా పరిచర్య పర్యవేక్షణ తర్వాత, “పెద్ద (వృద్ధుడు)” నుండి వచ్చిన పత్రిక అంటే అపొస్తలుడైన యోహాను నుండే వచ్చినట్లు వెంటనే గుర్తించబడేంతగా ప్రసిద్ధి చెందాడు. అపోస్తులుడైన యోహాను ఆసియా మైనర్ పశ్చిమ తీరంలో ఉన్న ఎఫెసుకు బిషప్ అని ఇరేనియస్ చెప్పాడు. పెద్ద అనే పదం ఆప్యాయత మరియు గౌరవాన్ని సూచిస్తుంది. అపొస్తలుడైన యోహాను జీవిత చరిత్ర సమాచారం కోసం, 1యోహాను పరిచయ గమనికలో “రచయిత” క్రింద చూడండి.

పత్రిక వ్రాయబడిన కాలము
అతడు వీటిని క్రీ.శ. 85 లేదా 95 లలో ఎఫెసు నుండే రాశాడని ఉత్తమ అంచనా. ఈ సమయానికి అతడు 12 మంది శిష్యులలో మిగిలివున్న చివరి వ్యక్తి కావచ్చు.

3వ యోహానులో క్రీస్తు
యోహాను తన మొదటి పత్రికలో చేసిన విధంగానే ఈ పత్రికలో కూడా క్రీస్తు పట్ల చేస్తూవున్న తప్పును ఖండించాడు. “యేసు క్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వారు” (v.7) వంచకులు అని మరల అతడు నొక్కిచెప్పాడు. “క్రీస్తుబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు” (v.9). ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము మరియు యేసు క్రీస్తు యొక్క పని వేదాంతశాస్త్రంలోని ప్రతి ఇతర రంగాన్ని ప్రభావితం చేస్తూ వున్నాయి కాబట్టి దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండటానికి క్రీస్తు బోధకు ప్రతిఒక్కరు కట్టుబడి ఉండాలి.

కీవర్డ్
అబద్ద బోధకులతో సహవాసమును కలిగియుండకుడి.

కీ వచనం
క్రీస్తుబోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు (9,10).

ఈ పత్రిక ఎవరికి వ్రాసాడు
లేఖ గ్రహీతలు, ఏర్పరచబడినదైన అమ్మగారు, ఆమె పిల్లలు.

సందర్భం
యోహాను వ్రాయడానికి గల కారణం, ఆదిమ సంఘ జీవితంలోని ఒక ప్రాముఖ్యమైన అంశము పై కేంద్రీకృతమై ఉంది. అతడు సేవ చేసిన సంఘాల్లో సెమినరీ-శిక్షణ పొందిన రెసిడెంట్ పాస్టర్లు చాలా తక్కువ లేదా అసలు లేరు. ప్రాంతీయ పర్యవేక్షకులు అనే బలహీనమైన వ్యవస్థ ఉంది, వారిని బిషప్‌లు అని పిలిచెడివాళ్ళు. వీరిలో ఒక్కకొక్కరు కొన్ని సంఘాలను పర్యవేక్షించే వాళ్ళు. వీటిలో ఎక్కువ భాగం సామాన్య ప్రజలచే నడపబడేవి. కొన్ని ప్రసంగాలు బిషప్‌లు చేసేవాళ్ళు. మరికొన్ని పౌలు పరిచర్యను అనుకరిస్తూ సంఘాలను దర్శిస్తూ తిరిగే ఉపదేశకుల ద్వారా చెయ్యబడేవి. ఆదిమ క్రైస్తవ సంఘానికి చెందిన డాక్యుమెంట్ ఒకటి, సంఘ పరిచర్య చేసే రెండు రకాలైన పనివారిని గురించి వివరిస్తూ: బిషప్‌లు మరియు డీకన్‌లు అట్లే ప్రవక్తలు, అపొస్తలులు మరియు సంఘాలను దర్శిస్తూ తిరిగే ఉపదేశకులు ఉండేవారని చెప్తూవుంది.

క్రీ.శ. 90లో రోమన్ సామ్రాజ్యంలో నివసించిన ప్రజలందరూ అజ్ఞానులుగా, సంస్కార హీనంగా జీవించే వారని అనుకోకూడదు. రోమన్ సైన్యం మొత్తం మధ్యధరా ప్రపంచాన్ని ఏకం చేసింది. రోమన్ ఇంజనీర్లు నగరాలను కలిపే హైవే వ్యవస్థను నిర్మించారు. రోమన్ సైన్యం భద్రతను అందించింది. రోమన్ నావికాదళం సముద్రపు దొంగలను మధ్యధరా నుండి తరిమికొట్టింది. సముద్ర ప్రయాణీకులకు మళ్లీ ప్రయాణం సురక్షితంగా మార్చింది. ఒక ఏకీకృత కరెన్సీ సామ్రాజ్యం అంతటా వాణిజ్యాన్ని సాధ్యం చేసింది. ఏకీకృత బ్యాంకింగ్ వ్యవస్థ ఒక పట్టణ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పోర్టబుల్ క్రెడిట్ లెటర్‌లను సాధ్యం చేసింది. గ్రీకు భాష సామ్రాజ్యం అంతటా సార్వత్రిక మొదటి భాషగా లేదా రెండవ భాషగా అవతరించింది. దేవుని అసాధారణమైన సమయానుకూల తలాంతులు క్రైస్తవ విశ్వాసాన్ని ప్రబలంగా అంతటా విస్తరించే టట్లు చేసాయి. పెంతెకొస్తు ఆత్మచే ఆజ్యం పోసిన సువార్త యుదయా నుండి సిరియాలో మరియు ఆఫ్రికాలో విస్తరించింది. క్రైస్తవులు పరస్పర మద్దతును సేకరించడం ప్రారంభించారు. ట్రావెలింగ్ టీచర్లు స్వాగతించబడ్డారు, కొద్ది రోజులు ఉండమని కోరబడ్డారు. ఆ పై తదుపరి ప్రాంతానికి పంపబడ్డారు. క్రొత్త నిబంధన క్రైస్తవులను శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చు చుండుడి అని ప్రోత్సహిస్తూ వుంది (హెబ్రీయులు 13:2, రోమా ​​12:13; 15:24). యేసు స్వయంగా తన ప్రయాణ పరిచర్యలో స్నేహితుల ఆతిథ్యాన్ని తరచుగా ఆనందించే వాడు. పౌలు లూదియ (అపొ.కార్య. 16:13-15), యాసోను (అపొ.కార్య. 17:5), గాయి (అపొ.కార్య. 19:29), ఫిలిప్ ది ఎవాంజెలిస్ట్ (అపొ.కార్య. 8:26-39) మరియు మ్నాసోను (అపొ.కార్య. 21:16) వంటి వారితో ఉండేవాడు. సత్రాలు ఇంకను క్రమబద్ధీకరించబడలేదు కాబట్టి అవి తరచుగా ప్రమాదకరమైనవివిగా ఉండెడివి. విదేశీయుల నుండి ప్రయోజనాన్ని పొందడానికి దొంగలు, వేశ్యలు, జూదగాళ్లు ఎల్లప్పుడూ పుష్కలంగా ఉండెడివారు. కాబట్టి ట్రావెలింగ్ క్రిస్టియన్ టీచర్స్ తోటి క్రైస్తవులతో కలిసి ఉండడం వారికి ఆనందంగాను సురక్షిమైనదిగాను ఉండేడిది.

విజిటింగ్ టీచర్లు ఈ యువ సంఘాల నిజమైన అవసరాన్ని తీర్చారు. వారు సమర్థమైన బైబిలు బోధలను అందించడమే కాకుండా, ఇతర క్రైస్తవ సంఘాలలో ఏమి జరుగుతుందో దాని గురించిన సమాచారాన్ని కూడా పంచుకొనేవారు. వారు ఒక నెట్‌వర్క్‌ను, ఒక గొప్ప క్రైస్తవ సంఘాన్ని నిర్మించడంలో సహాయపడ్డారు. కాని ఇక్కడ ఒక సమస్య ఉత్పన్నమైయింది. ఈ విజిటింగ్ టీచర్ల ముసుగులో అనేకమంది అబద్ద బోధకులు కూడా బయలు దేరారు. ఈ అబద్ద బోధకుల మధ్యలో నిజమైన భోధకున్ని ఎలా గుర్తించాలి అనేదే సమస్యగా ఉంది. సాతాను నిజ బోధకుల మధ్యలో అబద్ద బోధకులు కూడా ఉండేటట్లు చూసుకున్నాడు. ఈ స్వీయ-అభిషేక వేషధారులు, ఉచిత ఆహారం, బస లేదా డబ్బు కోసం ప్రజలను హడావిడి చేశారు. ఈ మతపరమైన స్కామ్ కళాకారులకు ప్రజల దాతృత్వం, విశ్వాసం మరియు అపరాధభావాన్ని ఎలా నేర్పుగా ఉపయోగించు కోవాలో బాగా తెలుసు.

అమెరికా సరిహద్దులోని చిన్న చిన్న క్రైస్తవుల సమూహాలు కూడా మొదట్లో ఇదే సమస్యను ఎదుర్కొన్నాయి. టెలిఫోన్‌లకు ముందు రోజుల్లో, అన్ని కమ్యూనికేషన్‌లను కాలినడకన లేదా గుర్రం ద్వారా తీసుకు వెళ్లే రోజుల్లో, భోదకులుగా చెప్పుకునే వ్యక్తుల ఆధారాలను పరిశీలించడానికి చాలా సమయం పట్టేది. సంఘాల లోనికి భోదకులుగా వచ్చిన వారిని సంఘాలు అక్కడికక్కడే వారి క్లెయిమ్‌లను మూల్యాంకనం చెయ్యాల్సి వచ్చింది. పాస్టర్లుగా చెప్పుకునే చాలా మంది వ్యక్తులు వాస్తవానికి మోసగాళ్లు, సౌకర్యవంతమైన జీవనం కోసం చూసేవాళ్ళు. ప్రారంభ చర్చిలు కూడా తమ భోధకులను పరీక్షించడంలో చాలా కష్టమైన సమయాన్ని కలిగి ఉన్నాయి. కొన్నిసార్లు నిజ బోధకులు అబద్ద భోధకులచే చంపబడ్డారు కూడా.

మొదటి శతాబ్దం చివరి నుండి సిరియాలోని సంఘము యొక్క మాన్యువల్ మనుగడలో ఉంది. దీనిని సాధారణంగా దాని గ్రీకు పేరున “డిడాకే” (Did-ah-KHAY అని ఉచ్ఛరిస్తారు) అని పిలుస్తారు. ట్రావెలింగ్ టీచర్స్ తో వ్యవహరించడానికి ఈ మాన్యువల్ చాలా కఠినమైన నియమాలను అప్పట్లో నిర్దేశించి ఉండటాన్ని నేడు మనం చూడొచ్చు:

  1. వారు ఒక్క రాత్రి మాత్రమే బస చెయ్యాలి. అత్యవసర పరిస్థితుల్లో రెండు రాత్రులు మాత్రమే ఉండ గలరు.
  2. వారు బయలుదేరినప్పుడు, మీరు వారి ప్రయాణానికి ఆహారం సమకూర్చవచ్చు.
  3. వారు డబ్బు అడిగితే, వారు తప్పుడు ప్రవక్తలు అని మీరు అనుకోవచ్చు.
  4. వారు ఒకటి లేదా రెండు రోజుల కంటే ఎక్కువ కాలం ఉండాలని ఎంచుకుంటే, వారు ఉద్యోగం మరియు పనిని పొందవలసి ఉంటుంది.

కాబట్టే యోహాను, ఈ తప్పుడు బోధకులను క్రైస్తవులు చేర్చుకోకుండా వారిని హెచ్చరించే క్రమములో 2వ యోహానును వ్రాసాడు. నిజమైన బోధకులను క్రైస్తవులు చేర్చుకొనులగున వారిని ప్రోత్సహించే క్రమములో 3వ యోహానును వ్రాసాడు. ఈ రకమైన అప్రమత్తత ఎప్పటికి నిరర్థకము కాదు.

కార్మికులను నియమించడం, శిక్షణ ఇవ్వడం మరియు పర్యవేక్షించడం ఎంత క్లిష్టమైనదో ప్రతి వ్యాపార నాయకుడికి తెలుసు. కొంతమంది వ్యక్తుల బలాలు లేదా బలహీనతలు వెంటనే స్పష్టంగా కనిపిస్తాయి; మరికొందరు కాలక్రమేణా వారి నిజమైన పాత్రను మరియు విలువను చూపెడతారు. అయితే మంచి సిబ్బంది నిర్వహణ మరియు మూల్యాంకనం వ్యాపారం యొక్క ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. అదే విధంగా, ఒక సంఘంలోని పెద్దలు మరియు సభ్యులు వారి మతపరమైన అనుభవాన్ని దేవుని మహిమార్థమై ఉపయోగించకుండా ఊరికినే ఉండడం సంఘానికి మంచిది కాదు. వారు తమ మధ్య పరిచర్య చేసే వ్యక్తులను అంచనా వేయాలి. వారు సత్యాన్ని అబద్ధాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. మంచి నాయకులకు శిక్షణ ఇవ్వడం మరియు ఎన్నుకోవడం మరియు వారు చేసే పనులకు తమ నాయకులను జవాబుదారీగా ఉంచడం ఎలాగో వారు తప్పక నేర్చుకోవాలి.

2వ యోహాను యొక్క అవుట్ లైన్: క్రీస్తు బోధలో కొనసాగండి
I. పరిచయం (1–3)
II. సత్యం మరియు ప్రేమలో నడవండి (4–6)
III. మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించండి (7–11)
IV. చివరి శుభాకాంక్షలు (12, 13)

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.