మొదటి భాగము
గాయు – ప్రియుడైన స్నేహితుడు (1–8)

లేఖ యొక్క చిరునామా, లేదా సూపర్‌స్క్రిప్షన్ చాలా క్లుప్తంగా ఉంది: 1పెద్దనైన నేను సత్యమునుబట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది.

అపొస్తలుడైన యోహాను తనను తాను సూచించుకోవడానికి “పెద్ద” అనే రూపకాన్ని ఉపయోగించడంపై వ్యాఖ్యానము కొరకు 2 యోహాను 1లోని గమనికలను చూడండి. యోహాను తన అపొస్టలిక్ అధికారాన్ని నొక్కి చెప్పవచ్చు. కాని అతడు అలా చెయ్యలేదు.

గాయు అనేది రోమన్ సంస్కృతిలో, అత్యంత సాధారణమైన పేరు. కొత్త నిబంధనలో గాయియు అనే పేరుతో మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, అందరూ అపొస్తలుడైన పౌలుతో ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉన్నారు. పౌలుకు మాసిదోనియ నుండి ఆ పేరుతో ఒక ప్రయాణ సహచరుడు ఉన్నాడు (అపొ. కార్య. 19:29) అతడు తన మూడవ ప్రయాణంలో ఎఫెసులో జరిగిన అల్లర్లలో పౌలుతో పాటు పట్టుబడ్డాడు. పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయు లలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడునైన గాయియును (దక్షిణ-మధ్య ఆసియా మైనర్‌లోని ఒక పట్టణం), తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకికు, త్రోఫిమును యెరూషలేములో బాధపడుతున్న క్రైస్తవుల కోసం సేకరించిన నిధులతో యెరూషలేముకు పౌలుతో కలిసి ప్రయాణించిన సంఘ ప్రతినిధులు కావచ్చు (అపొ. కార్య. 20:4). కొరింథులో మరొక గాయియు కూడా ఉన్నాడు, ఇతడు పౌలుచే వ్యక్తిగతంగా బాప్తిస్మం తీసుకున్నాడు (1 కొరింథీ 1:14). ఇతడు పౌలు రోమన్లకు పత్రికను వ్రాసేటప్పుడు కొరింథులో పౌలుకు ఆతిథ్యమిచ్చాడు మరియు వారి యావత్సంఘమునకు ఆతిథ్య మిచ్చాడు (రోమా 16:23).

యోహాను పేర్కొంటున్న గాయుయు ఈ ముగ్గురు గాయియులలో ఒకడు కాదు. ఊహించగలిగేది ఏమిటంటే, అతడు తన సంఘంలో మంచి సాధారణ నాయకుడని, పశ్చిమ ఆసియా మైనర్‌లో యోహాను పర్యవేక్షిస్తున్న వాటిలో ఆ సంఘం కూడా ఒకటని, ఇతడు ట్రావెలింగ్ టీచర్లకు బస చేసేందుకు తన సొంత ఇంటిని అందించిన వాడని ఇతనిని గురించి చెప్పొచ్చు. యోహాను గాయును ప్రేమించు ప్రియునిగా సంబోధించాడు. అంటే వారు ఒకరికొకరు బాగా తెలిసి ఉండాలి, గతంలో ఏదో ఒక విధంగా వారిద్దరూ కలిసి పని చేసి ఉండాలి.

యోహాను తాను గాయును “సత్యమునుబట్టి” ప్రేమించుచున్నానని చెప్పాడు. దీనిని బట్టి అతడు బహుశా గాయుతో తనకు గల సంతృప్తికరమైన సంబంధాన్ని వెల్లడిస్తూవున్నాడు. అది యేసుక్రీస్తు సువార్త యొక్క సత్యాన్ని వ్యాప్తి చేసే పనిలో పాతుకుపోయిందని అర్థం. 4వ వచనంలో అతడు గాయును తన “పిల్లలలో” ఒకడు అని పిలుస్తున్నాడు. గాయు యొక్క కన్వర్షన్ లో, విశ్వాసంలో, ప్రారంభ శిక్షణలో యోహాను బహుశా కీలక పాత్ర పోషించియున్నాడని ఇది సూచిస్తూ ఉంది.

2ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండ వలెనని ప్రార్థించుచున్నాను. 3నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. 4నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.

ఈ లేఖను బట్టి చూస్తే: కొంతమంది క్రైస్తవ సోదరులు ఎఫెసు నుండి మిషనరీ పర్యటనలో భాగముగా ఈ సంఘానికి వెళ్లారు. ఈ మిషనరీలను తగిన ఆతిథ్యంతో స్వీకరించడానికి యోహాను వారికి వివిధ సంఘాలను ఉద్దేశిస్తూ సిఫార్సు లేఖలను ఇచ్చాడు. వాళ్ళు ఎఫెసుకు తిరిగి వచ్చిన తర్వాత, ఆ సహోదరులు దియొత్రెఫే తమ లేఖలను తిరస్కరించాడని, యోహాను గురించి చెడుగా మాట్లాడి, వారికి ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా, గాయు తన క్రైస్తవ కర్తవ్యాన్ని ఉల్లాసంగా సుముఖతతో నిర్వర్తించినప్పుడు అది అతనికి చాలా కోపము పుట్టించియున్నదని నివేదించారు. అట్లే, గాయు దైవభక్తి గురించి పరిశుధ్ధ యోహానుకు తెలియజేయబడింది. దియొత్రెఫేకు ఎదురు నిలబడడం, అతని స్టాండ్ కారణంగా గాయు అనేకవిధాలుగా నష్టపోయే ప్రమాదముంది, మరియు అతని ఆరోగ్యానికి కూడా ముప్పు కలిగించే సోదరుల కోసం అలుపెరగని ప్రయత్నాలు, ఇవన్ని అతని హృదయంలో నివసిస్తున్న క్రైస్తవ ప్రేమ యొక్క వాస్తవికతకు తగిన సాక్ష్యాలుగా తెలియజేయబడ్డాయి.

కాబట్టే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండ వలెనని ప్రార్థించుచున్నాను అని అపొస్తలుడు గాయును బలపరుస్తూ ఆ విషయాన్ని తెలియజేస్తూ ఇట్లు వ్రాసియున్నాడు. ఈ మాటలను చదవడం, అందుకోవడం గాయుకు ఎంతటి థ్రిల్ల్ని ఇచ్చి ఉండొచ్చొ కదా! యేసు ప్రేమించిన ప్రియ శిష్యులలో ఒకడు, ఆయన సిలువ మరణాన్ని చూసిన పవిత్ర అపొస్తలులలో ఒకడు తన కొరకు ప్రార్థిస్తున్నాడు. గాయు యొక్క భౌతిక ఆరోగ్యం అతని ఆధ్యాత్మిక ఆరోగ్యం వలె బలంగా ఉండాలని యోహాను ప్రార్ధించుచున్నానని చెప్తూ వున్నాడు. ఇది గాయు సత్యంలో నడవడాన్ని బట్టి, సాక్ష్యముగా, చాలా బలంగా ఉంది. వాస్తవానికి, ఒకడు ప్రేమించబడినప్పుడు, సానుకూల మానవ నెట్‌వర్క్‌లో భాగం అయ్యినప్పుడు, ఇతర వ్యక్తుల ఆప్యాయత మరియు మద్దతును ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు వాడు శారీరకంగా ఆరోగ్యంగా జీవిస్తాడని వైద్య అధ్యయనాలు చెప్తూవున్నాయి. భౌతికంగా ప్రజల విషయంలో ఏది నిజమో అది ఆధ్యాత్మికంగా కూడా నిజం. ఒకరిపట్ల మరొకరు ప్రేమను మద్దతును వ్యక్తం చేయడం మరియు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడం ఒకరి నొకరు నిర్మించుకోవడానికి మనం చేయగలిగిన ఉత్తమమైన వాటిలో ఒకటి. ఆరోగ్యవంతమైన సంఘాన్ని నిర్మించే రహస్యాలలో ఇది కూడా ఒకటి.

యోహాను సూచించిన “సహోదరులు” ఈ లేఖలో ప్రాధాన్యమై ఉన్నారు. సోదరుడు అనే పదాన్ని కొన్నిసార్లు కొత్త నిబంధన లో “విశ్వాసి” అనే అర్థంలో ఉపయోగిస్తారు. ఈ లేఖలోని మూడు ఉపయోగాలలో (వచనాలు 3, 5, 10), యోహాను “సోదరుడు” అంటే ప్రయాణ ప్రతినిధులు మరియు వార్తాహరులు అని అర్థం. వారి పని యోహాను సూచనలను వారు సందర్శిస్తున్న సంఘాలతో పంచుకోవడం, ఆ సంఘాల నుండి సమాచారాన్ని అపొస్తలునికి అందించడం మరియు కొంత బోధన చేయడం కూడా. వారు యోహాను మరియు ఇతర అపొస్తలులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న సమాచారం మరియు జవాబు దారితనం అనెడి నెట్‌వర్క్‌ లో భాగమై యున్నారు.

వారు గాయు గురించి గొప్ప నివేదికను యోహాను దగ్గరకు తీసుకువచ్చారు. ప్రాంతీయ జిల్లాలను సందర్శించే సోదరులు ఎఫెసుకు తిరిగి వచ్చినప్పుడల్లా, ఈ నివేదికలు వచ్చాయి, గాయు సత్యంలో జీవిస్తున్నాడని, అతడు విశ్వాసం ద్వారా సువార్త యొక్క సత్యాన్ని అంగీకరించడమే కాక, జీవితాన్ని కూడా నడిపిస్తున్నాడనే వాస్తవాన్ని అతడు విన్నాడు. నిజమైన క్రైస్తవ ప్రేమకు సంబంధించిన ఈ రుజువు ద్వారా యోహాను ఎంతగానో ప్రభావితమయ్యాడు. (నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని). యోహాను వేరే చోట పేర్కొన్నట్లుగా, గాయు “సత్యంలో ప్రేమలో నడుచుకుంటున్నాడు.” ఇవి నిజమైన క్రైస్తవ మతం యొక్క రెండు కనిపించే ప్రామాణికమైన ట్రేడ్‌మార్క్‌లు: లేఖనాలకు నిజమైన బోధనలు మరియు వారి జీవితాల్లో దైవిక సహవాసం మరియు వారి విశ్వాసమును దైవికమైన సత్క్రియల ద్వారా చూపించే వ్యక్తులు. గాయు అందించిన మంచి నాయకత్వాన్ని బట్టి ఆ సంఘము వారు ఆశీర్వదింపబడియున్నారు. దేవుని వాక్యం యొక్క శక్తివంతమైన ప్రభావాన్ని బట్టి గాయు సత్య మార్గాల్లో నడుస్తున్నాడని తెలుసుకోవడం వృద్ధుడైన అపొస్తలుడికి గొప్ప సంతృప్తిని, గొప్ప ఆనందాన్ని మరియు సంతోషాన్ని కలిగించింది. అట్లే అతని “పిల్లలు,” అతని విద్యార్థులు, వారి విశ్వాసంలో ఎదగడం మరియు ప్రభువు కోసం పనిచేయడం చూడటం అతనికి ఎంతో సంతృప్తిని సంతోషాన్ని ఇచ్చింది. యేసు అపొస్తలునిగా, ఒక తండ్రి తన పిల్లలను చూసుకున్నట్లే, యోహాను వారి పట్ల ఆధ్యాత్మికంగా శ్రద్ధ వహించాడు మరియు వారి విశ్వాస భద్రతకు బాధ్యత వహించాడు. కాబట్టే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు అని యోహాను అంటున్నాడు.

పరలోకపు తండ్రీ, మేము యేసుపై విశ్వాసంతో మరియు మీ మాట యొక్క సత్యంలో నడుచుకునేలా అనుగ్రహించండి. క్రీస్తులో మా సోదరులు మరియు సోదరీమణులకు సేవ చేయడానికి మాకు గొప్ప విశ్వాసాన్ని మరియు శారీరక శక్తిని ఇవ్వండి. ఆమెన్.

5ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయు చున్నావు. 6-7వారు నీ ప్రేమనుగూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమియు తీసికొనక ఆయన నామము నిమిత్తము బయలు దేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును. 8మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టివారికి ఉపకారము చేయ బద్ధులమై యున్నాము.

మునుపటి లేఖలో, తప్పుడు బోధకులకు చట్టబద్ధత ఇవ్వోధ్ధని విశ్వాసులను యోహాను హెచ్చరించాడు. ఈ లేఖలో విశ్వాసులు నిజమైన బోధకులను స్వాగతించాలని, గౌరవించాలని మరియు వారికి మద్దతును ఇవ్వాలని యోహాను కోరుకుంటున్నాడు.

గాయు పై యోహానుకు చాలా ప్రశంసలు ఉన్నాయి. గాయు నమ్మకమైన ప్రయాణ బోధకులను సరిగ్గా గుర్తిస్తూ, వారికి బస మరియు ఆహారం కొరకు ఏర్పాట్లు చేయడం, వారికి హామీ ఇవ్వడం మరియు వారు తనకు వ్యక్తిగతంగా అపరిచితులైనప్పటికీ వారిని గౌరవించమని మరియు వారి మాటలను వినమని సంఘమును ప్రోత్సహిస్తూ ఉండటం నిజముగా ప్రశంసనీయం.

6వ వచనంలోని “చర్చి” తప్పనిసరిగా యోహాను హోమ్ చర్చి ఎఫెసు అయి ఉండాలి, యోహాను ఎఫెసు బిషప్ అని రెండవ శతాబ్దానికి చెందిన లియోన్స్‌కి చెందిన ఇరేనియస్ రాశాడు. సహోదరులు ఆసియా మైనర్లో ఉన్న సంఘాలను సందర్శించి వెనుకకు ఎఫెసుకు వచ్చారు. ఈ “సహోదరులు” యోహానుకు రిపోర్టింగ్ చేసియుండుటను బట్టి వారు యోహాను ద్వారా పంపబడ్డారని చెప్పొచ్చు. ఈ “సహోదరులు” గాయుకు అపరిచితులు, కాని అతడు యోహానును విశ్వసించినందున అతడు వారిని స్వాగతించాడు.

యోహాను గాయును “వారు అన్యజనుల వలన ఏమియు తీసికొనక ఆయన నామము నిమిత్తము బయలు దేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండునని” కోరాడు, అంటే బహుశా గాయు వారికి కొంత ప్రయాణ డబ్బును, ప్రయాణానికి ఆహారం మరియు బహుశా వారి తదుపరి స్టాప్ కోసం సిఫారసు లేఖ కూడా ఇవ్వాలి. వారు తమ స్వలాభం కోసం కాదు గాయు మరియు అతని తోటి క్రైస్తవులకు దేవుని వాక్యాన్ని తీసుకురావడానికి వచ్చారు. ఈ “సహోదరులు” క్రీస్తు రాయబారులు కాబట్టి, తమ ప్రభువైన యేసుకు ఇవ్వాల్సిన గౌరవంతో గాయు వారిని చూస్తాడని యోహాను నమ్మకంగా ఉన్నాడు. వ్యవస్థీకృత చర్చిల ముందు రోజులలో, విశ్వాసం మరియు భాగస్వామ్య నెట్‌వర్క్‌ను నిర్మించడం చాలా ముఖ్యమైనది, “మనము సత్యమునకు సహాయకులమవునట్టు (జతపనివారిమవునట్లు) అట్టివారికి ఉపకారము చేయ బద్ధులమై యున్నాము” అను మాటలు ఆ విషయాన్నే తెలియజేస్తూవున్నాయి.

ఈ ప్రయాణ సహోదరులు ఎన్నటికీ ధనవంతులు కారు. వారు యేసుక్రీస్తు యొక్క రక్షణ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తమ స్వంత సపోర్ట్ నెట్‌వర్క్‌ను, వారి ఇతర ఉద్యోగాలను మరియు వారి కుటుంబాలను విడిచిపెట్టియున్నవారు. ఈ సహోదరులు (విజిటింగ్ టీచర్స్) “అన్యమతస్థుల” (వచనం 7) నుండి ఎటువంటి ద్రవ్య సహాయాన్ని కోరలేరు కాబట్టి, వారు తోటి క్రైస్తవుల నుండి మద్దతును కోరవలసి వచ్చింది. వారు సేవ చేస్తున్న క్రైస్తవ ప్రజల నుండి వచ్చే ప్రేమపూర్వక మైన బహుమానములపై మాత్రమే ఆధారపడి ఉన్నారు. సత్యాన్ని భోదిస్తున్న వారికి సంఘము/ విశ్వాసులు మద్దతు ఇచ్చి నప్పుడు, వారు సువార్త సత్యం కోసం పని చేస్తారు. ఇది సంఘాల పట్ల దేవుని పాలసీ: వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను (గలతీ 6:6). “పనివాడు తన జీతమునకు పాత్రుడు” (1 తిమోతి 5:18).

ఈ “సహోదరులు” గాయుకు మరియు సంఘానికి అపరిచితులు, కాని వారు యోహాను మరియు క్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. యేసు తన శిష్యులకు శిక్షణను ఇస్తూ వారి వారి ప్రయాణాలకు వారిని సిధ్ధపరుస్తూ, ఆయన వారితో ఇలా అన్నాడు:

  1. మత్తయి 10:11-15, మీరు ఏపట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి. ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి. ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
  2. మత్తయి 10:40-41, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతు డని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును.

లోకములోనికి ఆయన వాక్యాన్ని నడిపించడంలో ఆయన ఏజెంట్లుగా దేవుడు తన మానవ వార్తాహరులకు తనను తాను పరిమితం చేసుకోవడానికి ఎంచుకున్నాడు. ప్రజలను మార్చడం మరియు వారిని తన ఆత్మతో నింపడం ఆయన పని. తన దైవిక సందేశం కోసం ఆయన మానవ వార్తాహరులను ఉపయోగించుకొనుటకు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నమ్మకమైన బోధకులు మాట్లాడినప్పుడు, దేవుని ప్రజలు తప్పక వినాలి. నాయకులు ముఖ్యంగా సత్యాన్ని వినడం నేర్చుకోవాలి మరియు నిజం మాట్లాడేవారిని గౌరవించేలా ఇతరులను నడిపించాలి.

రెండవ భాగం
దియొత్రెఫే – ఒక దుర్వినియోగ నిరంకుశుడు (9, 10)

9నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. 10వాడు మమ్మును గూర్చి చెడ్డమాటలు వదరుచు, అది చాలనట్టుగా, సహోదరులను తానే చేర్చు కొనక, వారిని చేర్చుకొన మనస్సుగల వారిని కూడ ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు; అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియ లను జ్ఞాపకము చేసికొందును.

యోహాను, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని అని చెప్తున్నాడు. మనం 2 యోహాను అని పిలిచే పత్రిక అదే అయి ఉంటుందా? గాయు సంఘం 2 యోహానులో “ఏర్పరచబడినదైన అమ్మగారు” కాగలదా? లేదా యోహాను గాయు సంఘానికి ఇంతకు ముందు లేఖ వ్రాసి ఉండొచ్చా? దియొత్రెఫే యోహాను సలహాను తిరస్కరించి ఉండొచ్చు. ఈ దియొత్రెఫే ఎవరు? క్రొత్త నిబంధనలో అతని గురించి మరెక్కడా పేర్కొనబడ లేదు, కాబట్టి ఇతనిని గురించి మనకు తెలిసినవన్నీ ఈ రెండు వచనాలలోనే కనిపిస్తాయి. అతని తల్లిదండ్రులు తప్పనిసరిగా అన్యమతస్థులు అయి ఉండాలి, ఎందుకంటే వారు అతనికి పెట్టిన గ్రీకు పేరుకు “జ్యూస్ (zeus) చేత పోషించబడువాడు” అని అర్థం, (గ్రీకు పురాణాల దేవతలకు జ్యూస్ రాజు).

దియొత్రెఫే వారి సంఘంలో తనను తాను అత్యున్నత నాయకుడిగా మొదటి స్థానంలో ఉంచుకొంటున్నాడు. దియొత్రెఫే ఒక అహంభావ నాయకుడు. అతడు సామాన్యుడా లేక పాస్టర్ గారా అనే సంగతి తెలియదు. అతడు సంఘంలో వారి సమావేశాలను నియంత్రించడానికి మరియు అతడు చెప్పినట్లు చేయడానికి నిరాకరించిన వారిని బహిష్కరించేటంత ఇన్ఫ్లుయెన్స్ కలిగియున్నాడు. దియొత్రెఫే నాయకత్వం అతని తలకెక్కింది. యేసు బోధకు అనుగుణంగా సేవకునిగా వ్యవహరించడానికి బదులుగా, అతను తన నాయకత్వాన్ని దుర్వినియోగం చేసే నిరంకుశుడిగా మారాడు. నాయకత్వాన్ని పొందాలని చూస్తున్న దియొత్రెఫే అపొస్తలుడి అధికారాన్ని పూర్తిగా విస్మరించాడు, సహోదరులను (విజిటింగ్ టీచర్స్ ని), అపొస్తలుడు పంపిన ప్రతినిధులను స్వీకరించడానికి నిరాకరించాడు. ఇదంతా ఎందుకంటే, బహుశా ఆ మొత్తం ప్రావిన్స్‌లో, దియొత్రెఫే తనను తాను నాయకుడిగా మార్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. దియొత్రెఫే నాయకత్వంలోని ఐదు భయంకరమైన లక్షణాలను యోహాను పేర్కొంటున్నాడు:

  1. ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే, దియొత్రెఫే ప్రధానత్వమును కోరుకొంటూవున్నాడు. పరిశుద్ధ గురువారం సాయంత్రం యేసు తన శిష్యులు ఎలా ఉండాలో చూపించడానికి ఆయన మోకాళ్లపై ఉండి వారి పాదాలను కడిగాడు (యోహాను 13:12-17). ఆయన కపెర్నహూములో తన శిష్యులతో, “ఎవడైనను మొదటి వాడైయుండ గోరిన యెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెనని” చెప్పాడు (మార్కు 9:35). ఈగో సమస్యలతో ఉన్న నాయకులు తమ ప్రజలకు ఏమి అవసరమో అనే దానిపై ఆసక్తి చూపరు. వారు తమ స్వంత అవసరాలను తీర్చుకోవడానికి లేదా చుట్టూ ఉన్న వ్యక్తులకు యజమానిగా ఉండే అధికారాన్ని బట్టి, నియంత్రణ పట్ల మక్కువను బట్టి లేదా ఇతరత్రా కారణాలను బట్టి ప్రజలను ఉపయోగించు కొంటారు. దియొత్రెఫే ఈ కోవకు చెందినవాడు.
  2. మమ్మును అంగీకరించుటలేదు, దియొత్రెఫే యోహానుతో ఏమీ చేయకూడదనుకున్నాడు. ఇది తీవ్ర సమస్యగా మారింది. అపొస్తలుడైన యోహాను, ఇతర అపొస్తలులు క్రీస్తు వ్యక్తిగత ప్రతినిధులు. వ్రాతపూర్వక బైబిల్ వచ్చే వరకు, అపొస్తలుల మాటలే బైబిల్. యోహానుతో అగౌరవంగా ప్రవర్తించిన దియొత్రెఫే వంటి నాయకుడు తమ రక్షకుని పట్ల ఇతర సభ్యుల మనస్సులను మరియు హృదయాలను విషపూరితం చేస్తున్నాడు. దియొత్రెఫే యోహాను నుండి అపొస్టలిక్ లేఖను తిరస్కరించడం అంటే క్రీస్తును తిరస్కరించడం.
  3. వాడు మమ్మును గూర్చి చెడ్డమాటలు వదరుచు, దియొత్రెఫే యోహాను గురించి దురుద్దేశంతో గాసిప్ చేస్తున్నాడు. గాసిప్ అనేది నాశనం చేసే చర్చ. ఇది ద్వేషం మీద ఆధారపడి ఉంటుంది, ప్రేమ కాదు. ఇది నయం చేయడానికి కాదు, గాయపరచడానికి రూపొందించబడింది. ఇది గాసిపర్‌ను నిర్మించడానికి మరియు బాధితుడిని కూల్చివేయడానికి ప్రయత్నిస్తుంది. యోహాను తనను తాను రక్షించు కోవడానికి వ్యక్తిగతంగా అక్కడ లేనందున, దియొత్రెఫే సమర్థవంతంగా ప్రతిఘటించబడలేదు.
  4. అది చాలనట్టుగా, సహోదరులను తానే చేర్చు కొనక, వారిని చేర్చుకొన మనస్సుగల వారిని కూడ ఆటంకపరచుచు, దియొత్రెఫే సోదరులను (అంటే యోహాను పంపిన సహోదరులను మరియు ప్రతినిధులను) స్వాగతించడానికి నిరాకరించాడు. తన చిన్న సమూహాన్ని నియంత్రించడానికి చేసే ప్రయత్నంలో, దియొత్రెఫే బయటి వారి ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు. ఇది కల్ట్స్ యొక్క క్లాసిక్ యుక్తి. కల్ట్ నాయకులు తమ బాధితులను బ్రెయిన్‌వాష్ చేయడంతో, వారు వ్యక్తి యొక్క కుటుంబం లేదా మునుపటి ఆధ్యాత్మిక నాయకుడితో అన్ని సంబంధాలను తెంచు కోవడానికి ప్రయత్నిస్తారు. తద్వారా వారు దియొత్రెఫేనే కోరుకొనేటట్లు అతడు ప్రయత్నిస్తూవున్నాడు.
  5. సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు, దియొత్రెఫే సహోదరులను స్వాగతించకుండా ఇతరులను ఆపడమే కాకుండా, సహోదరులను స్వాగతించిన వారిని వెలివేస్తూ చర్చి నుండి బయటకు పంపాడు. దియొత్రెఫే ఒక నిరంకుశుడు అయ్యాడు, ఈ సమూహాన్ని పూర్తిగా నియంత్రించాలని కోరుకున్నాడు. ఆరోగ్యకరమైన సంఘాలు నిజ సత్య బోధకుల మాటలను వింటారు, నిర్ణయాలను, పరిచర్యను పంచుకుని ఏకాభిప్రాయాన్ని నిర్మించే నాయకులను కలిగి ఉంటాయి. దియొత్రెఫే పవర్ ట్రిప్‌లో ఉన్నాడు. అతడు ఒక విధంగా సమూహాన్ని బెదిరించి ఎవరు సభ్యుడిగా ఉండవచ్చో మరియు ఎవరు కాకూడదో నిర్ణయించేలా చేశాడు. బహుశా గాయు స్వయంగా దియొత్రెఫే కోపాన్ని అనుభవించాల్సి ఉంటుంది.

10వాడు మమ్మునుగూర్చి చెడ్డమాటలు వదరుచు, అది చాలనట్టుగా, సహోదరులను తానే చేర్చుకొనక, వారిని చేర్చుకొన మనస్సుగల వారిని కూడ ఆటంక పరచుచు సంఘములోనుండి వారిని వెలివేయుచున్నాడు; అందుచేత నేను వచ్చి నప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును. యోహానుకు దేవుడిచ్చిన అధికారాన్ని అడ్డుకోవడానికి దియొత్రెఫే యోహానుపై ఎలాంటి ఆరోపణలను సంఘానికి చెప్పాడో మనకు తెలియదు. యోహాను పంపిన ప్రతినిధులను స్వీకరించడానికి, నిరాకరించడానికి అతడు తన సంఘానికి ఏమి చెప్పాడో మనకు తెలియదు; అతని ఆరోపణలు తప్పు. సహోదరులను చేర్చుకొన మనస్సుగల వారిని కూడ ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు, బహిష్కరణ అనేది సమాధి, ఫెలోషిప్ నుండి ఒకరిని తొలగించడానికి కొన్నిసార్లు అవసరమైన సాధనం. దాని లక్ష్యం ఎల్లప్పుడూ పశ్చాత్తాపం చెందని పాపిని పునరుద్ధరించడమే (మత్తయి 18:15-18), చర్చిలో అధికారాన్ని ఏకీకృతం చేయడానికి ఒక వ్యక్తికి సాధనంగా అది మారకూడదు. ఇది పాస్టర్ లేదా ఛైర్మన్ యొక్క వ్యక్తిగత హక్కు కాదు, కాని ఇది మొత్తం ఫెలోషిప్ ద్వారా తీసుకోవలసిన నిర్ణయం.

గాయు సంఘంలోని సమస్యలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి, ఈ వచనాలు నేటి మన జీవితాలకు అన్వయించబడవని మనం అనుకోవచ్చు. కాని నాయకత్వం వహించే వారందరూ, చర్చిలో నడిపించే వారు కూడా, వారి హృదయాలలో మరియు మనస్సులలో, దియొత్రెఫే యొక్క స్వభావాన్ని కలిగియున్నారు. ఆ స్వభావము హానికరము. తమకు నచ్చని ఏదైనా ఆలోచనలు లేదా ప్రోగ్రామ్‌లకు ఆక్సిజన్‌ను నెమ్మదిగా ఆపివేసే పాస్టర్లు ఇప్పటికీ ఉన్నారు. తమ దారికి రాకపోతే డబ్బును నిలిపివేస్తానని బెదిరించే విశ్వాసులు ఇప్పటికీ ఉన్నారు. సమాచారం లేదా నిర్ణయాలను పంచుకోని, ప్రజలపై తమ ఇష్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నించే, అన్ని మార్పులను మొండిగా ప్రతిఘటించే లేదా ఫెలోషిప్ యొక్క చర్యలను నియం త్రించడానికి భావోద్వేగ ప్రకోపాలు (అవుట్ బరస్ట్స్), తారుమారు చేసిన సమాచారం లేదా ఇతర బెదిరింపు వ్యూహాలను ఉపయోగించే నాయకులు ఇప్పటికీ ఉన్నారు.

మూడవ భాగం
దేమేత్రియు – ఒక గౌరవనీయమైన రోల్ మోడల్ (11, 12)

11ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలుచేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. 12దేమేత్రియు అందరివలనను సత్యమువలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడ అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము; మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు.

ఆశ్చర్యకరంగా, 9 మరియు 10 వచనాల యొక్క నిరాశజనకమైన దృష్టాంతంలో, యోహాను ఆశాజనకమైన మాటలను చెప్తూ వున్నాడు:

దియొత్రెఫే చేత క్రిందికి లాగబడకండి. కీడుచేయువాడు దేవుని చూచిన వాడు కాడు. దియొత్రెఫే వెనుక దేవుని బలం లేదా సంకల్పం లేదు, చివరికి అతను విఫలమై పడిపోతాడు. మనందరికీ అన్నిటికంటే ఎక్కువగా దేవుని ఆమోదం అవసరం, మరియు దియొత్రెఫే చేస్తున్న పనిని దేవుడు ఖచ్చితంగా ఆమోదించడు. దౌర్జన్యం మరియు గాసిప్‌లతో పోరాడటానికి ఉత్తమ మార్గం మంచిని అనుకరించడం. గాసిప్‌కు బదులుగా సత్యంలో ఆశ్రయం పొందండి. నీచత్వం, ద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కోండి. క్రైస్తవులు సంఘంలో వ్యక్తిగత అధికారాన్ని పొందేందుకు తమ ప్రభావాన్ని లేదా స్థానాన్ని ఉపయోగించ కూడదు, (లూకా 22:24-27). “మేలు చేయువాడు దేవుని సంబంధి” అని యోహాను చెప్పాడు, (మార్కు 10:18). దేవుడు తన చిత్తాన్ని చేసే వారందరినీ ఆశీర్వదిస్తాడని నమ్మండి. వారి పరిచర్యలను ఆయన మార్గంలో నిర్వహించండి. దేవుని వాక్యం, సంకల్పం మరియు శక్తి విజయాన్ని ఇస్తాయి. కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు, 1 యోహాను 3:6.

దేమేత్రియు మీతో ఉన్నారు. గాయుకు దేమేత్రియు ఎవరో తెలుసు. మనకు తెలియదు. అతడు గాయు సంఘంలో సానుకూ లమైన మరియు నిర్మాణాత్మకమైన పనివానిగా ఉన్నాడు. దియొత్రెఫే చెడు పనులను ప్రతిఘటించడంలో మిత్రుడు. అతడు ఈ లేఖతో యోహాను పంపిన కొరియర్ లేదా “సహోదరులలో” ఒకరు కావచ్చు. అపొస్తలుల కార్యములు 19:24లో అర్తెమిదేవికి వెండి విగ్రహాలను చేసిన వెండి కంసాలి పేరు కూడా దేమేత్రియునే. అతని ప్రోద్బలంతో ఎఫెసులో పెద్ద అల్లర్లు చెలరేగాయి. ఈ దేమేత్రియు, 3 యోహానులోని దేమేత్రియు ఒకటి కావొచ్చా? (ఇప్పుడు అతడు క్రీస్తులోనికి మార్చబడి సంఘములో చేరి వున్నాడా?) తెలియదు.

దేమేత్రియు ఎవరైయున్నప్పటికి, అతడు గాయుకు ప్రోత్సాహం మరియు బలాన్ని ఇచ్చాడు. అతడు అందరి వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. ఆరోగ్యకరమైన సంఘ జీవితాన్ని స్థాపించడంలో అతడు విలువైన మిత్రుడిగా నిరూపించు కున్నాడు. అతడు యోహాను యొక్క పూర్తి విశ్వాసాన్ని మరియు ఆమోదాన్ని కలిగి ఉన్నాడు. “మేము కూడ అతనికి సాక్ష్యమి చ్చుచున్నాము; మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు” అను మాటలకు దేమేత్రియు చెప్పిన మాటలలో సత్యం ఉంది, అతడు దేవుని నుండి మాట్లాడుతున్నాడని అవి నిరూపిస్తున్నాయి అని యోహాను చెప్తున్నాడు. వాస్తవానికి సత్యము ఒక అమూర్తీకరణమై యున్నది. సత్యాన్ని మాట్లాడాలి; అది స్వయంగా మాట్లాడదు. యోహాను సత్యాన్ని వ్యక్తీకరిస్తున్నాడు.

మేము కూడ అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము అని చెప్పడంలో, ఒక సాక్ష్యం నిలబడటానికి ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు ఉండాలి (ద్వితీయో.కాండము 19:15; మత్తయి 18:16; 2 కొరింథీ 13:1) అని బైబులు చెప్తూ వుంది. ఇక్కడ సాక్షులు (1) యోహానుతో ఉన్న సంఘము (2) దేవుని వాక్య సత్యం మరియు (3) అపొస్తలుడైన యోహాను మరియు అతని తోటి పెద్దలు.

పరలోకపు తండ్రి మీ రాయబారుల పట్ల మమ్మును ప్రేమతో నింపండి, సత్యానికి సాక్ష్యమిచ్చే వారందరినీ మేము చేర్చు కొంటాం మరియు వారికి మద్దతు ఇస్తాం. సంఘానికి హాని కలిగించే వారి కుట్రలకు వ్యతిరేకంగా నిలబడటానికి మాకు ధైర్యాన్ని ఇవ్వండి, ఆమేన్.

నాలుగవ భాగం
అంతిమ శుభాకాంక్షలు (13, 14)

13అనేక సంగతులు నీకు వ్రాయవలసియున్నది గాని సిరాతోను కలముతోను నీకు వ్రాయ నాకిష్టము లేదు; 14శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను; అప్పుడు ముఖాముఖిగా మాటలాడు కొనెదము.

ఈ చిన్న పత్రిక గాయు సంఘంలోని సమస్యలపై క్లుప్తంగా మాత్రమే తెలియజేస్తూవుంది. యోహాను మార్గదర్శకత్వం మరియు సూచన కూడా సంక్షిప్తముగా ఉంది. ప్రజలకు అవసరమైన మార్పులను తీసుకురావడానికి వ్యక్తిగతంగా అక్కడికి వెళ్లాలని యోహాను ప్లాన్ చేశాడు. అతడు అక్కడికి వెళ్ళాడో లేదో మనకు తెలియదు. పశ్చిమ ఆసియా మైనర్‌లో తన పరిచర్యలో అనేక దశాబ్దాలుగా, అతడు తన సంరక్షణలో ఉన్న చర్చిలకు డజన్ల కొద్దీ, వందల కొద్దీ క్షేత్ర సందర్శనలు చేసి ఉండాలి. ప్రతి ఒక్కరికి అతడు యేసు యొక్క శ్రమ మరణములను బట్టి “సత్యం, ప్రేమలో నడవమని” తెలియజేసాడు. అతడు ప్రజలను ప్రేమించి, వారి రక్షకుని గురించిన సత్యాన్ని వారికి బోధించేవాడు.

యోహాను పత్రిక ఒకే సంఘానికి చెందియున్న మనలో ప్రాంతీయ పర్యవేక్షణ అనే ఆలోచనను అభినందించడానికి సహాయ పడుతూ వుంది. దృఢ సంకల్పం మరియు చిత్తశుద్ధి లేని స్థానిక నాయకులు దేవుని మందలోని గొర్రెల పట్ల దౌర్జన్యం చేయ వచ్చు మరియు దేవుని మందలోని గొర్రెలను దుర్వినియోగం చేయవచ్చు. స్థానిక నాయకులను జవాబుదారిగా ఉంచే మరియు తప్పును ఎదిరించడానికి బలహీనులుగా భావించే క్రైస్తవులకు వనరుగా పనిచేసే తెలివైన మరియు బలమైన “బిషప్‌లు” ఉండటం గొప్ప ఓదార్పు. ఈ ఇంటర్‌ లాకింగ్ సంబంధాల వెబ్ అనేది దేవుడు తన చర్చిలో నిర్మించిన అద్భుతమైన రక్షణ, మరియు చర్చి నిర్వహణ, పర్యవేక్షణ మరియు సిబ్బంది మన ప్రశంసలకు మరియు ప్రార్థనలకు అర్హులు.

నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము.    

సంఘంలోని అల్లకల్లోలం కారణంగా గాయు ఇబ్బంది పడుతూ ఉండాలి. దియొత్రెఫేచే “బహిష్కరించబడిన” తన క్రైస్తవ స్నేహితులతో మాట్లాడినప్పుడు అతని హృదయం ఎంతగానో బాధపడి ఉండొచ్చు. అతడు మరియు ఇతరులు నిర్మించినదంతా నెమ్మదిగా బలహీనపడుతూ వున్నట్లుగా అనిపించవచ్చు.

ఈస్టర్ సాయంత్రాన్న భయపడుతూవున్న యోహానుతో పునరుత్థానుడైయున్న క్రీస్తు మాట్లాడిన అదే మాటను యోహాను గాయుతో చెప్తూవున్నాడు: నీకు సమాధానము కలుగును గాక. దేవుడు “సమాధానము” అని చెప్పి నప్పుడు మనం నిజంగా నెమ్మదిని కలిగివుండొచ్చు. ఎందుకంటే, సాతాను ఓడిపోయాడు. వాడు దియొత్రెఫే వలె దురహంకారంతో మోసపూరితమైన శత్రువై యున్నప్పటికీ, వాడు గాయపడియున్న ఆయన చేతుల నుండి క్రీస్తు మందలో ఒకదానిని కూడా చీల్చలేడు కాబట్టి. “నీకు సమాధానము కలుగును గాక” అనే యోహాను మాటలు గాయు హృదయానికి ఎంతో ప్రశాంతతను కలిగించాయి. దేవుడు తన సింహాసనం మీద ఉన్నాడు; మనము విజేతల కంటే ఎక్కువ; దేవుణ్ణి ప్రేమించే వారి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగునను మాటల ద్వారా యోహాను గాయు దృష్టిని క్రైస్తవుల విస్తృత సహవాసం వైపుకు ఎత్తాడు.

మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. “మన స్నేహితులు” (అంటే, యోహాను స్వసంఘము లో ఉన్నవారు) నీకు శుభాకాంక్షలను పంపుతున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము,” అంటే ఒక్కొక్కరిగా, పేరు ద్వారా. ప్రారంభ క్రైస్తవులకు, వారి బాప్టిజం పేరు దేవుని దయ యొక్క ప్రత్యేక జ్ఞాపకాన్ని కలిగించేదిగా ఉండెడిది, ఇక్కడ వ్యక్తిగత శుభాకాంక్షలు వారు క్రీస్తులోకి బాప్టిజం ద్వారా సోదరులు మరియు దేవుని పిల్లలు అని వారికి గుర్తు చేస్తూవుంది. యోహాను తమను వ్యక్తిగతంగా జ్జ్యపాకము చేసుకుంటున్నాడని ఈ వ్యక్తులు తెలుసుకోవడం ఎంతో మధురమైనది. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత శుభాకాంక్షలను తెలియజేయడంలో గాయు యోహాను యొక్క వ్యక్తిగత ప్రతినిధిగా వున్నాడు. వారందరు కూడా యోహానుకు స్నేహితులే (అక్షరాలా “ప్రియమైనవారు”), మరియు వారందరు దేవుని స్నేహితులు కూడా కాబట్టి దేవుడు వారందరిని కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు, అనే అర్ధములో నీకు సమాధానము కలుగును గాక అని చెప్పియున్నాడు.

పరలోకపు తండ్రి మీరు బాప్టిజం ద్వారా మాలో ప్రతి ఒక్కరినీ పేరుపేరునా మీ కుమారుని లోనికి పిలిచి యున్నారు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును క్రీస్తును ముఖాముఖిగా చూచు వరకు మాకు దయ చేయుమని అడుగు చున్నాము. ఆమెన్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.