యేసుని శిష్యులు ఆయన దేహాన్ని ఎత్తుకొని వెళ్లారు అనే అబద్ధం లోని అసంబద్దతలు (రోమన్ సైనికుల తరుపున ఆలోచిద్దాము)

ఖాళీ సమాధికి సంబంధించిన విభిన్న సిద్ధాంతాలు

మత్తయి 28: 11-15_ వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్ని టిని ప్రధానయాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతోకూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి – మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి; ఇది అధిపతి చెవినిబడిన యెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందరకలుగకుండ చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి.  

ప్రధానయాజకులు పెద్దల మహాసభ సన్హెడ్రిన్ కూడి ఆలోచన చేయడానికి కారణమేంటి? వాళ్ళు ఎంత జాగ్రత్త వహించి నప్పటికీ, యేసుదేహం సమాధిలో లేదు. నిజానికి ఆయనను చంపడానికి వాళ్ళెంతగానో కష్టపడ్డారు. ఆయన దేహము సమాధిలో పెట్టబడిన తరువాత వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నారు. ఆయన చనిపోయాడని నిర్ధారించుకున్నారు. యేసుని బరియల్ లో వాళ్ళు వున్నారు, యేసుని సమాధిని రాతితో మూసివేసినప్పుడు వాళ్ళు వున్నారు. ఆ సమాధికి పిలాతు ఆజ్జ్యతో కావలి పెట్టారు మరి ఇప్పుడు యేసుని దేహము సమాధిలో లేదు. అక్కడ ఖాళీ సమాధి తప్ప. ఆయన మళ్లీ బ్రతికించబడ్డాడని స్త్రీలు శిష్యులచే ద్రువీకరింపబడియుండటాన్ని యూదా మతపెద్దలు విని యుండొచ్చు. ఇప్పుడు తమ స్వజనులకు, పిలాతుకు, లోకానికి యేమని జవాబు చెప్పాలి. ఎలా చెప్తే బాగుంటుంది అని ఆలోచన చేసి సైనికులకు చాల ద్రవ్యమిచ్చి – మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి, అనే దానిని ఫైనల్ చేశారు.  

నిజానికి, మొదటిగా ప్రధానయాజకులు లేదా యూదా మతపెద్దలు శిష్యులను స్త్రీలను పిలిచి ఈ విషయమై ఎంక్వయిరీ చెయ్యాలి. చేశారా, లేదే. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి కనీసం ఎలాంటి ప్రయత్నము చెయ్యకుండా యూదా మతపెద్దలు చాలా తర్జనభర్జన తర్వాత వాళ్ళు సైనికులకు లంచం ఇచ్చి అబద్ధం చెప్పడానికి వారిని ప్రేరేపించి అతని శిష్యులు రాత్రివేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరనే అబద్దాన్ని ప్రాచుర్యములోనికి తేవాలనే అభిప్రాయానికి వచ్చారు. సత్యాన్ని దాచిపెట్టడానికి అబద్దాన్ని ప్రాచుర్యములోనికి తేవడానికి ఆ అబద్దాన్ని ద్రువీకరించడానికి సైనికులకు చాలా పెద్ద మొత్తములో డబ్బు ఇవ్వబడింది. యూదా మతపెద్దలు ప్రాచుర్యములోనికి తెచ్చిన అబద్దములోని అసంబద్ధ తలను ఒక్కసారి పరిశీలిధ్ధాం: 

1.     యేసుని సమాధి వద్ద ఉంచబడిన రోమన్ సైనికుల సంఖ్య 60. వాళ్ళు యేసు దేహాన్ని కాపాడే ఉద్దేశ్యంతో అక్కడ ఉంచబడ్డారు. వాళ్ళు శిక్షితులైన  సైనికులు. రోమన్ రూల్స్ ప్రకారం సైనికులు కాపలా వున్నప్పుడు నిద్రపోతే శిక్ష మరణమే. మరి యేసు లేచి వెళ్లిపోతూవున్నప్పుడు సైనికులందరు నిద్రపోతూ ఉన్నారా? 

వారిలో ఏ ఒక్కరికి కూడా మెలకువ రాకుండా సమాధి మీద రాయిని దొర్లించడం సాధ్యమేనా? సైనికులు “నిద్రలో” ఉంటే, శిష్యులే యేసుని దేహాన్ని దొంగిలించారని వాళ్లకు ఎలా తెలుసు. ఒకవేళ  సైనికులు “మేల్కొని ఉంటే,” వాళ్ళు శిష్యులను ఎందుకని ఆపలేదు, పట్టుకోలేదు. సైనికులు వాళ్లకు ఎందుకని భయపడ్డారు? తరువాతైనా శిష్యులే యేసుని దేహాన్ని దొంగిలించినట్లు ఎందుకని వాళ్ళు రుజువు చెయ్య లేదు? ఆ దిశగా వాళ్ళు కనీసం ప్రయత్నించను కూడా లేదు ఎందుకని?

2.    శిష్యులు సాయుధులైన రోమన్ సైనికుల నుండి వారి కావలిలో వున్న సమాధినుండి యేసుని దేహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించారంటే ఎలా నమ్మగలం? ఎందుకంటే అక్కడ గొడవ జరిగిన దాఖలాలు ఏవి లేవు. శిష్యులలో ఏ ఒక్కరు గాయపడలేదు.

3.    సమాధులను దోచుకొనే దొంగలు ఒకవేళ యేసుని సమాధిని తెరచి యేసుని ఎత్తుకొనిపోయి ఉంటే ఆయనను అలాగే ఎత్తుకొనిపోయి వుండేవాళ్ళు తప్ప ఆయన దేహమును చుట్టిన నారబట్టను పూర్తిగా విప్పేసి వాటిని చక్కగా మడిచి (అదికూడా నేను తిరిగి వత్తును అనే అర్ధములో) ఆయన నగ్నదేహాన్ని ఎత్తుకొనిపోయారా? లేదా ఆయనకు మరొక బట్టను చుట్టి ఎత్తుకొని పోయి ఇంకెక్కడన్న పాతిపెట్టారా? 

యూదా మతపెద్దలు ప్రాచుర్యములోనికి తెచ్చిన ఈ అబద్దములోని అసంబద్ధతలనుబట్టి వీళ్ళని వెర్రివాళ్ళు అనుకో కండి. వీళ్ళు ప్రాచుర్యములోనికి తెచ్చిన ఈ అబద్దమును వీళ్ళు ఎంత మేనేజ్ చేసారో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. (చరిత్రపరంగా మతపరంగా రాజకీయపరంగా ఈ అబద్దమును మేనేజ్ చెయ్యాలి) చేశారు. అందుకనే రోమన్ రికార్డ్స్ లో యేసునిదేహానికి ఏమయ్యింది అనే విషయమై ఎలాంటి సమాచారంలేకుండా యూదా మతపెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకొన్నారు. 

యేసు లేచాడనే సాక్ష్యాలు తారుమారు చెయ్యాలి, చేశారు. సైనికులు వారి జీవితాంతము నోరువిప్పకుండా వారి చుట్టూ వారికి తెలియకుండా కస్టడీ ఏర్పాటు చేసివుంటారు, అలాగే వాళ్ళు ఇందుకోసమై కరడుకట్టిన మత ఛాందసవాదులను కూడా ఏర్పాటుచేసుకొన్నారు. ఈ అబద్దాని ప్రజలలోనికి వైరల్ గా తీసుకొనివెళ్ళాలి అంటే ఇశ్రాయేలులోని ప్రతి ఒక్కరి దగ్గరకు ప్రతి గ్రామానికి ఈ అబద్దాన్ని చేర్చవలసివున్నారు. ఇందుకు వాళ్ళు సమయాన్ని సంపదను సామర్ధ్యమును వెచ్చించవలసియున్నారు. ఈ అబద్ధము వ్యాపించే క్రమములో అది ప్రజలలో ఎన్నో సందేహములను లేవనెత్తాలంటే వాళ్ళు ఈ అబద్దాన్ని భూదిగంతములవరకు వ్యాపింప చెయ్యవలసి ఉన్నారు. వ్యాపింప చేశారు. ప్రజలు ఈ అబద్దాన్ని నమ్మేలా చేయడంలో యూదా మతపెద్దలు విజయం సాధించామనే అనుకొన్నారు. 

యూదా మత పెద్దలు ప్రాచుర్యములోనికి తెచ్చిన అబద్దములో క్లిష్టమైన విషయాలు రెండు ఉన్నాయండి. ఒకటి ఖాళీ సమాధి. యూదా మతపెద్దలేమో యేసుని శిష్యులు యేసుని దేహాన్ని ఎత్తుకొనిపోయారని చెప్తున్నారు. అందుకు ఖాళీ సమాధిని రుజువుగా చూపెడుతున్నారు. ఇదేమో అందరికి అందుబాటులో వాస్తవంలో కనబడుతూ ఉంది. 

యేసుని శిష్యులు అంటే అపొస్తలులు, అరిమతియా యేసేపు, నీకొదేములాంటి అత్యంత ధనవంతులు, ప్రభావశీలురు, ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు యేసుకు రహస్య అనుచరులు ఇలా చాలామంది శిష్యులు యేసుకు వున్నారు అనే విషయం మరచిపోకండి.

అపొస్తలులు యేసును దగ్గరగా వెంబడించిన స్త్రీలలో కొందరు యేసు లేచియున్నాడని తాము ప్రత్యక్షంగా చూచి యున్నామని చెప్తున్నారు. అందుకు ఖాళీ సమాధిని రుజువుగా వాళ్ళు కూడా  చూపెడుతున్నారు. 

రెండవది యేసుని పునరుద్ధానము. మరి యేసు లేచినట్లైతే ఆయన అందరికి ఎందుకని తన్నుతాను ప్రత్యక్షపర్చుకో లేదు. ఈ రెండిటిని కలిపి అర్ధం చేసుకోవడమే వాళ్ళు ప్రాచుర్యములోనికి తెచ్చిన అబద్దములో ఉన్న చిక్కు ప్రశ్న. 

యూదా మతపెద్దలు యేసుని శిష్యులే యేసుని దేహాన్ని ఎత్తుకొనిపోయారనే అబద్దాన్ని ఎందుకని వాళ్ళు ప్రాచుర్యము లోనికి తెచ్చారు, అందుకు కారణాలు ఏమై ఉండొచ్చు? మొదటిగా యేసుని దేహాన్ని ఎత్తుకుపోవాల్సిన అవసరత ఎవరికుంది, ఆలోచించండి.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.