అంశము: యాకోబు ఏశావుల కధలో వాళ్లిద్దరూ ఇస్సాకు రిబ్కాలు కూడా చెల్లించిన వెల ఎంతో మీకు తెలుసా?

ఏశావు జేష్ఠత్వమును అమ్ముకోవడం

ఆదికాండము 25:21-34_21ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను. 22ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె– ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగవెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను– 23రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిప్ఠమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. 24ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. 25మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. 26తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది యేండ్లవాడు. 27ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. 28ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను. 29ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి 30–నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. 31అందుకు యాకోబు–నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా 32ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను 33యాకోబు–నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా 34యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. అట్లే ఆదికాండము 27:1-46 వచనాలలో యాకోబు ఇస్సాకును దీవెనల విషయములో మోసగించడాన్ని ఎలా అర్ధం చేసుకొందాం?

  1. ఏశావు స్వభావము ప్రవుత్తి అతనిని గురించి ఏయే విషయాలు తెలియజేస్తుంది?
  2. యాకోబు స్వభావము ప్రవుత్తి అతనిని గురించి ఏయే విషయాలు తెలియజేస్తుంది?
  3. ఇస్సాకుకు ఏ కుమారుడంటే ఇష్టం ఎందుకని? రిబ్కాకు ఏ కుమారుడంటే ఇష్టం ఎందుకని?
  4. వీరి ఇష్టాలు త్రీవ్రమైన ఒక సమస్యకు కారణమయ్యాయి. ఎలా?
  5. జేష్ఠత్వముతో ఏయే విషయాలు ముడిపడున్నాయి?
  6. ఏశావుకు జేష్ఠత్వము దానితో ముడిపడియున్న విషయాలను గురించి తెలుసా?
  7. ఏశావు ఏ పరిస్థితులలో తన జేష్ఠత్వాన్ని తృణీకరించాడు?
  8. ఏశావు బ్రష్టుడు వ్యభిచారి అని చెప్పబడింది కదా ఆ మాటలకు అర్ధమేమి?
  9. యాకోబు–నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకన్నాడు గదా. ఏశావు ఇలా ఎందుకన్నాడు?
  10. ఏశావు దేవునిచే ఇవ్వబడిన ఆధిక్యతను తెలిసే అమ్ముకొన్నాడని ఎలా చెప్పగలం?
  11. సహోదరుడు ఆకలిగొని ఆహారాన్ని అడిగితే ఆ ఆహారాన్ని యాకోబు అమ్మడం అనేది మెచ్చుకోదగిన విషయమా? ఆహారాన్ని అమ్మడానికి కారణాలు ఏమై ఉండొచ్చు?
  12. ఈ విషయములో యాకోబులో మెచ్చుకోదగిన అంశము ఏంటి?
  13. యాకోబు జ్యేష్ఠత్వాన్ని ఏశావు నుండి పొందుకొన్నాడు. దానిని ఎలా నిర్ధారించుకున్నాడు?  
  14. ఏశావు ఏ విధముగా తన స్వీయ చిత్తములో  దైవిక మార్గము నుండి తొలగిపోయాడు?
  15. ఇస్సాకు నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచి గల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని ఏశావుకు చెప్పెను అను మాటలను ఎలా అర్ధం చేసుకొందాం?
  16. ఇస్సాకు ఏశావును దీవించదలచానని అతనితో చెప్పడం రిబ్కా విని  ఆమె ఏమి చేసింది?
  17. ఇస్సాకు యాకోబుకు ఇచ్చిన దీవెనలు ఏంటి? ఈ దీవెనలు ఏశావుకు ఇస్సాకు ఇవ్వవలసినవా ?
  18. ఇస్సాకు ఎందుకని వణికాడు?
  19. జరిగిన దానిలో ఏశావు దేవుని హస్తాన్ని ఎందుకని చూడలేక పోయాడు?
  20. ఇస్సాకు కుటుంబంలోని నలుగురు అధర్మముగా ప్రవర్తించడాన్ని బట్టి వాళ్ళు చెల్లించిన వెల ఏంటి?
  21. దేవుని శాశ్వతమైన ముందస్తు జ్ఞానంలో నిత్యరక్షణకు కొందరు నిత్యత్వములో కృపలో ఏర్పరచబడ్డారని లేక రక్షణకు ముందుగానే నిర్ణయింపబడ్డారని చెప్పొచ్చు. అలాగే మఱొకప్రక్క కొందరు ఉగ్రత కొరకు ఏర్పరచబడ లేదని అంటే నరకానికి ముందుగానే నిర్ణయింపబడలేదని మనం చెప్పొచ్చు. ఈ మాట కరెక్ట్ ఆ లేక తప్పా?    

ఇస్సాకు మరియు రిబ్కా కవల కుమారులైన ఏశావు యాకోబుల కథ. దేవుని సార్వభౌమ ఎంపికకు లేఖనంలో అత్యంత లోతైన ఉదాహరణలలో ఇది ఒకటి. ప్రధానంగా ఆదికాండము 25–36లో కనుగొనబడిన ఈ కథనం ఒక కీలకమైన వేదాంత ప్రశ్నను లేవనెత్తుతుంది: దేవుడు పెద్దవాడైన ఏశావు కంటే చిన్న కుమారుడైన యాకోబును ఎందుకు ఎంచుకున్నాడు – ముఖ్యంగా ఏశావు మొదటి సంతానంగా జన్మించినప్పుడు? బైబిల్ దైవిక సార్వభౌమత్వం మరియు మానవ బాధ్యత రెండింటిపై ఆధారపడిన అనేక సమాధానాలను అందిస్తుంది. ఇది దేవుని ఉద్దేశాలు, కృప మరియు విమోచన ప్రణాళిక గురించి ముఖ్యమైన సత్యాలను వెల్లడిస్తుంది.

దేవుడు యాకోబును ఎంచుకోవడానికి గల అత్యంత ప్రాథమిక కారణం ఆయన సార్వభౌమ సంకల్పం మరియు ఉద్దేశ్యంలో ఉంది. ఆదికాండము 25:23లో, కవలలు పుట్టకముందే, దేవుడు రెబెకాకు ఇలా ప్రకటించాడు: రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిప్ఠమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.

అపొస్తలుడైన పౌలు రోమా 9:10–16లో ఈ ఆలోచనను విస్తరిస్తూ ఇలా వ్రాశాడు: రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది. కాబట్టి యేమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు– ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవని యెడల జాలి చూపుదునో వాని యెడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలననైనను, ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని, కరుణించు దేవుని వలననే అగును.

దేవుని ఎంపిక మానవ యోగ్యత పై ఆధారపడి ఉండదు. దైవిక ఎన్నిక యొక్క చర్య—దేవుని సార్వభౌమ ఎంపిక ద్వారా జరుగుతుంది. వాస్తవానికి, ఏశావు మొదట జన్మించాడు (ఆదికాండము 25:25) అయినప్పటికీ, కవలలు పుట్టక ముందే మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని, దేవుని ఎన్నిక ఉద్దేశ్యం క్రియల ద్వారా కాదు, పిలిచిన వ్యక్తి ద్వారా జరుగుతుందని రిబ్కాకు చెప్పబడింది.

ప్రాచీన సంస్కృతులలో, మొదటి కుమారుడు వారసత్వ హక్కులు మరియు కుటుంబ నాయకత్వంతో సహా ప్రత్యేక హోదా మరియు అధికారాలను కలిగి ఉండేవాడు. పెద్దవాడిగా ఏశావు, అబ్రహం నుండి ఇస్సాకు ద్వారా అందించబడిన నిబంధన ఆశీర్వాదాలను పొందడానికి సహజ ఎంపికగా ఉండేవాడు. అయినప్పటికీ, దేవుడు చిన్న కుమారుడైన యాకోబును ఎంచుకున్నాడు – ఇది బైబిల్ అంతటా పునరావృతమయ్యే నమూనా. దేవుడు తరచుగా మానవ అంచనాలను తారుమారు చేస్తాడు, తద్వారా ఆయన ఎంపికలు సామాజిక కట్టుబాట్లకు లేదా మానవ తర్కానికి కట్టుబడి ఉండవు. ఇక్కడ పితృస్వామ్య కుటుంబం దీవెనలో, మరొక అంశం, రక్షకుని పూర్వీకుడు అనే గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. ఈ దీవెన యాకోబుకు ఎందుకు వెళ్ళింది? అది యాకోబు యొక్క ప్రత్యేకత లేదా విలువ కారణంగా కాదు, కానీ దేవుడు దానిని ఆ విధంగా కోరుకున్నాడు కాబట్టి. అది ఆయన సార్వభౌమ ఎంపిక.

మలాకీ 1:2,3లో, వీరిద్దరి మధ్యనున్న వ్యత్యాసాన్ని దేవుడు ఎంత చక్కగా చెప్పాడో చూడండి : యెహోవా సెలవిచ్చునదేమనగా –నేను మీ యెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు–ఏ విషయమందు నీవు మాయెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని. ఇక్కడ ఏశావును ద్వేషించి అనే మాటను “తక్కువగా ప్రేమించడం” అని అర్థం చేసుకోవాలని వివరణ ఇవ్వబడుతుంది. ద్వేషం యొక్క అర్థాన్ని ఒకరు తప్పుగా అర్ధం చేసుకొంటే, వాళ్ళు దేవుని ప్రేమను కూడా ప్రశ్నార్థకం చేస్తారు. మరి, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను” అను మాటలని ఎలా అర్ధం చేసుకొంటాం.

ప్రేమ దయగల దేవుడు న్యాయవంతుడు మరియు పరిశుద్ధుడు. న్యాయవంతుడు పరిశుద్ధుడైన దేవుడుగా, ఆయన పాపంపై కోపంగా ఉంటాడు మరియు పాపిని ద్వేషిస్తాడు. దేవుడు ద్వేషించే పాపులు ఎవరు? అనే ప్రశ్నకు, దేవుని ముందు లభించే నీతి లేని పాపులందరూ అని అర్ధం. ఆయన ద్వేషించే పాపము నుండి విడిపించడానికి ప్రేమలో ఆయన తన కుమారుడిని ప్రపంచంలోని పాపాలకు ఏకైక ఆమోదయోగ్యమైన చెల్లింపుగా చనిపోయేలా ఆయనను అనుగ్రహించాడు.

దేవుడు పాపిని ద్వేషిస్తాడు; దేవుడు పాపిని ప్రేమిస్తాడు. పాపం మరియు పాపి పట్ల దేవుని ద్వేషాన్ని దేవుని ధర్మశాస్త్రం గట్టిగా హెచ్చరిస్తుంది. కీర్తనకర్త దేవుని గురించి చెప్తూ, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు (కీర్తన 5:5). కాని పాపాన్ని సహించలేని అదే దేవుడు, “నా జీవముతోడు… దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును” (యెహెజ్కేలు 33:11). పౌలు కూడా ఈ విషయాన్నే చెప్తూ, “మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు” (రోమీయులు 5:8) అని అంటున్నాడు.

ప్రభువు పాపాన్ని మరియు పాపులను ద్వేషిస్తాడు, మరియు ప్రభువు పాపులను ఎంతో ప్రేమిస్తాడు మరియు వారు రక్షించబడాలని కోరుకుంటున్నాడు. ఏశావు కంటే యాకోబు ఎందుకు? దేవుడు ఏశావును తిరస్కరించడానికి ఎన్నో ముఖ్యమైన కారణాలు ఏశావు స్వంత ఎంపికలలో ఉన్నాయి. ఇప్పుడు మన పాఠాన్ని పరిశీలిద్దాము.

25:27_ ఏశావు యాకోబులు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను, యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇరువురు పెరిగి పెద్దయ్యాక, వాళ్ళ స్వభావాల్లో స్పష్టమైన తేడాలున్నాయి. ఏశావు వేటాడుట యందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను. ఏశావు వేటలో ఉన్న రిస్కుని, భావోద్వేగాన్ని, వేటలో జంతువులను పట్టుకోవడంలో వేసే మోసపూరిత వ్యూహాలను ఇష్టపడుతూ ప్రమాదకరమైన జీవితాన్ని జీవించడంలో సంతోషించేవాడు. అందుకోసం అడవులలో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ అరణ్యవాసిగా ఉండేవాడు. ఇస్సాకు తనలో లేని ప్రత్యేకతను తన కొడుకైన ఏశావులో చూసి ఏశావు పట్ల ఆకర్షితుడయ్యాడు. ఏశావు తెచ్చిన వేట మాంసమును ఇష్టపడుచు తినుచుండెను గనుక ఇస్సాకు ఏశావును ప్రేమించాడు.

యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. యాకోబు నెమ్మదస్తుడు. ఏశావులా ప్రమాదకరమైన జీవితమతనిది కాదు. అబ్రాహాము ఇస్సాకులా అతడు కూడా గొర్రెల కాపరిగా ఉండటాన్ని ఇష్టపడ్డాడు. వారిలా భక్తిపరుడై ఇంటి పట్టున ఉండేవాడు. నెమ్మదస్తుడైన యాకోబును తల్లియైన రిబ్కా సహజంగానే ప్రేమించింది.

ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహామును గురించి దేవునితో అబ్రాహాముకుగల సంబంధాన్ని గురించి, వారికి ఇవ్వబడ్డ వాగ్ధానాలను గురించి, తన గురించి, దేవునితో తనకుగల సంబంధాన్ని గురించి తన కుటుంబానికున్న ప్రత్యేకతను గురించి తన పిల్లలకు చెప్పే ఉంటాడు. కవలలు పుట్టక ముందే యెహోవా ఇచ్చిన వాగ్దానాన్ని రిబ్కా తన చిన్నకుమారునితో చెప్పి ఉండొచ్చు. తల్లిదండ్రులకు ఇష్టమైన బిడ్డ ఉండటం ఇక్కడ సమస్యకు కారణం అయ్యింది. యాకోబు ద్వారా మెస్సయ్యను తేవాలనే దేవుని ఉద్దేశ్యంలో జోక్యం చేసుకొనేంతగా, ప్రయత్నించేంత తీవ్రమైన సమస్యకు కారణమయ్యింది.  

జుడాయిజంలో జేష్టుడు చాల ప్రాముఖ్యమైన కాన్సెప్ట్. కాబట్టి జేష్టునిగా ఉండటం మూలాన్న వచ్చే దీవెనలను గురించి ఏశావుకు తెలుసు. ద్వితీయోపదేశకాండము 21:17 ప్రకారము జేష్టుడు వారసత్వములో రెట్టింపు భాగానికి అర్హుడు. ఆదికాండము 27:29 ప్రకారము తండ్రి తరువాత సర్వహక్కులు, అధికారాలు మొదటి బిడ్డకే వస్తాయి. అతడు కుటుంబానికి ఏలికగా ఉంటాడు. తండ్రి తరువాత తండ్రి స్థానము లోనికి వస్తాడు. యాజకత్వము కూడా జేష్ఠత్వముతో ముడిపడి ఉంది (ఆదికాండము 28:26-29; 28:4). కాబట్టి జేష్టుడు తన కుటుంబాన్ని దేవుని భయభక్తులలో కూడా నడపాల్సి ఉన్నాడు. దేవుని వాగ్దానాలకు అతడు టైటిల్ గా ఉంటాడు. ఆ వాగ్ధానాలను ఆదికాండము 27:27-29 లో చూడొచ్చు.

కాని ఇక్కడ ఈ విషయాలన్ని ఎరిగి జేష్టునిగా ఉన్న ఏశావు దేవుడు తనకు బహుమానంగా ఇచ్చిన తన జేష్ఠత్వపు హక్కుకు అంతగా విలువనివ్వక పోవటం విచారించదగిన విషయం. యాకోబుకు కూడా ఈ విషయాలన్ని తెలుసు. అవి దేవుని ఉద్దేశ్యాల నెరవేర్పు కొరకు ఎదురుచూసేలా యాకోబును నడిపించాయి.

ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు–నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు–నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. ఈ రోజుకు కూడా సిరియా ఐగుప్తులో ఈ వంటకం వాళ్లకు ఫేవరెట్ డిష్.

యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను. ఇస్సాకు ధనవంతుడు ఇంట్లో చాలా మంది సేవకులున్నారు. కాబట్టి ఆహారము ఎల్లప్పుడు సమృద్ధిగానే  ఉంటుంది. ఏశావు ఆకలితో మరణించే సమస్యే లేదు. ఏశావు సేవకులతో యేసేపు తయారు చేసిన వంటకాన్ని తాయారు చేసి తెమ్మని చెప్పి ఉండొచ్చు లేదా ఏశావుకు యాకోబు వంటకాన్ని తినాలని అనిపిస్తే తన తల్లితోగాని తండ్రితోగాని చెప్పి యాకోబు దగ్గర నుండి కొంత తెప్పించుకొని తిని ఉండొచ్చు.

ఇక్కడ ఏశావు తెలిసే జేష్ఠత్వపు హక్కును వదులుకుంటున్నాడు. ఏశావుకు తన జేష్ఠత్వపు హక్కుతో పాటు దానితో ముడిపడి ఉన్న ఆశీర్వాదాలను ఇచ్చేస్తున్నానని తెలుసు. ఆ ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక స్వభావం కలిగినవి, అతని దృష్టిలో వాటికి విలువ లేదు. కాబట్టే నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకు? ఈ నా ప్రమాదకరమైన ప్రవృత్తిలో (ఈ వేటలో) నేను ఎప్పుడన్నా చనిపోవొచ్చు, అప్పుడు నా జేష్ఠత్వపు హక్కు వలన నాకు కలిగే ప్రయోజనమేంటి? కాబట్టి జ్యేష్ఠత్వము నాకెందుకు? అని అన్నాడు. దేవుడు నా తాతయైన అబ్రాహాముతో నా తండ్రితో చేసిన వాగ్దానాలు నాకెలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేవు అనే నిర్లక్ష్యపు జవాబు, అతనికి విలువైనది వర్తమాన ఇంద్రియ ఆనందమేనని తెలియజేస్తుంది. భవిష్యత్ యొక్క ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను ఏశావు అంచనా వేయలేక పోయాడు. ఏశావు, దేవుడు అబ్రాహాము ఇస్సాకులకు చేసిన వాగ్దానాలకు, మెస్సయ్యనిక్ లైన్ ని గూర్చిన వాగ్దానాలకు ఎలాంటి విలువను ఇవ్వక ఆ ఘడియలో తన అవసరం తీరితే చాలనుకొన్నాడు. దాని కోసం దేవునిచే ఇవ్వబడిన ఆధిక్యతను అమ్ముకొన్నాడు.

సహోదరుడు ఆకలిగొని ఆహారాన్ని అడిగితే ఆ ఆహారాన్ని యాకోబు అమ్మడం మెచ్చుకోదగిన విషయమా? యాకోబు ఏశావుకు ఆహారాన్ని అమ్మడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఇస్సాకు తరువాత వాగ్ధానాలను యాకోబు ముందుకు తీసుకువెళ్తాడనేది, దేవుడు తన ముందస్తు జ్ఞానములో తెలియజేసిన మాట. కాని ఇది ఎలా జరుగుతుందో యాకోబుకు తెలియదు. జేష్టుని స్థానములో ఏశావు ఉన్నాడు. ఏశావు విషయములో దేవుడేమి చెయ్యబోతున్నాడో తన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకొంటాడో యాకోబుకు తెలియదు. అందుకోసం యాకోబు ఎదురు చూడలేదు. నేనిలా చేస్తే బహుశా దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో నాకు సహాయపడతాడని అనుకున్నాడు. యాకోబు దేవుని సామర్థ్యంపై సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచకపోవడం మెచ్చుకోదగిన అంశం కాదు.

అయితే ఆత్మీయమైన విలువల పట్ల యాకోబుకున్న జాగరూకత నిజంగా మెచ్చుకోదగిన అంశం. ఏది విలువైనదో, దానిని కలిగియుండటం ఎంతటి విలువైనదో యాకోబు తెలుసుకొన్నాడు. కాబట్టే యాకోబు ఏశావు జ్యేష్ఠత్వాన్ని అడిగాడు. పూటకూటి కోసం తన జేష్ఠత్వపు హక్కును అమ్ముకోవడానికి ఏశావు ఇష్టపడినప్పటికీ, కడుపు నిండిన తరువాత అతడు తన మనస్సు మార్చుకొంటాడేమో అని యాకోబు అనుకొన్నాడు. కాబట్టే యాకోబు ఏశావును ఈ విషయములో ప్రమాణం చెయ్యమని అడిగాడు. ప్రమాణం చెయ్యడమంటే, ఏశావు దేవునిని సాక్షిగా పిలిచి ఆయన తనకు ఇచ్చిన జేష్ఠత్వపు హక్కులను ఆయన ఎదుటే యాకోబుకు బదిలీచెయ్యడం. ఇది కూడా ఏశావును భయపెట్టలేదు. ఏశావు ఆలోచనలు పూర్తిగా “పూటకూటి” పైనే ఉన్నాయి. అతడు తిని త్రాగి లేచిపోయెను, అనే మాటలు ఏశావు నిర్లక్ష్యపు ధోరణిని తెలియజేస్తున్నాయి. ఏశావు నిర్లక్ష్యపు స్వభావము ఏశావును తీర్పు లోనికి శిక్షావిధి లోనికి త్రోసివేశాయి. శరీరానుసారమైన ఏశావు స్వభావము అతనికి ఇవ్వబడిన వాగ్ధానాలను పోగొట్టుకొనేలా చేసింది.

ఏశావు దేవునిచే గొప్పగా ఆశీర్వదించబడ్డప్పటికీ దేవునిని నిర్లక్ష్యము చేసి ఆ గొప్ప దీవెనలను పోగొట్టుకొనిన వ్యక్తిగా లేఖనాలలో ఒక హెచ్చరికగా మిగిలిపోయాడు, హెబ్రీయులకు 12:16,17_ఒక పూటకూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడెను.

ఈ లోకములో ఇప్పటి వరకు ఎవరు చెల్లించనంత వెలను ఒక పూటకూటి కొరకు చెల్లించిన బుద్దిహీనుడు ఎవరన్నా ఉన్నారా అంటే అది ఏశావు మాత్రమే. పూటకూటి కొరకు తన జన్మ హక్కును విక్రయించాడు. దేవుడు తనకిచ్చిన జ్యేష్ఠత్వము అనే ఆధిక్యతను తృణీకరించిన, భ్రష్టుడు, వ్యభిచారి. భ్రష్టుడు అంటే మాటల ద్వారా కాని ప్రవర్తన ద్వారా కాని తాను నమ్ముతున్న దేవునిని అపహాస్యం చేయువాడని, నిర్లక్ష్యం చేయువాడని, రక్షణతో ముడిపడియున్న హక్కులను బహిరంగంగా త్యజించడం ద్వారా దేవునిని ధిక్కరించే వాడని, పరిశుద్ధమైన వాటి పట్ల గౌరవములేని వాడని అర్ధం. వ్యభిచారి అంటే ఒక చిన్న వస్తువు కొరకు ఒక కొడుకుగా దేవుని ద్వారా తనకు లభించిన జేష్ఠత్వము అనే అత్యున్నతమైన గౌరవాన్ని త్రోసిపుచ్చిన వాడు అనే అర్ధంలో ఇక్కడ ఈ మాట వాడబడింది. ఈ రెండు మాటలు ఏశావు స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. అలాగే జేష్ఠత్వపు హక్కును అమ్మడం అమ్మకపోవడం అనేది ఏశావు స్వీయ చిత్తముపై ఆధారపడి ఉందనే విషయాన్ని మరచిపోకండి.

దేవుడు ఏశావును తిరస్కరించడానికి మరో ముఖ్యమైన కారణం ఏశావు స్వంత ఎంపికలలో ఉంది. ఆదికాండము 25:29–34 ఏశావు ఆకలితో, అలసిపోయి, ఒక గిన్నెడు వంటకం కోసం తన జన్మహక్కును యాకోబుకు ఎలా అమ్మేశాడో వివరిస్తుంది. ఈ చర్య ఆధ్యాత్మిక విషయాల పట్ల నిర్లక్ష్యం మరియు దేవుని నిబంధన పట్ల భక్తి లేకపోవడాన్ని వెల్లడిస్తుంది. ఏశావు అపవిత్రుడిగా, పవిత్రమైన వాటిని తక్షణం సంతోషం కోసం వదులుకొన్న వ్యక్తిగా ఉన్నాడు. యాకోబు కుటుంబ ఆశీర్వాదం కోసం జన్మహక్కును విలువైనదిగా భావించాడు, దేవుడు వాగ్దానం చేసిన దాని కోసం కోరికను ప్రదర్శించాడు. ఈ విరుద్ధంగా, దేవుని ఎంపిక మరింత స్పష్టమవుతుంది. యాకోబు లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, దేవుని ఆశీర్వాదాన్ని అనుసరించాడు, ఏశావు దానిని తృణీకరించాడు.

ఆదికాండము 26:34_ ఏశావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లి చేసికొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగ జేసిరి. ఈ వచనము కూడా ఏశావు స్వభావాన్ని తెలియజేస్తుంది. ఏశావు తన తండ్రి ప్రత్యేక ప్రేమకు పాత్రుడై ఉన్నప్పటికి, ఏశావు అదే ప్రేమను తన తండ్రికి తిరిగి ఇవ్వలేక పోయాడు. తన తల్లిదండ్రులకు తెలియకుండా వారి ఇష్టానికి విరుద్ధంగా, అతడు హీత్తీయులైన ఇద్దరు యువతులను వివాహం చేసుకున్నాడు. ఈ చర్యతో అతడు దేవునిని అగౌరపర్చాడు. తన తాత తన తండ్రికి దేవుడు చేసిన వాగ్దానాల పట్ల లెక్కలేనితనాన్ని ప్రదర్శించాడు. వాగ్దాన దేశంలో భాగం కావడంలో అలాగే తన వారసులు వాగ్దానం చెయ్యబడిన ఆశీర్వాదాలను పంచుకోవడంలో ఏశావుకు పెద్దగా ఆసక్తి లేదు అనే విషయం ఈ చర్య ద్వారా స్పష్టముగా అర్ధమవుతుంది. ఏశావు ఎంచుకున్నహీత్తీయ భార్యలు అవిశ్వాసులు. వారు తమ పిల్లలకు యెహోవాను ప్రేమించడంలో మరియు ఆయన వాగ్దానాలకు కట్టుబడి ఉండే విషయములో శిక్షణ ఇవ్వలేరు. వారు దేవుని తీర్పు క్రిందకు వచ్చే కనాను తెగకు చెందిన వాళ్లు. ఏశావు తన స్వీయ చిత్తములో దైవిక మార్గం నుండి పూర్తిగా తొలగిపోయాడు.

ఇప్పుడు ఆదికాండము 27:4_ఇస్సాకు నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచి గల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని ఏశావుకు చెప్పెను అను మాటలను ఎలా అర్ధం చేసుకొందాం. యాకోబుకు దేవుడు దీవెనలను ఇచ్చాడని ఇస్సాకుకు ముందే తెలుసు. మరి ఇస్సాకు ఏశావును పిలిచి ఇలా ఎలా చెప్తాడు?

ఈ అధ్యాయం ఇస్సాకు కుటుంబం యొక్క ముఖచిత్రాన్ని చూపిస్తుంది. అది ప్రశంసించదగినదిగా లేదు. బలహీనపడిన ఇస్సాకు పరిస్థితి అతడిక ఎక్కువ కాలం జీవించడనే విషయాన్ని అతనికి గుర్తుచేసి ఉండొచ్చు. కాబట్టే తాను చనిపోయే ముందే, ఇస్సాకు జేష్ఠకుమారుని హక్కులను తన అభిమాన కుమారుడైన ఏశావుకు బదిలీ చేయాలనుకొని నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని ఏశావుకు చెప్పాడు. ఇస్సాకు ఈ చర్యను మెచ్చుకోలేం, అలాగని డిఫెండ్ కూడా చెయ్యలేం.

తాను ఏశావుకు ఆశీర్వాదం ఇచ్చినా, దేవుని అసలు ఉద్దేశ్యానికి ఎలాంటి విఘాతము కలుగదని ఇస్సాకు తనను తాను ఒప్పించుకొని ఉండొచ్చు. ఇంకా, ఏశావు తనకు అభిమాన కుమారుడు కాబట్టి, నిబంధనకు లింకుగా ఉండటానికి ఏశావు అనర్హుడై ఉన్నప్పటికి ఇస్సాకు ఏశావులోని లోపాలను పట్టించుకోలేదు. ఇద్దరు అన్యజాతి స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా ఏశావు ప్రభువు వాగ్దానం పట్ల పూర్తి ఉదాసీనతను చూపించాడని మనకు అర్ధమయ్యింది. దేవుని శాసనాన్ని మార్చాలనుకొనే ఇస్సాకు ఉద్దేశ్యం తప్పు.

ఏశావు ఆ పాపపు అపరాధంలో పాలుపంచుకున్నాడు. తన తండ్రి ప్రణాళికను అంగీకరించడమంటే, ఏశావు యాకోబుకు తన జేష్ఠత్వపు హక్కును విక్రయించిన సమయంలో చేసిన తన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే.

ఇస్సాకు ఏశావును దీవించదలచానని అతనితో చెప్పడం రిబ్కా విని ఆమె ఎంతో నిరాశకు లోనయ్యింది. పితరులు దీవెనలను ఉచ్చరించేటప్పుడు దేవుని ప్రతినిధులుగా మాట్లాడతారని రిబ్కాకు తెలుసు. కాని ఇక్కడ ఇస్సాకు తన ఇష్టానికి అనుగుణముగా తాను ఏశావును దీవించదలచానని చెప్పడం విన్న రిబ్కా ఎంతగానో భయపడింది. తాను ఇప్పుడు ఏదో ఒకటి తొందరపడి చెయ్యకపోతే, అది కూడా ఏశావు వేట నుండి తిరిగి రాకముందే తొందరపడి చెయ్యకపోతే, తన ప్రియకుమారుడైన యాకోబు శాశ్వతముగా ఆశీర్వాదాన్ని కోల్పోతాడని ఆమె భయపడింది తప్ప ఇలా చెయ్యటం ధర్మమా అధర్మమా అని ఆలోచించలేదు.

ఒక వైపు, తన భర్త దేవుని సంకల్పంకు ఎదురు వెళ్తున్నాడని రిబ్కాకు తెలుసు. ఈ విషయములో రిబ్కా తన భర్తను హెచ్చరించి ఉండొచ్చు. రిబ్కా దేవుని వాగ్దానం మీద ఆధారపడి, ఇస్సాకు ఆశీర్వాదం యాకోబుకు మాత్రమే దక్కాలని అనుకొంది. దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ఆమె తన వంతు తాను ఏదో ఒకటి చెయ్యాలని భావించింది. ఈ మేరకు ఆమె తాను ఏమి చేయగలదో అది చేసింది. తన వ్యూహం విజయవంతం అవుతుందని శాపం సంభవించే అవకాశమే లేదని ఆమె అనుకొని ఉండొచ్చు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే క్రమములో ఆమె చేసిన ప్రయత్నంలో ఆమె మోసానికి పాల్పడింది. ఆమె ప్రేరణ దేవునికి మహిమను తేవటం కాదు, తన అభిమాన కుమారుడి సంక్షేమం. తన భర్త తినే మేకమాంసాన్ని అతడు అడవి జంతువు మాంసముగా భావించేటట్లు అతనిని మోసగించడానికి ఆమె తన వంట సామర్ధ్యాన్ని ఉపయోగించడమే కాకుండా మందదృష్టి కలిగిన ఇస్సాకును మోసగించేటట్లు తన కుమారుడైన యాకోబును ఒప్పించింది.

అమ్మా, నాన్నకు ఈ విషయం తెలిసిపోతే నా మీదికి శాపమేగాని ఆశీర్వాదము తెచ్చుకొననని యాకోబు తల్లితో చెప్పడం సముచితం. కాని అతని తల్లి– వెంటనే నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక అని చెప్పి యాకోబును సంతృప్తిపరచింది. యాకోబు ఉద్దేశ్యపూర్వకముగానే తన తండ్రిని మోసం చేసాడు, ఏశావులా ప్రవర్తించాడు. ఒకవేళ ఇస్సాకు యాకోబు మోసాన్ని పసిగట్టి ఉంటే యాకోబు పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి.

ఇస్సాకు తికమకపడినా తన కుటుంబసభ్యులు తనను మోసగిస్తారని అనుకోలేదు. ఏశావు అనుకోని యాకోబును దీవించాడు: ఆదికాండము 27;27-29_ ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక. ఈ మాటలలో మెస్సియానిక్ ఆశీర్వాదం గురించి ఏమీ లేదు కాని ఇస్సాకు ఏశావు అని ఊహించుకొంటున్న కొడుకుపై ప్రకటించిన భౌతికమైన ఆశీర్వాదాలను గురించి తెలియజేస్తుంది. ఈ దీవెన ఓకే. జనములు నీకు దాసులగుదురు. జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము. నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించు వారు శపింపబడుదురు. నిన్ను దీవించు వారు దీవింపబడుదురు గాక. ఈ దీవెన ఇస్సాకు ఏశావుకు ఇవ్వకూడనిది. యాకోబుకు చెందినది. కాని ఇస్సాకు యాకోబు కోసం దేవుడు నియమించిన ఒక ఆశీర్వాదాన్ని ఏశావుకు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇస్సాకు తన అహంకారపూరితమైన స్వీయ-సంకల్పoలో యాకోబుకు ఇవ్వవలసిన దీవెనను ఏశావుకు ఇవ్వాలని అనుకొన్నను దేవుని చిత్తప్రకారముగా ఆ దీవెన యాకోబుకే దక్కింది. దేవుని చర్యను గమనించారా. రిబ్కా యాకోబుల మోసాన్ని బట్టి యాకోబుకు ఈ దీవెన లభించలేదు. ఇది రిబ్కా యాకోబుల మోసాన్ని క్షమించదు. పాపం పాపమే.

తరువాత ఏశావు ఇస్సాకు వద్దకు వచ్చి నా తండ్రి నన్ను దీవించుమని అడిగినప్పుడు, ఇస్సాకు నీవు ఎవరవని ఏశావును అడిగినప్పుడు అతడు–నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకెను. ఇస్సాకు ఎందుకని వణికాడు? ఇస్సాకు మోసపోయానని తెలుసుకొని నిశ్చేష్టుడై ఉండొచ్చు. అలాగే తాను దేవునికి వ్యతిరేకముగా యాకోబుకి ఇవ్వవలసిన దీవెనను ఏశావుకు ఇవ్వాలనుకొన్నను, అందులో దేవుడేలా జోక్యం చేసుకొని ఆ దీవెన చేరవలసిన వారికి చేరేటట్లు చెయ్యడం చూసి గడగడా వణికి ఉండొచ్చు. దేవుని జోక్యం అంటే దేవుడు తనను మందలించడం అని ఇస్సాకు గ్రహించాడు. దీవెన విషయములో దేవుడు జోక్యం చేసుకున్నాడని దేవుడు చేసిన దాన్ని మార్చడానికి తాను నిస్సహాయుడనని దానిని మార్చలేననే విషయాన్ని ఇస్సాకు గుర్తించాడు. కాబట్టే ఇస్సాకు నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమిచ్చాడు. ఇస్సాకు దేవుని ఆత్మ ద్వారా ఏశావుకు అతని వారసులకు ఏమి జరుగుతుందో దీవెనగా ప్రవచించాడు తప్ప ఏశావుకు ఆశీర్వాదం ఇవ్వలేకపోయాడు.

జరిగిన దానిలో ఏశావు దేవుని హస్తాన్ని చూడలేకపోయాడు. కోపము అతనిని గ్రుడ్డివానిని చేసింది. ఏశావు యాకోబు మీద పగబట్టాడు. యాకోబును చంపాలని నిర్ణయించుకున్నాడు.

ఏశావు హంతక పథకం గురించి రిబ్కా తెలుసుకొని, యాకోబును ఉత్తరాన ఐదు వందల మైళ్ల దూరంలో ఉన్న హారానులో ఉన్న తన సోదరుడి ఇంటికి పంపిస్తూ అక్కడ కొన్నాళ్లు ఉండుము, నేను నిన్ను మళ్ళీ పిలిపిస్తాను అని చెప్పి పంపింది.

రిబ్కా కుతంత్రాలు యాకోబు అబద్దాలు దేవునిని కొంచం కూడా మహిమపరచడం లేదు. దేవుని వాగ్ధానాలను ముందుకు తీసుకు వెళ్లే క్రమములో వాళ్ళు దేవునిపై నమ్మకాన్ని ఉంచారనే విషయాన్ని వాళ్ళ క్రియలు వెల్లడించడం లేదు. దేవుడు యాకోబుకు వాగ్దానం చేసిన దానిని యాకోబు తీసుకోవడం తప్పు కాదని అనేకులు వాదిస్తూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులలోనైనా దేవుని ఉద్దేశ్యాలు తప్పకుండా నెరవేరుతాయి అనే విషయాన్ని మరచిపోకూడదు. ఇస్సాకు కుటుంబంలోని నలుగురు సభ్యులు అధర్మముగా ప్రవర్తించారు. అందుకోసం ప్రతి ఒక్కరూ భయంకరమైన వెలను చెల్లించారు. రిబ్కా యాకోబులు ఈ ఎపిసోడ్లో చాల వెలను చెల్లించారు. కొన్నాళ్లు అని రిబ్కా అనుకొంది దేవుడు దానిని 20 సంవత్సరాల వరకు పొడిగించాడు. ఆమె అభిమాన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చే సమయానికి రిబ్కా చనిపోయింది. యాకోబు దీవింపబడినప్పటికి చేతికర్రతో మాత్రమే మిగిలాడు. 20 సంవత్సరాలు దేవుని శిక్షణ తరగతిలో చేరాల్సి వచ్చింది. తాను ఎంతగానో ప్రేమించిన ఏశావు దేవుని దృష్టిలో భ్రష్టుడుగా వ్యభిచారిగా ఉండటం ఇస్సాకును ఎంతో కలవరానికి గురి చేసి ఉండొచ్చు. దేవుని దీవెనలను పోగొట్టుకోవడం అనే అతని స్వీయ చిత్తాన్నిబట్టి ఏశావు ఎంతగానో కుమిలిపోయి ఉండొచ్చు. ఇస్సాకు తన ఇద్దరు కుమారులను దూరపరచుకొన్నాడు. ఆదికాండము 47:9లో_ యాకోబు ఫరోతో మాట్లాడుతూ_నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి అని చెప్పటం మనం వినొచ్చు.

దేవుడు ఏశావుకు బదులుగా యాకోబును ఎన్నుకోవడం మానవ యోగ్యత లేదా సాంస్కృతిక ప్రమాణాలలో కాకుండా ఆయన సార్వభౌమాధికారంలో పొందుపర్చబడి ఉంది. యాకోబు అపరిపూర్ణుడు మోసపూరితుడు అయినప్పటికీ, అతడు దేవుని ఆశీర్వాదం కోసం ఆశించాడు మరియు క్రీస్తు వైపుకు నడిపించే నిబంధన వంశంలో కీలక వ్యక్తి అయ్యాడు. మరోవైపు, ఏశావు ఆధ్యాత్మిక విషయాల పట్ల నిర్లక్ష్యం చూపించాడు. మానవులు తమ ఎంపికల పట్ల కలిగి ఉన్న స్వాభావిక స్వభావాన్ని హైలైట్ చేశాడు. ఈ కథ ద్వారా, దేవుని ఉద్దేశాలు తరచుగా ఆశ్చర్యకరమైనవి, కాని ఎల్లప్పుడూ న్యాయమైనవి, మరియు ఆయన తన కృప మరియు విమోచనను ఎవరి ద్వారా వెల్లడిస్తారో ఆయన సార్వభౌమాధికారంతో ఎంచుకుంటాడని లేఖనం బోధిస్తుంది.

దేవుని శాశ్వతమైన ముందస్తు జ్ఞానంలో నిత్యరక్షణకు కొందరు నిత్యత్వములో కృపలో ఏర్పరచబడ్డారని లేక రక్షణకు ముందుగానే నిర్ణయింపబడ్డారని చెప్పొచ్చు. అలాగే మఱొక ప్రక్క కొందరు ఉగ్రత కొరకు ఏర్పరచబడలేదని అంటే నరకానికి ముందుగానే నిర్ణయింపబడలేదని కూడా మనం చెప్పొచ్చు. దేవుడు నిత్యత్వములో ఏశావును ఖండించడానికి నరకానికి ఎంచుకున్నాడని ఏశావు యాకోబుల కధ చెప్తుందా? లేదు. దేవుడు “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతము గలవాడై యున్నాడు” అని 2 పేతురు 3:9 చెప్తుంది. “ఆయన, మనుష్యులందరు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు” అని 1 తిమోతి 2: 4 తెలియజేస్తుంది. లోకములోని ప్రతి ఒక్కరి పట్ల దేవునికున్న ప్రేమ సార్వత్రికమను సత్యాన్ని లేఖనాలు స్పష్టముగా బయలుపరుస్తున్నాయి. దేవుని ప్రేమ ఎలాంటి మినహాయింపులు లేకుండా మానవులందరిని చేర్చుకొంటూ ఉంది. క్రీస్తు సంపూర్ణముగా మానవులందరిని దేవునితో సమాధానపర్చాడు. మానవులందరు రక్షింపబడాలని దేవుడు మనస్ఫూర్తిగా ఆశపడ్తున్నాడు. ఏశావు రక్షించు విశ్వాసాన్ని కలిగి ఉంటే రక్షింపబడి ఉంటాడు. అందరి విషయములో అంతే. అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసిన యేసు క్రీస్తును నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

కృపలో ఏర్పరచబడటం మరియు కృపయొక్క సార్వత్రిక చిత్తము మధ్యనున్న తేడాను లేఖనాల ద్వారా పరిశీలించటానికి ఏశావు యాకోబుల కథను పరిశీలించటం ద్వారా మనం లేఖనాలను స్పష్టముగా అర్ధం చేసుకొని దేవుడు కృపలో ఏర్పరచుకొనుట అనే అంశాన్ని అర్ధం చేసుకొందాం.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl