అరిమతీయాకు చెందిన యేసేపు అంటే ఎవరు?
అరిమతీయాకు చెందిన యోసేపు యేసుక్రీస్తు సమాధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి. ఆసక్తికరంగా, యేసు తన పుట్టుకలో యోసేపు అనే వ్యక్తి సంరక్షణలో ఉన్నాడు; అలాగే తన మరణం తరువాత కూడా యోసేపు అనే మరొక వ్యక్తి చేత గౌరవంగా సమాధి చేయబడ్డాడు. ఈ ఇద్దరూ క్లిష్ట పరిస్థితుల్లో విశేషమైన ధైర్యాన్ని చూపించారు. మొదటి యోసేపు గర్భవతియైన మరియను తన ఇంటికి చేర్చుకోవడం ద్వారా దేవుని చిత్తానికి లోబడ్డాడు. రెండవ యోసేపు యేసు దేహాన్ని అడగడానికి పిలాతు వద్దకు ధైర్యంగా వెళ్లి తన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించాడు.
“అరిమతియా” అనే ఊరు ఖచ్చితంగా ఎక్కడ ఉందో తెలియదు. అది యూదయ ప్రాంతంలోని ఒక పట్టణం. కొందరి అభిప్రాయం ప్రకారం అది యెరూషలేముకు సమీపంలోని ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో ఉండి ఉండవచ్చు. బైబిలు ప్రకారం యోసేపు యెరూషలేములో నివసించే ప్రభావశీలుడైన వ్యక్తి.
బైబిలు యోసేపును ధనవంతుడు, సజ్జనుడు, నీతిమంతుడు, యేసు రహస్య శిష్యుడు, దేవుని రాజ్యాన్ని ఎదురుచూస్తున్నవాడు, అలాగే యూదుల మహాసభ (సన్హెడ్రిన్) సభ్యుడిగా పరిచయం చేస్తుంది. యేసును సిలువ వేయాలనే యూదా నాయకుల నిర్ణయాన్ని అతడు సమర్థించలేదు. యేసు మరణించిన తరువాత పిలాతు వద్దకు వెళ్లి ఆయన దేహాన్ని కోరాడు. తర్వాత యూదుల సంప్రదాయం ప్రకారం యేసు దేహాన్ని నారబట్టలతో చుట్టి, సుగంధ ద్రవ్యాలు పూసి, తనకొరకు సిద్ధం చేసుకున్న కొత్త సమాధిలో ఉంచాడు.
యోహాను 19:38 ప్రకారం యోసేపు యూదుల భయంతో రహస్యంగా యేసు శిష్యుడిగా ఉండేవాడు. అయితే యేసు మరణించిన తరువాత తన విశ్వాసాన్ని దాచకుండా బహిరంగంగా ప్రకటించే సమయం వచ్చింది. శిష్యులు భయంతో చెదరిపోయిన ఆ సమయంలో దేవుడు తన కుమారుని సమాధి బాధ్యతను యోసేపుకు అప్పగించాడు.
ద్వితీయోపదేశకాండము 21:22–23 ప్రకారం సిలువపై మరణించిన వ్యక్తిని అదే రోజున సమాధి చేయాలి. యోసేపు ముందుకు రాకపోయి ఉంటే, యేసు దేహాన్ని ఇతర నేరస్తుల మాదిరిగా అవమానకరంగా పారవేసే అవకాశం ఉండేది. కానీ యెషయా 53:9లో ముందే ప్రవచించబడినట్లు, మెస్సీయ “ధనవంతుని సమాధిలో” ఉంచబడాలి. ఆ ప్రవచనం నెరవేరడానికి దేవుడు యోసేపును ఉపయోగించాడు.
పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహాన్ని అడగడం చిన్న విషయం కాదు. రోమా అధికారుల అనుమతి లేకుండా సిలువపై ఉన్న శవాన్ని ఎవరూ తీసుకోలేరు. యేసుతో సంబంధం కలిగి ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించడం కూడా ప్రమాదకరం. అయినప్పటికీ యోసేపు భయపడలేదు. ప్రజల విమర్శలు, మత నాయకుల కోపం, తన గౌరవం, సంపద, పదవి అన్నింటికంటే క్రీస్తుపై ప్రేమను గొప్పదిగా భావించాడు.
పిలాతు వెంటనే యోసేపు అభ్యర్థనను అంగీకరించడం కూడా దేవుని సంకల్పంలో భాగమే. రోమీయుల ఆచారం ప్రకారం సిలువ వేయబడిన నేరస్తుల శవాలను గౌరవంగా సమాధి చేయడం సాధారణం కాదు. కానీ దేవుడు తన కుమారుని దేహం అవమానానికి గురికాకుండా కాపాడాడు.
యోసేపు తన కొత్త సమాధిలో యేసును ఉంచడం కూడా దేవుని ప్రణాళికలో భాగమే. ఆ సమాధిలో ఇంతకు ముందు ఎవరినీ ఉంచలేదు. అందువల్ల పునరుత్థానమైనది యేసు ఒక్కడేనని స్పష్టంగా తెలిసింది. ఇది యేసు రాజుగా పొందిన గౌరవాన్నీ, యెషయా ప్రవచనం నెరవేరినదనినీ తెలియజేస్తుంది.
తరువాత యూదా నాయకులు సమాధికి ముద్ర వేసి కాపలాదారులను నియమించారు. అయినప్పటికీ దేవుని శక్తిని ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. యేసు మూడవ రోజు మరణాన్ని జయించి లేచాడు.
కాలక్రమేణా యోసేపు గురించి అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. కొందరు అతడు మరియకు బంధువని, మరికొందరు బ్రిటన్కు సువార్త తీసుకెళ్లాడని చెబుతారు. అయితే ఈ విషయాలకు బైబిలులో ఎలాంటి ఆధారం లేదు. యేసు సమాధి తరువాత యోసేపు గురించి బైబిలు మౌనంగా ఉంది.
అరిమతయియ యేసేపు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు: అరిమతీయా యోసేపు ప్రజల భయానికి లొంగలేదు. తన విశ్వాసాన్ని ధైర్యంగా ఒప్పుకున్నాడు. తన గౌరవం, పదవి, సంపద అన్నింటినీ పణంగా పెట్టి క్రీస్తు పక్షాన నిలబడ్డాడు. అతని ధైర్యానికి మూలం క్రీస్తుపై ఉన్న ప్రేమ.
ఈరోజు కూడా మనం క్రీస్తును ఒప్పుకోవడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, ప్రజల అభిప్రాయాలకు భయపడకుండా విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. మన మాటల్లో, ప్రవర్తనలో, నిర్ణయాల్లో క్రీస్తుపట్ల మన ప్రేమ కనిపించాలి. అప్పుడు మన జీవితాలు దేవుని కృపకు మహిమను తీసుకువస్తాయి.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl
