యేసు ఆ సంగతి విని అంటే ఏ సంగతి అని మీరు అనుకుంటున్నారు? యేసు బేత్సయిదా అను ఊరికి వెళ్లడంలో ఆయన ప్రాధమిక ఉద్దేశ్యము ఏంటి? ప్రజలు యేసుని ఎందుకని వెంబడించారు? వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున ఆయన వారి మీద కనికరపడటం అంటే ఏంటి? ఫిలిప్పు ద్వారా, శిష్యుల ద్వారా ఆయన మనకు నేర్పిస్తున్న పాఠమేంటి? ఈ అద్భుతము కధా లేక వాస్తవ సంఘటనా?

అయిదు రొట్టెలు రెండు చిన్న చేపలు

మత్తయి 14: 13-21; మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6: 5-13

మత్తయి 14:13-21_ యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, ఆ సంగతి విని సకల పట్టణముల నుండి జనసమూహములు, కాలి నడకను పరుగెత్తి వారి కంటె ముందుగా వచ్చిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, ఆయన వారిని చేర్చుకొని వారు కాపరిలేని గొఱ్ఱెల వలె ఉన్నందున వారిమీద కనికరపడి, యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండి దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు, అనేక సంగతులను భోదించడమే కాకుండా వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను

యేసు కన్నులెత్తి జనులను చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని ఆయన యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు–వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.  సాయంకాలమైనప్పుడు శిష్యులాయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దు గుంకుచున్నది, ఈ జనులు గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు–వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా  మేము వెళ్లి యీన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి

అందుకాయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ –ఇక్కడ ఉన్న యొక చిన్న వాని యొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలును తప్ప మరేమియు లేదని యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పిరి.

అందుకాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండ బెట్టుడని తన శిష్యులతో చెప్పగా, ఆ చోట చాల పచ్చికయుండెను గనుక వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీర్చి అందరిని కూర్చుండబెట్టిరి. లెక్కకు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు కూర్చుండిరి. అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి యేసు కూడా ఆ రొట్టెలు పట్టుకొని కూర్చున్న వారికి వడ్డించెను. ఆలాగున చేపలు కూడ వారి కిష్టమైనంత మట్టుకు వడ్డించెను.  

వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవలరొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి. స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచు మించు అయిదు వేలమంది పురుషులు.

ఆ మనుష్యులు యేసు చేసిన సూచకక్రియను చూచి–నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొన బోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లిపోయెను.

  1. యేసు ఆ సంగతి విని, అంటే ఏ సంగతి విని?
  2. దోనె యెక్కి, అక్కడ నుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా ఎందుకని వెళ్ళాడు?
  3. వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకొని సకల పట్టణముల నుండి జనసమూహములు, కాలినడకను పరుగెత్తి వారికంటె ముందుగా ఆయన వెళ్లిన చోటుకు చేరుకోవాల్సిన అవసమేముంది?
  4. వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, అను మాటలకు అర్ధమేమి?
  5. దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు, అనేక సంగతులను భోదించడమే కాకుండా వారిలో రోగులైన వారిని ఆయన ఎందుకని స్వస్థపర్చాడు?
  6. వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పునే యేసు ఎందుకని అడిగాడు?
  7. అందుకు ఫిలిప్పు ఇచ్చిన జవాబు ఏంటి?
  8. మీరే వారికి భోజనము పెట్టుడని ఆయన శిష్యులతో ఎందుకని చెప్పాడు? 
  9. మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని ఆయన వారితో ఎందుకని చెప్పాడు?
  10. పచ్చికమీద అందరిని పంక్తులు పంక్తులుగా కూర్చుండ బెట్టుడని ఆయన ఎందుకని చెప్పాడు?
  11. ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను?
  12.  వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పటంలో ఆయన ఉద్దేశ్యము ఏంటి?

ఈ వాక్యభాగం, యేసు కేవలం ఐదు రొట్టెలు మరియు రెండు చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టిన అద్భుతాన్ని వివరిస్తుంది. నాలుగు సువార్తలలోనూ (మత్తయి 14:13–21; మార్కు 6:30–44; లూకా 9:10–17; యోహాను 6:5–13) నమోదు చేయబడిన ఏకైక అద్భుతం ఇదే.

మత్తయి సువార్త, “యేసు ఈ సంగతి విని” అని చెప్పడంతో మొదలవుతుంది—ఇది బాప్తిస్మమిచ్చు యోహాను మరణాన్ని సూచిస్తుంది. ఇది కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది: యోహానును చంపిన హేరోదుకు భయపడి యేసు వెళ్ళిపోయారా? ఆయన ప్రమాదాన్ని, సంఘర్షణను, లేదా రాజకీయ ఉద్రిక్తతను తప్పించుకోవడానికి ప్రయత్నించారా? లేక యోహాను మరణానికి ఏకాంతంగా దుఃఖించడానికి వెళ్ళిపోయారా? యేసు భయం వలన అలా చేశారని లేఖనం చెప్పడం లేదు. బదులుగా, ఆయన విశ్రాంతి, ప్రార్థన కోసం ఏకాంత ప్రదేశానికి వెళ్లిపోయాడని చెప్తుంది.

మన పాఠములో, యేసు చేస్తున్న అద్భుతాల గురించి హేరోదు విన్నప్పుడు, అతడు భయపడ్డాడు. తాను చంపించిన బాప్తిస్మమిచ్చు యోహాను తప్ప మరెవరూ అలాంటి అద్భుతాలు చేయలేరని బాప్తిస్మమిచ్చు యోహానే యేసుగా మళ్ళీ మృతులలో నుండి లేచియున్నాడని అనుకొన్నాడు, మార్కు 6:14-15, లూకా 9:7, లూకా 9:9, మార్కు 6:16, లూకా 9:9.

నిజానికి, బాప్తిస్మమిచ్చు యోహాను హేరోదును అతని వ్యభిచారం కారణంగా గద్దించాడు. దేవుని ధర్మశాస్త్రం అటువంటి సంబంధాలను స్పష్టంగా నిషేధిస్తుంది (లేవీయకాండము 18:16). ఒక ప్రవక్తగా, యోహాను దేవుని సత్యాన్ని పలికాడు, దేవుని ప్రజలను పరిపాలిస్తూ పాపంలో కొనసాగుతున్నందుకు అతడు హేరోదును ధైర్యంగా ఎదుర్కొన్నాడు (మత్తయి 14:3–4). హేరోదు యోహానుకు భయపడ్డాడు. ఈ భయం అతని అపరాధ మనస్సాక్షి నుండి వచ్చి ఉండొచ్చు. పాపంతో బాధపడే మనస్సాక్షి సంపద లేదా అధికారంతో శాంతించదు- అది నిందిస్తూనే ఉంటుంది. హేరోదు యోహానును ఖైదు చేసి ఉరితీశాడని చరిత్రకారుడు జోసీఫస్ నమోదు చేశాడు. చాలామంది యోహానును అనుసరించడానికి సిద్ధంగా ఉన్నందున, ప్రజలపై యోహాను ప్రభావానికి హేరోదు భయపడ్డాడని అతడు సూచించాడు. దీని కారణంగా, హేరోదు యోహానును బెదిరింపుగా భావించాడు మరియు అతనిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భములో మత్తయి బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క విషాద మరణం అసలు ఎలా జరిగిందో, మత్తయి 14:1-12; మార్కు 6:14-29 కోట్ చేసాడు.

ఆ సంగతి విని – హేరోదు తన వల్ల కలవరపడుతున్నాడని యేసు విని – ఆయన ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయాడు. హేరోదు యేసును మృతులలో నుండి లేచిన బాప్తిస్మమిచ్చు యోహానని భావించాడు, కాబట్టి అతడు అతనిని చంపడానికి ప్రయత్నించే నిజమైన ప్రమాదం ఉంది. హేరోదు నుండి తనను తాను రక్షించుకునే దైవిక శక్తి యేసుకు ఉన్నప్పటికీ, ఆయన ఘడియ యింకను రాలేదు కాబట్టి యేసు అనవసరంగా తనను తాను ప్రమాదానికి అప్పగించు కోదలచుకోలేదు. అనవసరంగా ఆయన తనను తాను ఎప్పుడూ ప్రమాదంలోకి నెట్టుకోలేదు. బదులుగా, యేసు హేరోదు ప్రాంతాన్ని విడిచిపెట్టి, హేరోదు ఫిలిప్ పరిపాలించే ప్రాంతంలోని గలిలయ సముద్రానికి తూర్పు వైపున ఉన్న భూభాగంలోకి వెళ్ళిపోయాడు. మత్తయిని బట్టి బాప్తిస్మమిచ్చు యోహాను మరణించిన కొద్దికాలానికే ఇది జరిగింది.

తమ మొదటి పరిచర్య తరువాత, అపొస్తలులు యేసు యొద్దకు తిరిగి వచ్చి, తాము చేసినదంతయు ఆయనకు నివేదించారు (మార్కు 6:30; లూకా 9:10). వారు తిరిగి వచ్చి తనకు నివేదించడానికి యేసు ఒక సమయాన్ని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ సందర్భములోనే, ఎందరో జనం వస్తూ పోతూ ఉండటంతో శిష్యులకు భోజనం చేయడానికి కూడా సమయం దొరకలేదు. అందుకే యేసు వాళ్ళతో, “నాతో మీరు మాత్రమే ఏకాంత ప్రదేశానికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు, మార్కు 6:31. వారికి విశ్రాంతి, సేదతీర్పు అవసరం కాబట్టి, యేసు వారిని గలిలయ సముద్రానికి తూర్పున ఉన్న బేత్సయిదా అనే ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు. వారితో సమయం గడపడం, వారి పని గురించి మాట్లాడటం, వారికి విశ్రాంతి ఇవ్వడం ఆయన ఉద్దేశం. బాప్తిస్మమిచ్చె యోహాను అప్పుడే చంపబడియున్నందున, అది వారికి ఒక కష్టకాలం కూడా. యేసు తన శిష్యులకు విశ్రాంతినిచ్చి, వారు నిరుత్సాహపడకుండా వారిని బలపరిచి వారి పట్ల శ్రద్ధ వహిస్తూ ఆయన వారిని వెంట బెట్టుకొని తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి బేత్సయిదా అను ఊరికి వెళ్ళాడు.

అనేక కారణాల వల్ల యేసు ఆ స్థలాన్ని విడిచిపెట్టాడు. కష్ట సమయాల్లో ఆయన ఉదాహరణ నుండి మనం ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవచ్చు. బాప్తిస్మమిచ్చు యోహాను ఆయన బంధువు మరియు స్నేహితుడు, కాబట్టి అతడి మరణం ఖచ్చితంగా యేసుకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. అయినప్పటికీ, యేసు తన పనిని ఆపడానికి బదులుగా తన పరిచర్యను కొనసాగించాడు. ఆయన దుఃఖం ఆయన్ని మరింత ఎక్కువ కరుణ చూపించేలా చేసింది. ఇతరులకు సేవ చేయడంలో, ఆయన ప్రయోజనాన్ని మరియు బలాన్ని కనుగొన్నాడు.

యోహాను మరణం ప్రజలలో అశాంతిని కూడా రేకెత్తించి ఉండొచ్చు. యేసు మరియు ఆయన శిష్యులు వెళ్లిపోతుండగా, జనసమూహం ఆయనను గమనించి, గుర్తించింది. వార్తలు త్వరగా వ్యాపించాయి. వివిధ పట్టణాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పరిగెత్తారు- అనేక మంది గలిలయ సముద్రం చుట్టూ చాలా దూరం ప్రయాణించి ఆయన కంటే ముందే బేత్సయిదా చేరుకున్నారు (లూకా 9:10). వారు తమతో పాటు చాలా మంది రోగులను కూడా తీసుకువచ్చారు, యేసు వారిని నయం చేస్తాడని ఆశించారు.

బేత్సయిదా అంటే “చేపలు పట్టే ఇల్లు” అని అర్ధం. అది గలిలయ సముద్రపు ఈశాన్య తీరంలో ఉండేది. ఫిలిప్పు, పేతురు, అంద్రెయ వంటి కొంతమంది అపొస్తలులు ఈ పట్టణానికి చెందినవారే (యోహాను 1:44). దీని తరువాతి కాలములో యేసు ఈ స్థలం గురించి హెచ్చరిస్తూ, అక్కడ అనేక అద్భుతాలు జరిగినప్పటికీ, ప్రజలు పశ్చాత్తాపపడలేదని, తూరు, సీదోను వంటి నగరాలు కూడా అలాంటి కార్యాలను చూసి ఉంటే పశ్చాత్తాపపడి ఉండేవని అన్నారు (లూకా 10:13–14). అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు. అయినను విమర్శకాలము నందు మీ గతికంటె తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై యుండును.

చాలా పెద్ద గుంపు యేసును వెంబడించారు—సుమారు ఐదు వేల మంది పురుషులు, స్త్రీలు మరియు పిల్లలను లెక్కించలేదు. ఇంతమంది ఆయనను వెంబడించడానికి కారణాన్ని యోహాను తెలియజేస్తూ, రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించారని, యోహాను 6:2 ప్రజలు రక్షణ సువార్త కోసం ఆయనను వెంబడించ లేదని చెప్పాడు.

జనసమూహం నుండి తప్పించుకోవడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి యేసు తన శిష్యులతో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. కాని ఆయనకు విశ్రాంతి దొరకలేదు. ప్రజలు వారిని వెంబడించి, అనేకమంది రోగులను ఆయన వద్దకు తీసుకువచ్చారు. వారిని చూచి యేసు నిరాశ చెందలేదు లేదా చికాకుపడలేదు బదులుగా, యేసు వారిని స్వాగతించాడు. దేవుని రాజ్యం గురించి వారికి బోధించాడు మరియు అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరిచాడు (లూకా 9:11). సహాయం కోరుతూ వచ్చిన వారిని తిరస్కరించకూడదని దీని ద్వారా శిష్యులు తెలుసుకున్నారు.

వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన వారిని తృణీకరింపక, మార్క్ 6:34 ప్రకారం, యేసు జనసమూహంపై కనికరం చూపాడు, ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల్లా ఉన్నారు.

ఒక కాపరి తన మందను జాగ్రత్తగా చూసుకుంటాడు. అతడు వాటికి ఆహారం పెడతాడు, ప్రమాదాల నుండి వాటిని కాపాడతాడు, మరియు ఆహారం, నీరు ఉన్న సురక్షితమైన ప్రదేశాలకు వాటిని నడిపిస్తాడు (కీర్తన 23). బలహీనుల పట్ల, నిస్సహాయుల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతాడు. కాపరి లేకపోతే, గొర్రెలు దారితప్పుతాయి, తప్పిపోతాయి (మందకు దూరమవుతాయి), బలహీనపడతాయి (మందను చేరుకోవడానికి మార్గాన్ని కనుగొనలేక నిస్సహాయ జీవులుగా గాయపడి రోగగ్రస్తమవ్వటమే కాకుండా పోషకాహార లోపంతో బలహీనపడి మరణించే ప్రమాదములో ఉంటాయి), మరియు సులభంగా గాయపడతాయి లేదా చంపబడతాయి (భద్రత లేని కారణంగా అవి క్రూర మృగాల బారిన పడి గాయపడొచ్చు లేదా వాటికి వేటగా మారొచ్చు కూడా).

కాబట్టి ప్రజలు “కాపరిలేని గొఱ్ఱెలవలె” ఉన్నారని యేసు చెప్పినప్పుడు ఆ మాటలు అసాధారణమైనవిగా ఉన్నాయి. ఇశ్రాయేలుకు అప్పటికే మతపరమైన నాయకులు ఉన్నారు—శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు మరియు ఇతరులు. అయితే ఈ నాయకులు తమ విధి నిర్వహణలో విఫలమవుతున్నారు. వారు నిజంగా ప్రజలపట్ల శ్రద్ధ వహించడం లేదు లేదా వారికి నమ్మకంగా బోధించడం లేదని ఈ మాటలు తెలియజేస్తున్నాయి.

దేవుని సత్యంలో వారిని నడిపించడానికి బదులుగా, వాళ్ళు వారిని తప్పుదారి పట్టించారు మరియు తరచుగా స్వార్థపూరిత ఉద్దేశాలతో ప్రవర్తించారు. తత్ఫలితంగా, ప్రజలు ఆధ్యాత్మికంగా కోల్పోయారు, బలహీనులుగా మారి ప్రమాదంలో ఉన్నారు. అందుకే యేసు వారిపై కనికరం చూపాడు. వారు శారీరకంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఆకలితో ఉన్నారు. అందుకే ఆయన సువార్తను వారికి బోధించాడు- ముఖ్యంగా నిర్లక్ష్యం చేయబడిన వారికి దేవుని సత్యాన్ని మరియు రక్షణను అందించాడు. కాబట్టే బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది వెళ్లి బాప్తిస్మమిచ్చు యోహానుతో చెప్పుడి అని యోహాను శిష్యులతో యేసు చెప్పటం మనం లూకా 7:22లో చూడొచ్చు.

వారి ప్రార్థనా స్థలాల్లో, ప్రజలు నిజమైన ఆధ్యాత్మిక పోషణను పొందడం లేదు. వాగ్దానం చేయబడిన మెస్సీయ వైపు వారు మళ్ళించబడలేదు. వారిని దేవుని వాక్యానికి నడిపించే బదులు, వారి నాయకులు మానవ బోధలతో వారిని తప్పుదారి పట్టిస్తున్నారు.అందుకే యేసు వారిపై కనికరం చూపాడు. వారు తప్పిపోయారు, నిస్సహాయంగా దేవుని మందకు తిరిగి వెళ్ళే మార్గాన్ని కనుగొనలేని దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. మంచి కాపరి అయిన యేసు వారిని చూసుకోవడానికి వచ్చాడు. వారి అవసరాన్ని చూసి, ఆయన తన విశ్రాంతిని పక్కన పెట్టాడు. దేవుని రాజ్యం గురించి వారికి బోధించాడు, మెస్సీయ ఎవరో వారికి చూపించాడు మరియు అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరిచాడు. ఈ విధంగా, ఆయన తప్పిపోయిన గొర్రెలను తిరిగి మంద వద్దకు నడిపించాడు మరియు వారికి నిజంగా అవసరమైన వాటిని ఇచ్చాడు.

పరిచర్యలో భాగముగా సమయం వేగముగా అయిపోతూ ప్రొద్దు గుంకడం మొదలయ్యింది. యేసు కన్నులెత్తి జనులను చూచి ఫిలిప్పుతో, “వీరంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాం?” అని అడిగాడు. యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు. దానికి ఫిలిప్పు, “రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు” అన్నాడు, యోహాను 6:4-7

రెండు వందల దేనారముల విలువైన రొట్టె కూడా అందరికీ సరిపోదని ఫిలిప్పు చెప్పాడు. అతను కేవలం వాస్తవాన్ని చెబుతున్నాడు—అంత పెద్ద జనసమూహానికి సరిపడా ఆహారాన్ని కొనడం లేదా సంపాదించడం వారికి ఏ విధంగానూ సాధ్యం కాదు.

తాను ఏమి చేయబోతున్నాడో యేసుకు ముందే తెలిసినప్పటికీ, ఆయన ఫిలిప్పును ఈ ప్రశ్న అడిగాడు. ఆయన ఫిలిప్పును పరీక్షిస్తున్నాడు—అతన్ని విఫలం చేయడానికి కాదు, కానీ తనపై అతని విశ్వాసాన్ని, నమ్మకాన్ని బలపరచడానికి. యేసు నందు అతనికున్న నమ్మకానికి, విశ్వాసానికి ఇది పరీక్ష.

అయితే, ఫిలిప్పు ఆ పరిస్థితిని మానవ దృష్టితో చూశాడు. అతడు డబ్బు మరియు ఆచరణాత్మక పరిమితులపై దృష్టి పెట్టాడు. అతని సమాధానం, అతను కేవలం మనుషులు ఏమి చేయగలరనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడని చూపిస్తుంది. దీని ద్వారా, యేసు అతనికి ఒక ముఖ్యమైన విషయాన్ని బోధిస్తున్నాడు: దేవుని శక్తి మానవ పరిమితుల కంటే చాలా గొప్పది. మనకు అసాధ్యంగా అనిపించేది దేవునికి సాధ్యమే.

యేసు అంతకుముందు అపొస్తలులను పంపినప్పుడు, వారి అవసరాలు తీర్చబడతాయని వాగ్దానం చేశాడు (లూకా 9:2–6). ఇప్పుడు వారు ఆ పాఠాన్ని నేర్చుకున్నారో లేదో చూడటానికి ఆయన ఈ ప్రశ్న అడిగాడు. ఫిలిప్పు ఇదివరకే ఈ అనుభవాన్ని పొందాడు, కానీ అతడు దానిని మరచిపోయినట్లు కనిపిస్తుంది. యేసును నమ్మడానికి బదులుగా, అతడు సమస్యపై దృష్టి పెట్టాడు. అతడు యేసు వైపు చూసి, “ప్రభువా, మేము ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారు?” అని అడిగుండొచ్చు. దేవునికి ఏదీ అసాధ్యం కాదనే విషయాన్ని అతడు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదని ఇది చూపిస్తుంది. ఈ పరీక్షలో ఫిలిప్పు ఫెయిల్ అయ్యాడు.

ఈ సంభాషణను ఫిలిప్పు ఇతర శిష్యులతో కూడా చెప్పాడు, వాళ్ళు ఆశ్చర్యపడి ఒకరితో ఒకరు ఈ ప్రశ్నను గురించి చర్చించుకొని ఉండొచ్చు. బోధకుడు ఇలా అన్నాడా? ఆయన ఉద్దేశ్యం అర్ధమవుతున్నట్లుగానే ఉంది కాని ఇది ఎలా సాధ్యం? ఇంత గొప్ప సమూహానికి భోజనమా? వాళ్ళు ఎన్నో మార్గాలను గురించి ఆలోచించి ఉండొచ్చు. ఒకవేళ బోధకుడు మనల్నే వెళ్లి ఇంత మందికి భోజనము కొనమంటే మనం ఎక్కడ కొందాం? ఇంత మందికి సరిపోయే భోజనం ఒక్క దగ్గరే దొరకదు. ఎలా కోఆర్డినేట్ చేధ్ధాం. ఈ నిర్జన్య ప్రాంతములో ఇంత మందికి భోజనము సిద్ధపర్చడం అందుకు కావలసిన వాటిని సమకూర్చడం సాధ్యం అయ్యే పని కాదు, ఏమి చేధ్ధాం? భోజనము కొనడానికి డబ్బు వారి దగ్గర ఉందొ లేదో మనకు తెలియదు. దానిని ఎలా సమకూర్చు కొంటారో చెప్పబడలేదు, శిష్యులు ఎంతో తర్జనభర్జన పడి ఉండొచ్చు. శిష్యులును, యేసు పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. వారు యేసును ఇతరులకు అందించువారిగా ఉండటానికి పిలువబడి ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి “అధిగమించలేని” అడ్డంకుల పై దృష్టి పెట్టారు. యేసును ఇతరులకు అందించే అవకాశాలు ఎన్నో ఉన్నా మనం కూడా శిష్యుల వలె అడ్డంకులను గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాం. క్రీస్తు వైపు చూడటానికి బదులుగా, వారు అడ్డంకుల వైపే చూశారు. మనం కూడా తరచుగా అలాగే చేస్తాం—మనం సమస్యలనే చూస్తాం తప్ప, మన ఊహకు అందని రీతిలో సమకూర్చగల సామర్థ్యం, ​​కార్యాలు జరిగించగల శక్తి యేసు సొంతమని మర్చిపోతాం.

ఈ పరీక్ష యేసు చేయబోయే అద్భుతం కోసం శిష్యులను సిద్ధం చేయడానికి కూడా ఉద్దేశించబడింది. సాయంత్రమైపోతూ ఉంది, వాళ్లకి ఒకటే సొల్యూషన్ కనిపించింది. ఏమయితే అయ్యింది మనం యేసు దగ్గరకు వెళ్లి మాట్లాడదాం అనుకొని పండ్రెండుగురు శిష్యులు యేసుని సమీపించి, –మనం అరణ్య ప్రాంతంలో ఉన్నాం. వీరంతా చుట్టుపక్కల గ్రామాలకూ, పల్లెలకూ వెళ్ళి రాత్రి బస చూసుకుని, ఆహారం సంపాదించుకోడానికి జనసమూహమును పంపేయండి అని ఆయనతో చెప్పారు, లూకా 9:12. అప్పుడు యేసు– వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టండి అన్నాడు, ఇది వారిని షాక్‌కి గురి చేసిందనుకోవాలి.

వారు యేసుతో ఉన్నప్పటికీ మరియు ఆయన శక్తిని చూసినప్పటికీ, వారు మానవ పరిష్కారాలపై దృష్టి పెట్టారు. వారు ఆయనను విశ్వసించడానికి బదులుగా, వారు ఆయనతో, “రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని, వారికి పంచిపెట్టమంటారా” అని ఆయనను అడగటం ఆశ్చర్యం. వారి దగ్గర ప్రజలందరికి ఆహారము కొనేందుకు తగినంత డబ్బు లేదు అట్లే తగినంత ఆహారం కూడా వారికి అందుబాటులో లేదు. పరిస్థితి అసాధ్యంగా కనిపిస్తూ ఉంది.

అందుకాయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడండని వారితో చెప్పాడు. ఆ సందర్భములో వనరులుగా, దేవుడు వారికి ఏమి అందించాడో తెలుసుకొమ్మని ఆయన తన శిష్యులను ప్రజల మధ్యకు పంపించాడు. కాబట్టి, అందుబాటులో ఉన్న ఆహారం ఏమిటో తెలుసుకోవడానికి వారు జనసమూహంలోకి వెళ్లారు. జనసమూహంలోని పురుషులు 5000 మంది, స్త్రీలు పిల్లలు లెక్కవెయ్యలేదు. అందరిని కలిపితే ఇంచుమించు 15000 మంది ఉండొచ్చని అంచనా. 14999 మంది దగ్గర తినడానికి ఏమీ లేదు. ఈ ఎంక్వయిరీలో శిష్యులు ప్రజల దృష్టిని ఆకర్షించారు. శిష్యులు వెతుకుతుండగా, జనసమూహంలో కుతూహలం కలిగింది. యేసు రొట్టె ఎందుకు అడుగుతున్నాడు? ఆయన దానితో ఏదైనా చేయబోతున్నాడా? ఇప్పుడు యేసు ఏమి చేయబోతున్నాడని ప్రజలు శిష్యులను అడిగి ఉండొచ్చు. అందుకు శిష్యులు యేసుకు వారికి మధ్య జరిగిన సంభాషణను వారితో పంచుకుని ఉండొచ్చు. ఏంటి? ఏం జరుగుతుంది? ఏదో జరగబోతూ ఉంది ఏంటది? నిజంగా ఏమి జరగబోతోందో ఎవరికీ తెలియదు. ఏదో ముఖ్యమైనది జరగబోతోందనే భావన వారికి కలిగుండొచ్చు, కానీ అది ఏమిటో శిష్యులకు, ప్రజలకు కూడా ఖచ్చితంగా తెలియలేదు.

వారు చూచి తెలిసికొని ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ –ఇక్కడ ఉన్న యొక చిన్నవాని యొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలును తప్ప మరేమియు లేదని యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పాడు.

ఆ రోజుల్లో బార్లీ రొట్టె మరియు ఎండు చేపలు పేదలు తినే సాధారణ ఆహారం. బాలుడి నైవేద్యం-ఐదు రొట్టెలు మరియు రెండు చేపలు-చాలా చిన్నవి, ఒకరిద్దరు వ్యక్తులకు సరిపోతాయి మరియు ఇంత పెద్ద జనసమూహానికి ఆహారం ఇవ్వడానికి సరిపోవు.

అద్భుతానికై దేవుడు వారికి అందించినవి యింత మందికి ఇవి ఏమాత్రమని (శిష్యులు) ఆయనతో చెప్పగా అందుకాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద అందరిని పంక్తులు పంక్తులుగా కూర్చుండ బెట్టుడని తన శిష్యులతో చెప్పాడు. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసి మంది చొప్పునను పంక్తులు తీర్చి అందరిని కూర్చుండబెట్టారు. వారు 5,000 మంది పురుషులను లెక్కించారు (స్త్రీలు మరియు పిల్లలు ఎక్స్ట్రా), మత్తయి 14:21. అందరిని కలుపుకొంటే ఇంచుమించు 15,000 మంది భోజనము చేయడానికి పంక్తులలో కూర్చున్నారు. భోజనము కొరకు త్రొక్కిసలాట జరగకూడదని, ఏ ఒక్కరు ఈ సందర్భములో గాయపడకూడదని, బహుశా పంపిణీని మరింత క్రమబద్ధంగా చేయడానికి మరియు ఎవరూ తప్పిపోకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కరికి సమృద్ధిగా వాళ్ళు తిన్నంత భోజనాన్ని వాళ్లకు అందించడానికిగాను వారు క్రమములో అందరిని కూర్చుండబెట్టారు. ఇంత పెద్ద జనసమూహం విధేయత చూపడం ఆశ్చర్యకరమైన విషయం. అందరి కళ్ళు యేసు మీదే ఉన్నాయి, ఆయన ఏమి చేయబోతున్నాడోనని ఆశ్చర్యపోతూ వారందరు ఆయననే చూస్తూ ఉండొచ్చు.

ద్రాక్షారసం కొరత ఉన్నప్పుడు కానాలో జరిగిన పెళ్లిలో చేసినట్లే యేసు ఇప్పుడు సమస్యను తన చేతులలోనికి తీసుకొన్నాడు. అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చాడు, శిష్యులు జనులకు వడ్డించారు. యేసు కూడా ఆ రొట్టెలు పట్టుకొని కూర్చున్న వారికి వడ్డించాడు. ఆలాగున చేపలు కూడ వారి కిష్టమైనంత మట్టుకు వడ్డించాడు, యోహాను 6:11,12

యేసు పరలోకం వైపు చూసి, తండ్రిపై తన నమ్మకాన్ని కనబరుస్తూ, అక్కడ కూడుకొనియున్న ప్రజల కొరకై తండ్రి ఏర్పాటు చేసిన ఆహారానికై ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇది తండ్రితో ఆయనకున్న సంబంధాన్ని, తండ్రి మద్దతును తెలియజేస్తుంది. బహుమానాన్ని బట్టి తండ్రికి ధన్యవాదాలు తెలియజేసి, ఆశీర్వదించి_ అందరికి సరిపోయేలా ఆయన వాటిని దీవించాడు.

సమూహానికి గొప్ప ధైర్యం అవసరం. ఇదేమి మేజిక్ కాదు. ప్రజలు తినడానికి మొదట భయపడి ఉండొచ్చు. వారు వాటిని పట్టుకొన్నారు, వాసన చూసారు, రుచి చూసారు, తిన్నారు. అందరికి ఆహారాన్ని అందిస్తున్న శిష్యులకు కూడా విశ్వాసం మరియు ధైర్యం అవసరం.

ప్రజలకు వడ్డించే పని శిష్యులది. గంపలో తరగని రొట్టెలు/ తరగని చేపలు, ప్రతి ఒక్కరూ తమ కడుపునిండా తినే వరకు సరఫరా ఆగిపోలేదు. వారు ఇతరులకు ఆహరం పంచిపెడుతూ ఉంటే ఆహరం ఇంకా ఎక్కువైన సంగతి గమనించండి. ప్రభువు ఆహారాన్ని ఇచ్చినపుడు శిష్యులు ప్రజలకు సులభముగా పంచిపెట్టగలిగారు, పంచిపెట్టారు. ఆ ఏర్పాటు ప్రభువు నుండి వచ్చిందని ఇది స్పష్టంగా చూపించింది.

అదే విధంగా, మనకు ఉన్నదంతా- దేహానికి మరియు ఆత్మకు- దేవుని నుండి వచ్చినదని గుర్తుంచుకోవాలి మరియు మనం ఆహారాన్ని తిన్నప్పుడల్లా ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి.

కొందరు ఆ ఆహారాన్ని తమ ఇండ్లకు తీసుకొని వెళ్లి ఉండొచ్చు. పరిసయ్యులు సద్దూకయ్యులు శాస్త్రులు మొదలైన వారు కూడా వీటిని చూసి ఉండొచ్చు, తాకి ఉండొచ్చు, రుచి చూసి ఉండొచ్చు. అవి రెండు మూడు రోజులైనను సాధారణ రొట్టెల వలె ఉన్నాయి తప్ప మాయమై పోలేదు. ఇవి దేవుని ఏర్పాటు యొక్క నిజమైన అద్భుతం.

ఈ అద్భుతం క్రీస్తు ఎవరో మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఆయన కేవలం ఒక మానవుడు కాదు—ఆయన నిజమైన దేవుడు మరియు నిజమైన మానవుడు కూడా. ఈ సంఘటనలో, ఆయన దైవిక శక్తి మరియు అధికారంతో పాటు, ప్రజల పట్ల ఆయనకున్న ప్రగాఢమైన కరుణను మనం చూస్తాము. అంతటి మహా జనసమూహానికి ఆహారం పెట్టడం దేవుడు మాత్రమే చేయగల పని.

ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత, ప్రజలు పాత నిబంధన వాగ్దానాల గురించి ఆలోచించడం ప్రారంభించారు. వారు, “నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే” అని చెప్పుకున్నారు (యోహాను 6:14,15). ఒక కోణంలో, ఇది నిజమే—యేసు వాగ్దానం చేయబడిన ఆ ప్రవక్తే. కానీ వారు ఆయన మిషన్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన ఉద్దేశ్యం, ఆయన నెరవేర్చవలసిన కార్యము గురించి వారికెలాంటి అవగాహనగాని గ్రహింపుగాని లేదు. వారు ఆధ్యాత్మికంగా కాకుండా భూసంబంధంగా ఆలోచిస్తున్నారు.

ఈ కారణంగా, వారు ఆయనను బలవంతంగా భూలోక రాజుగా చేయాలనుకున్నారు. దేవుడు మోషే ద్వారా అరణ్యంలో ఆహారాన్ని ఎలా అందించాడో వారు జ్ఞాపకం చేసుకున్నారు. యేసు తమ కోసం మళ్లీ మళ్లీ అదే చేయాలని వారు కోరుకున్నారు. వారు భౌతిక అవసరాలు మరియు రాజకీయ స్వేచ్ఛపై దృష్టి సారించారు. ఆయన రోమన్ పాలన నుండి వారిని విడిపిస్తాడని మరియు శ్రేయస్సును తీసుకువస్తాడని ఆశించారు. కానీ వారు గొప్ప సత్యాన్ని కోల్పోయారు. యేసు భూసంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. పాపం నుండి ప్రజలను రక్షించడానికి మరియు దేవుని శాశ్వతమైన రాజ్యంలోకి తీసుకురావడానికి ఆయన వచ్చాడు.

ఈ మొత్తం ఎపిసోడ్ ను జనసమూహము సాధారణమైనదిగా తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ప్రజలు తిని, తృప్తి చెంది, పెద్దగా స్పందించకుండా వెళ్లిపోయారు. ఒక గొప్ప అద్భుతం జరిగిందని వారు నిజంగా గుర్తించలేదు. కానాలో విందు యజమాని వలె, వారికి ఆహారం ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు. కాని శిష్యులకు తెలుసు! ఇది శిష్యులకు ఒక అద్భుతం, దేవుని రాజ్య రహస్యాలలో ఒకటి.

వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పాడు. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవలరొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపారు

12 గంపలు మిగిలాయి_ ఈ కథని నేను నా సండే స్కూల్లో చెప్పిన తరువాత 12 గంపలు మిగిలాయి కదా ఎందుకని అని అడిగితే, ఒక పిల్లోడు లేచి, పాస్టర్ గారు, 12 మంది శిష్యులు రొట్టెలు చేపలు అంతమందికి పంచి పెట్టారు కదండి, వారి సేవను బట్టి ఒక్కొక్క శిష్యునికి ఒక్కొక గంప చొప్పున వారి కొరకు మిగిలేలా యేసు చేసాడు అని చెప్పాడు, మీరేమంటారు?

పంపిణీతో అద్భుతం అయ్యిపోలేదు. అక్కడ మిగిలిపోయినవి, ప్రతి శిష్యుడికి ఒకటి చొప్పున, జరిగిన అద్భుతానికి సాక్ష్యముగా, 12 బుట్టలలో సరిపడా బార్లీ రొట్టెలు, చేపలు ఉన్నాయి. ఇది ఒక నిజమైన అద్భుతం జరిగిందని స్పష్టంగా చూపించింది. ఇది ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా బోధిస్తుంది: క్రీస్తు సువార్త యావత్ ప్రపంచానికి ఆహారం అందించడానికి సరిపోతుంది. దేవునికి పంచిపెట్టే వాళ్ళు కావాలి. దానిని పంచిపెట్టమని దేవుడు తన సేవకులను పిలుస్తాడు. శిష్యులు రొట్టెను పంచిపెట్టినట్లే, నేటి పరిచారకులు “జీవపు రొట్టె” అయిన యేసును పంచుతున్నారు.

ఈ సంఘటన యేసు నిజమైన మానవుడు మరియు నిజమైన దేవుడు అని ధృవీకరిస్తుంది. ఆయన తన అనుచరులను తన దయను పంచడానికి ఉపయోగిస్తాడు. యేసు సర్వశక్తిమంతుడు. మన చిన్న మరియు సరిపోని ప్రయత్నాలు కూడా, క్రీస్తుకు ఇవ్వబడినప్పుడు, అవి చాలా మందికి ఆశీర్వాదంగా మారొచ్చు.

యేసు ఐదు రొట్టెలతో 12 బుట్టలను మాత్రమే నింపగలిగితే, ఆయన ఒక అద్భుతం చేశాడు, కాని 15వేల మంది తిన్న తర్వాత మిగిలిపోయాయి మరి దీనిని ఏమందాం? ఇది దేవుని విస్తారమైన ఏర్పాటును చూపుతుంది.

యేసు చేసిన అద్భుతంలోని నిజమైన సత్యాన్ని ప్రజలు అర్ధంచేసుకోలేకపోయారు. వారికి ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి దేవునిచే పంపబడిన వాగ్దానం చేయబడిన క్రీస్తు ఆయన. వాళ్ళు ఆయనను ఒక గొప్ప ప్రవక్తగా అనుకొన్నారు తప్ప తమ మెస్సయ్యగా ఆయనను గుర్తించలేక పోయారు. వారి ఆలోచనలను తెలుసుకున్న యేసు, అక్కడినుండి వెళ్లిపోయాడు.

ఈ సంఘటన ప్రభువు ఎదుట మనలోని అనేక బలహీనతలను ఒప్పుకోవాలని మనకు పిలుపునిస్తుంది:

శిష్యుల వలె, మనం కూడా దేవుని శక్తిని, ఆయన అనుగ్రహాన్ని నమ్మకుండా, తరచుగా సందేహిస్తూ మన పరిమితులపైనే దృష్టి పెడుతున్నాం.

తన కొద్దిపాటి భోజనాన్ని ఇష్టపూర్వకంగా ఇచ్చిన ఆ బాలుడిలా కాకుండా, మనం స్వార్థపరులుగా ఉంటున్నాం —అవసరంలో ఉన్నవారితో పంచుకోకుండా, మనకున్నదానిని మనమే దాచుకొంటున్నాం.

మనకున్నదంతా దేవుని నుండి వచ్చిందని గుర్తించడంలో విఫలమై, మనం తరచుగా కృతజ్ఞత లేనివారిగా ఉంటున్నాం.

కష్టమైన లేదా “అసాధ్యమైన” పరిస్థితులలో, ఆయనను పూర్తిగా నమ్మకుండా మనపైనే ఆధారపడుతున్నాం.

మనం దేవుని బహుమతుల విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నాం, కొన్నిసార్లు ఆయన అనుగ్రహించిన వాటిని తెలివిగా ఉపయోగించకుండా వృధా చేస్తున్నాం.

ఈ పై పాయింట్స్ మన ఈ పాపాలను— అంటే మన సందేహాలను, స్వార్ధాన్ని, కృతజ్ఞత లేకపోవడాన్ని మరియు పేలవమైన గృహనిర్వాహకత్వాన్ని—మనకు చూపిస్తున్నాయి. వాటిని మనం ఒప్పుకొందాం.

ఈ పై పాయింట్స్ — క్రీస్తు బలహీన శిష్యుల పట్ల సహనం కలిగి ఉన్నాడని, మన వైఫల్యాలను క్షమిస్తాడని మరియు మన చిన్న, అసంపూర్ణమైన అర్పణలను కూడా తన మంచి ఉద్దేశ్యాల కోసం ఉపయోగించుకుంటూనే ఉంటాడని, ఆయన సమృద్ధిని అనుగ్రహిస్తాడని ఆదరణను కలుగజేస్తున్నాయి.

ఈ పాఠములోని దేవుని ప్రేమ

యేసు ప్రజల పట్ల కరుణను చూపించాడు – ఆయన వారి శారీరక అవసరాలను తీర్చాడు, రోగులకు సహాయపడ్డాడు. ఆయనే స్వయంగా రక్షణ వాక్యాన్ని వారికి బోధించాడు.

ఆహరం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఆయన తగినంత కంటే ఎక్కువే అందించాడు. ఇది దేవుని ఉదారమైన శ్రద్ధను తెలియజేస్తుంది.

తనను విశ్వసించే వారికి భౌతిక ఆహారమే కాకుండా ఆధ్యాత్మిక ఆహారాన్ని కూడా ఇస్తాడు.

మన దగ్గర ఉన్న కొద్దిపాటి వాటిని విశ్వాసంతో ఆయన దగ్గరకు తీసుకువస్తే, ఆయన వాటితో గొప్ప పనులు చేయగలడు.

దేవుడు ఇతరులకు సహాయం చేయడానికి ప్రజల ద్వారా పని చేస్తాడు, కాబట్టి మన దగ్గర ఉన్నవాటిని పంచుకోవడానికి మనం పిలువబడ్డాము.

దేవునికి ఏదీ చాలా కష్టం కాదు- ఆయన ఎలాంటి సమస్యనైనా అధిగమించగలడు.

ఈ పై పాయింట్స్ అన్నింటికంటే మించి, క్రీస్తు ప్రేమను చూపుతున్నాయి — ఆయన మనకు అర్హమైన దానికంటే ఎక్కువగానే ఇస్తాడు, రక్షిస్తాడు.

ఈ పాఠము మనకేమి నేర్పిస్తుంది?
1. ఆ బాలుడి చిన్న భోజనం వేలాది మందికి ఆహారం ఇవ్వడానికి సరిపోయింది. యేసు దానిని అద్భుతంగా ఉపయోగించాడు. దేవుడు మన చిన్న కానుకలను తీసుకొని ఇతరుల గొప్ప అవసరాలను తీర్చడానికి వాటిని ఉపయోగిస్తాడు.

2. శిష్యులు మొదట్లో జన సమూహానికి ఆహారం పెట్టడం గురించి ఆందోళన చెందారు, కాని దేవుని ఏర్పాటుపై వారు నమ్మకం ఉంచవచ్చని యేసు వారికి చూపించాడు. మన అవసరాలు అధికంగా అనిపించినా, దేవుడు వాటిని తీరుస్తాడని నమ్మమని ఈ కథ మనల్ని ప్రోత్సహిస్తుంది.

3. ఆ బాలుడి అర్పణ చిన్నది, కాని దానిని యేసు చేతుల్లో ఉంచినప్పుడు అది అత్యద్భుతమయ్యింది.

4. ఈ కథలో హీరో ఒక చిన్న పిల్లవాడు. యేసు అద్భుతం చేయడానికి ఉపయోగించిన ఆహారాన్ని అందించిన వాడు. దేవుడు ఎవరినైనా వారి నేపథ్యం లేదా హోదాతో సంబంధం లేకుండా ఉపయోగించుకొంటాడని ఇది మనకు బోధిస్తుంది. మీ జీవితంలోని అనేక సంఘటనలలో మీ చుట్టూ ఉన్న వారి కొరకు దేవుడు మిమ్మల్ని హీరో గా ఎన్నుకొన్నాడేమో, ఆ విషయాన్ని మీరు గుర్తించలేదేమో?

5. ఈ కథ జనసమూహానికి శారీరక పోషణపై దృష్టి సారించినప్పటికీ, ఇది యేసు అందించే ఆధ్యాత్మిక పోషణను కూడా సూచిస్తుంది. ఈ అద్భుతం యేసు శారీరక మరియు ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే శక్తిని ప్రదర్శిస్తుంది.

6. ఆ బాలుడు తన భోజనం పంచుకోవడానికి ఇష్టపడటం మరియు శిష్యులు ఆహారాన్ని పంచడానికి ఇష్టపడటం దాతృత్వం మరియు సేవ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తాయి. ఈ కథ మన వనరులతో మనం ఉదారంగా ఉండాలని మరియు ఇతరులకు సేవ చేయడానికి మన బహుమతులను మనం ఉపయోగించాలని ప్రోత్సహిస్తుంది.

ఈ పై పాయింట్స్ మన మన సందేహాలను, స్వార్ధాన్ని, ఉదారత లేకపోవడాన్ని చూపిస్తున్నాయి.

ఈ పై పాయింట్స్ క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాయి – ఆయన మన బలహీనతలలో కూడా మనలను ఉపయోగించుకుంటాడని, మనకు నిజంగా అవసరమైన ప్రతిదాన్ని ఇస్తాడని తెలియజేస్తున్నాయి.

ప్రజలు అవసరంలో, నిస్సహాయతలో ధర్మశాస్త్రం కనిపిస్తుంది. వారు ఒక నిర్జన ప్రదేశంలో, ఆకలితో, మరియు తమకు తాము పోషించుకోలేని స్థితిలో ఉన్నారు. వారు వారి అవసరాలను తీర్చుకోలేరు; మీరు పేదవారు మరియు ఇతరులపై ఆధారపడినవారు అని తెలియజేస్తుంది. శిష్యులు కూడా ఈ ఒత్తిడిని అనుభవించి, “మా వద్ద ఐదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి. ఈ జనసమూహాలను పంపించి వేయండి” అని అన్నారు. ఇది మానవ పరిమితిని, ఆందోళనను, మరియు ఆయనపై నమ్మకం లేకపోవడాన్ని బయటపెడుతుంది. మనల్ని మనం పోషించుకోలేమని ఇది మనకు చూపిస్తుంది—శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా అస్సలు కాదు. ధర్మశాస్త్రం మన బలహీనతను మరియు దేవునికి బదులుగా మనపైనే ఆధారపడే మన ప్రవృత్తిని వెల్లడిస్తుంది. ధర్మశాస్త్రం విధేయతను కోరుతుంది.

సువార్త అనేది యేసు యొక్క ప్రతిస్పందన. ఆయన ప్రజలను పంపించివేయడు. దానికి బదులుగా, ఆయన వారిపై కరుణ చూపి, వారికి కావలసినవి సమకూర్చి, అద్భుతరీత్యా వారందరికీ సమృద్ధిగా ఆహారం పెట్టాడు. ప్రతి ఒక్కరూ తిని తృప్తి చెందారు, మరియు పోయింది. ఇది స్వచ్ఛమైన కృప. ప్రజలు దానిని సంపాదించుకోలేదు, దానికి అర్హులు కాలేదు, లేదా దానికి ఏమీ తోడ్పడలేదు. క్రీస్తు ఉచితంగా ఇచ్చాడు.

ఈ అద్భుతం శరీరానికి రొట్టె అనే పరిధిని దాటి, జీవపు రొట్టె అయిన క్రీస్తునే సూచిస్తుంది (యోహాను 6). క్రీస్తు కరుణతో సమృద్ధిగా సమకూరుస్తాడు, మీరు ఎన్నటికీ సంపాదించలేని దానిని ఇస్తాడు—అంతిమంగా మీ రక్షణ కొరకు తననే అర్పించుకొన్నాడని తెలియజేస్తుంది. ఆయన భౌతిక ఆహారాన్ని ఎలాగైతే అందిస్తాడో, అలాగే పాపుల కోసం ఉచితంగా ఇవ్వబడిన తన ద్వారా నిత్యజీవాన్ని కూడా అందిస్తాడు. సువార్త ఓదార్చి రక్షిస్తుంది.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl